ఆదికాండము 11:27;12:9; అ.కా. 7:2-4; హెబ్రీ. 11:8
ఉద్దేశము/లక్ష్యము
దేవునికి విధేయత చూపుట వలన గొప్ప ఆశీర్వాదములు పొందగలము అని బోధించుట.
ముఖ్యాంశము
ఇల్లు మారటం - మీరు ఎప్పుడైనా ఇల్లు మారారా? కొన్నిసార్లు సామాను అంతా సర్దుకొని క్రొత్త ఇంటికి మారవలసివస్తుంది. అలా మారడానికి ముందు, క్రొత్తగా చేరబోయే ఇల్లు సౌకర్యంగా ఉందో లేదో మీ తల్లిదండ్రులు వెళ్ళి అన్నీ జాగ్రత్తగా తెలుసుకుంటారు. మీకు చాలా ధనవంతుడైన స్నేహితుడు ఉన్నాడు అనుకుందాం. ఒకరోజు మీ దగ్గరకు వచ్చి కొన్ని వందల కిలోమీటర్ల దూరములో మీకోసం పెద్ద ఇంటిని కొని ఉంచాను అని చెప్పాడు అనుకోండి. అప్పుడు మీ అనుభూతి ఎలా ఉంటుంది? మీ స్నేహితుడు సామాను సర్దుకొని వెంటనే బయలుదేరండి అని చెప్తాడు. మీరు ఆ ఇంటిని చూడనేలేదు. నిజంగా అతని మాట నమ్మవచ్చా లేదా?అని సందేహం కలుగుతుంది కదూ! ఎక్కువమంది వెళ్ళకూడదు అని నిర్ణయం తీసుకుంటారు కూడా!
ఊరు అనే పట్టణములో నివసిస్తున్న అబ్రాహాము
మనము అబ్రాహాము అనే వ్యక్తిని గురించి తెలుసుకోబోతున్నాం. అతని భార్య పేరు శారా, కాని వారికి పిల్లలు లేరు. యూఫ్రటీసు నదీతీరమున ఉన్న ఊరు అనే అందమైన పట్టణములో వారు నివసించేవారు. వారి ఊరు చుట్టూ సారవంతమైన భూములు ఉండేవి కనుక వంటలు సమృద్ధిగా పండేవి. ఇప్పుడు గనుక ఆ ప్రాంతం చూడడానికి వెళ్తే అది పూర్తిగా పాడుబడి రాళ్ల కుప్ప వలె ఉంటుంది.
అబ్రాహాము నివసించిన దినములలో ఊరు పట్టణము చాలా ముఖ్యమైన పట్టణముగా పేరు పొందింది. కాని ఆ పట్టణములోని వారు విగ్రహాలను ఆరాధించేవారు. పెద్ద పెద్ద గుళ్ళు నిర్మించి అందులో రాతితో, చెక్కతో చేసిన విగ్రహాలను ప్రతిష్ఠించి సాగిలపడి మ్రొక్కి పూజలు చేస్తుండేవారు. వారు చంద్రుడిని ఇష్టమైన దేవుడిగా పూజించేవారు. అబ్రాహాము తండ్రి అయిన తెరహు కూడా విగ్రహారాధన చేసేవాడు.
దేవుని ఆజ్ఞ
ఒక రోజు దేవుడు ప్రత్యక్షమై - "నీవు నీ దేశమును, నీ స్వజనమును విడిచి బయలుదేరి, నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్ము" అని చెప్పినప్పుడు అబ్రాహాము ఎంతగానో ఆశ్చర్యపడి ఉండవచ్చు (అ.కా. 7:2,3). అబ్రాహాము ఏమి చేయాలి? అతడు తన తండ్రి ఇంటి వారిని, తన పనిని, స్నేహితులను విడిచిపెట్టి వెళ్లాలి. అతడు తనకున్న వారినందరిని, తనకు ప్రియమైన వారినందరిని అక్కడే విడిచి వెళ్లాలి. తిరిగి ఊరు పట్టణానికి రావడానికి అవకాశం రాకపోవచ్చు. మనము మంచి ఊరిలో బాగా అలవాటు పడిన తరువాత క్రొత్త ఊరికి వెళ్ళాలంటే ఎంతో కష్టంగా అనిపిస్తుంది. దేవుడు అబ్రాహాముకు కొన్ని అద్భుతమైన వాగ్దానాలు చేశాడు. నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా ఆశీర్వదించ బడతాయి అని కూడా ప్రభువు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు.
అబ్రాహాము విధేయత చూపుట
దేవుడు ఊరు పట్టణమును విడిచిపెట్టమని చెప్పినప్పుడు అబ్రాహాము ఏమి చేసి ఉంటాడు? దేవుడు చెప్పిన మాటలు మరిచిపోయాడా, విననట్లు నటించాడా? నేను ఎందుకు నా వారిని విడిచి వెళ్లాలి అని ప్రశ్నించాడా, లేదు దేవుని మాటలకు విధేయత చూపాడా - మీరు ఏమి అనుకుంటున్నారు? అవును, దేవుడు ఆజ్ఞాపించిన వెంటనే అబ్రాహాము విధేయత చూపాడు. అబ్రాహాము జీవితం పట్ల దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగియున్నాడో మనము తరువాత పాఠాలలో చూద్దాము.
ఊరు పట్టణము విడిచి ప్రయాణము
అన్నీ చక్క పరచుకుని ప్రయాణం మొదలు పెట్టడానికి అబ్రాహాము శారాలకు కొంత సమయం పట్టి ఉండవచ్చు. వారితో పాటు అబ్రాహాము తండ్రి అయిన తెరహు, అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు కూడా బయలుదేరారు. వారు తమ ప్రయాణం ప్రారంభించారు (ఆది 11:31). అబ్రాహాము ఎక్కడికి వెళ్లవలసినది తెలియకుండానే బయలుదేరాడు(హెబ్రీ 11:8). ఏ సమాచారము తెలియకుండానే దేవుని మాటలకు లోబడి అబ్రాహాము ప్రయాణం మొదలు పెట్టడం ఎంత అద్భుతమైన విషయం! అబ్రాహాము ఊరు పట్టణం వదిలిపెట్టే సన్నివేశం ఒకసారి ఊహించండి. ఆ పట్టణములో వారికి తెలిసిన వారు, బంధువులు, స్నేహితులు వీడ్కోలు చెప్పడానికి అక్కడ చేరి ఉండవచ్చు. అబ్రాహాము తన కుటుంబముతో పాటు దాసదాసీ జనం, గాడిదలు, పశువులు వారికి కలిగిన వస్తువులు కూడా తీసుకుని బయలుదేరారు. ప్రయాణానికి అవసరమైన ఆహారము గాడిదల మీద వేసి ఉంటారు. వారు యూఫ్రటీసు నది వెంబడి ప్రయాణము చేస్తూ చేస్తూ ఆ నదిని దాటారు అని బైబిల్ (యెహోషువ 24: 2) లో వ్రాయబడింది.
హారానులో నివసించుట
వారు ఈశాన్య దిశగా దాదాపు 800 కిలోమీటర్ల ప్రయాణం చేసి హారాను అనే ప్రాంతం చేరుకున్నారు. అబ్రాహాము ఆ ప్రాంతంలో కొంతకాలము నివసించినట్లు మనము గ్రహించవచ్చు. దేవుడు ఆజ్ఞాపించిన దేశమునకు వెళ్లకుండా హారానులో అబ్రాహాము ఎందుకు నివసించాడు అనే విషయం తెలియదు. అబ్రాహాము తండ్రి అయిన తెరహు వృద్ధుడు గనుక ప్రయాణము చేయలేని స్థితిలో ఉండి ఉండవచ్చు. తెరహు మరణించిన వెంటనే దేవుడు అబ్రాహాముతో మరల మాట్లాడాడు (ఆది 12:4). దేవుడు అబ్రాహాముతో -"నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము" అని చెప్పాడు. ప్రభువు అబ్రాహాముకు ఎన్నో వాగ్దానాలు చేశాడు.నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును'' అని దేవుడు తిరిగి అబ్రాహాముకు గుర్తు చేశాడు. అబ్రాహాము సంతానమును గొప్ప జనముగా చేసి ఆశీర్వదించుతాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అంతేకాకుండా భూమియొక్క సమస్తవంశములు అబ్రాహాము నందు ఆశీర్వదించ బడతాయి అని కూడా చెప్పాడు. అబ్రాహాము దేవుని వాగ్దానములను నమ్మి ప్రయాణానికి సిద్ధపడ్డాడు. ఆ సమయానికి అబ్రాహాము యొక్క సంపద, దాసీజనము, వస్తువులు ఎంతో విస్తారంగా అభివృద్ధి పొందాయి (ఆది. 12:5)
కనాను దేశము చేరుట
దాదాపు 500 కి.మీ. ప్రయాణం తరువాత అబ్రాహాము, అతని ఇంటి వారందరు షెకెము అనే ప్రాంతానికి చేరుకున్నారు. అబ్రాహాముకు, అతని సంతానమునకు ఇస్తాను అని దేవుడు వాగ్దానము చేసిన ప్రాంతం వారు చేరుకున్నారు (ఆది. 12:1). అబ్రాహాము శారా ఎంతో ఉత్సాహంతో నింపబడి ఉంటారు కదూ! చివరకు
వారు ఉండవలసిన స్థలమునకు చేరుకున్నారు. దేవుడే వారిని అక్కడకు నడిపించాడు. అక్కడకు చేరే సమయానికి అబ్రాహాము వయస్సు 75 సంవత్సరాలు, శారాకు 65 సంవత్సరాలు. అబ్రాహాము దేవునికి అక్కడ ఒక బలిపీఠము కట్టాడు.
సందేశము
అబ్రాహాము దేవుని యందు విశ్వాసము గలవాడు. దేవుని ఆజ్ఞను అనుసరించి ఊరు అనే తన పట్టణమును వదిలి కనాను దేశం వెళ్ళాడు. అబ్రాహామును గొప్ప జనముగా చేసి ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. కొన్ని సంవత్సరముల తరువాత దేవుని వాగ్దానం నెరవేరి అబ్రహాము సంతానము గొప్ప జనాంగముగా ఏర్పడింది.
దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు భూమియొక్క సమస్తవంశములు నీ యందు ఆశీర్వదింపబడును అని చెప్పాడు (ఆది.12: 3 అ.కా 3:25). ప్రభువైన యేసు అబ్రాహాము వంశంలో జన్మించాడు అని బైబిల్ లోవ్రాయబడింది (మత్తయి 1). యేసు సర్వలోకమునకు రక్షకుడిగా ఉన్నాడు. ఆయన మాత్రమే పాపములను క్షమించగల లోక రక్షకుడు. దేవుడు అబ్రాహామునకు చేసిన వాగ్దానముల నన్నింటిని నెరవేర్చాడు.
అన్వయింపు
దేవుడు మనము నివసిస్తున్న ప్రాంతమును వదిలిపెట్టి మరొక ప్రాంతమునకు వెళ్ళమని మనతో చెప్పకపోవచ్చు, కానీ అబ్రాహాము వలె మనము కూడా ఆయనకు విధేయత చూపాలి అని కోరుకుంటున్నాడు. ఈ కాలములో దేవుడు బైబిల్ ద్వారా మనతో మాట్లాడుతున్నాడుగనుక మనము దేవుని మాటలకు విధేయత చూపితే ఆశీర్వదించబడతాము.
దేవుడు నీవు నివసించు స్థలమును విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు వెళ్ళిన యెడల ఆశీర్వదిస్తాను అని అబ్రాహాముతో చెప్పాడు. మనము కూడా ఆయన వాక్యానికి విధేయులమై మన పాపములను క్షమించమని ప్రభువైన యేసుకు ప్రార్థన చేసినట్లయితే, ఆయన మనలను క్షమించి నూతన హృదయము ఇచ్చి మనలను ఆశీర్వదిస్తాడు. ఇది మనకు అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదము. మన పాపములను క్షమించుట ద్వారా గొప్ప సంతోషాన్నిమనకు అనుగ్రహిస్తాడు. మన హృదయములో శాంతిని, సమాధానమును నింపుతాడు (ఫిలిప్పి 4:7). మనము క్రైస్తవులముగా మారుమనస్సు పొందిన యెడల దేవుడు మనలను తప్పకుండా తన ఆశీర్వాదాలతో సంతృప్తి పరుస్తాడు. ఆయన మనము ఎలా జీవించాలో నేర్పుతాడు. ప్రభువు పట్ల ఎటువంటి విధేయత కలిగి ఉండాలి అనే విషయం అబ్రాహాము తన జీవితం ద్వారా మనకు నేర్పుతున్నాడు.
మీరు అమెరికా దేశం వెళ్ళినట్లయితే ఆ దేశము ఏ విధముగా స్థాపించబడినది మీరు తెలుసుకోవచ్చు, లేదా చరిత్ర చదివినా తెలుస్తుంది. నాలుగు వందల సంవత్సరముల క్రిందట ఇంగ్లాండ్ దేశములో నివసిస్తున్న కొందరు తమ విశ్వాసమును బట్టి, దేవుని ఆరాధించే విధానమును బట్టి శ్రమలు పొందారు. వారిలో కొందరు ఇంగ్లండు అనే దేశము వదిలిపెట్టి మరొక దేశమునకు వెళ్లి నివసించాలి అనుకున్నారు. వారు మే ఫ్లవర్ అనే ఓడలో అట్లాంటిక్ సముద్రం గుండా ప్రయాణము చేసి అమెరికా దేశం చేరుకున్నారు. ఆ ప్రయాణంలో వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. తరువాత వారు తమకొరకు ఇండ్లను కట్టుకుని అక్కడ స్థిరపడ్డారు. వారిని యాత్రికులు అని పిలుస్తారు. వారు తమ కష్టాలలో ప్రభువుపై విశ్వాసము కలిగి ఉన్నారు. అక్కడకు వెళ్ళిన ఒక సంవత్సరములోనే వారు తమ పంటను కోసి, ఎంతో సంతోషంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ పండుగ చేసుకున్నారు. దానినే ``కృతజ్ఞతార్పణల పండుగ'' అని అంటారు. ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం అమెరికా దేశములో ఈ పండుగ జరుపుకుంటారు. అమెరికా దేశమునకు వచ్చిన మొదటి క్రైస్తవ యాత్రికుల ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇప్పటికి కూడా వారు గుర్తు చేసుకుంటారు.
మనము ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళినట్లయితే యూదా వంశమునకు అబ్రాహాము మూల పురుషుడు అని వారు చెబుతారు. అప్పుడు కనాను దేశముగా పిలువబడినదే ఈనాటి ఇశ్రాయేలు. అక్కడి ప్రజలను యూదులు లేదా ఇశ్రాయేలీయులు అని పిలుస్తారు. దేవుని పిలుపుకు విశ్వాసముతో లోబడుట అబ్రాహాము నుండి మనము నేర్చుకొనవలసిన గొప్ప పాఠము.
కంఠతవాక్యము
అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడెను . (హెబ్రీ. 11:8).
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF