సంఖ్యా. 21:4-9; యోహాను 3 :14-15, 1 కొరింథీ. 10:9
ఉద్దేశము
మీకు ప్రతి విషయానికి గొణుగు కొనే అలవాటు ఉందా? స్కూల్ల్ కి వెళ్లాలంటే గొణగడం, ఇంటికి వచ్చిన తరువాత బోర్ కొడుతుందని, డిన్నర్ నచ్చలేదు అని, టీవీ చూస్తూ ఉంటే పడుకోమన్నారు అని, ప్రతి విషయానికి కొందరు గొణుగుతుంటారు. మనమందరము ఏదో ఒక విషయానికి గొణుగు కుంటాము. కాని ప్రతి విషయములో కృతజ్ఞత కలిగి ఉండాలని బైబిల్ మనకు బోధిస్తుంది (1థెస్స 5 :18). దేవుడు చేస్తున్న ఉపకారములకు ప్రతి దినము మనము కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? ఇశ్రాయేలీయులు కృతజ్ఞత లేనివారు అని మనము చూసాము. వారి సణుగులు గొణుగులు వలన వారికి ఎంత పెద్ద ప్రమాదం ఎదురైందో మనము చూద్దాము.
నేపధ్యము
ఇశ్రాయేలీయులు ఎన్నోసార్లు గొణగడం మనము చూశాము. మాంసాహారం కోసం వారు బిగ్గరగా ఏడ్చినట్లు చూశాము. దేవుడు ఇచ్చిన మన్నాతో సంతృప్తి చెందక ఐగుప్తులో వారుతినిన ఆహారము గుర్తు తెచ్చుకుని వారు ఏడ్చారు ( సంఖ్యా. 11). వారి గుడారము చుట్టూ దేవుడు పూరేళ్లు కురిపించి, వారు ఏరుకుని వండుకొని తినునట్లు చేశాడు. వారు మొదట్లో సంతోషంగా తిన్నారు కానీ దేవుడు వారి అత్యాశవలన అనారోగ్యానికి గురై కొందరు మరణించునట్లు దేవుడు చేశాడు. ఇంకా అనేక సమయాలలో ఇశ్రాయేలీయులు గొణిగారు. మీకు గత వారం జరిగిన విషయం గుర్తుందా?
గతవారము
వారు ఏ విషయంలో గొణుగుకున్నారు? ఐగుప్తు నుండి కనాను దేశమునకు అనవసరంగా వచ్చాము అని బాధపడ్డారు. దేవుడు తమకు తోడుగా ఉండి శత్రువులపై విజయము దయచేస్తాడు అని నమ్మలేకపోయారు. ఇశ్రాయేలీయుల వలె సణుగకుడి అని 1 కొరింథీ 10:10 లో వ్రాయబడింది. వారియెడల ఎంతో ప్రేమ దయ చూపించినప్పటికి వారు అలా ప్రవర్తించడం దేవునికి ఆగ్రహాన్ని కలిగించింది. ఇశ్రాయేలీయులు కృతజ్ఞత గలవారై తమ అవసరాల నిమిత్తం దేవునిపై ఆధారపడవలసింది కాని వారు అలా చేయలేకపోయారు.
ఇశ్రాయేలీయులు మరల సణుగుకొనుట
ఇశ్రాయేలీయులు వెనుకకు తిరిగి అరణ్య మార్గముగా తమ ప్రయాణం కొనసాగించారు. ఆ ప్రయాణములో 20 సంవత్సరముల వయస్సు పై బడిన వారందరూ చనిపోయారు. మోషే మిర్యాము అహరోను కూడా చనిపోయారు (సంఖ్యా. 21:28, 29). దేవుడు చెప్పినట్లుగానే వారికి జరుగుతున్నాయి. చివరకు దేవుడు చెప్పిన 40 సంవత్సరముల కాలము ముగియ బోతోంది, కాని 40 సంవత్సరములు అరణ్యములో తిరుగులాడుతూ ప్రయాణం చేయుటవలన ఇశ్రాయేలీయులు అలసట చెంది విసిగిపోయారు. మరల దేవునిపై సణుగుటకు మొదలుపెట్టారు. వారు మోషే వైపు తిరిగి - "ఐగుప్తులోనుండి మీరు మమ్మును ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు చవి సారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది" అని గొణిగారు. ఎంత భయంకరం! దేవుడు వారి అవసరాలు అన్నింటినీ తీరుస్తూ వచ్చాడు. వారి వస్త్ర ములు పాతబడలేదు చినిగి పోలేదు అయినా తమకు ఏమీ లేదని అబద్ధాలు చెబుతున్నారు. త్వరలో వాగ్దాన భూమిలో ప్రవేశించబోతున్నందుకు వారెంతో కృతజ్ఞతతో ఎదురు చూడవలసింది కానీ ఎప్పటివలె వారి సణుగుటకు మొదలుపెట్టారు. మన్నా తిని విసిగిపోయారు, కనుక రుచికరమైన ఆహారం కావాలి అని వారు కోరుకున్నారు. దేవదూతల ఆహారమైన మన్నాను దేవుడు వారికి సమకూర్చినప్పటికి వారు సంతృప్తి చెందలేకపోయారు.
దేవుని శిక్ష
తిరిగి వారు సణుగు కొనుట చూచి దేవుడు ఎంతగానో ఆగ్రహంతో నిండిపోయి వారికి తగిన శిక్ష విధించాలి అనుకున్నాడు. అప్పుడు దేవుడు విషపూరితమైన సర్పములను పంపించాడు. దేవుడు ఒక వేళ కొన్నివేల సర్పములను పంపి ఉండవచ్చు. వారు తప్పించుకోవడానికి కూడా వీలుకాలేదు. ఆ సర్పములను చూచి ఇశ్రాయేలీయులు ఎంతగానో భయపడి ఉంటారు. వాటిని తమ గుడారముల లోనికి రాకుండా చంపడానికి ఎంతగానో ప్రయత్నించి ఉండవచ్చు కాని ఆ సర్పములు కరవడం వలన అనేకులు చనిపోయారు. ఎంత దుఃఖకరమైన సంఘటన!
దేవుని దయాగుణము
అప్పుడు ప్రజలు మోషే దగ్గరకు వచ్చి - "మేము ప్రభువునకు విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. దేవుడు మా మధ్యనుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుము" అని చెప్పారు. అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల కొరకు ప్రార్థన చేయగా ప్రభువు మోషేతో - "నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును నావైపు చూచి బ్రతుకును" అని చెప్పాడు. అప్పుడు మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభముమీద దానిని పెట్టాడు. అప్పుడు పాము చేత కరవ బడిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందువలన బ్రతికాడు. దేవుడు వారు తన మాటలను లక్ష్య పెడతారా లేదా అని వారిని పరీక్షించాడు. ఆ సర్పమును చూచిన ప్రతి ఒక్కరు ఆ సర్పముల విషం నుండి ప్రత్యేకించబడ్డారు. ఇత్తడి సర్పము కాదుగాని , దేవుని అద్భుతమైన శక్తి ఇశ్రాయేలీయులను బ్రతికించింది.
సందేశము
ప్రభువైన యేసు ఈ భూమి మీద జీవించినప్పుడు నీకోదేము అను వ్యక్తి వచ్చి పరలోకమునకు ఏలాగున వెళ్ళగలను అని యేసును అడిగాడు. అప్పుడు యేసు మోషే చేయించిన ఇత్తడి సర్పము గురించి చెప్పాడు. యేసు నీకోదేముతో - "అరణ్యములో మోషే సర్పము ఏలాగు ఎత్తెనో ఆలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను" అని చెప్పాడు. తాను సిలువ మీద వ్రేలాడి ప్రాణం పెట్టుట వలన అందరూ సిలువ వైపు చూచి మరణమును తప్పించుకుని నిత్యజీవము పొందుతారు అని చెప్పాడు (యోహాను 3:14, 15)
అన్వయింపు
ఈ సంఘటన తెలుసుకొనిన తరువాత సిలువపై ప్రాణము పెట్టిన ప్రభువైన యేసును మనము గుర్తు చేసుకోవాలి. మన హృదయాలు పాపముతో నిండినవి అని మరిచిపోకూడదు. మన పాపములను కడిగివేయమని యేసును అడగకపోతే మనకు ఎటువంటి నిరీక్షణ ఉండదు. యేసు మాత్రమే పాపములనుండి మనలను వినిపించగలడు. ఆయన తన ప్రాణమును పెట్టుటకు సిలువ పైకి ఎత్తబడ్డాడు. మనము యేసువైపు చూచి జీవించాలి అని బైబిల్ మనకు బోధిస్తుంది. ఆయన మనలను రక్షించగలడు అని విశ్వసించాలి. ఆయన మాటలకు విధేయత చూపాలి. అప్పుడు మనము రక్షించబడి నిత్యజీవము పొందగలము.
కంఠతవాక్యము
తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను (యోహాను 3:16)
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF