ఆదికాండము 1:26-31, 2:7-8, 2:18-25, కీర్తన 8
ఉద్దేశము/లక్ష్యము
దేవుని సృష్టిలో అతి ముఖ్యమైనది మానవ సృష్టి అని చూపుట. దేవుడు ఆదాము యొక్క అవసరాన్ని గుర్తించి సాటి అయిన సహాయముగా హవ్వను ఇచ్చుట. మన అవసరాలు కూడా దేవునికి తెలుసు అని బోధించుట.
ముఖ్యాంశము
నీటితో మీరు ఇంటిని కట్టగలరా? గడ్డి నుండి కారును తయారు చేయగలరా? అసాధ్యం కదా! మనకు అసాధ్యమే, కాని నేలమంటి(మట్టి) తో దేవుడు చేసిన అద్భుతాన్ని గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. మనం కొంచెం మంటిని తీసుకుని ఏదైనా సజీవమైన వస్తువు తయారు చేయడానికి ప్రయత్నించినా అది వీలు పడదు. కానీ అది దేవునికి సాధ్యమే.
దేవుడు ఆదామును నిర్మించుట
ఆరు దినములలో దేవుడు అద్భుతమైన సృష్టిని చేశాడు అని గత వారం చూశాము. మనుష్యులను సృజించడానికి ముందు భూమిని అన్ని విధాలుగా దేవుడు సిద్ధపరిచాడు. ఒకవేళ మనుష్యులను ముందే నిర్మించి ఉంటే ఏమి జరిగేది ? అది ఎంతో భయంకరంగా ఉండేది. వారు నీటిలోనే ఉంటూ మొదటి రెండు రోజులు ఆహారం లేకుండా ఉండేవారు.
దేవుడు జ్ఞానవంతుడు దయ కలిగినవాడు. మానవుని చేయుటకు ముందే సమస్తాన్నిసృష్టించి, ఆరవ దినమువరకు మనిషిని సృష్టించలేదు. మనుష్యులను నేలమంటి నుండి సృష్టించాలి అని దేవుడు నిర్ణయించుకున్నాడు. మొదటి మానవునికి దేవుడు ఆదాము అని పేరు పెట్టాడు. దీని గురించి ఆలోచించండి. మానవుడిని దేవుడు తప్ప మంటి నుండి మరి ఎవరు చేయగలరు? అది అద్భుతమైన సృష్టి, మన శరీరం ఎంత అద్భుతంగా తయారు చేయబడింది అని ఆలోచించండి - కళ్ళు, చెవులు, కాళ్లు, చేతులు. శరీరములో ప్రతి అవయవము చక్కగా అమర్చబడింది. ఆదాము చిన్న పిల్లవానిగా సృష్టించబడలేదు కాని పెద్దవానిగానే చేయబడ్డాడు. దేవుడు ఆదామును మంటితో నిర్మించిన తరువాత అతని జీవవాయువును ఊదినప్పుడు (2:7) అతనికి జీవము వచ్చింది. అతను నడవగలిగే, మాట్లాడగలిగే, నవ్వగలిగే జీవిగా ఉన్నాడు. నరుని కోసం తాను సిద్ధం చేసిన అందమైన వాటిని ఆదాము అనుభవిస్తూ ఆనందంగా ఉండాలి అని దేవుడు ఇష్టపడ్డాడు. ఆదాము జంతువుల నన్నింటిని కాపాడుతూ వాటిపై అధికారము కలిగి ఉండులాగున దేవుడు నియమించాడు. దేవుడు ఏదెను అనే అందమైన తోటలో ఆదామును ఉంచాడు. దేవుడు చేసిన వాటన్నింటినీ ఆదాము ఎంతో ఆసక్తిగా చూసి ఉండవచ్చు - అక్కడ ఉన్న జంతువులు, చేపలు, చెట్లు, మొక్కలు,అందమైన పువ్వులు అన్నింటిని.
ఆదాముకు ఇవ్వబడిన మొదటి పని
దేవుడు ఆదామును సృజించిన తరువాత ఒక ముఖ్యమైన అని అతనికి అప్పగించాడు. అన్ని జంతువులకు పక్షులకు ఆదాము పేర్లు పెట్టునట్లు దేవుడు వాటిని రప్పించాడు. అతనికి ఇష్టమైన పేరు పెట్టవచ్చు అని దేవుడు ఆదాముతో చెప్పాడు (2:19). ఆదాము తన దగ్గరకు వచ్చిన జంతువులను పక్షులను చూసి వాటిని ఎంతగానో ప్రేమించాడు, కాని వాటితో మాట్లాడలేకపోయాడు. ఆదాము ఒంటరిగా ఉన్నాడు. తనతో మాట్లాడుతూ కలిసి ఉండుటకు తన వంటి మరొకరి అవసరము ఆదాముకు కలిగింది. ఆదాము హృదయాన్ని దేవుడు గ్రహించగలిగాడు. ఆదామును చూసిన దేవుడు - “ నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. వానికి సాటి అయిన సహాయమును వానికొరకు చేయుదును” అని నిశ్చయించుకున్నాడు (2:18).
దేవుడు హవ్వను నిర్మించుట
దేవుడు ఆదాముకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేశాడు. తరువాత దేవుడు ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాడు (2:21-22). నిద్ర మేల్కొనిన ఆదాము ఆ స్త్రీని చూచి ఎంతో సంతోషించి ఉంటాడు. ఆదాము ఆ స్త్రీకి హవ్వ అని పేరు పెట్టాడు. హవ్వ తన ప్రక్కటెముక నుండి నిర్మించబడినది అని ఆదాముకి తెలుసు (2:23). హవ్వను బట్టి అతను ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు తెలియజేసి ఉండవచ్చు. ఆదాముకు ఇప్పుడు అందమైన భార్య తోడుగా దొరికింది. వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరిపట్ల ఒకరు శ్రద్ద కలిగి ఉండసాగారు. ఆదాము యొక్క ఆలోచనలను హవ్వ అర్థం చేసుకోగలదు, వారు ఒకరితో ఒకరు మాట్లాడు కొనగలరు, దేవుడు ఆదాముకు అవసరమైన దానిని సమకూర్చాడు.
దేవుడు ఆదామును తన పోలిక చొప్పున చేయుట
మొదట ఆదాము హవ్వలు ఎంతో మంచితనము దయ కలిగి పరిపూర్ణులుగా ఉండేవారు. వారు ఎలాంటి పొరపాటు చేయలేదు, వారికి ఎటువంటి బాధలు లేవు, మరణము అంటే వారికి తెలియదు. దేవుడు వారిని తన స్వరూపములో సృజించాడు. అంటే మానవులు దేవునివలె ఉన్నారు అని మనం అనుకొనరాదు, ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక ఆయనకు శరీరము లేదు (యోహాను 4:24). మానవులలో కూడా ఆలోచనాశక్తి, మనస్సాక్షి, ఆత్మ అనేది దేవుడు ఉంచాడు గనుక వారు దేవుని పోలిన వారు గా ఉన్నారు.
మనకు ఆలోచించే మనస్సు ఉంది
మనము ఆలోచించగలము, ప్రణాళికలు రూపొందించగలము, వివేకముగా ప్రవర్తించగలము, విషయాలను గుర్తుంచు కొనగలము. దేవుడు మనకు ఇచ్చిన ఐదు జ్ఞానేంద్రియాలతో మనము చూడగలము, వినగలము, రుచి చూడగలము, వాసన చూడగలము, స్పర్శను అనుభవించగలము. జంతువులకు కూడా అవే జ్ఞానేంద్రియాలు ఉన్నప్పటికి అవి మన వలె వాటిని ఉపయోగించుకొనలేవు. మనము బొమ్మలు గీయగలము, గిటార్ వాయించగలము, పుస్తకాలను చదవగలము. గుర్రము వీణ వాయించగలదా ? పిల్లి కంప్యూటర్ తో పని చేయగలదా? అవి అటువంటి పనులు ఏమి చేయలేవు. దేవుడు మానవులకు జ్ఞానము ప్రసాదించాడు. దేవునితో సమానమైన జ్ఞానము మనుష్యులకు లేకపోయినా, దేవుని పోలిక కలిగి జ్ఞానము కలిగి ఉన్నారు.
మనకు మనస్సాక్షి ఉంది
మంచి చెడులకు ఉండే తేడా చెప్పగలిగిన మనస్సాక్షి దేవుడు మనలో ఉంచాడు. దేవుడు మంచి చెడులను గూర్చి న్యాయం చెప్పగలడు. దేవుడు ఎటువంటి చెడు లేనివాడు. మనం కూడా మంచి చెడులను అర్థం చేసుకొనునట్లు దేవుడు మనకు మనస్సాక్షిని అనుగ్రహించాడు. మనము అబద్ధం చెప్పినా ఎవరినైనా మోసం చేసినా మన మనస్సాక్షి మెల్లని స్వరం తో లోపలి నుండి మనలను హెచ్చరిస్తూ ఉంటుంది. ఇతరులను ప్రేమించడం, సహాయపడటం మంచి పని అని మనకు మన మనసాక్షి తెలుపుతుంది. జంతువులకు మనస్సాక్షి ఉండదు. పిల్లి వంట గదిలో పాలు దొంగతనంగా తాగినప్పటికి తప్పు చేసాను అని బాధ పడదు. కొన్ని పనులు చేయకుండా జంతువులకు శిక్షణ ఇవ్వగలము కాని తప్పు చేస్తున్నప్పుడు అది తప్పు అని గ్రహించగలిగే మనస్సాక్షి వాటికి ఉండదు.
మనకు ఆత్మ ఉంది
దేవుడు ఆదాములో ఆత్మను ఉంచాడు. ఈ ఆత్మ ద్వారానే ఆదాము దేవుని ప్రేమించి, ఆయనతో మాట్లాడ గలిగాడు. జంతువులు దేవునితో మాట్లాడలేవు. అవి చనిపోయినప్పుడు వాటిని పాతిపెట్టడమే వాటి అంతము. మానవులమైన మనము మరణించినప్పుడు మనలను కూడా పాతిపెడతారు. కాని మన శరీరాలు మట్టిలో కలిసిపోయినా ఆత్మ నిత్యము జీవించి ఉంటుంది. దేవుడు మనలను ఆయన పోలిక చొప్పున నిత్యము జీవించునట్లు సృష్టించాడు.
సందేశము
దేవుడు తన సృష్టిని ఆరు దినములలో పూర్తి చేశాడు. దేవుడు చేసిన సృష్టిని చూసినప్పుడు అది చాలా మంచిదిగా కనిపించింది. ప్రతి మొక్కకు జంతువుకు పక్షికి చేపకు ఏది అవసరమో దేవునికి తెలుసు. ఆదాము హవ్వలు నివసించుటకు స్థలం కూడా ఆయన ఏర్పాటు చేశాడు. అంతా సంపూర్ణంగా చేయబడింది. దేవుని సృష్టిలో అన్నిటికన్నా అద్భుతం మానవుని సృష్టి. ఎందుకనగా వారు దేవుని స్వరూపములో చేయబడ్డారు. ఆదాముతో కలిసి జీవించడానికి దేవుడు హవ్వను భార్యగా ఇచ్చాడు. ఆదాము హవ్వలను దేవుడు ఎంతగానో ప్రేమించాడు, వారు సంతోషంగా జీవించటానికి అవసరమైన వాటన్నింటిని దేవుడు వారికి సమకూర్చాడు. దేవుడు కరుణామయుడు!
అన్వయింపు
ఆదాము హవ్వల అవసరాలను తెలిసి కొనగలిగిన దేవుడు, మన అవసరాలు కూడా గ్రహించగలడు. ఒంటరిగా దుఃఖంలో మనము ఉన్నట్లయితే, దేవునికి ప్రార్థించి మన బాధలు చెప్పుకొనవచ్చు. ప్రభువైన యేసు దేవుని కుమారుడు అయినప్పటికిని భూమిపై ఉన్నప్పుడు శరీరముతో ఉన్నాడు కనుక కష్టములను గురించి ఆయనకు తెలుసు (హెబ్రీ 4:15). మన పరిస్థితులను గురించి యేసు అర్థం చేసికొనగలడు. మనము ప్రభువైన యేసుకు చెందిన వారము అయితే, ఆయన మనకు మంచి స్నేహితుడుగా ఉంటాడు. మనం హృదయపూర్వకముగా ప్రార్ధించినప్పుడు ఆయన తప్పక మన ప్రార్ధన వింటాడు. ఆయన మన అందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన యందు విశ్వాసముంచినట్లయితే తప్పక మన అవసరాలను తీరుస్తాడు.
కంఠతవాక్యము
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను (ఆదికాండము 1:27)
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF