నిర్గమ 19:1-20,21; హెబ్రీ 12:18-21

ఉద్దేశ్యము
దేవుడు పరిశుద్ధుడు అని బోధించుట. ప్రభువైన యేసును గురించి మనము నేర్చుకుంటున్నప్పుడు ఆయన స్వభావము, గుణ లక్షణాలను గురించి అర్థం చేసుకోగలము .
ముఖ్యాంశము
ముఖ్యమంత్రి మీ స్కూల్ ని చూడడానికి వస్తున్నాడు అనుకోండి. అప్పుడు మీరు ఏమి చేస్తారు? ఎన్నో రోజుల ముందు నుండి మీ స్కూల్ ని శుభ్ర పరుస్తూ ఉంటారు. స్కూల్ అంతా శుభ్రం చేసి రాళ్లు అన్నీ తీసేసి స్కూల్ కి రంగులు వేస్తారు. ఆ రోజు శుభ్రంగా ఉండే యూనిఫాం ఇస్త్రీ చేసి వేసుకుని, తల చక్కగా దువ్వుకుని స్కూల్ కి రమ్మని చెప్తారు కదా! ముఖ్యమంత్రి వచ్చే సమయానికి అందరూ స్వాగతం చెప్పడానికి ఎదురుచూస్తుంటారు. ముఖ్యమంత్రి గారు ప్రసంగించే సమయంలో మాట్లాడకుండా అందరూ శ్రద్ధగా వినాలని ముందుగానే నీకు సూచనలు ఇస్తారు ఎందుకు? ముఖ్యమంత్రి ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తి కనుక ఆయన మాటలు అందరూ జాగ్రత్తగా వినాలి అని అందరూ అనుకుంటారు. ఈరోజు ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి కంటే గొప్పవ్యక్తి మాటలు మనము విందాము . ఆ వ్యక్తి ఎవరో మీరు ఊహించగలరా? అవును దేవుడు - ఎంతో ముఖ్యమైన విషయాలను చెప్పడానికి దేవుడు పరలోకము నుండి దిగి వచ్చాడు.
గతావారము
ఎర్ర సముద్రము దాటిన ఇశ్రాయేలీయులకు మూడు రోజుల ప్రయాణం తరువాత ఏ సమస్య ఎదురైంది? అప్పుడు వారు ఏమి చేశారు? దేవుని పట్ల ఇశ్రాయేలీయులు ఎలా ప్రవర్తించారు? ఇశ్రాయేలీయుల దాహము దేవుడు ఎలా తీర్చాడు? తరువాత వారి ప్రవర్తనలో ఏమైనా మార్పు కలిగిందా ? ఏలీము ప్రాంతం ఎలా ఉంది? వారికి తిరిగి దాహము వేసినప్పుడు దేవుడు బండ లో నుండి వారికి సమృద్ధిగా నీటిని ఇచ్చాడు. అయినా ఇశ్రాయేలీయులు మరలా మరలా సణుగుట మానలేదు.
సిద్ధపాటు (నిర్గమ 19 :1-15)
అరణ్యములో, ఎడారిలో వారి ప్రయాణంలో దేవుడు ఎంతో అద్భుతంగా ఇశ్రాయేలీయులకు ఆహారమును నీటిని సమకూర్చినట్లు మనము చూసాము. వారు ఎఱ్ఱ సముద్రమును దాటి దాదాపు 3 నెలలు దాటింది. దేవుడు మేఘస్తంభము, అగ్ని స్తంభము ద్వారా వారికి దారి చూపుతూ ఉంటే ఇశ్రాయేలీయులు వెంబడిస్తూ ప్రయాణిస్తున్నారు . ఇప్పుడు గొప్ప రాళ్లు గల ఎత్తయిన సీనాయి పర్వతం ఎదుటికి వారు వచ్చారు. ఈ పర్వతము మోషే 40 సం లు తన మామ మందను మేపిన పర్వతము. ఇక్కడే దేవుడు కాలుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడి తిరిగి ఇశ్రాయేలీయులను అక్కడకు తీసుకొని వస్తాను అని వాగ్దానం చేసాడు (నిర్గమ 3:12). వారు ఆ పర్వతము ఎదుట తమ గుడారములు వేసుకొని అక్కడ ఉన్నారు. ఇది ఇశ్రాయేలీయులకు చాలా ముఖ్యమైన సమయము. మూడు దినములలో దేవుడు దిగి వచ్చి వారిని దర్శిం చబోతున్నాడు. దేవుడు ఇశ్రాయేలియుల పట్ల ఎంతో శ్రద్ధ కలిగిన వాడు కనుక వారికి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలని ఇష్టపడ్డాడు. దేవుడు మోషేతో - "నీవు ఇశ్రాయేలీయులకు తెలుపవలసినది ఏమనగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలను అనుసరించి నడిచిన యెడల మీరు నా సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్య మగుదురు అని చెప్పుము" అని వివరించాడు. మోషే తిరిగి వెళ్లి ఇశ్రాయేలీయులకు దేవుని మాటలను తెలియజేయగా వారందరూ అందుకు ఏకముగా అంగీకరించారు. దేవుడు తిరిగి మోషేను పిలిచి మూడవ నాటికి ప్రజలందరి కన్నుల యెదుట సీనాయి పర్వతం మీదికి దిగి వస్తాను అని చెప్పాడు. ప్రజలు తమను తాము పరిశుద్ధ పరచుకొనాలి అని ఆజ్ఞాపించాడు. దేవుడు ఇశ్రాయేలీయులకు తన మాటలను వినిపించనై యున్నాడు . వారు తమ బట్టలు ఉదుకుకొని ప్రతి విధమైన అపవిత్రతకు దూరముగా ఉండి సిద్ధపడాలి అని దేవుడు మోషేకు వివరించాడు. ఇశ్రాయేలీయులు పర్వతము ఎక్కకుండా దాని అంచులు ముట్టకుండా చుట్టూ సరిహద్దులు ఏర్పరచుమని దేవుడు మోషేకు ఆజ్ఞా పించాడు. వారు ఆ పర్వతమును తమ చేతులతో కూడా తాకకూడదు అని దేవుడు ఖచ్చితమైన విధిని ఏర్పరచాడు. పర్వతము ముట్టుకొను ప్రతివాడు మరణశిక్ష పొందాలి అని దేవుడు చెప్పాడు. పరిశుద్దుడైన దేవుడు ఆ పర్వతము మీద ఉన్నాడు గనుక వారు తప్పక వాటిని పాటించాలి .
దేవుని సన్నిధి ( నిర్గమ19:16-25)
మూడవనాడు ఉదయము ఉరుములు,మెరుపులు మేఘములు ఆ పర్వతమును కమ్మివేశాయి. అప్పుడు గొప్ప బూర ధ్వని ఆ పర్వతము మీద వినిపించింది. అప్పుడు మోషే పాళెములో నుండి ప్రజలను బయటకు పిలిచినప్పుడు వారు పర్వతం దగ్గర మోషే ఏర్పరచిన సరిహద్దులకు అవతల నిలబడ్డారు. ఉరుములు మెరుపులు బూరధ్వని వినినప్పుడు వారు ఎంతగానో భయపడ్డారు. అప్పుడు ప్రభువు అగ్నిలో సీనాయి పర్వతం మీదికి దిగి రాగా అదంతయు ధూమము (పొగ) తో నిండిపోయింది. అది వారికి అగ్నిపర్వతము వలె కనిపించి ఉండవచ్చు. ఆ బూర ధ్వని అంతకంతకు ఎక్కువకా సాగింది . అప్పుడు ఆ పర్వతము భూకంపం వచ్చినట్లు కంపించింది. అప్పుడు దేవుడు మోషేను పైకి పిలువగా మోషే ఎక్కిపోయాడు. అప్పుడు దేవుడు మోషేతో - "ప్రజలు చూచుటకు ప్రభువు వద్దకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము" అని చెప్పాడు. తన ప్రజలు నశించుట దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఆ కొండను చూచిన ప్రజలు భయంతో వణికిపోయారు. మోషే కూడా ఆ దర్శనమును చూచి మిక్కిలి భయపడి వణుకుచున్నాడు అని బైబిల్ లో వ్రాయబడింది (హెబ్రీ 12:21).
దేవుడు మాట్లాడుట (నిర్గమ.20:1- 18; ద్వితీ. 4:33)
దేవుడు ఆ కొండ మీద నుండి ఇశ్రాయేలీయులకు పది ఆజ్ఞలు ఇచ్చాడు. వీటిని గురించి వచ్చే వారం వివరంగా తెలుసుకుందాము. దేవునికి ప్రీతికరంగా జీవించుటకు ఇశ్రాయేలీయులు అనుసరించవలసిన ముఖ్యమైన ఆజ్ఞలు ఇవే. అప్పుడు ఇశ్రాయేలీయులు మోషే తో - "నీవు మాతో మాటలాడుము మేము విందుము. దేవుడు మాతో మాటలాడిన యెడల మేము చనిపోవుదుము" అని చెప్పి ఆ పర్వతమునకు దూరంగా నిలబడ్డారు . అందుకు మోషే వారితో - "భయపడకుడి మిమ్ములను పరీక్షించుటకును, మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసెను" అని ధైర్యపరచాడు. (నిర్గమ 20:20) ఇశ్రాయేలీయులను అహరోనుకు అప్పగించి మేఘములతో నిండియున్న పర్వతము మీదికి దేవుని దగ్గరకు మోషే ఎక్కి పోయాడు. దేవుడు మోషేకు అనేకమైన ఆజ్ఞలు ఇవ్వబోతున్నాడు. సీనాయి పర్వతం మీద మోషే ప్రభువుతో కలిసి 40 రోజులు 40 రాత్రులు వున్నాడు. దేవుడు రెండు రాతి పలకల మీద పది ఆజ్ఞలను తన వ్రేలితో వ్రాసి మోషేకు ఇచ్చాడు. దేవుడు ఇంకా ఎన్నో కట్టడలను మోషేకు వివరించాడు. వాటి ప్రకారమే ఇశ్రాయేలీయులు నడుచుకోవాలి అని దేవుడు ఆశించాడు. వారు ఏమి చేయాలో ఏమి చేయకూడదో వివరముగా తెలియ చేశాడు. ఆ సమయంలో ఇశ్రాయేలీయులు తమ గుడారములలోనికి తిరిగి వెళ్ళి మోషే కోసం ఎదురు చూడసాగారు.
ప్రత్యక్షపు గుడారము ( నిర్గమ.25: 27, 40: 38)
పర్వతము మీద దేవుని సన్నిధిలో ఉన్నపుడు, ఇశ్రాయేలీయులు దేవుని ఆరాధించవలసిన విధి విధానాలను కూడా దేవుడు మోషేకు వివరించాడు. ప్రత్యక్షపు గుడారము అని పిలువబడే దేవుని నివాస స్థలమును కట్టుటకు మోషేకు అన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. అది ప్రజలు వచ్చి దేవుని ఆరాధించుకొనదగిన స్థలమై ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అది గుడారము వలె తయారు చేసిన ఎడల ఇశ్రాయేలీయులు తమతో పాటు తీసుకొని పోవుటకు వీలవుతుంది అని దేవుని ప్రణాళిక. దేవుడు తాను చెప్పిన సూచనలను ఖచ్చితంగా పాటించి ప్రత్యక్షపు గుడారము నిర్మించాలి అని మోషేకు ఆజ్ఞా పించాడు. ఆ మందిరము పది తెరలతో చేయునట్లు ఆజ్ఞాపించాడు. ప్రతి తెర పొడుగు 28 మూరలు, వెడల్పు4 మూరలు ఉండాలి అని చెప్పాడు. ఆ మందిరము చుట్టూ ఎవరూ తొంగి చూడకుండునట్లు ఎత్తుగా కట్టాలి. లోపల ప్రత్యేకమైన సామానులు తయారు చేయాలి. గుడారము లోపల నిబంధన మందసము అని పిలువబడే చిన్న పెట్టె వంటిది తయారు చేయాలి. ఈ మందసములోనే మోషే పది ఆజ్ఞల పలకలను ఉంచాడు. ఈ గుడారమును చేయుటకు ఎంతో విలువైన, ప్రశస్తమైన వస్తువులు ఉపయోగించవలసి ఉన్నది. ఇశ్రాయేలీయులను బంగారు,ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములుగల మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మ కర్రలు, ప్రదీపమునకు తైలము, సుగంధ సంభారములు, లేతపచ్చలు, ఏఫోదుకు పతకమునకు చెక్కు రత్నములను మనఃపూర్వకముగా తీసుకుని రావలసిందిగా దేవుడు ఆజ్ఞాపించాడు. మోషే కొండ దిగి వచ్చిన తరువాత దేవుడు చెప్పిన కొలతలు సూచనల ప్రకారము ప్రత్యక్షపు గుడారము నిర్మించుట మొదలుపెట్టారు. ప్రత్యక్షపు గుడారపు నిర్మాణం పూర్తి అయిన తరువాత మేఘము దానిని కమ్మగా ప్రభువు తేజస్సుతో మందిరము నిండిపోయింది (నిర్గమ 40:34). దేవుడు ప్రత్యకమైన రీతిలో తన సన్నిధిని ఆ ప్రత్యక్షపు గుడారములో ఉంచుతాను అని వారికి వాగ్దానము చేశాడు. పగటి పూట నడిపిస్తున్న మేఘస్తంభము రాత్రి వేళ నడిపిస్తున్న అగ్ని స్తంభము ఇప్పుడు ప్రత్యక్షపు గుడారము పైన నిలువసాగాయి. దేవుని సన్నిధి తమతో ఉన్నది కనుక ఎంతో క్షేమంగా ఉండగలము అనే ధైర్యంతో ఇశ్రాయేలీయులు ఉన్నారు.
సందేశము
దేవుడు సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చుట ఈరోజు మన పాఠము. పర్వతము మీద జరిగిన విషయాలు ఇశ్రాయేలీయులను భయపెట్టడానికి కాదు గాని దేవుని పరిశుద్ధతను వారు గ్రహించటానికే జరిగాయి. ఆయన పరిశుద్ధుడు కనుక వారు తనను సమీపించ లేరు అని దేవుడు వారికి తెలియపరిచాడు. తన అద్భుతమైన శక్తిని ఇశ్రాయేలీయులు అర్థం చేసుకొనుటకు దేవుడు ఆ రీతిగా చేశాడు. దేవుని మాటలు శ్రద్ధగా విని విధేయత చూపునట్లు ఆ కొండమీద సంఘటనలు జరిగాయి.
అన్వయింపు
మనము కూడా దేవుని గొప్పతనం గురించి అర్థం చేసుకోవాలి. కానీ ఆయనను చూడకుండా ఎలా అర్థం చేసుకోగలము? ప్రభువైన యేసు పరలోకమును విడిచి భూమి మీదికి వచ్చి నివసించుట ద్వారా దేవుని ప్రత్యక్ష పరిచాడు (యోహాను1 :18). యేసు పరిశుద్ధుడు ఆయన ఎన్నడూ ఎటువంటి తప్పు చేయలేదు. ఆయన పరిపూర్ణుడు. బాల్యము నుండి కూడా యేసు ఎన్నడూ అబద్దం ఆడలేదు, దొంగిలించలేదు, తల్లిదండ్రులకు అవిధేయత చూపలేదు. యేసు గొప్పవాడు సర్వశక్తిమంతుడు - ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చాడు, మరణించిన వారిని తిరిగి లేపాడు. యేసు మంచివాడు,దయగలవాడు. గ్రుడ్డివారిని, కుంటి వారిని, రోగులను స్వస్థపరచాడు. యేసు ప్రేమ గలవాడు, క్షమాగుణం గలవాడు. ఎవరైనా వారి పాపముల విషయమై నిజముగా పశ్చాత్తాప పడితే ఆయన వారిని తప్పక క్షమిస్తాడు. మనము ఆయనకు లోబడి ఆయన మాటలు వినాలి. యేసును గూర్చి నేర్చుకోవడం, దేవుని గూర్చి తెలుసుకొనడం గొప్పఅద్భుతం. మనము దేవుని మాటలన్నింటిని జాగ్రత్తగా విని బైబిల్ లో ఆయన మనకు ఆజ్ఞాపించిన వాటన్నిటికిని విధేయత చూపాలి. దేవుని ఆజ్ఞలు మనకు ఎంతో మేలుకరమైనవి అని మనము గుర్తించాలి. కంఠతవాక్యము
" మీరు పరిశుద్ధులై యుండవలెను. మీ దేవుడనైన నేను పరిశుద్ధుడవై ఉన్నాను" లేవీయకాండము 19:2

ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

సిరీస్ 1 - సృష్టి నుండి బాబెలు

  1. సృష్టికర్తయైన దేవుడు
  2. ఆరు దినముల సృష్టి క్రమము
  3. దేవుడు మానవుని సృజించుట
  4. దేవుడు సృష్టి కార్యమును పూర్తి చేయుట
  5. ఆదాము - హవ్వ
  6. మానవుని పతనము - పర్యవసానములు (ఫలితము)
  7. కయీను - హేబెలు
  8. నోవహు ఓడను నిర్మించుట
  9. నోవహు ఓడలోనికి వెళ్ళుట
  10. నోవహు కృతజ్ఞతార్పణ చెల్లించుట
  11. బాబెలు గోపురము

సిరీస్ 2 - అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు

  1. అబ్రాహాము దేవునికి విధేయత చూపుట
  2. అబ్రాహాము, లోతు - వారి ఎంపిక
  3. శారా యొక్క అవిశ్వాసము
  4. సొదొమ పట్టణములో లోతు
  5. అబ్రాహాము అబద్ధమాడుట
  6. అబ్రాహాముకు దేవుని వాగ్దానము
  7. హాగరు - ఇష్మాయేలు
  8. అబ్రాహాము విశ్వాసము పరిశోధించబడుట
  9. ఇస్సాకు వివాహము చేసికొనుట
  10. యాకోబు ఇస్సాకును మోసము చేయుట
  11. యాకోబు - నిచ్చెన
  12. యాకోబు వివాహము
  13. యాకోబు తిరిగి తన దేశమునకు వెళ్ళుట

సిరీస్ 3 - యోసేపును గురించి మరియు మోషే పుట్టుక

  1. యోసేపు స్వప్నములు
  2. యోసేపు విచిత్రపు నిలువుటంగీ
  3. పోతీఫరు గృహములో యోసేపు
  4. యోసేపు - పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి
  5. చెరసాలలో నుండి అధికారము లోనికి
  6. యోసేపు స్వప్నములు నెరవేరుట
  7. యోసేపు తన సహోదరులను పరీక్షించుట
  8. ఐగుప్తులో యోసేపు కుటుంబము
  9. ఇశ్రాయేలు వంశము ఐగుప్తునందు అభివృద్ధి చెందుట
  10. మోషే జన్మించుట
  11. మోషే నిర్ణయము (ఎంపిక)
  12. మోషేకు దేవుని పిలుపు

సిరీస్ 4 - మోషే, ఇశ్రాయేలీయుల చరిత్ర

  1. మోషే తన పని ప్రారంభించుట
  2. ఐగుప్తు దేశము మీద తెగుళ్ళు
  3. పస్కా పండుగ
  4. ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రమును దాటుట
  5. దేవుడు మన్నా కురిపించుట
  6. దేవుడు ఇశ్రాయేలీయులకు నీటిని సమకూర్చుట
  7. సీనాయి పర్వతం
  8. పది ఆజ్ఞలు
  9. బంగారు దూడ
  10. వేగులవారి సమాచారము
  11. ఇత్తడి సర్పము
  12. మోషే మరణము

సిరీస్ 5 - యెహోషువ, సమూయేలు

  1. యెహోషువ - క్రొత్త నాయకుడు
  2. జ్ఞాపక సూచకమైన రాళ్ళు
  3. రాహాబు విశ్వాసము
  4. యెరికో పట్టణము కూలిపోవుట
  5. ఆకాను పాపము
  6. గిబియోనీయులు మోసగించుట
  7. యెహోషువ వీడ్కోలు - న్యాయాధిపతుల కాలము
  8. గిద్యోను సిద్దపడుట
  9. గిద్యోను విజయము
  10. సమ్సోను
  11. సమూయేలు జన్మించుట
  12. సమూయేలును దేవుడు పిలుచుట
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.