ఆదికాండము 29:1-30
ఉద్దేశము/లక్ష్యము
మనము ఇతరులకు అబద్ధాలు చెప్పి మోసం చేస్తే, మనకు కూడా అదే విధముగా జరుగుతుంది అని బోధించుట.
ముఖ్యాంశము
నిరాశ - మీరు వేసవి సెలవులలో కొడైకెనాల్ వెళ్లాలి అని ప్లాన్ చేశారు అనుకోండి. మీ తమ్ముడికి చెట్టు మీద నుండి పడి చేయి విరిగింది అనుకుందాము. మీ ప్రయాణం ఆగిపోయింది, అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫ్రెండ్స్ తో కలిసి లంచ్ కి బయటకు వెళ్ళాలి అనుకున్నారు, కానీ జ్వరం రావడం వల్ల వెళ్లలేక పోతే ఎలా ఉంటుంది? కొన్నిసార్లు చాలా చిన్న విషయాలకు నిరాశ చెందుతుంటాము. యాకోబు తన జీవితంలో ఎదుర్కొనిన భయంకరమైన, ఎంతో నిరాశతో కూడిన ఒక సంఘటన గురించి ఈ రోజు చూద్దాము.
గతవారము
యాకోబు తన ఇంటి నుండి ఎందుకు పారిపోవలసి వచ్చింది? దూరములో ఉన్న రిబ్కా సహోదరుడైన లాబాను దగ్గరకు యాకోబును పంపివేశారు. మార్గము మధ్యలో బేతేలు అనే స్థలము దగ్గర యాకోబు ఆగాడు. రాత్రి కలలో దేవుడు యాకోబుతో మాట్లాడినట్లు చూశాము. యాకోబుకు కలలో ఏమి కనిపించింది? నిచ్చెన మీద ఎవరు ఎక్కి దిగుతున్నారు? నిచ్చెన కొనకు పైగా నిలిచి యాకోబుతో ఎవరు మాట్లాడారు? యాకోబు యొక్క మోసము, అబద్ధాలు దేవుని దయను పొందకుండా అడ్డంగా ఉన్నాయి, కానీ యాకోబు పాపములను క్షమించి దేవుడు అతనికి తన ప్రేమను చూపాడు. అబ్రాహాముతో చేసిన వాగ్దానములను యాకోబుకు దేవుడు గుర్తు చేశాడు. ప్రభువు యాకోబుతో - "నేను నీకు తోడై యుండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువను" అని వాగ్దానము చేశాడు.
ప్రభువు తనకు తోడుగా ఉన్నందుకు యాకోబు ఎంతగానో సంతోషించాడు.
యాకోబు రాహేలును కలుసుకొనుట
యాకోబు హారాను ప్రాంతము సమీపంలోనికి వచ్చాడు. అతడు ఇంకా ఊరి బయట ఉన్నప్పుడే పొలము, అందులో ఒక బావి కనిపించింది. అక్కడ గొర్రెల మందలు పడుకొని ఉన్నాయి. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టేవారు. ఆ బావి మీద ఒక పెద్ద రాయి మూత వేసి ఉంది. యాకోబు అక్కడ వారిని చూసి మీరు ఎక్కడివారు అని అడిగినప్పుడు వారు మేము హారాను వారము అని సమాధానమిచ్చారు. నాహోరు కుమారుడైన లాబాను మీకు తెలుసా అని యాకోబు వారిని అడుగగా వారు మాకు తెలుసు అని చెప్పారు. వారు యాకోబుతో - ``లాబాను కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నది" అని చెప్పారు.
రాహేలు గొర్రెలు కాస్తుండేది. మందలన్నీ అక్కడకు కూడి వచ్చినప్పుడు బావి మీదనుండి ఆ రాతిని పొర్లించి, గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట ఉంచుతాము అని అక్కడి గొర్రెల కాపరులు యాకోబుకు చెప్పారు. రాహేలు తన గొర్రెలను తోలుకుని ఆ బావి దగ్గరకు రాగానే యాకోబు లేచి దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టాడు. ఒక కొత్త వ్యక్తి తన గొర్రెలకు నీరు పెట్టడం చూచి రాహేలు ఎంతో ఆశ్చర్యపడి ఉండవచ్చు. తరువాత యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని గట్టిగా ఏడ్చాడు. యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడను అని రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తి పోయి తన తండ్రితో ఆ విషయం చెప్పింది. ప్రభువు తనతో ఉండి సరియైన స్థలమునకు నడిపించినందుకు యాకోబు హృదయము కృతజ్ఞతతో నిండిపోయింది. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరుగెత్తుకొని వచ్చాడు. లాబాను యాకోబును కౌగలించుకొని, ముద్దు పెట్టుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. యాకోబు ఆ ఇంటిలో ఒక నెల దినములు నివసించాడు.
యాకోబు రాహేలును ప్రేమించుట
యాకోబు ఆ నెల దినములు వారి ఇంటిలో ఎన్నో పనులు చేసి ఉండవచ్చు. లాబాను యాకోబు చేస్తున్న పనికి జీతం ఇవ్వాలి అనుకున్నాడు. నీకెంత జీతము కావలెనో చెప్పుమని లాబాను యాకోబును అడిగాడు. లాబానుకు ఇద్దరు కుమార్తెలు - పెద్ద కుమార్తె పేరు లేయా, చిన్న కుమార్తె పేరు రాహేలు. యాకోబు రాహేలును ప్రేమించాడు. రాహేలు అందమైనది గనుక ఆమెను వివాహం చేసుకోవాలనే కోరిక యాకోబుకు కలిగింది. రాహేలును వివాహము చేసుకోవాలంటే లాబానుకు ధనము ఇవ్వాలి అని యాకోబుకు తెలుసు. ఆ దినములలో ఆ దేశములో పెండ్లికుమారుడు పెండ్లికుమార్తె తండ్రికి ధనము ఇచ్చి ఆమెను వివాహము చేసికొనుట ఆచారము. కానీ యాకోబు దగ్గర ధనము లేదు గనుక రాహేలు కోసము ఏడు సంవత్సరములు నీ దగ్గర పని చేస్తాను అని లాబానుకు చెప్పాడు. అప్పుడు లాబాను - ``ఆమెను అన్యులకు ఇచ్చుట కంటె నీకు ఇచ్చుట మేలు నా యొద్ద ఉండుము" అని చెప్పాడు. యాకోబు రాహేలును ప్రేమించడం వలన అతడు ఎంతో సంతోషంగా పని చేయసాగాడు. లాబాను కూడా యాకోబు పనికి సంతోషించాడు. లాబాను దురాశ కలిగిన వాడు గనుక జీతము లేకుండానే యాకోబు పని చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నాడు.
యాకోబు మోసపోవుట
ఏడు సంవత్సరములు పూర్తి అయిన తరువాత రాహేలును తనకు భార్యగా ఇవ్వమని యాకోబు లాబానును అడిగాడు. అప్పుడు లాబాను ఆ స్థలములో నున్నమనుష్యులందరినీ పోగుచేసి విందు ఏర్పాటు చేశాడు. తూర్పు దేశములో పెండ్లి కుమార్తెను అలంకరించిన తరువాత ముఖము కనబడకుండా ముసుగు కప్పుతారు. ఆ విందు ముగిసిన తరువాత ఇంటికి వెళ్లి, పెండ్లికుమార్తె ఆ ముసుగును తీసివేసినప్పుడు అందరూ ఆమెను చూస్తారు.
పెండ్లికుమార్తె ముఖము కొంచెం కూడా కనిపించకుండా మందంగా ఉన్న బట్టతో ముసుగు కప్పారు. వివాహమై ఇంటికి వెళ్ళిన తరువాత ఆ ముసుగు తీసివేయాలి, కాని ఆ రాత్రి చీకటిలో యాకోబు ఇంటికి వెళ్ళిన తరువాత కూడా ఆమె ముఖాన్ని చూడలేకపోయాడు.
మరుసటి రోజు ఉదయం యాకోబు తన జీవితంలో అతి పెద్ద షాక్ (దిగ్భ్రాంతి)ని ఎదుర్కొన్నాడు. తాను వివాహము చేసుకున్నది రాహేలు అక్క లేయాను అని తెలుసుకున్నాడు. యాకోబు ఎంత భయపడి ఉంటాడో మనము ఊహించలేము. యాకోబు రాహేలును ప్రేమించాడు కానీ లేయాను ప్రేమించలేదు. యాకోబుకు ఎంతో బాధ, కోపం కలిగింది. యాకోబుకు తన జీవితంలో ఎదురైన అతిపెద్ద నిరాశ ఇదే కావచ్చు.
యాకోబు కోపపడుట
అలా ఎందుకు జరిగింది యాకోబుకు అర్థం కాలేదు. లేయా,రాహేలు కలసి మోసము చేశారా? లేదు, రాహేలు కూడా యాకోబుతో వివాహము జరగనందుకు బాధపడింది. యాకోబు మామ అయిన లాబాను అంతా చేశాడు. యాకోబు ఎంతో కోపముతో లాబాను దగ్గరకు వెళ్ళి - "నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమేగదా నీకు కొలువు చేసితిని ఎందుకు నన్ను మోసపుచ్చితివి ?" అని అడిగాడు. అందుకు లాబాను "పెద్ద దానికంటె ముందుగా చిన్నదానిని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు" అని చెప్పాడు. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు లాబాను ముందుగానే యాకోబుకు చెప్పాలి కదా! ఎందుకు యాకోబును మోసం చేశాడు? లాబాను ఎంతో ధనాపేక్ష గలవాడు గనుక యాకోబుకు ఎటువంటి జీతము ఇవ్వకుండా పని చేయించుకోవాలి అనుకున్నాడు. తిరిగి లాబాను యాకోబుతో - "నీవింకను ఏడు సంవత్సరములు నాకు కొలువు చేసినయెడల అందుకై ఆమె(రాహేలు)ను కూడా నీకిచ్చెదను" అని చెప్పాడు. ఎలాంటి జీతం తీసుకోకుండా ఏడు సంవత్సరములు యాకోబు పని చేశాడు. ఇంకా ఏడు సంవత్సరములు రాహేలు కోసం జీతం లేకుండా పని చేయమని లాబాను అడిగాడు. ఏడు రోజుల తరువాత యాకోబుకు రాహేలుతో వివాహం జరిగింది, కానీ ఆమె కోసం మరొక ఏడు సంవత్సరములు పని చేయవలసి వచ్చింది. యాకోబుకు లేయా, రాహేలు ఇద్దరు భార్యలు.
సందేశము
యాకోబును గురించి ఆలోచించినప్పుడు ఎంతో బాధ కలుగుతుంది కదూ! అతడు ఎంతో నిరాశ చెంది ఉంటాడు. లాబాను మోసముతో రాహేలు బదులు లేయాతో యాకోబుకు వివాహము జరిపించాడు. లాబాను స్వార్థము,చెడుతనము గలవాడని మనము అర్థం చేసుకోవచ్చు. యాకోబుతో పని చేయించుకుని ధనవంతుడు కావాలి అనుకున్నాడు గాని యాకోబును గురించి ఆలోచించలేదు. ఏశావు వలె నటించి దృష్టి మాంద్యం గల తండ్రియైన ఇస్సాకును యాకోబు ఎలా మోసం చేశాడు గుర్తుంది కదా! తాను చేసిన విధంగానే ఇప్పుడు యాకోబుకు కూడా జరిగింది. లేయా రాహేలు వలె నటించి యాకోబును వివాహం చేసుకుంది. తాను మోసము చేసినప్పుడు ఇస్సాకు ఎలా బాధపడి ఉంటాడో యాకోబుకు అర్థమైంది. ఏశావు ఎందుకు తనను చంపాలి అనుకున్నాడో కూడా గ్రహించాడు. ఎవరూ తనను పట్టించుకోలేదు అనే భాద యాకోబును ఎంతో నిరాశపరచింది. ప్రభువు యాకోబును క్షమించినప్పటికి, తన తండ్రికి, అన్నకు చేసిన మోసం ఎంత బాధాకరమైనదో అతడు అనుభవించి గ్రహించేలా చేశాడు.
అన్వయింపు
కొన్నిసార్లు ఇతరులకు బాధ, నిరాశ కలిగించే రీతిగా మనము ప్రవర్తిస్తుంటాము. అదే పరిస్థితులు వారి దగ్గర నుండి ఎదుర్కొన్నప్పుడు ఆ బాధ మనకు కూడా తెలుస్తుంది. శ్రేయ ఒక రోజు ఇంటిలో పూలకుండి పగలగొట్టింది. అది ఎవరికీ తెలియకుండా కనిపించకుండా దాచిపెట్టింది. వాళ్ళ అమ్మ అడిగినప్పుడు నాకు తెలియదు అని చెప్పింది. నిజం చెప్పకుండా వాళ్ళ అమ్మను మోసం చేసింది. తరువాత ఒకరోజు తన దగ్గర ఉన్న ఖరీదైన బొమ్మను స్నేహితురాలు అడిగితే ఇచ్చింది. ఆ స్నేహితురాలు దానిని పాడు చేసి ఎక్కడో పోగొట్టాను అని చెప్పింది, కానీ నిజం తెలుసుకున్న శ్రేయ ఎంతో బాధపడింది. వెంటనే తను కూడా తన తల్లి తో అలాగే చేశాను అన్న విషయం గుర్తుకు వచ్చింది. తన తల్లికి తాను చేసిన తప్పును వివరించి క్షమించమని అడిగింది. మనము చేసిన చెడు పనులు, ఇతరులు చేసినప్పుడు మనము బాధపడకూడదు, ఆశ్చర్య పడకూడదు. ఎందుకంటే మానవులందరి హృదయాలు మోసకరమైనవి గనుక ప్రతి ఒక్కరు అలాగే ప్రవర్తిస్తారు. అందుకే ప్రతి ఒక్కరికి యేసు క్షమాపణ అవసరము అని గ్రహించాలి. ఇతరులు మనలను ఎలా చూడాలి అని ఆశిస్తామో అదే విధంగా మనము ఇతరుల యెడల ప్రవర్తించాలి అని ప్రభువైన యేసు బోధించాడు. ఇతరులు మన పట్ల ప్రేమ, దయ కలిగి ఉండాలి అని ఆశిస్తే మనము కూడా వారియెడల అదే విధంగా ఉండాలి. మన స్నేహితులు మనతో ఎప్పుడూ నిజం చెప్పాలి అనుకుంటే మనము కూడా వారితో నిజమే చెప్పగలగాలి.
మీరు ఎప్పుడైనా అబద్ధాలు చెప్పి ఎవరినైనా మోసం చేశారా? అలా చేస్తే అది పాపము. యేసు పాపుల కొరకు సిలువపై తన ప్రాణం పెట్టాడు. పాపములు క్షమించమని మనము ప్రభువైన యేసుకు ప్రార్థించాలి. మన హృదయాలు పవిత్ర పరచబడి, మనము క్రైస్తవులమైతే ఎన్నడూ అబద్ధాలు చెప్పడానికి, మోసం చేయడానికి ఇష్టపడము.
కంఠత వాక్యము
మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి (లూకా 6:31).
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF