న్యాయాధిపతులు 6 వ అధ్యాయము
ఉద్దేశము
చిన్న విషయాలలో కూడా దేవుని యందు విశ్వాసముంచి నప్పుడే, దేవుని చేత గొప్పగా వాడబడగలము అని చూపించుట.
ముఖ్యాంశము
ఒక ఆపిల్ పండ్ల బుట్టలో కొన్ని చెడిపోయిన పండ్లు ఉంటే వాటి వలన మిగిలిన పండ్లు అన్నీ పాడైపోతాయి కదా? మంచి పండ్లు ఎక్కువ ఉన్నా ఆ చెడ్డ పండ్లను మంచిగా మార్చలేవు. దేవుని ప్రేమించని ప్రజలతో స్నేహము చేసిన ఇశ్రాయేలీయులు ఏ విధముగా చెడిపోయారో చూద్దాము.
గతవారము
చనిపోకముందు యెహోషువ కొన్ని సూచనలు ఇచ్చి వీడ్కోలు చెప్పినట్లు చూసాము. దేవుడు ఎంతో ప్రేమ, దయ కలిగి వారిని ఐగుప్తు చెరలో నుండి విడిపించిన సంగతిని యెహోషువ గుర్తు చేశాడు. వారు కనాను దేశమును స్వాధీన పరచుకొనునట్లు చేశాడు. తరువాత యెహోషువ వారికి చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్పాడు. యెహోషువ వారితో - ``మీరు దేవుని ప్రజలు. మీరు ఆయనకు విధేయులై ఆయనను ప్రేమించాలి. ఈ దేశములో దేవుని ప్రేమించని జనులు ఇంకను ఉన్నారు గనుక వారిని తరిమి వేయాలి. అలా చేయకుండా వారితో స్నేహము చేసినట్లయితే మీరు కూడా వారి వలె చెడుతనమునకు అలవాటు పడతారు. అప్పుడు వారు మిమ్మును తమ దేవతల తట్టు త్రిప్పుతారు" అని చెప్పాడు.
యెహోషువ మాట్లాడుట ముగించిన తరువాత ఇశ్రాయేలీయులు అతనితో - "మేము ప్రభువుకు లోబడి ఉండెదము. ఇక్కడి దేవతలను పూజించము" అని ప్రమాణం చేశారు. ఒకవేళ వారు అక్కడి దేవతలను పూజిస్తే దేవుడు వారికి ఆశీర్వాదాలకు బదులుగా శాపములను, తెగుళ్లను ఇస్తాడు అని హెచ్చరించాడు. ప్రభువుకు దూరమైతే వారి పరిస్థితి ఎలా ఉంటుందో వారికి వివరించాడు. విచారకరమైన విషయం ఏమిటి అంటే యెహోషువ మరణించుటకు ముందే ఇశ్రాయేలీయులలో కొందరు దేవునికి అవిధేయత చూపటం మొదలుపెట్టారు.
ఇశ్రాయేలీయులు అవిధేయత చూపుట
యెహోషువ, ఇశ్రాయేలీయుల పెద్దలు మరణించిన తరువాత ఇశ్రాయేలీయులు దేవునికి దూరముగా వెళ్ళుటకు మొదలుపెట్టారు. యెహోషువ యెదుట చేసిన ప్రమాణమును నిర్లక్ష్యపెట్టి దేవుని ఆజ్ఞలు అతిక్రమించుటకు మొదలు పెట్టారు. అక్కడి జనులను వెళ్లగొట్టుటకు బదులుగా వారితో స్నేహము చేయుటకు మొదలుపెట్టారు. అప్పుడు ఏమి జరిగిందో తెలుసా? ఇశ్రాయేలీయులు అక్కడి ప్రజల అలవాట్లు, ఆచారాలు నేర్చుకొని వారి దేవతలను పూజించుటకు మొదలుపెట్టారు. ఎంత భయంకరం! ప్రభువు వారి యెడల ఎన్నో గొప్ప కార్యములు చేసిన తరువాత కూడా వారు ఆ విధముగా చేయటం ఎంత విచారకరం! మరి దేవుడు వారి పట్ల ఎలా ఉన్నాడు? మనము ఒకరి పట్ల ఎంతో ప్రేమ,దయ చూపి వారికి ఎంతో సహాయం చేస్తే, వారు కొంతకాలం తరువాత మనలను పట్టించుకోకుండా, మాట్లాడకుండా ఉంటే ఎలా అనిపిస్తుంది? తన మాటలను నిర్లక్ష్యపెట్టి, తనకు దూరమై పోతున్న ఇశ్రాయేలీయులను దేవుడు శిక్షించ బోతున్నాడు.
దేవుడు ఇశ్రాయేలీయులను శిక్షించుట
దేవుడు ఇశ్రాయేలీయుల మీద కోపముతో దోచుకొను వారికి వారిని అప్పగించాడు. అంతేకాకుండా చుట్టూ ఉన్న వారి శత్రువుల చేతికి ఇశ్రాయేలీయులను అప్పగించాడు. మిద్యానీయులు అందరి కంటే ఎక్కువగా వారి పట్ల కఠినంగా ప్రవర్తించ సాగారు.
ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత, మిద్యానీయులు ప్రతి సంవత్సరము తమ పశువులను గుడారములను తీసుకుని మిడతల దండు వలె విస్తారముగా దండెత్తుతుండేవారు. వారు ఇశ్రాయేలీయుల పంటలో, కాపులో దేనిని మిగలకుండా తీసుకుని పోయేవారు. వారి పశువులను కూడా మిద్యానీయులు తీసుకుని వెళ్ళేవారు. ఇశ్రాయేలీయులు మిద్యానీయులకు ఎంతో భయపడుతుండే వారు. వారు ఎంతో హీనదశకు చేరుకొని తమ శత్రువులను ఎదిరించలేని బలహీన స్థితికి చేరుకున్నారు. వారు మిద్యానీయులు దండెత్తు సమయానికి వారి ఎదుట నిలువలేక కొండలలో నున్న వాగులు, గుహలలో దాగి ఉండేవారు. మిద్యానీయులు వెళ్లి పోయిన తరువాత వారు తిరిగి తమ ఇళ్లకు వచ్చేవారు. కానీ అప్పటికి వారికి ఏమి మిగిలి ఉండేది కాదు. ఈ రీతిగా ఏడు సంవత్సరములు జరుగగా ఇశ్రాయేలీయులు ఎంతో దిగులు చెందారు. వారికి తినడానికి ఆహారం కూడా ఉండేది కాదు. వారు ఎంతో భయముతో బాధతో జీవిస్తున్నారు. ఆ పరిస్థితులలో వారు ప్రభువును గుర్తు తెచ్చుకున్నారు. ఇతర దేవతలను పూజించి తమ దేవునికి కోపము కలిగించామని గ్రహించారు. మిద్యానీయుల వలన కలిగిన బాధను బట్టి వారు జీవముగల దేవునికి ప్రార్ధించుట మొదలుపెట్టారు. తమపై దయ చూపుమని ఎలుగెత్తి మొరపెట్టారు. ఆహారము కొరకు మాత్రమే కాక, తమ పాపములు క్షమించమని ప్రార్థించారు. మరి వారి ప్రార్థనలు దేవుడు అంగీకరించాడా ? అవును, వారు దేవుని దయను పొందుటకు పాత్రులు కాకపోయినా, పశ్చాత్తాపముతో ప్రార్థించడం బట్టి దేవుడు వారిని క్షమించాడు. ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేతినుండి తప్పించుటకు ప్రభువు ఏమి చేశాడో చూద్దాము.
దేవుడు గిద్యోనును పిలుచుట
దేవుడు ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేతినుండి విడిపించుటకు గిద్యోను అనే వానిని నాయకుడిగా ఏర్పరచాడు. గిద్యోను తండ్రి వ్యవసాయము చేసేవాడు. ఒకరోజు గిద్యోను మిద్యానీయులకు కనిపించకుండా గానుగ చాటున గోధుమలను దుళ్ల గొడుతున్నాడు. అప్పుడు ఒక అద్భుతమైన విషయం జరిగింది. ప్రభువు దూత గిద్యోనుకు కనబడి - "పరాక్రమము గల బలాఢ్యుడా ప్రభువు నీకు తోడై ఉన్నాడు" అని చెప్పాడు. అందుకు గిద్యోను - "చిత్తము నా యేలినవాడా, ప్రభువు మాకు తోడైయుండిన యెడల ఇదంతయు మాకేల సంభవించెను? ప్రభువు ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నియు ఏమాయెను? ప్రభువు మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెను" అని చెప్పాడు. అప్పుడు ప్రభువు గిద్యోనుతో - "బలము తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము నిన్ను పంపిన వాడను నేనే" అని చెప్పాడు. ప్రభువు చెప్పిన మాటలకు గిద్యోను ఎంతో ఆశ్చర్యపోయాడు. గిద్యోను దేవునితో- "చిత్తము నా యేలినవాడా దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నేను ఎన్నికలేని వాడను" అని చెప్పగా దేవుడు గిద్యోనుతో - "అయిననేమి? నేను నీకు తోడైయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువు" అని సెలవిచ్చాడు.
సర్వశక్తిమంతుడైన ప్రభువే తనతో మాట్లాడుచున్నాడు అని గ్రహించి గిద్యోను ఎంతగానో భయపడ్డాడు. అప్పుడు ప్రభువు గిద్యోనుతో - "నీకు సమాధానము భయపడకుము, నీవు చావవు" అని చెప్పాడు. ఇది చూచినప్పుడు దేవుడు మనకు ఏదైనా పనిని అప్పగిస్తే దానిని చేయుటకు అవసరమైన సహాయాన్ని కూడా ఆయనే అందిస్తాడు అని మనం గ్రహించవచ్చు.
గిద్యోను విశ్వాసము పెరుగుట
ఆ రోజు రాత్రి ప్రభువు గిద్యోను కు కనిపించి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికి వేయమని ఆజ్ఞాపించాడు. గిద్యోను కు అది ఎంతో కష్టమైన పని. ఇశ్రాయేలీయులు కనాను దేశపు ప్రజలతో స్నేహము చేసి వారి దేవతలను విగ్రహాలుగా చేసికొని పూజించటం మొదలుపెట్టారు. గిద్యోను తండ్రి కూడా అలాగే చేసాడు. ఇప్పుడు గిద్యోను ఆ విగ్రహాలను బలిపీఠాలను పడగొడితే వారికి తప్పక కోపం వస్తుంది. గిద్యోను భయముచేత పగటిపూట ఆ పని చేయలేక రాత్రి సమయమందు పది మందిని తీసుకొని ప్రభువు చెప్పినట్లుగా బయలు బలిపీఠమును, దేవతా స్తంభమును పడద్రోసాడు. ఆ స్థలములోనే ప్రభువుకు బలిపీఠము కట్టాడు. ఆ ఊరి వారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము విరుగగొట్టబడి, దేవతా స్థంభము పడద్రోయబడి ఉండుట చూచారు. అప్పుడు వారు కోపంతో నిండిన వారై గిద్యోనును చంపుటకు నిర్ణయించుకున్నారు. అప్పుడు గిద్యోను తండ్రి బయలు నిజమైన దేవత అయితే తనను తాను కాపాడుకొనగలడు అని వారికి చెప్పి గిద్యోనును కాపాడాడు. ప్రభువు తాను చెప్పిన విధముగా గిద్యోనుకు తోడుగా ఉండి అతడు మరణించకుండా క్షేమంగా ఉంచాడు.
గిద్యోను ప్రభువును సూచకక్రియ కొరకు అడుగుట
తనతో మాట్లాడినది ప్రభువే అని గిద్యోనుకు తెలుసు. తనను దేవుడు ప్రజల చేతి నుండి కాపాడినట్లు కూడా గ్రహించాడు, కానీ మిద్యానీయులపై దేవుడు తనకు తప్పక విజయాన్ని కలుగజేస్తాడు అనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకున్నాడు. గిద్యోను ఒక సూచకక్రియను చూపుమని దేవునికి ప్రార్థించాడు. ప్రభువుతో - "నేను కళ్ళమున గొర్రె బొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడిన యెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించెదవని నేను నిశ్చయించుకొందును" అని చెప్పాడు. అతడు ఉదయమే లేచి ఆ బొచ్చును పిండగా ఒక పాత్ర పూర్తిగా నీటితో నిండిపోయింది. ఎంత గొప్ప అద్భుతం! గిద్యోనుకు దేవుని పై ఎంతో విశ్వాసం కలిగింది. కానీ గిద్యోను మరియొక అద్భుతాన్ని దేవుని దగ్గర నుండి చూడాలి అనుకున్నాడు. రెండవసారి నేల అంతటా మంచుపడి తాను ఉంచిన గొర్రె బొచ్చు మీద పడకూడదు అని ప్రార్థించగా, అదే విధముగా తెల్లవారి చూడగా అ బొచ్చు మాత్రము పొడిగా ఉండునట్లు దేవుడు చేశాడు. గిద్యోను ఈ రెండు సూచక క్రియలను బట్టి దేవుని మహా శక్తిని గుర్తించాడు. తాను మిద్యానీయులపై విజయం సాధించగలను అని విశ్వసించాడు.
గిద్యోను ఏ విధముగా మిద్యానీయులను జయించాడో వచ్చేవారం చూద్దాము.
సందేశము
ఇశ్రాయేలీయులు ఇతర దేవతలను పూజించుట ద్వారా ప్రభువు ఆజ్ఞలను అతిక్రమించారు. దేవుడు కోపముతో ఇశ్రాయేలీయులు మిద్యానీయుల చేతిలో శ్రమలను పొందునట్లు చేశాడు. వారు తమ శ్రమలలో తిరిగి ప్రభువుకు మొఱ్ఱపెట్టగా ఆయన గిద్యోనును వారికి నాయకుని (న్యాయాధిపతి) గా నియమించాడు.
గిద్యోను మొదట భయపడ్డాడు. తాను ఎన్నిక లేని బలహీనుడు గనుక శత్రువులతో యుద్ధము చేయలేను అని తలంచాడు. ప్రభువు ఒక చిన్న పనిని అప్పగించి గిద్యోనును యుద్ధము కొరకు సిద్ధపరచాడు.
తన తండ్రి కట్టించిన బలిపీఠమును, దేవతా స్తంభమును పడగొట్టి ప్రభువుకు బలిపీఠము కట్టించి బలిని అర్పించిన తరువాత దేవుని యందు విశ్వాసముంచాడు. దేవుడు చేసిన రెండు సూచక క్రియలు గిద్యోను యొక్క విశ్వాసాన్ని బలపరచాయి.
అన్వయింపు
యవ్వనస్తులు గా ఉన్నప్పుడే విశ్వసించినవారికి, పెద్దవారయిన తరువాత దేవుడు వారికి గొప్ప పనులను అప్పగిస్తాడు అని మనము గ్రహించాలి. దేవుడు ఒక పనిని అప్పగించినప్పుడు దానిని చేయుటకు అవసరమైన సహాయాన్ని కూడా ఆయన అందిస్తాడు అని గిద్యోను తెలుసుకున్నాడు. గిద్యోను భయము చూచి దేవుడు కోపము తెచ్చుకొనక అతనిని ధైర్య పరిచాడు. దేవుడు అప్పగించిన చిన్న పనిని చేసిన తరువాత మిద్యానీయులను జయించగలను అనే ధైర్యం గిద్యోనుకు కలిగింది. మనము కూడా దేవుడు మనకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు అని విశ్వాసముంచాలి. మనము క్రైస్తవులమైన యెడల అన్ని పనులలో దేవుడు మనతో ఉండి నడిపిస్తాడు అనే విషయం మరిచిపోకూడదు.
కంఠతవాక్యము
నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను (ఫిలిప్పి 4:13).
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF