సంఖ్యా 20:1-13,ద్వితీ 34:1-8
ఉద్దేశము
జీవితమనే ప్రయాణం లో మనము ప్రభువుకు విధేయులమై జీవించినట్లయితే తప్పక పరలోకం వెళ్తాము అని బోధించుట.
ముఖ్యాంశము
వృద్ధులు, త్వరలోనే మరణించబోతున్నాము అని తెలిసిన వారు తమ కుటుంబంతో, స్నేహితులతో మాట్లాడి భవిష్యత్తును గురించి కొన్ని సూచనలు సలహాలు ఇస్తుంటారు. మరణము తరువాత తన ఇంటిని ధనాన్ని కారును వ్యాపారాన్ని ఎవరెవరికి ఇవ్వాలో చెప్తారు. ఈ దినాలలో అటువంటి విషయాలన్నింటిని ముందుగానే వీలునామాలో వ్రాస్తున్నారు. "త్వరలో నీవు మరణిస్తావు" అని దేవుడు మోషేతో చెప్పాడు. మోషే తన మరణం తర్వాత ఇశ్రాయేలీయులు వెంబడించ వలసిన దేవుని ఆజ్ఞలు కట్టడలను వారికి వివరించాడు. ఒకసారి మోషే జీవితము ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యాలను ఈ రోజు గుర్తు చేసుకుందాము.
మోషే పుట్టుక
మోషే జన్మించిన సమయంలో ఐగుప్తులో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూశాము. అప్పుడు మోషే ఫరో కుమారునిగా రాజభవనములో పెరిగాడు. మోసే అన్ని విద్యలయందు నేర్పు గలిగి తెలివిగలవాడుగా ఉన్నాడు. తనకు 40 సంవత్సరములు వయస్సు వచ్చినప్పుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను కాపాడాలని అనుకున్నాడు. ఐగుప్తు ధనము సుఖము కంటె తన ప్రజలతో కలిసి కష్టములు అనుభవించుట మేలు అని తలంచాడు(హెబ్రీ11: 24- 26). ఒక దినముఒక ఇశ్రాయేలీయునితో కొట్లాడుచున్న ఐగుప్తీయుని మోషే చంపాడు. ఫరోకు ఆ విషయం తెలిసి తనను చంపుతాడు అనే భయముతో అక్కడ నుండి పారిపోయాడు
మోషేను దేవుడు పిలుచుట (నిర్గమ.2:16-6:8;అపొస్తలుల కార్యములు 7:29-31)
మోషే ఐగుప్తు నుండి పారిపోయి మిద్యాను దేశము చేరుకున్నాడు. ప్రభువు ఎంతో దయతో మోషే అవసరాలన్నింటిని తీర్చాడు. అక్కడ అరణ్యములో మోషే తన మామ మందలను మేపుచుండేవాడు. రాజభవనములో నివసించిన మోషే అరణ్యములో మందలను మేపడం ఎంత ఆశ్చర్యం! కానీ ఈ సంఘటనలు అన్నిటిలో మనము దేవుని ప్రణాళికను ఎంతో స్పష్టంగా చూడగలము. దేవుడు గొప్ప పని కొరకు మోషేను సిద్ధ పరుస్తున్నాడు. ఒకరోజు మోషే సీనాయి పర్వతం మీద మందలను మేపుచున్న సమయములో మండుచున్న పొద లో నుండి దేవుడు అతనితో మాట్లాడాడు. ఐగుప్తులోని ఇశ్రాయేలీయులను విడిపించుటకు నాయకునిగా దేవునిచేత ఎన్నుకొనబడ్డాడు.
మోషే తన పనిని మొదలుపెట్టుట (నిర్గమ 7:10 నుండి)
80 సంవత్సరముల వయస్సులో దేవుడు మోషేను గొప్ప పనికి పిలిచాడు. ఐగుప్తు లోని తన ప్రజలైన ఇశ్రాయేలీయులను విడిపించవలసిన సమయము వచ్చింది. ఇశ్రాయేలీయులు తమది కాని పరదేశములో నాలుగు వందల సంవత్సరములకు పైగా నివసించిన తరువాత వాగ్దాన దేశములోనికి ప్రవేశిస్తారు అని దేవుడు అబ్రాహాము,ఇస్సాకు,యాకోబులకు ప్రమాణం చేశాడు. ఫరో రాజు దగ్గరకు వెళ్లడానికి అవసరమైన ధైర్యాన్ని ప్రభువే మోషేకు ఇచ్చాడు. చెడ్డవాడైన ఫరో ఇశ్రాయేలీయులను పంపించడానికి నిరాకరించగా దేవుడు 10 తెగుళ్ళు ఐగుప్తు దేశము మీదకు పంపించాడు.
ఇశ్రాయేలీయుల ప్రయాణం (కీర్తన 78:12-25)
అర్ధరాత్రి సమయంలో ఇశ్రాయేలీయులు త్వరపడి ఐగుప్తు దేశములో నుండి బయటకు రావడం, ప్రభువు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా ఛీల్చడం మీకు గుర్తుంది కదూ! వారిని వెంబడించి తరిమిన ఐగుప్తీయులు సముద్రం మధ్యలోనే మునిగిపోయారు. తమ శత్రువుల చేతిలోనుండి విడిపించబడిన ఇశ్రాయేలీయులు ఎంతో సంతోషంతో దేవుని స్తుతిస్తూ కీర్తనలు పాడారు. వారిని ఆ అరణ్యములో ఎడారులలో మేఘస్తంభము, అగ్నిస్తంభము ద్వారా 40 సంవత్సరములు ఎటువంటి కొరత లేకుండా దేవుడు నడిపించాడు. ఇన్ని అద్భుతాలు చూచినప్పటికీ ఇశ్రాయేలీయులు దేవునిపై విశ్వాముంచక మార్గమంతటిలో గొణుగుతునే ఉన్నారు. ఇశ్రాయేలీయుల ప్రవర్తన మోషేకు ఎంతో కష్టాన్ని, భాధను కలిగిస్తూ ఉండేది. మోషే వారితో ఎప్పుడూ వాదిస్తూ వారి విషయములో దేవునికి ప్రార్థిస్తూ ఉండేవాడు.
మోషే చేసిన పాపము (సంఖ్యా. 20:01-13)
ఇశ్రాయేలీయులు ఎప్పటివలె ఒకరోజు గొణుగుట మొదలుపెట్టారు. నీరు కావాలని వారు గొణగసాగారు. నీటి కొరకు దేవునికి ప్రార్థించకుండా మోషేతో వాదించసాగారు. మోషే ప్రార్ధించినప్పుడు బండతో మాట్లాడిన యెడల బండలో నుండి నీరు వస్తుంది అని ప్రభువు మోషేకు చెప్పాడు. కానీ ఇశ్రాయేలీయుల ప్రవర్తన పట్ల మోషే ఎంతో విసుగు చెందిన వాడై తన సహనం కోల్పోయాడు. ప్రభువు చెప్పిన విధముగా బండతో మాట్లాడుటకు బదులు కర్రతో రెండుసార్లు కోపముతో బండను కొట్టాడు. అంతేకాకుండా ఇశ్రాయేలీయులతో - " ద్రోహులారా వినుడి మేము ఈ బండ లో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా?" అని కోపగించుకున్నాడు. దేవుడు చేస్తున్న అద్భుత కార్యములో తనకు కూడా భాగముంది అన్నట్లుగా "మేము మీ కొరకు" అని చెప్పాడు. దేవుడు బండ నుండి నీళ్ళు రప్పించినప్పటికీ మోషే చూపిన అవిధేయత విషయములో కోపము తెచ్చుకున్నాడు. వాగ్దాన దేశం అయిన కనాను ప్రవేశించడానికి దేవుడు మోషేను అనుమతించలేదు. ఇది మోషేకు భయంకరమైన నిరాశ కలిగించి ఉంటుంది. 40 సంవత్సరాలుగా ఎదురు చూచిన వాగ్దాన దేశంలో తన పాపము,అవిధేయత వలన ప్రవేశించ లేకపోవడం ఎంత బాధాకరం! మోషే వాగ్దాన దేశమునకు తనను తీసుకుని వెళ్ళమని ప్రభువును ఎంత బ్రతిమాలినా ఆయన అంగీకరించలేదు, కానీ మరణించుటకు ముందు పిస్గాకొండ యెక్కి వాగ్దాన దేశమును చూచుటకు దేవుడు మోషేకు అవకాశం ఇచ్చాడు (ద్వితీ 3:23-27).
మోషే వీడ్కోలు చెప్పుట
త్వరలో మరణించబోతున్నాను అని మోషే గ్రహించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుటకు ఇశ్రాయేలీయులను ఒకచోట సమకూర్చాడు. అరణ్యములో వారు ప్రయాణించిన 40 సంవత్సరములు ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు చూపిన దయను, నమ్మకత్వాన్నివారికి గుర్తుచేశాడు. ఇశ్రాయేలీయులు తమ స్వంత మార్గములలో కాకుండా ప్రభువుకు విధేయులుగా జీవించుమని హెచ్చరించాడు. విధేయత చూపించుట వలన కలిగే ఆశీర్వాదాలను, చూపింపకపోతే వారి మీదకు వచ్చే శాపాలను వివరించాడు. ఇప్పుడు వారికి మోషే స్థానములో కొత్త నాయకుడు అవసరమై ఉన్నాడు. పన్నెండు మంది వేగులవారిలో మంచి సమాచారం చెప్పిన ఇద్దరిలో ఒకడైన యెహోషువను దేవుడు వారికి క్రొత్త నాయకునిగా నియమించాడు. యెహోషువ వారిని వాగ్దాన దేశములోనికి నడిపిస్తాడు. ప్రభువును స్తుతించునట్లు మోషే వారికి ఒక స్తుతి కీర్తన నేర్పించి వారిని ఆశీర్వదించి వీడ్కోలు చెప్పాడు.
మోషే మరణించుట (ద్వితీ 34:1-8)
మోషే ఇశ్రాయేలీయులను విడిచి వెళ్ళవలసిన సమయము వచ్చింది. వారిని విడిచి వెళ్ళవలసినందుకు బాధగా ఉన్నప్పటికి, త్వరలో దేవుడు వారిని కనాను దేశమునకు చేరుస్తాడు గనుక సంతోషించాడు. యెహోషువ మంచి నాయకుడు అని మోషేకు తెలుసు. చనిపోవడానికి ముందు వాగ్దాన భూమిని చూపుతాను అని దేవుడు మోషేకు చెప్పాడు. అప్పుడు మోషే పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరాన్ని ఎక్కాడు. అక్కడనుండి దేవుడు ఇశ్రాయేలీయులకు ఇవ్వబోతున్న కనాను దేశమంతటిని చూచాడు. ఆ దృశ్యం మోషేకు ఎంతో సంతోషాన్ని కలిగించి ఉండవచ్చు. అక్కడ నిలుచుండి తన జీవితాన్ని గురించి, దేవుని అద్భుతాలను గురించి ఆలోచించి ఉండవచ్చు.
వాగ్దాన దేశములోనికి ప్రవేశించలేనప్పటికీ, అంతకంటె శ్రేష్టమైన పరలోకములో ప్రవేశిస్తాను అనే సంతోషం మోషేకు కలిగివుండవచ్చు. భూమిపై తనకు అప్పగించబడిన పనిని పూర్తి చేసినందుకు తనకెంతో ప్రియమైన ప్రభు సన్నిధికి వెళ్లడం మోషేకు ఎంతో ఆనందమైన, అద్భుతమైన విషయం! ఆ కొండమీద చనిపోయినప్పుడు మోషే వయసు 120 సంవత్సరములు. మోషే చనిపోయినప్పుడు కూడా అతనికి దృష్టి మాంద్యం లేదు, బలము తగ్గలేదు (ద్వితీ 34:7). ఎవరికీ తెలియ కుండునట్లు ప్రభువే మోషేను పాతిపెట్టాడు.
సందేశము
మోషే ప్రభువును ప్రేమించి, విశ్వాసముంచినవాడు. దేవుడు తనకు అప్పగించిన పనులన్నిటిలో మోషే నమ్మకమైన వాడు (హెబ్రీ 11: 24-27). అప్పటివరకూ మోషే వంటి నాయకుడు లేడు. దేవుని సన్నిధిలో 40 పగళ్ళు 40 రాత్రులు గడిపిన వాడు మోషే. మరెవరికీ అటువంటి ఆధిక్యత కలుగలేదు. దేవుని పది ఆజ్ఞలు రాతి పలకలపై వ్రాసి ఇశ్రాయేలీయులకు అందించాడు. అంత గొప్ప నాయకుడిగా ఉన్నప్పటికీ భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని మోషేను గురించి బైబిల్ లో వ్రాయబడింది (సంఖ్యా 12:3). దేవుని యొక్క మహాశక్తిని మోషే గ్రహించాడు గనుక తన బలహీనతలను గుర్తించ గలిగాడు. మోషే కనాను దేశము దగ్గరకు ఇశ్రాయేలీయులను నడిపిస్తే, యెహోషువ కనాను దేశం లోనికి వారిని నడిపించబోతున్నాడు. దేవుడు మోషేకు తోడై ఉన్నట్లు గానే యెహోషువకు కూడా తోడుగా ఉంటాను అని వాగ్దానం చేశాడు.
అన్వయింపు
ఇశ్రాయేలీయుల అరణ్య మార్గపు ప్రయాణాన్ని గురించి గత కొన్ని వారాలుగా నేర్చుకున్నాము. మన జీవితము కూడా ఒక ప్రయాణము వంటిది. మన పుట్టుకతో జీవిత ప్రయాణం మొదలవుతుంది. పెద్ద వారమవుతున్నప్పుడు ప్రయాణము కష్టంగా మారిపోతుంది. కొన్నిసార్లు దుఃఖము, బాధలు, ఒంటరితనం, అనారోగ్యం మనలను ఎంతగానో క్రుంగజేస్తుంది. అటువంటి పరిస్థితులలో ప్రభువైన యేసుకు మనము సమీపంగా ఉండాలి అని చెబుతుంటారు. మనము క్రైస్తవులమైన యెడల మన ప్రయాణములో దేవుని గొప్ప శక్తిని గ్రహించగలము. మన జీవితం పట్ల దేవుని ప్రణాళికను చూపుమని ప్రభువును ప్రార్థించాలి. మన దేవుడు అప్పగించిన పని ముగిసిన తర్వాత మోషే వలె మన ప్రయాణము కూడా ముగుస్తుంది. అప్పుడు ప్రభువైన యేసుతో సదాకాలము ఉండుటకు పరలోకము చేరుకుంటాము.
కంఠతవాక్యము
నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును (సామెతలు 3:6)
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF