యెహోషువ 9
ఉద్దేశము
సరియైన మార్గములో నడవాలంటే దేవునికి ప్రార్ధించుట చాలా ముఖ్యము అని బోధించుట. అదే విధముగా నమ్మకముగా ఉండుట కూడా ఎంతో ముఖ్యమైన విషయము.
ముఖ్యాంశము
స్కూల్ లో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలో మీరు ఎప్పుడైనా పాల్గొన్నారా? రాజు వేషం వేయ వలసి వస్తే రాజుల దుస్తులు, కిరీటము, కత్తి అన్నీ అలంకరించుకుంటారు కదూ! మనలను ఎవరూ గుర్తు పట్టలేరు. చాలా తమాషాగా అనిపిస్తుంది. కొందరు వ్యక్తులు తమ వేషాలను మార్చుకుని గుర్తు పట్టలేకుండా తయారై మోసగించడానికి ప్రయత్నించిన విషయాన్ని ఈ రోజు చూద్దాము.
గతవారము
యెరికో పట్టణమును నాశనము చేసిన ఇశ్రాయేలీయులు దేనినీ తీసుకొనరాదు అని ప్రభువు ఆజ్ఞాపించాడు కదా? కానీ ప్రభువుకు ఒక వ్యక్తి అవిధేయత చూపాడు. అవును, ఆకాను దేవుని మాటలు లక్ష్యపెట్టలేదు. ఆకాను ఏమి చేశాడు? తన కంటికి అందంగా కనిపించిన షీనారు పై వస్త్రాన్ని, వెండిని, బంగారమును దొంగిలించి తన గుడారపు డేరా మధ్యలో గుంత తవ్వి అందులో దాచి పెట్టాడు. ఇశ్రాయేలీయులు తన మాటలు వినని యెడల వారికి శిక్ష ఉంటుంది అని దేవుడు ముందుగానే హెచ్చరించాడు. చిన్న పట్టణమైన హాయిని పట్టుకోవడానికి వెళ్ళిన ఇశ్రాయేలీయులకు ఏమి జరిగింది? వారు హాయి పట్టణస్థుల చేతిలో ఓడిపోయారు. యెహోషువ ఎందుకు అలా జరిగింది అని దేవుని ప్రశ్నించాడు. అప్పుడు మీలో ఒకరు పాపము చేశారు అని దేవుడు యెహోషువతో చెప్పాడు. ఆకాను చేసిన పాపము బయటపడిన తరువాత అతడు రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. అతడు మాత్రమే కాదు గాని అతని కుటుంబము, అతనికి కలిగిన సమస్తము తో దొంగిలించిన వస్తువులు కూడా నాశనమైపోయాయి.
దేవుని ఆశీర్వాదాలు పొందడానికి తప్పక ఆయన మాటలకు విధేయత చూపించాలి అనే ముఖ్యమైన పాఠాన్ని ఇశ్రాయేలీయులు ఆకాను సంఘటన ద్వారా నేర్చుకున్నారు. ఆకానును చంపిన తరువాత వారు హాయి పట్టణము మీదకు వెళ్లి దానిని స్వాధీనం చేసుకున్నారు. వారు దేవుని సహాయముతో ఎన్నో విజయాలు సాధించగలిగారు. వారు తిరిగి గిల్గాలుకు చేరుకున్నారు.
గిబియోనీయులు
హాయికి 15 కిలోమీటర్ల దూరములో గిబియోను అనే పట్టణము ఉంది. కనాను దేశములో నివసిస్తున్న ఇతరుల వలె గిబియోను వాసులు కూడా ఇశ్రాయేలీయుల వలన భయపడ సాగారు. ఇశ్రాయేలీయులు తమ దేవుని సహాయము వలన యెరికో, హాయి, ఇంకను అనేక పట్టణములను జయించిన వార్తను గిబియోనీయులు కూడా విన్నారు. ఇశ్రాయేలీయులు తమ దేశం మీదికి కూడా యుద్ధానికి వస్తారు అని వారు అనుకున్నారు. దేవుడు గొప్ప సూచక క్రియలు చూపి ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించిన సంగతిని, ఎర్ర సముద్రమును దాటించిన విషయాన్ని కూడా వారు విని ఉండవచ్చు. ఇశ్రాయేలీయుల దేవుని మహాత్మ్యము, శక్తి ఎదుట తాము కూడా ఓడిపోవుట తప్ప మరి ఏమీ చేయలేము అని వారు గ్రహించారు. మరి వారు ఏమి చేయవలసింది? పెద్దల దగ్గరకు వచ్చి - "మీ దేవుని శక్తి యందు మేము నమ్మకం ఉంచుతున్నాము మమ్మల్ని నాశనము చేయవద్దు" అని అడగవలసింది. ఇశ్రాయేలీయుల దేవుని యందు విశ్వాసముంచిన రాహాబు యెరికో పట్టణస్థులతో కలిసి నశించకుండా క్షేమంగా తప్పించుకున్న విషయము కూడా గిబియోను వారికి తెలిసి ఉండవచ్చు. కానీ గిబియోనీయులు ఇశ్రాయేలీయులను బ్రతిమాలు కొనలేదు గాని చాలా పెద్ద పొరపాటు చేశారు. వారు కపటోపాయముతో యెహోషువను, ఇశ్రాయేలీయులను మోసగించారు.
గిబియోనీయుల కపటోపాయము
గిద్యోను నివాసులు యెహోషువను, ఇశ్రాయేలీయుల నాయకులను మోసం చేయుటకు ఒక మోసకరమైన ఉపాయము ఆలోచించారు. తమలో కొందరిని ఏర్పరచుకుని చాలా దూర దేశము నుండి ఎన్నో దినములు ప్రయాణము చేసినట్లుగా పాతబడిన వస్త్రాలు ధరించారు. వారు పాతబడిన బట్టలు ధరించి, పాతబడి అతుకులు వేసిన చెప్పులు తొడుగుకొని వచ్చారు. అంతేగాక తమ గాడిదలకు పాత గోనెలు వెనుక వేసి, పాత ద్రాక్షారసపు సంచులు తెచ్చుకున్నారు. వారు ఆహారముగా తెచ్చుకొనిన భక్ష్యాలు ఎండిన ముక్కలు గా మారాయి. చిన్న గుంపుగా వారు నడిచి వస్తుంటే వారు ఎంతో అలసిపోయిన వారు గా కనిపించారు. కాని వారు సమీపము లోనే ఉంటారు అనే విషయము ఎవరూ గుర్తించలేకపోయారు.
ఇశ్రాయేలీయులు దిగిన గిల్గాలు ప్రాంతమునకు వారు వచ్చారు. వారు యెహోషువ మరియు ఇశ్రాయేలీయులతో - "మేము దూర దేశమునుండి వచ్చిన వారము. మాతో ఒక నిబంధన చేయుడి" అని అన్నారు. అయితే ఇశ్రాయేలీయులలో కొందరు వారి మాటలు నమ్మక -"మీరు మా మధ్యను నివసించుచున్న వారేమో మేము మీతో ఎలాగు నిబంధన చేయగలము" అని ప్రశ్నించారు? యెహోషువ వారిని - "మీరు ఎవరు, ఎక్కడ నుండి వచ్చితిరి?" అని ప్రశ్నించినప్పుడు వారు - "నీ దేవుని నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరము నుండి వచ్చితిమి. ఏలయనగా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తు దేశములో చేసిన సమస్తమును వింటిమి. అప్పుడు మా పెద్దలును మా దేశానివాసులందరును మీతో నిబంధన చేసుకొనునట్లు మమ్మును పంపిరి. మీ యొద్దకు రావలెనని బయలుదేరిన దినమున మేము సిద్ధ పరచుకుని మా ఇండ్ల నుండి తెచుకొనిన మా వేడి భక్ష్యములు ఇవే ఇప్పటికి అవి ఎండి ముక్కలాయెను. ఈ ద్రాక్షారసపు తిత్తులు మేము నింపి నప్పుడు అవి క్రొత్తవే, ఇప్పటికి అవి చినిగి పోయి బహు దూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలును చెప్పులును పాతగిలి పోయెను" అని చెప్పారు. కాని వారు చెప్పినవన్నీ అబద్ధాలు. యెహోషువ, ఇశ్రాయేలీయుల నాయకులు వారి మాటలు నమ్మారా? అవును నమ్మారు.
యెహోషువ గిబియోను వారిని స్నేహితులుగా చేసుకొనుట
యెహోషువ, ఇశ్రాయేలీయులు గిబియోను వారు తెచ్చిన ఆహారములో కొంత భుజించారు. ఆహారము భుజించిన తరువాత యెహోషువ వారితో సమాధానపడి వారిని నాశనము చేయకుండా బ్రతుకునట్లు నిబంధన చేసుకున్నారు. ఆ సమయములో యెహోషువ, ఇశ్రాయేలీయుల నాయకులు దేవుని సహాయం కొరకు ప్రార్థించ లేదు, వారు తమ స్వంత ఆలోచనలు అనుసరించి వారితో నిబంధన చేసుకున్నారు.
వారితో నిబంధన చేసుకున్న తరువాత మూడు దినములకు వారు తమకు పొరుగువారు, తమ మధ్యలో నివసించుచున్నవారే అని ఇశ్రాయేలీయులు తెలుసుకున్నారు. గిబియోనీయులు తమను మోసం చేసినట్లు వారు గ్రహించారు. వారి వేషము, మాటల వలన ఇశ్రాయేలీయులు మోసపోయి వారిని నాశనము చేయకుండునట్లు నిబంధన చేసుకున్నారు. గిబియా నివాసులు చేసిన మోసము యెహోషువకు, ఇశ్రాయేలీయులకు కోపము కలిగించింది కాని, వారు చేసిన ప్రమాణం వలన ఏమీ చేయలేక పోయారు. అప్పుడు యెహోషువ వారిని పిలిపించి - "మీరు మా మధ్యను నివసించు వారై ఉండియు మేము మీకు బహు దూరముగానున్న వారమని చెప్పి మమ్మునేల మోసపుచ్చితిరి? ఆ హేతువు (కారణము) చేతను మీరు శాపగ్రస్తులగుదురు. దాస్యము మీకెన్నడును మానదు. నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకు వారును, నీళ్లు చేదు వారునైయుండక మానరు" అని చెప్పాడు. యెహోషువ మాటలకు గిబియోనీయులు ఎంతో సంతోషించారు. వారు యెహోషువతో - ``నీ దేవుడు ఈ సమస్త దేశమును మీకిచ్చి మీ యెదుట నిలువకుండ ఈ దేశ నివాసులందరిని నశింపచేయునట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించెనని నీ దాసులకు రూఢిగా తెలుపబడెను గనుక మేము మా ప్రాణముల విషయములో నీ వలన మిక్కిలి భయపడి ఈలాగు చేసితిమి. కాబట్టి మేము నీ వశమున నున్నాము మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో ఏది మంచిదో అదే చేయుము'' అని ప్రత్యుత్తర మిచ్చారు. యెహోషువ ఆ దినమందే సమాజము కొరకు, ప్రభువు ఏర్పరచుకొను చోటుననుండు బలిపీఠము కొరకును కట్టెలు నరుకు వారుగాను నీళ్లు చేదు వారుగాను వారిని నియమించాడు.
సందేశము
గిబియోనీయులు ఇశ్రాయేలీయులను ఎందుకు మోసం చేశారు అని మనము అర్థం చేసుకొనవచ్చు. ఇశ్రాయేలీయుల దేవుడు మహా శక్తిమంతుడు గనుక తన వాగ్దానం ప్రకారము కనాను దేశమును తప్పక వారికి స్వాస్థ్యముగా ఇస్తాడు అని వారికి అర్థమైంది. తాము సురక్షితంగా ఉండడానికి అబద్దాలు చెప్పడం చాలా పొరపాటు. వారు యెహోషువ దగ్గరకు వెళ్లి, మీ దేవుని పరాక్రమమును విశ్వసిస్తున్నాము అని, తమకు కీడు చేయకుండా వదిలిపెట్టమని అడిగి ఉండవలసింది. తన యందు విశ్వాసముంచి దగ్గరకు వచ్చిన వారిని దేవుడు ఎప్పుడూ త్రోసి వేయడు. దానికి ముందు రాహాబు కూడా ప్రభువును విశ్వసించి రక్షించబడింది.
గిబియోనీయులు కపటముగా ఒక ఉపాయము ఆలోచించారు. యెహోషువ, ఇశ్రాయేలీయుల పెద్దలు తమకు అన్నీ తెలుసు గనుక దేవుని నడిపింపు కొరకు అడగవలసిన అవసరం లేదని భావించారు. వారు దేవుని సహాయం కొరకు ప్రార్ధించి ఉంటే తప్పక దేవుడు వారిని సరియైన జ్ఞానముతో నింపి నడిపించేవాడు. కాని వారు తమ సొంత నిర్ణయాలు చేసుకున్నారు. వారు చేసిన పొరపాటు తరువాత చాలా సమస్యలు ఎదుర్కొనుటకు కారణమైంది.
అన్వయింపు
ఈరోజు మనము నేర్చుకొనిన కథ నుండి రెండు ముఖ్యమైన పాఠములు గుర్తు పెట్టుకోవాలి. మనము ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి తెలియనప్పుడు తప్పక దేవునికి ప్రార్థించాలి. క్రైస్తవులు తమకు ఇష్టం వచ్చినట్లు కాదు గాని దేవునికి ఇష్టమైన రీతిలో నిర్ణయాలు తీసుకోవాలి. మనము పెద్దవారమైనప్పుడు చాలా పెద్ద విషయాలలో నిర్ణయాలు తీసుకొనవలసి ఉంటుంది. ఎక్కడ స్థిరపడాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఇలా ఎన్నో విషయాలలో నిర్ణయాలు చేయాలి. తనను వేడుకుని ప్రార్థించిన వారికి ప్రభువు తప్పక మంచి ఆలోచనను అనుగ్రహిస్తాడు. సామెతలు 3:6 లో - "నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును" అని వ్రాయబడి ఉన్నది. మనము చూపినప్పుడు ఆయన మన హృదయాలలో శాంతిని సమాధానాన్ని నింపుతాడు.
రెండవదిగా అబద్ధములు చెప్పడం చాలా పెద్ద నేరము అనే విషయాన్ని మనము నేర్చుకోవాలి. మన మాటలలో అబద్దాలు చెప్తుంటాము, కొన్నిసార్లు మాటల ద్వారా మోసం చేస్తూ ఉంటాము మరికొన్ని సార్లు మనలో లేని వాటిని గిబియోనీయుల వలె కపటముగా చూపించి మోసం చేస్తుంటాము. అబద్ధములాడు నాలుక ప్రభువు కు హేయము అని సామెతల గ్రంథము లో వ్రాయబడింది. ప్రభువైన యేసు ఈ భూమి మీద నివసించిన దినములలో ఒక్కసారి కూడా అబద్ధం చెప్పలేదు. ఆయన సత్యాలు మాత్రమే మాట్లాడేవాడు, బోధించేవాడు. అబద్ధం చెప్పకూడదు అనేది దేవుని పది ఆజ్ఞలలో ఒకటి. అబద్ధము లాడువారు పరలోకమునకు వెళ్ళలేరు అని ప్రకటన 21:27 లో ఉంది. యేసు మాత్రమే మనందరి పాపములు క్షమించ గలిగినవాడు. మీరు ఎప్పుడైనా అబద్ధాలు చెప్పారా? అందరము ఏదో ఒక సమయములో అబద్ధాలు చెప్తుంటాము. కాని మనము ఆ విషయము గురించి పశ్చాత్తాప పడవలసిన అవసరం ఉంది. తల్లిదండ్రులు మనము చేసిన పొరపాట్లకు శిక్షిస్తారు అనే భయంతో అబద్ధాలు చెప్పి తప్పించుకుంటుంటాము. మనము చేసిన తప్పులు తల్లిదండ్రులకు తెలియకపోయినా, దేవుడు సమస్తము ఎరుగగలడు. తన పాపములను దేవుడు పూర్తిగా క్షమించి వేశాడు అని తెలిసిన క్రైస్తవులు ఎంతో సంతోషంగా ఉండగలరు. క్రైస్తవులు అబద్ధములు చెప్పకుండా ఉండుటకు ప్రభువు సహాయం చేస్తాడు (సామెతలు 13:5).
కంఠతవాక్యము
ప్రభువా, నా నోటికి కావలి యుంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము (కీర్తనలు141:3).
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF