ఆదికాండము 4:1-15
ఉద్దేశము/లక్ష్యము
ప్రభువైన యేసు నందు విశ్వాసము కలిగి సరియైన మార్గములో దేవుని దగ్గరకు వచ్చిన యెడల ఆయన మనలను అంగీకరిస్తాడు అని బోధించుట.
ముఖ్యాంశము
మీ తల్లిదండ్రులు, తాత అవ్వలు వారు చిన్నవారుగా ఉన్నప్పుడు చేసిన పనులను గురించి మీకు చెబుతుంటారా? అనేక సంవత్సరాల క్రితం వారి జీవితాలలో జరిగిన విషయాలను పిల్లలకు చెప్పడం తల్లిదండ్రులకు, పెద్దలకు అలవాటు. కొన్ని వారాలుగా ఆదాము, హవ్వల గురించి ఆలోచిస్తున్నాము. త్వరలోనే వారికి సంతానం కూడా కలిగింది. కయీను హేబెలు అనే ఇరువురు కుమారులు వారికి మొదట పుట్టారు. ప్రపంచంలోనే మొదట పుట్టిన సంతానము కయీను, హేబెలు. తమకు పుట్టిన ఇరువురు కుమారులను బట్టి ఆదాము హవ్వలు ఎంతో సంతోషించి ఉంటారు. తరువాత వారికి అనేక మంది కుమారులు, కుమార్తెలు పుట్టారు(5:4).
ఏదెను తోటలో తమకు దేవునితో ఉన్న సహవాసం గురించి, ఎటువంటి పాపము లేని ఆ స్థలం గురించి ఆదాము హవ్వలు తమ కుమారులకు ఖచ్చితంగా చెప్పిఉంటారు. బాధ, కోపం, నిరాశ, దుఃఖం ఇలాంటివి తమకు ఆ వనములో ఉన్నంతవరకు తెలియవు అని వారు వివరించి ఉండవచ్చు. సాతాను కుయుక్తితో వారిని మోసపరచినప్పుడు, తెలివి లేనివారుగా శోధనకు గురై దేవునికి అవిధేయత చూపించారు. అప్పటి నుండి అంతా మారిపోయింది. దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకొనుట వలన జీవితం ఎంతో కష్టంగా మారిపోయింది. వారి చెడుతనాన్ని బట్టి దేవుడు ఏదెను తోటనుండి వారిని
వెళ్లగొట్టవలసి వచ్చింది. ఆదాము కష్టపడి పొలం దున్ని పంటను పండించవలసి వచ్చింది. హవ్వ ఇద్దరు కుమారులను కనిన సమయంలో ఎంతో ప్రసవవేదన అనుభవించింది. ఎంత బాధాకరమైన విషయాలు! ప్రారంభంలో ఎంతో సంతోషంగా ఉన్న ఆదాము హవ్వలు అవిధేయులై చేసిన పాపాన్ని బట్టి వారికి ఎదురైన కష్టాలు - ఈ విషయాలు అన్నీ కయీను హేబెలు ఎంతో ఆసక్తిగా విని ఉండవచ్చు. సాతానును ఓడించే ఒకని పంపుతాను అని దేవుడు చేసిన వాగ్దానాన్ని కూడా వారు కయీను, హేబెలుకు చెప్పి ఉంటారు.
కయీను - హేబెలు
కయీను హేబెలు పాపముతోనే జన్మించారు గనుక వారు కూడా అల్లరి పనులు చేస్తుండేవారు. గొడవలు పెట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉండి ఉండవచ్చు. ఆదాము హవ్వలు చెప్పే మాటలు వినకుండా ఎంతో అసూయ, కోపముతో ఉండేవారు. వారు పెద్దవారయిన తరువాత వారి పనులు కూడా వేరైపోయాయి. కయీను వ్యవసాయం చేసి ధాన్యం, కూరగాయలు పండించాలి అని అనుకున్నాడు, కాని హేబెలు గొర్రెల కాపరి గా ఉండటానికి నిర్ణయించుకున్నాడు (4:2).
ఆదాము, హవ్వ, కయీను, హేబెలు, ఆ తరువాత పుట్టిన వారు అందరూ పాపులే అయినప్పటికి, వారు తిరిగి తన దగ్గరకు వచ్చే మార్గాన్ని దేవుడు వారికి చూపాడు. ఆదాము హవ్వలకు దేవుడు జంతువుల చర్మాలతో వస్త్రాలు చేసి కప్పాడు. ఆ సమయంలో వారి శరీరాలను కప్పుకోవడానికి జంతువుల రక్తం తప్పక చిందించబడాలి అని దేవుడు వారికి చూపాడు. దీని వలన తరువాత కాలములో ప్రభువైన యేసు ఈ లోకములోనికి వచ్చినప్పుడు సిలువపై తన రక్తాన్ని చిందించటం ద్వారా ప్రజల పాపాలను కప్పి వేయబోతున్నాడు (హెబ్రీ 9:22).
అని చూపించాడు. దేవుని గొర్రెపిల్ల అయిన యేసు వచ్చువరకు ప్రజలు తమ పాప క్షమాపణ కొరకు జంతువులను బలిగా అర్పించవలసివచ్చింది (లేవీయ17:11).
కయీను, హేబెలు తమ అర్పణలు అర్పించవలసిన సమయం వచ్చింది. కయీను తన చేనిలో నుండి కొంత ధాన్యము అర్పణగా తీసుకుని వెళ్లాలి అనుకున్నాడు. అతడు తన ధాన్యాన్ని చూచి ఎంతో గర్వంగా దేవుడు ఈ అర్పణను చూచి ఎంతో సంతోషిస్తాడు అని తలంచాడు. హేబెలు తన మందలో నుండి గొర్రెపిల్లను అర్పణగా తీసుకొని వచ్చాడు, అది అతని మందలో శ్రేష్టమైనది (4:4). హేబెలు రాళ్లతో బలిపీఠమును కట్టి దానిపై గొర్రెపిల్లను బలిగా అర్పించి ఉండవచ్చు. హేబెలు అర్పించిన అర్పణను దేవుడు అంగీకరించాడు. పరలోకం నుండి అగ్ని దిగివచ్చి ఆ అర్పణను దహించివేసి ఉండవచ్చు. కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు. దేవుడు కోరుకున్నది అటువంటి అర్పణ కాదు. కయీను నిజమైన ప్రేమతో అర్పణను అర్పించలేదు అని దేవునికి అర్థమైంది. అందుకే దేవుడు అతని అర్పణను అంగీకరించలేదు.
కయీను కోపము దేవుడు తన అర్పణను అంగీకరించకుండా హేబెలు అర్పణను అంగీకరించినందుకు కయీనుకు కోపం వచ్చింది. కయీను కోపపడటం న్యాయమేనా? కాదు, ఎందుకంటే దేవునికి ఇష్టమైన అర్పణ ఏమిటో తెలిసి కూడా అతడు అటువంటి అర్పణను తీసుకుని రాలేదు. తన సహోదరుని చూచి అసూయ, ద్వేషముతో నిండిపోయాడు. దేవుడు కయీను యెడల కూడా దయ కలిగియున్నాడు. యెహోవా కయీనుతో - “నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చుకొనియున్నావేమి? నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా?”అని అడిగాడు. కయీను పశ్చాత్తాపపడి నట్లయితే దేవుడు అతనిని,అతని అర్పణను అంగీకరించి ఉండేవాడు. కయీను తన చెడుతనమును బట్టి దేవుని మాట వినలేదు. క్షమించమని దేవుని అడగలేదు. తన తమ్ముడైన హేబెలుపై కోపము, అసూయ పెంచుకో సాగాడు. ఒకరోజు కయీను పొలములో హేబెలుతో మాట్లాడుతూ అతని మీద పడి చంపివేశాడు. తన సొంత తమ్ముని హత్య చేశాడు (1 యోహాను 3 :12). చంపివేసిన తరువాత నేలలో పాతిపెట్టాడు(4:10). తాను చేసిన పని ఎవరికీ తెలియదు అనుకున్నాడు కయీను. దేవుడు ఆదాము హవ్వలను ఏదెను తోట నుండి బయటకు వెళ్లగొట్టిన తరువాత సంభవించిన మొదటి మరణం హేబెలుది. ఎంత ఘోరమైన విషయం!
దేవుడు కయీనుతో మాటలాడుట కయీను తాను చేసిన పనిని ఎవరూ చూడలేదు అనుకున్నాడు, కాని ఒకరు చూశారు. దేవునికి మరుగైనది ఏదియు లేదు గనుక ఆయన చూశాడు. దేవునికి కయీను పట్ల ఎంతో ఆగ్రహం కలిగింది. దేవుడు కయీనుతో - “నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ?'' అని అడిగాడు. కయీను దేవునికి అబద్ధం చెప్పాడు. హేబెలును తానే చంపినప్పటికి నాకు తెలియదు అని దేవునితో అబద్ధమాడాడు. దేవునితో అబద్ధాలు చెప్పగలను అని అనుకోవడం ఎంత బుద్ధి తక్కువ!
జరిగిన విషయం దేవునికి తెలుసు గనుక కయీనును శిక్షించవలసి వచ్చింది. కయీను ఇంటినుండి వెళ్లగొట్టబడ్డాడు. కయీను, అతని భార్య దేశదిమ్మరుల వలె తిరుగసాగారు. కయీనుకు జీవితం ఎంతో కష్టంగా మారిపోయింది. అతడు వ్యవసాయము చేస్తున్నప్పటికి పంటలు పండటం లేదు. నేల తన సారమును ఇవ్వటం మానివేసినందువలన అతడు వ్యవసాయము సరిగా చేయలేకపోయాడు(4:12). కయీను ఎంతో బాధలతో ఉన్నాడు కాని అతడు చేసిన గొప్ప నేరం వలన శిక్షను పొందక తప్పలేదు.
సందేశము
కయీను దేవునికి ఇష్టమైన అర్పణ కాకుండా తనకు నచ్చిన దానిని అర్పించాడు. దేవుడు సరియైన మార్గములో వెళ్లమని ప్రేమతో హెచ్చరించినప్పటికి వినిపించుకోలేదు. అతని పాపము పెరుగుతూ పెరుగుతూ పోయింది - గర్వము, అసూయ, ద్వేషము, నరహత్య, అబద్ధాలు(యూదా 11) ఇలా ఎన్నో. కయీను మోసకరమైన హృదయాన్ని పరిశీలించిన దేవుడు అతనిని శిక్షించాడు.
హేబెలు దేవుని ప్రేమించి, దేవునికి లోబడి ఉండాలని ఆశించేవాడు. దేవునికి ప్రీతికరమైన అర్పణను తెచ్చాడు. తాను మంచి మార్గంలో జీవిస్తే దేవుడు తనను అంగీకరిస్తాడు అని హేబెలు నమ్మాడు. దేవుడు హేబెలు హృదయమును కూడా చూశాడు. హేబెలు విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టమైన అర్పణను అర్పించి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అని బైబిల్ లో వ్రాయబడింది (హెబ్రీ 11:4).
అన్వయింపు
దేవుడు చెప్పినట్లు విని నడిచే హేబెలు వంటివారు లోకములో చాలా తక్కువ మంది ఉంటారు. ప్రభువైన యేసు సిలువపై పాపుల కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడు అని విశ్వసించుట వలన మానవులు పాపక్షమాపణ పొందగలరు అని బైబిల్ లో స్పష్టంగా వ్రాయబడింది. మరి ఏ విధంగా కూడా పాపక్షమాపణ దొరకదు. ఆయనకు అంగీకారమైన అర్పణ వలె మన హృదయాలను అర్పించుట ద్వారా హేబెలు వలె మనము కూడా యేసుచేత అంగీకరించబడతాము.
ఎంతోమంది కయీను వలె ఇష్టమొచ్చినట్టు, నిర్లక్ష్యంగా దేవుని దగ్గరకు వెళ్ళవచ్చు అనుకుంటారు. చర్చికి వెళ్లడం ద్వారా, దానధర్మాలు చేయుట ద్వారా, పొరుగు వారితో, వృద్ధులతో, మంచిగా ఉండటం ద్వారా దేవుని సంతోష పెట్టగలము అనుకుంటారు. కాని ఆ విషయాలు దేవునికి సంతోషాన్ని కలిగించలేవు. మంచి కార్యములు మనిషి యొక్క పాపాలను పోగొట్టి నీతిమంతులుగా మార్చలేవు. తనకు విధేయత చూపనివారి యెడల దేవుడు కోపము కలిగినవాడై వారిని తప్పక శిక్షిస్తాడు అని గుర్తుంచుకోవాలి.
కంఠతవాక్యము
యేసు (ఈ) నామము వలననే రక్షణ పొందవలెను గాని, మరి ఏ నామమున రక్షణ పొందలేము (అ.కా. 4:12).
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF