ద్వితీ. 31- 34 యెహోషువ 1వ అధ్యాయము
ఉద్దేశము
అప్పగింపబడిన నూతన బాధ్యతల కొరకు దేవుడు యెహోషువను సిద్ధపరచి, శిక్షణ ఇచ్చాడు అని అని బోధించుట.
ముఖ్యాంశము
ఏదైనా క్రొత్త ఉద్యోగములో లేదా పనిలో చేరినప్పుడు దానిని గురించిన శిక్షణ పొందడం ప్రతి ఒక్కరికి అవసరం. ఆ తరువాత వారు ఆ పనిని నైపుణ్యంతో చేయగలరు. డాక్టర్లు, నర్సులు, మెకానిక్ లు,ఇటుక పని చేసేవారు ఎవరైనా సరే తమ పనిని గురించిన మెళకువల కోసం, నిపుణత కోసం శిక్షణ తీసుకోవాలి. స్కూల్ లో ఎవరూ అకస్మాత్తుగా హెడ్ మాస్టర్ కాలేరు. ముందుగా టీచర్ వలె పనిచేసి, అనుభవం పొందిన తరువాత మాత్రమే హెడ్ మాస్టర్ గా నియమించబడ గలరు. స్కూల్ కి సంబంధించిన అన్ని విషయాలలో నైపుణ్యం కలిగిన వారే ఆ పదవిలో ఉండగలరు. అంతే కాకుండా స్కూల్ కి సంబంధించిన అన్ని విషయాలకు వారు బాధ్యత వహించగలగాలి. అంతేకాక టీచర్స్ అందరికీ అవసరమైన సలహాలు కూడా ఇవ్వగలగాలి.
ఒక ముఖ్యమైన పని కొరకు ఎన్నుకొనబడిన ఒక వ్యక్తిని గురించి మనము చూడబోతున్నాము. మంచి శిక్షణ, అనుభవము ఉన్నందు వలన అటువంటి పనులు చేయగల సామర్థ్యం ఉన్నవాడు, ఆ వ్యక్తి యెహోషువ. తన ప్రజలైన ఇశ్రాయెలీయులకు క్రొత్త నాయకునిగా యెహోషువను ప్రభువు ఎన్నుకున్నాడు.
నేపధ్యము
ఈ రోజు క్రొత్త పాఠములను మనము ప్రారంభించబోతున్నాము. మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు చెరనుండి విడిపించి అరణ్య మార్గం గుండా వారిని కనాను దేశము సమీపానికి నడిపించిన విషయం మీకు గుర్తుంది కదా! దేవుడు వాగ్దానము చేసిన కనాను దేశములోనికి వారు అడుగు పెట్టబోతున్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రిందట ఇశ్రాయేలీయుల పితరుడైన అబ్రాహాముకు ప్రభువు వాగ్దానము చేసిన కనాను దేశములో వారు ప్రవేశించే సమయము వచ్చింది. మోషే వృద్ధుడు మరియు దేవుని మాట చొప్పున వాగ్దాన దేశము లోకి ప్రవేశించలేడు గనుక దేవుడు మోషే స్థానములో యెహోషువను నాయకుడిగా చేసాడు. మోషే వాగ్దాన దేశములో ప్రవే శించలేక పోయినప్పటికీ దేవుడు ఒక పర్వత శిఖరము మీద నుండి ఇశ్రాయేలీయులు నివసించబోయే కనాను దేశమును మోషేకు చూపించాడు. యెహోషువ దేవుని ప్రజలను కనాను దేశము లోనికి నడిపించాడు.
యెహోషువ మంచివాడు ప్రభువును ప్రేమించినవాడు. నాయకుడిగా ఉండే వ్యక్తి మంచి సైనికుడు, పరిపాలించేవాడు మరియు దేవునిపై విశ్వాసము గల వాడై ఉండాలి. అతడు ఏ విధముగా తనకు అప్పగించబడిన పని నిమిత్తము శిక్షణ పొంది, సిద్ధపాటు కలిగి ఉన్నాడో చూద్దాం.
యెహోషువ - సైనికుడు (నిర్గమ17:8-16)
ఇశ్రాయేలీయుల నాయకుడైన యెహోషువ సైన్యాన్ని కూడా నడిపించవలసిన వాడైయున్నాడు. కనాను దేశమును జయించి స్వాధీన పరచుకొనుట కష్టమైన విషయము. యెహోషువ మంచి యుద్ధ నేర్పరి అని మనకు ఎలా తెలుసు? ఒకసారి అమాలేకీయులు ఇశ్రాయేలీయులపై యుద్ధానికి వచ్చారు. అప్పుడు యెహోషువ మనుష్యులను ఏర్పరచుకొని అమాలేకీయులతో యుద్ధము చేసి వారిపై విజయము సాధించాడు. ప్రభువు తమకు తోడుగా ఉండి విజయము కలుగ జేసాడు అని యెహోషువ గ్రహించగలిగాడు.
మోషే ప్రార్ధనలు కూడా తమ విజయానికి కారణము అని యెహోషువకు తెలుసు. యుద్ధము జరుగుతున్న సమయములో మోషే కొండ మీద నుండి అమాలేకీయులపై విజయము కొరకు ప్రార్ధించాడు. అది యెహోషువకు మరువలేని ఒక గొప్ప దినము. ప్రభువు ఇక ముందు జరగబోయే యుద్దాలన్నింటిలో కూడా తనకు తోడుగా ఉంటాడు అని యెహోషువ గ్రహించాడు. యెహోషువ గొప్ప సైన్యమును నడిపించగల సమర్ధుడు అని మనము అర్థము చేసి కొనవచ్చు .
యెహోషువ - అధికారి (నిర్గమ 24:12-13; 32:17; 33:11)
ప్రభువు పది ఆజ్ఞలను తీసుకొనుటకు కొండ మీదికి రమ్మని మోషేను పిలిచాడు. అప్పడు మోషేతో పాటు అతని పరిచారకుడైన యెహోషువ కూడా వెళ్ళాడు. వారు పాళెమనకు తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు బంగారు దూడను చేసుకొని ఆరాధించసాగారు. అప్పుడు మోషే కోపముతో తన చేతిలోని పది ఆజ్ఞలు గల పలుకలను పగులగొట్టాడు. అప్పుడు దేవుడు వారిలో కొందరిని శిక్షించి,మోషే ద్వారా తన కట్టడలను వారికి వివరించాడు. ఈ సంఘటనలు అన్నింటిలో యెహోషువ మోషే తో కలసి ఉన్నాడు. యెహోషువ మోషే పరిచారకుడు లేదా సహాయకుడు అని బైబిల్ లో వ్రాయబడింది (నిర్గమ 33:11). మోషే తో కలిసి ఉన్నయెహోషువ నాయకుడిగా ఉండుటకు అన్ని విధాలుగా సరి అయిన వాడు అని మనము గ్రహించవచ్చు.
యెహోషువ - విశ్వాసం గలవాడు (సంఖ్యా. 14:6-10) యెహోషువ సైన్యములను నడిపించగల వాడు, మంచి నాయకుడు అని మనము చూసాము. కానీ ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశములోనికి నడిపించడానికి ముఖ్యమైనది ప్రభువు నందు నమ్మకము. దానిని విశ్వాసము అంటాము. ఆ దేశమును స్వాధీనపరచుకొనుట ఎంతో కష్టమైన పని. అటువంటి సమయములో నిరాశ కరమైన సమయాలలో ప్రభువు సహాయము ఎంతో అవసరం. యెహోషువ తనంతట తాను ఆ పనులు చేయలేడు. యెహోషువ దేవుని యందు గొప్ప విశ్వాసం గలిగినవాడు. మోషే వేగు చూచుటకు పంపించిన 12 మందిలో యెహోషువ ఒకడు. తిరిగి వచ్చిన వారిలో 10 మంది అక్కడ నివసించువారు బలవంతులు గనుక ఆ దేశమును స్వాధీనపరచుకొనలేము అని చెప్పారు. యెహోషువ, కాలేబు మాత్రమే అది మంచి ప్రదేశము అని, దేవుడు తమకు తోడుగా ఉన్నాడు గనుక దానిని స్వాధీనపరచుకొనగలము అని చెప్పారు. యెహోషువ దేవుని యందు విశ్వాసము గలవాడై వాగ్దాన దేశమునకు వెళ్లుదమని ప్రజలను ప్రోత్సహించి ధైర్య పరిచాడు. దీనిని బట్టి యెహోషువ విశ్వాసము గొప్పది అని, అతడు దేవుని మహా శక్తి యందు నమ్మకము గలవాడని మనము అర్థం చేసికొనవచ్చు.
దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించుట (యెహోషువ 1:1-9)
యెహోషువ ధైర్యముగల సైనికుడు, మోషేకు పరిచారకుడు, అన్నింటిని మించి గొప్ప విశ్వాసం గలవాడు అని దేవునికి తెలుసు. అందుకే యెహోషువను పిలిచి మోషే స్థానాన్ని అప్పగించాడు. మోషే ఎంతో గొప్ప నాయకుడు కనుక అతని స్థానాన్ని తీసుకోవడం యెహోషువకు ఎంతో కష్టంగా అనిపించి ఉండవచ్చు. కాని ప్రభువు యెహోషువను ధైర్య పరచాడు. దేవుడు యెహోషువతో -
``నా సేవకుడైన మోషే మృతినొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరును ఈ యొర్దాను దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్లుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందును'' అని చెప్పాడు. భూమ్యాకాశములను సృష్టించిన సృష్టికర్త ప్రభువు అని యెహోషువకు తెలుసు. ఐగుప్తులో, అరణ్య మార్గములో దేవుడు చేసిన మహత్కార్యములను యెహోషువ మరిచిపోలేదు. ప్రభువు ఎటువంటి కార్యములనైనా చేయగలడు అని అర్థం చేసుకున్నాడు. తనకు ధైర్యంగా ఉండమని దేవుడు చెప్పాడు గనుక తప్పక తనతో కూడా ఆయన ఉంటాడు అని నమ్మాడు. దేవుడు మనకు అప్పగించిన పనులను చేయుటలో తప్పక మనతో ఉండి సహాయం చేస్తాడు అని విశ్వసించాలి. తమ సైన్యముతో కూడా దేవుడు ఉండి కనాను దేశమును జయించి స్వాధీనపరచుకుని నివసించడానికి సహాయకుడై ఉంటాడు అని యెహోషువ నమ్మ గలిగాడు. దేవుని వాక్యము ప్రతిదినము ధ్యానించి దానికి లోబడి జీవించాలి అని దేవుడు యెహోషువకు ఆజ్ఞా పించాడు. అలా చేసిన యెడల యెహోషువ తన తన మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించవచ్చు అని దేవుడు చెప్పాడు. దేవుడు యెహోషువకు తోడుగా ఉండి, ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశమునకు నడిపించిన విషయాలను గూర్చి తరువాతి పాఠాలలో తెలుసుకుందాము.
సందేశము
యెహోషువ ప్రత్యేకమైన వ్యక్తి. ఇశ్రాయేలీయులకు నాయకునిగా మోషే స్థానములో దేవుడు యెహోషువను నియమించాడు. అతడు సైన్యములను నడిపించగల వాడుగా, మంచి అధికారిగా, ప్రభువు నందు గొప్ప విశ్వాసం గలవాడుగా శిక్షణ పొందాడు. యెహోషువ దివారాత్రులు దేవుని వాక్యమును ధ్యానించి వాటి చొప్పున నడవాలని దేవుడు ఆజ్ఞాపించాడు. యెహోషువ యొక్క విజయములకు ముఖ్యమైన ఆధారం దేవుడు( యెహోషువ 1: 7- 9)
అన్వయింపు
చిన్న వయస్సులో తమలోని తలాంతులను వాడినటువంటి వ్యక్తులను పెద్దవారైన తరువాత దేవుడు తన పని కోసం వాడుకున్నట్లు బైబిల్ లో చదువగలము. చిన్నతనము నుండి గొర్రెలను మేపిన దావీదును తన ప్రజల మీద రాజుగా దేవుడు నియమించాడు( 2 వ సమూయేలు 5:2). అతడు తన సితారాను వాయించి పాటలు వ్రాశాడు. పెద్దవాడైన తరువాత రాజు గా ఉంటూ కీర్తనలు వ్రాసి దేవుని స్తుతించేవాడు.
దేవుడు మనకు ఇచ్చిన తలాంతులను మనము పెద్ద వారమైనప్పుడు ఆయన కొరకు ఉపయోగించాలి అని దేవుడు కోరుకుంటాడు. మనము క్రైస్తవులుగా మారినప్పుడు మాత్రమే ఆ విధముగా చేయగలము. ఆయన మన పాపములను క్షమించి మనలను తన వారసులుగా చేసుకుంటాడు అని మనము విశ్వసించాలి. అప్పుడు మాత్రమే మన తలాంతులతో దేవుని సేవించ గలము. ప్రతి పనిని ప్రార్ధనా పూర్వకంగా దేవుని మహిమ కొరకు చేయగలము. మనలో ఉన్న తలాంతులను దేవుడు తన పని కొరకు వాడుకొనగలడు.
ఉదాహరణ
శ్రావ్య ప్రభువును చిన్నతనము నుండి ఎంతగానో ప్రేమించేది. తాను పెద్దగా అయిన తరువాత డాక్టర్ కావాలని ఎంతో ఆశ పడేది. స్కూల్ లో తన స్నేహితులకు దెబ్బలు తగిలినప్పుడు వారి గాయాలు కడిగి తుడిచి మందు వేసేది. స్కూల్ లో ఎంతో కష్టపడి చదివేది. అదే సమయంలో సండే స్కూల్ లో దేవుని గురించి ఎన్నో విషయాలు నేర్చుకునేది. తరువాత డాక్టర్ కోర్స్ లో సీటు సంపాదించు కొని తన కోర్సు పూర్తి చేసుకొంది. ఉత్తర భారత దేశములో మిషనరీ డాక్టరుగా పేద ప్రజల మధ్య పని చేయడానికి శ్రావ్య నిర్ణయించుకొంది. డాక్టర్ గా అక్కడ రోగులకు వైద్యం చేస్తూ వారిని బాగుచేసేది. అదే విధముగా పాపములు క్షమించి పరలోకమునకు తీసికొని వెళ్లగలిగిన ప్రభువు ప్రేమను గురించి వారికి భోదించేది. శ్రావ్య తన జీవితాన్ని గురించి ఆలోచించినప్పుడు చిన్ననాటి నుండి స్కూల్ లో స్నేహితులకు చేసిన సహాయము, సండే స్కూల్ లో నేర్చుకొన్న విషయాలు తనకు గొప్ప శిక్షణగా పని చేసాయి అని గ్రహించింది.
మనము చిన్నవారముగా ఉన్నప్పుడే ప్రభువును విశ్వసించుట ఎంతో ముఖ్యం. దావీదు బాలుడిగా ఉన్నప్పుడే దేవునియందు విస్వసము గలవాడై సింహాన్ని చంపాడు. కొంచెము పెద్దవాడై యౌవనస్థుడిగా ఉన్నప్పుడు గొల్యాతును చంపగలిగాడు. ఇంకను పెద్దవాడైన తరువాత దేవుని ప్రజల మీద రాజుగా నియమించబడి ఎన్నో గొప్ప కార్యాలు చేసాడు. మనము చిన్న వయస్సులోనే బైబిల్ చదివి ప్రార్ధించి సండే స్కూల్ కి వెళ్ళడానికి అలవాటు చేసికొన్నప్పుడు పెద్దవారమైనప్పుడు మన విశ్వాసములో ఎంతో స్థిరంగా ఉండగలము. క్రైస్తవులు తమ తలాంతులను తన పని కోసం వాడాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు .
నీకు తోడై ఉండెదను అని ప్రభువు యెహోషువకు వాగ్దానం చేసినట్లుగానే ఆయనయందు విశ్వాసముంచిన యెడల మనకు కూడా తప్పక తోడై యుంటాడు.
కంఠతవాక్యము
నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడు నీకు తోడై యుండును (యెహోషువ 1:9)
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF