యెహోషువ 1:10-18, యెహోషువ 3,4 అధ్యాయాలు
ఉద్దేశము
దేవుడు అద్భుతమైన మహా శక్తిమంతుడు గనుక ఆయన మన యెడల చేసిన కార్యములన్నిటిని గుర్తు చేసుకొని కృతజ్ఞతతో జీవించాలి అని బోధించుట.
ముఖ్యాంశము
విజయము వెనుక రహస్యము - మనము మంచి కాలేజీలో చదవాలనుకుంటే దానికి నిర్దేశించబడిన మార్కులను మనము తెచ్చుకోవాలి. సీటు తెచ్చుకోవడానికి అదే రహస్యం. అలా మార్కులు తెచ్చుకో లేకపోతే అక్కడ చదవడం అసాధ్యం. అందుకే వాళ్ళు ఏర్పాటుచేసిన మార్కులు తెచుకొనే లాగున కష్టపడి చదవాలి. వేరే మార్గం లేదు.
గతవారము
గత వారము దేవుడు యెహోషువకు ఒక రహస్యం చెప్పాడు. యెహోషువ దేవుని మాటలను వినినయెడల తన మార్గములలో వర్ధిల్లుతాడు అని ప్రభువు చెప్పాడు (యెహోషువ 1:7-9). కష్టపడి చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడే సీటు పొందగలిగి నట్లు దేవుని మాటల ప్రకారం నడిచినప్పుడే యెహోషువ విజయము సాధించగలడు. యెహోషువ దేవునికి విధేయుడిగా ఉంటూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ తన మార్గములలో వర్ధిల్లినట్లు మనము తెలుసుకోవచ్చు.
ఇశ్రాయేలీయులు తమ వాగ్దాన భూమి అయిన కనాను దేశమునకు ప్రయాణం చేస్తున్నారు. వారు 40 సంవత్సరములు అరణ్యములో అటు ఇటు తిరుగుతూ, ఇప్పుడు వాగ్దాన భూమి సమీపమునకు వచ్చారు. మోషే చనిపోగా, యెహోషువ వారి కి క్రొత్త నాయకుడిగా వచ్చాడు ఇశ్రాయేలీయులను కనాను దేశమునకు నడిపించుట అను ముఖ్యమైన పని కోసం దేవుడు యెహోషువను సిద్ధపరచి, శిక్షణ ఇచ్చాడు. ప్రభువు యెహోషువతో '' నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము అని ధైర్యపరిచాడు. గొప్ప సమస్య ఎదురైన సమయంలో యెహోషువ దేవుని యందు విశ్వాసము ఉంచినప్పుడు దేవుడు గొప్ప అద్భుత కార్యం జరిగించాడు. ఈ రోజు ఈ విషయాన్ని నేర్చుకొందాము.
గొప్ప సమస్య
ఇశ్రాయేలీయులు కనాను దేశములో ప్రవేశించుటకు ముందు వారికి గొప్ప సమస్య ఎదురైంది ఆ సమస్య ఏమిటో తెలుసా? వారికి, వాగ్దాన దేశమునకు మధ్య యొర్దాను నది అడ్డుగా ఉంది. ఆ నదిని దాటడానికి ఓడలు గాని వంతెన గాని లేదు. వారు ఈదుకుంటూ వెళ్లడం సాధ్యం కాదు వారు బహుజనులై యున్నారు గనుక ఏమి చేయాలో అర్థం కాలేదు. అది కోతకాల సమయము. యొర్దాను ఆ సమయములో ఉదృతంగా దాని గట్లు అన్నిటి మీద పొర్లి పారుతుంది. మరియు ఆ నది చాలా లోతు, వెడల్పు కలిగి ఉన్నది. ఆ నది దాటడం అసాధ్యమైన పని. మనకు అసాధ్యమైనప్పటికి ప్రభువుకు సమస్తము సాధ్యమే. వారు ఏమి చేయవలసినది దేవుడు వారి నాయకుడైన యెహోషువకు వివరించాడు.
యెహోషువ దేవుని సూచనలను అనుసరించుట
దేవుని సూచనలను అన్నింటిని యెహోషువ అనుసరించాడు. ఇశ్రాయేలీయుల లోని యాజకులు నిబంధన మందసమును మోసికొని పోవలెను అని దేవుడు యెహోషువ తో చెప్పాడు.ఆ నిబంధన మందసము ఎంతో పరిశుద్ధమైనది. దేవుని చేతి వ్రాతతో పది ఆజ్ఞలు వ్రాయబడిన రాతి పలకలు అందులోనే ఉన్నాయి.
యాజకులైన లేవీయులు మందసమును మోయుచు ముందు నడుచుచుండగా మందసమునకు సమీపముగా కాకుండా ½ కిలోమీటరు దూరములో ప్రజలు వారి వెనుక నడువవలెను అని దేవుడు ఆజ్ఞాపించాడు. ముందుగా యాజకులు యొర్దాను నీటిలో తమ పాదములు నిలిపిన వెంటనే దేవుడు వారి మధ్య తన మహాశక్తిని కనపరుస్తాడు. ఇశ్రాయేలీయులందరి యెదుట దేవుడు తన సార్వభౌమత్వాన్ని చూపించనైయున్నాడు. మోషే ద్వారా ఎన్నో ఆశ్చర్య క్రియలు జరిగించిన దేవుడు ఇప్పుడు ఇశ్రాయేలీయుల కన్నులయెదుట యెహోషువను గొప్ప చేయుటకు మొదలుపెట్టాడు(7వ). జీవము గల దేవుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్న విషయము, తమ శత్రువులను జయించి కనాను దేశము లోనికి వారిని నడిపించనై యున్న విషయము ప్రజలు గ్రహించునట్లు ఆయన అద్భుతాన్ని జరిగించాడు.
యొర్దాను ప్రవాహము ఆగిపోవుట
మరుసటి దినము ఉదయము ఇశ్రాయేలీయులందరు లేచి యాజకులు ముందు నడువగా వారిని వెంబడించారు. యాజకుల కాళ్ళు యొర్దాను నీటికి తగిలిన వెంటనే గొప్ప అద్భుతం జరిగింది. యొర్దాను నీరు ప్రవహించుట ఆగిపోయింది. ప్రపంచమును నిర్మించిన దేవుడు యొ ర్దాను నది నీటిని ప్రవహించకుండా ఆపివేయలేడా? యొర్దాను నది నీరు గోడవలె పైకి నిలిచి పోయాయి. ఆ విధముగా దాదాపు 50 కి. మీ. దూరములో ఆదామను పురమునకు సమీపములో ఆగిపోయాయి. నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను నది మధ్యలో నిలుచుండగా ఇశ్రాయేలీయులు ఆరిన నేల పైన నడిచినట్లు గా నడిచి వెళ్ళిపోయారు. జరిగిన దానిని చూచి ఇశ్రాయేలీయులు ఎంతగానో ఆశ్చర్య పడి ఉంటారు. వారందరూ ఆ నది దాటడానికి చాలా సమయం పట్టి ఉండవచ్చు. దరికి చేరగానే ఇశ్రాయేలీయులు ఎంతో సంతోషించి ఉంటారు. వాగ్దాన దేశములోనికి ప్రవేశించగలిగి నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఉండవచ్చు. ఐగుప్తు నుండి బయలుదేరిన 40 సంవత్సరముల తరువాత దేవుడు వాగ్దానము చేసిన కనాను దేశములోనికి వారు ప్రవేశించగలిగారు. దేవుడు తమ ఎదుట ఎర్ర సముద్రమును 40 సంవత్సరముల క్రిందట రెండు పాయలుగా చేసి దాటించాడు. ఇప్పుడు యొర్దాను నది నీటిని నిలిపివేసి కనాను దేశము లోకి నడిపించాడు. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు తమ శత్రువులను ఓడించి ఏ విధముగా కనాను దేశము స్వాధీనపరుచుకున్నారో తరువాత తెలుసుకుందాము.
జ్ఞాపక సూచనగా స్తంభము నిలుపుట
ప్రభువు యెహోషువ తో రెండు స్తంభములను నిలుపుమని ఆజ్ఞ ఇచ్చాడు. ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల లెక్క ప్రకారము 12 రాళ్లు యాజకుల కాళ్లు నిలిచిన యొర్దాను నది నడుమ నుండి తెచ్చి నిలిపారు. యొర్దాను నదిలో నుండి మరొక 12 రాళ్లను ఇశ్రాయేలీయులలో 12 మంది ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకుని తీసుకొని రావలెను అని ఆజ్ఞాపించాడు. యాజకులు యోర్దాను నది నుండి పైకి వచ్చిన వెంటనే నీళ్లు
వాటి చోటికి ఎప్పటివలె పొర్లి ప్రవహించుట మొదలుపెట్టాయి. మరి పండ్రెండు రాళ్లు రాత్రి వారు బస చేసి నిద్రించిన చోట స్తంభము వలె నిలవబెట్టారు. దేవుడు మాత్రమే యొర్దాను నీటిని ఆపగలవాడు తిరిగి ప్రవహింప చేయగలవాడు. యాజకులు నిలిచిన చోట రాళ్లతో నిలువబెట్టిన స్తంభము నీరు ప్రవహించగానే కనిపించలేదు. ఆ నది నీరు ఎంతో లోతైనది. ఇశ్రాయేలీయులు అది చూచి దేవుని గొప్పతనమును ఎంతో స్తుతించారు.
మిగిలిన రాళ్లతో నిలువబెట్టిన స్తంభము జ్ఞాపక సూచనగా మిగిలిపోయింది. అక్కడ స్తంభమును నిలుపుమని దేవుడు ఇశ్రాయేలీయులకు ఎందుకు చెప్పి ఉండవచ్చు? ఇశ్రాయేలీయులు ఆ స్తంభమును చూచినప్పుడు ప్రభువు తమ యెడల చూపిన దయను ప్రేమను గుర్తు చేసుకొనుటకు దేవుడు ఆ రీతిగా వారికి ఆజ్ఞాపించాడు.
సందేశము
ఇశ్రాయేలీయులకు అది ఎంత గొప్ప దినము! వారు ఎండిన నేల మీద నడిచినట్లు గా యొర్దాను నడుమ నడిచి ఆ నదిని దాటారు. చివరకు తమ వాగ్దాన దేశమైన కనాను చేరుకున్నారు. ఆ దేశంలో కూడా ఎన్నో సమస్యలు ఇశ్రాయేలీయులకు ఎదురు కాబోతున్నాయి కానీ తమ దేవుడు సర్వశక్తిమంతుడని, ప్రేమ గలవాడని వారు గ్రహించారు గనుక ఆయన యందు విశ్వాసముంచారు. ఆయన యందు విశ్వాసముంచితే, దేవుడు తమతో కూడా ఉంటాడు అని వారు నమ్మిక ఉంచారు మరియు ప్రభువు యెహోషువకు తోడైయుండుట వారు చూచి అతడు తమ్మును ఆ వాగ్దాన దేశంలో కాపాడుతాడు అని నమ్మారు.
వారు జ్ఞాపక సూచనగా 12 రాళ్లతో నిలువబెట్టిన స్తంభము దేవుడు ఇశ్రాయేలియుల పట్ల చేసిన అద్భుత కార్యాలు వారికి గుర్తు చేస్తుంది. దేవుడు సృష్టికర్త గనుక ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు.
అన్వయింపు
ఆయన చేసిన అద్భుత కార్యాలను మనము మరువక గుర్తుంచుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలీయుల వలె జ్ఞాపకము కొరకు రాళ్లతో మనము స్తంభమును కట్టవలసిన అవసరము లేదు. ఆయన కార్యములను మరచిపోకుండునట్లు మన హృదయాలలో, మనస్సులలో వాటిని భద్రపరుచుకోవాలి. అనారోగ్యంతో ఉండి ప్రభువుకు ప్రారంభించినప్పుడు ఆయన బాగు చేసి ఉండవచ్చు, ప్రాణాలు పోగొట్టుకొన వలసిన ప్రమాదం నుండి ఆయన మనలను కాపాడి ఉండవచ్చు. అటువంటి పరిస్థితుల నుండి కాపాడిన దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాలి. చాలామంది దేవుడు తమకు చేసిన గొప్ప కార్యములను అన్నింటిని డైరీ లో వ్రాసుకుంటుంటారు. అవి తరువాత చదివినప్పుడు దేవుడు తమకు చేసిన గొప్ప కార్యములను వారు జ్ఞాపక మునకు తెచ్చుకుంటారు. క్రైస్తవులు అందరూ సంవత్సరములో ఒక దినము ``కృతజ్ఞతల పండుగ'' జరుపుకుంటారు. ఆ దినమున దేవుడు తమకు చేసిన మేలు లన్నింటిని గుర్తు చేసుకుని ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తారు.
ప్రభువు తమకు చూపిన దయను క్రైస్తవులు మరిచిపోకుండా ఉండడానికి ఒక మార్గం ఉంది. లోకము లోని మానవుల పాపములను క్షమించుటకు ప్రభువు యేసుని ఈ లోకములోనికి పంపి సిలువపై బలిగా అర్పించాడు. ఆ దినము మనము తప్పక గుర్తుంచుకోవాలి. అందుకే క్రైస్తవులు ఆలయములో కలుసుకున్నప్పుడు యేసు శరీరమునకు గుర్తుగా రొట్టెను, రక్తమునకు గుర్తుగా ద్రాక్షారసమును తీసుకుంటారు. అలా చేయుట వలన తమ కొరకు యేసు ప్రభువు సిలువ పై మరణించిన విషయాన్ని గుర్తు చేసుకుంటారు. ప్రభువు చేసిన గొప్ప కార్యాలను బట్టి క్రైస్తవులు ఎంతగానో కృతజ్ఞత కలిగి ఉంటారు. ప్రభువైన యేసు సిలువపై మరణించుట ద్వారా మానవులు తమ పాపములను పోగొట్టుకుని శాంతి సమాధానములతో జీవించగలుగుతారు. క్రైస్తవులు యెల్లప్పుడు దేవుడు చేసిన గొప్ప కార్యాలకు కృతజ్ఞతలు చెల్లించే వారుగా ఉండాలి (కీర్తన 103:2). మీరు ప్రతిరోజు రాత్రి నిద్రించడానికి ముందు దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నారా?
కంఠతవాక్యము
ప్రభువు దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి (కీర్తన 106: 1)
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF