నిర్గమ 15:22-27;17:1-7; కీర్తన 78:15-16; యోహాను 4:10 -14
ఉద్దేశ్యము
ప్రభువైన యేసు మాత్రమే ఇవ్వగలిగిన జీవజలముల కొరకు దాహము కలిగి ఉండాలి అని బోధించుట
ముఖ్యాంశము
ఒంటెలు చాలా దినములునీరు త్రాగకపోయినప్పటికీ బ్రతకగలవు అని మీకు తెలుసా? అందుకే ఇసుక ఎడారులలో ఒంటెలు ఎంతో దూరం నీరు లేకుండానే ప్రయాణించగలవు. మానవులు ఆహారము లేకుండా కొన్ని రోజులు బ్రతుకగలరు కానీ నీరు లేకుండా బ్రతకడం కష్టం. ఎంతోమంది ఎడారి మార్గంలో ప్రయాణం చేస్తూ నీరు లేనందువలన చనిపోతుంటారు. ఇశ్రాయేలీయులు ఆహారము దొరకనందువలన ఎంతో ఆకలితో ఉన్నట్లు గతవారం చూసాము. అప్పుడు దేవుడు వారి కొరకు దేవదూతల ఆహారమైన మన్నాను ఆకాశమునుండి కురిపించాడు. అది దేవుడు జరిగించిన గొప్ప అద్భుతం! ఇశ్రాయేలీయులు దాహంగా ఉన్నప్పుడు దేవుడు వారికి ఎలా నీటిని సమకూర్చాడో ఈ రోజు చూద్దాం.
గతవారము
దేవుడు ఇశ్రాయేలీయులకు ఆకాశమునుండి మన్నాను కురిపించగా వారు తిని తృప్తి పొందారు. ఏనాటికి కావలసినది ఆనాడు మాత్రమే కూర్చోకోవాలి, ఎక్కువ కూర్చుకొనవద్దు అని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. కొన్ని రోజుల తరువాత ఆ ఆహారము తమకు నచ్చలేదని వారు సణుగు కొనుట మొదలుపెట్టారు. వారి సణుగులు వినిన దేవుడు వారు కోరిన మాంసము వారికి ఇచ్చాడు కానీ వారి అవిధేయతను , అవిశ్వాసాన్ని బట్టి మాంసాపేక్ష గలవారిని కొందరిని శిక్షించాడు. దేవుడు అనుగ్రహించిన వాటిని బట్టి ఎంతో సంతోషంగా, తృప్తిగాఉండడం నేర్చుకోవాలి అని గతవారం నేర్చుకున్నాము.
మారా-చేదు నీరు ( నిర్గమ.15: 21-26)
ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటిన తరువాత దేవుని మేఘస్తంభమును, అగ్నిస్తంభమును వెంబడిస్తూ మూడు దినములు ప్రయాణించారు. వారు తమతో తెచ్చుకున్న నీరు అయిపోయింది కనుక ఆ అరణ్యములో త్రాగుటకు వారికి నీరు దొరకలేదు. వారు మిక్కిలి దాహముతో ఉన్నారు. మీరు సెలవుల్లో ఎండలో చాలా సేపు ఆడిన తరువాత వెంటనే చల్లటి నీరు తాగాలి అనిపిస్తుంది కదూ! ఇశ్రాయేలీయులు కూడా ఆ అరణ్యమార్గంలో మూడు రోజులు నడిచారు గనుక వారు ఎంతో దాహంతో ఉన్నారు. ఎక్కడా వారికి నీరు దొరకనందువలన వారెంతో నీరసంగా ఉండి ఉండవచ్చు. చివరకు మారా అనే ప్రదేశానికి చేరారు. అక్కడ వారికి నీళ్లు కనిపించాయి. ఆ నీళ్లు తాగడానికి వారు వెళ్ళినప్పుడు అవి చేదుగా ఉన్నాయి గనుక వారు త్రా గలేకపోయారు. అప్పుడు వారు మేము ఈ నీటిని ఎలా త్రాగాలి అని మోషే మీద సణుగుకున్నారు. అప్పుడు మోషే ప్రభువుకు మొఱ్ఱపెట్టగా, ప్రభువు మోషేకు ఒక చెట్టును చూపించి దానిని కొట్టి నీళ్లలో వేయమని చెప్పాడు. మోషే ఆ విధముగా చేయగానే దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఆ చేదు నీరు తీయగా మారిపోయింది. ఇశ్రాయేలీయులు ఆ నీటిని సమృద్ధిగా త్రాగి దాహము తీర్చుకున్నారు. వారు త్రాగిన తరువాత తమ పశువులకు కూడా నీళ్లు పెట్టి తమ పాత్రలలో కూడా నీళ్లు నింపుకుని ఉండవచ్చు.
ఏలీము - నీటి బుగ్గలు ( నిర్గమ.15:27)
వారు మారానుండి ప్రయాణమై ఏలీము అనే ప్రాంతానికి చేరుకున్నారు. ఈ ఏలీము దగ్గర 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు ఉన్నాయి. ఎంత అందమైన ప్రదేశం! ఆ చెట్ల క్రింద సేదదీరి అక్కడి నీళ్లు త్రాగి ఇశ్రాయేలీయులు ఎంతో సంతోషించారు. కానీ దేవుని స్తంభము ప్రయాణము సాగించగానే వారు కూడా బయలుదేరారు. మరొకసారి వాగ్దాన దేశము చేరుకొనుటకు ఇసుకతో కూడిన ఎడారులలో తమ ప్రయాణం కొనసాగించారు.
హోరేబు బండ నుండి నీరు (నిర్గమ17:1-7)
వారు ఎర్రసముద్రమును దాటి దాదాపు ఆరు వారాలు దాటిపోయింది. వారి దగ్గర ఉన్న నీరు మొత్తం అయిపోగా తిరిగి వారు దాహంగొన్నారు. నీరు లేకుండా ఎక్కువ దినములు బ్రతకలేరు గనుక తిరిగి వారు మోషేమీద గొణుగుటకు మొదలుపెట్టారు. ఇశ్రాయేలీయులు ఆ పరిస్థితులలో ఏమి చేసి ఉండవలసింది? ప్రభువు అంతవరకూ తమకు చేసిన గొప్ప కార్యములు వారు గుర్తు చేసుకొనవలసింది. దేవుని యందు విశ్వాసం ఉంచవలసింది. నీటిని అనుగ్రహించమని దేవునికి ప్రార్థన చేయవలసింది. కానీ దానికి బదులుగా అరణ్యములో చంపుటకు మమ్ములను ఐగుప్తునుండి తీసుకొని వచ్చావు అని మోషే మీద గొణగడం మొదలుపెట్టారు.వారు ఆగ్రహంతో రాళ్లతో మోషేను కొట్టిచంపాలి అనుకున్నారు. వారు దేవుడు మనమధ్య ఉన్నాడోలేడో అని అనుమానించారు. ప్రభువు చేసిన ఆశ్చర్య కార్యములు చూచిన తరువాత కూడా వారు ఆ విధముగా మాట్లాడటం ఎంత భయంకరం! పాపం మోషే వారికి నాయకుడిగా ఉన్నందుకు వారు ప్రతి విషయానికి మోషేపై తమ కోపాన్ని చూపుతున్నారు. మోషే ఏమి చేయగలడు? వారి ఎదుట ఉన్న సమస్య గురించి ప్రభువుకు ప్రార్థించాడు. అప్పుడు ప్రభువు మోషేతో - ``నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము .నీవు నదిని కొట్టిన నీ కర్రను చేతపట్టుకొని పొమ్ము ఇదిగో హోరేబులోని బండమీద నేను నీకు ఎదురుగా నిలిచెదను . నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరును'' అని సెలవిచ్చాడు. అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల యెదుట దేవుడు చెప్పినట్లుగానే చేశాడు. అప్పుడు ఆ బండ లో నుండి నదుల వలె నీరు ప్రవహించింది. సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు దొరికింది (కీర్తన 78: 15,16). అందరూ నీటి కోసం ఆ బండ దగ్గరకు పరుగెత్తడం మనము ఊహించవచ్చు. ఆ చల్లటి మంచినీరు ఎండిపోయిన వారి నోటిలో ఎంతో సంతృప్తిని కలిగించి వారి దాహాన్ని తీర్చి ఉంటుంది. వారు హోరేబు ప్రాంతంలో దాదాపు ఒక సంవత్సరం ఉన్నారు. ప్రభువు ఎంతో ప్రేమ కలిగి వారికి కావలసిన ఆహారాన్ని నీటిని ప్రతి దినము సమకూర్చాడు. వారు అరణ్యములో ప్రయాణం చేసిన 40 సంవత్సరములలో ఒక్కరు కూడా దాహం చేత చనిపోయినట్లు బైబిలులో ఎక్కడా వ్రాయబడలేదు. ప్రభువు మాత్రమే అంత గొప్ప అద్భుతాలను జరిగించగలడు. సందేశము
దాహంతో ఉన్న ఇశ్రాయేలీయులకు దేవుడు అరణ్యములో సమృద్ధిగా నీటిని ఇచ్చి వారిదాహము తీర్చినట్లు మనము చూశాము. దేవుడు వారి ప్రతి అవసరాన్ని తీర్చినప్పటికి కూడా ఇశ్రాయేలీయులు సణగటం మానలేదు. వారు దేవుని విశ్వసించవలసినంతగా విశ్వసించ లేకపోయారు.
అన్వయంపు
మన హృదయములలోని దాహము గురించి బైబిలులో ఎన్నోచోట్ల వ్రాయబడింది (కీర్తన 63:61; యెషయా 44: 3) ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అని చెప్పినట్లు బైబిల్ లో వ్రాయబడింది (యోహాను7:37). దేవుని క్షమాపణ కోరినట్లయితే ఆయన మనలను క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన మన పాపములను కడిగివేసి మనకు నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాడు. ప్రభువైన యేసు ఒకసారి సమరయ పట్టణములో బావి దగ్గర ఒక స్త్రీని కలిసి దాహమునకు నీళ్ళు ఇమ్మని అడిగాడు. తరువాత తాను జీవజలము ఇవ్వగలను అని ఆ స్త్రీతో యేసు చెప్పాడు. ఆ స్త్రీ ఆమె జీవితంలో చేసిన అనేకమైన పాపముల గురించి ఆమెకు తెలియచేసి పాపక్షమాపణ గురించి వివరించాడు. ఆ స్త్రీ యేసు లోక క్షకుడు అని విశ్వసించి జీవజలముల ఊట అయిన యేసును తన హృదయములో చేర్చుకుంది. ఆమె మాత్రమే కాక తన ఊరిలో వారందరినీ యేసు దగ్గరకు నడిపించి వారు కూడా విశ్వసించులాగున చేసింది(యోహాను 4:42). వారు కూడా జీవజలములను పొందగలిగారు. హృదయములో దాహము గొనుట అంటే ఏమిటి? మనము చేసిన ప్రతి పాపమును గురించి హృదయములో పశ్చాత్తాపపడి దేవుని క్షమించమని అడగాలి. మనలను క్షమించి మన హృదయములో ఉండమని ప్రభువైన యేసుకు ప్రార్థించాలి. మన హృదయమును ప్రభువు సన్నిధిలో క్రుమ్మరించి ప్రతి దినము దేవుని దగ్గర ప్రార్థించాలి. దేవుడు మనలను రక్షించి నప్పుడు మన హృదయాలలో సంతోషం సమాధానం ఉంటాయి.
ఉదాహరణ
ఒక ఊరిలో దివ్య అనే ఏడు సంవత్సరముల బాలిక ఉండేది. ఆ పాప హృదయంలో ప్రభువైన యేసును గూర్చి తెలుసుకోవాలని ఎంతో ఆశ వుండేది. ఏడు సంవత్సరముల వయసులోనే యేసును తన రక్షకునిగా ఉండమని ఎంతోప్రార్థించేది. అలా ఎన్నో సంవత్సరములు ప్రార్ధించిన తరువాత యేసు తన పాపములు క్షమించాడుఅనే విశ్వాసం దివ్య హృదయములో కలిగింది. అప్పుడు దివ్య హృదయము ఎంతో సంతోషంతో నిండిపోయింది. జీవజలము అయిన యేసు దివ్య హృదయములోని దాహం తీర్చి ఆమెను సంతృప్తి పరిచాడు. ఆయన దగ్గరకు వెళ్ళి క్షమాపణ కోరిన ఎడల మన దాహం కూడా ఆయన తీర్చి మనకు సంతోషాన్ని ఇవ్వగలడు.
కంఠత వాక్యం
"నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు" అని యేసు చెప్పాడు (యోహాను 4 :14)
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF