ఆదికాండము 22:1-19;హెబ్రీ 11:17-19
ఉద్దేశము/లక్ష్యము
మన జీవితాలలో దేవుడు మొదటి స్థానంలో ఉండాలి అని బోధించుట.
గతవారము
అబ్రాహాము హాగరును, ఇష్మాయేలును తన ఇంటి నుండి పంపి వేయుట గతవారం మనము చూశాము. అబ్రాహాము అలా ఎందుకు చేశాడు? ఇష్మాయేలు దాహముతో సొమ్మసిల్లి పోయినప్పుడు హాగరు ఏమి చేసింది? ప్రభువు ఏమి చెప్పాడు? ప్రభువు వారికి నీరు ఎలా ఇచ్చాడు? ఈ పాఠం మనకు ఏమి బోధించింది? ఇష్మాయేలు హాగరు ఎడారి ప్రాంతంలో నివాసం ఏర్పరుచుకున్నారు. ఇష్మాయేలు సంతతివారు ఒక ప్రత్యేకమైన జనముగా అభివృద్ధి చెందారు.
ముఖ్యాంశము
మీకు ఏ మాత్రం ఇష్టం లేని పనులు ఎప్పుడైనా చేశారా? అటువంటి పనులు చేయాల్సి వస్తుంది అని ఒకవేళ ముందుగా ఆలోచించినా, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రము ఎంతో బాధకు లోనవుతాము. ప్రస్తుతం చదువుతున్న స్కూల్ వదిలి క్రొత్త స్కూల్ కు వెళ్లడం లేదా వేరే ఊరికి మారిపోవడం, అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరడం ఇంకా ఇలాంటి పరిస్థితులు ఎన్నో సార్లు మనకు ఎదురవుతుంటాయి. వాటిని గురించి ఆలోచిస్తే ఎంతో బాధ కలుగుతుంది. ఈ రోజు ఎంతో కష్టమైన పని చేయమని దేవుడు అబ్రాహాముకు చెప్పాడు. అది అబ్రాహాము జీవితములో అతడు ఎదుర్కొనిన అత్యంత దుఃఖకరమైన పరిస్థితి.
గతవారము
ఊరు పట్టణమును విడిచి తాను చూపించబోవు క్రొత్త దేశమునకు వెళ్ళమని అబ్రాహాముతో దేవుడు చెప్పిన మాటలు గుర్తున్నాయా? దేవుడు అబ్రాహామును ఎలా నడిపించాడు?
అబ్రాహాము శారాలకు కుమారుడిని అనుగ్రహిస్తాను అని దేవుడు చేసిన వాగ్దానం కూడా గుర్తుంది కదూ! అబ్రాహాము 25 సంవత్సరములు ఎదురు చూడవలసి వచ్చినప్పటికి, దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. జరిగిన విషయాలు అన్నీ అబ్రాహాము విశ్వాసమును ఎంతో బలపరిచాయి. అబ్రాహాము ప్రభువునందు సంపూర్ణ విశ్వాసం గలవాడై ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని నమ్మాడు. ప్రభువు నందు అబ్రాహాము ఉంచిన విశ్వాసానికి పెద్ద పరీక్ష ఎదురైంది.
అబ్రాహాము ఇస్సాకును ప్రేమించుట
ఇస్సాకు జన్మించినపుడు అబ్రాహాము శారాలు ఎంత సంతోషించారో మీకు గుర్తుందా! సంవత్సరములు గడుస్తున్న కొలది అబ్రాహాముకు ఇస్సాకు పట్ల ప్రేమ ఎంతో ఎక్కువై ఉండవచ్చు. ఇస్సాకు బాలుడిగా ఎదుగుతూ ఉన్నాడు. మంచి ఆరోగ్యముతో, బలముతో పనులు కూడా చేస్తున్నాడు. అబ్రాహాము, శారాలకు ఇస్సాకును చూచినప్పుడు ఎంతో సంతోషం కలుగుతూ ఉండవచ్చు. ఇస్సాకు ఎంతో సహనం, ఆలోచన, విధేయత కలిగినవాడై ఉన్నాడు(ఆది. 20:6,7,8). వారు ప్రభువును గురించి ఎన్నో విషయాలు తమ కుమారునికి చెప్పి ఉండవచ్చు. దేవుని శక్తిని, ఆయన సృష్టిని గురించి కూడా ఇస్సాకు అబ్రాహాము శారాల ద్వారా తెలిసికొని ఉండవచ్చు. ప్రభువు తనకు చేసిన అద్భుతమైన వాగ్దానముల గురించి అబ్రాహాము ఎన్నోసార్లు ఇస్సాకుకు వివరంగా చెప్పి ఉండవచ్చు. తన ఒక్కగానొక్క కుమారుని అబ్రాహాము ఎంతో ప్రేమించే వాడు అని బైబిల్ లో వ్రాయబడింది (ఆది. 22:2).
ప్రభువు అబ్రాహామును పరిశోధించుట
దేవుడు ఒక దినము అబ్రాహాముకు ఎంతో కష్టమైన పనిని చేయాలి అని చెప్పాడు. ప్రభువు అబ్రాహామును పరీక్షిస్తున్నాడు. దేవుడు అబ్రాహాముతో- ``నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతని నర్పించుము'' అని చెప్పాడు. అబ్రాహాము ఆ మాటలు వినిన తరువాత ఎలా ఆలోచించి ఉంటాడు? ఎంతగానో విభ్రాంతితో కలత చెంది ఉండవచ్చు. 25 సంవత్సరములు ఎదురు చూచిన తరువాత ప్రశస్తమైన బహుమానంగా దేవుడు ఇస్సాకును అనుగ్రహించాడు, కానీ ఇప్పుడు దేవుడే నీ కుమారుని చంపమని చెబుతున్నాడు. అబ్రాహాము ఎలా ఇటువంటి పని చేయగలడు? తాను ఎంతగానో ప్రేమించే తన కుమారుని ఏ విధముగా చంపగలడు? ఏమీ అర్థం కాకపోయినా ప్రభువు పట్ల ఉన్న ప్రేమ, విశ్వాసమును బట్టి అబ్రాహాము దేవుని మాటలు ఎంతో శ్రేష్ఠమైనవి అని నమ్మాడు. అబ్రాహాము గొప్ప విశ్వాసం గలవాడు. ప్రభువు తాను చెప్పిన ప్రతి మాటను, చేసిన ప్రతి వాగ్దానమును తప్పక నెరవేరుస్తాడు అని అబ్రాహాముకు ఖచ్చితంగా తెలుసు. దేవుడు భూమ్యాకాశములను సృజించినవాడు అని అబ్రాహాము పరిపూర్ణంగా విశ్వసించగలిగాడు. ఇస్సాకు సంతానముతో నా నిబంధన స్థిరపరచెదనని ప్రభువు ఎంతో స్పష్టంగా అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చాడు (అది. 17 :19). ఇస్సాకును తాను చంపినా, దేవుడు ఇస్సాకును మృతులలోనుండి లేపగలడు అని అబ్రాహాము విశ్వసించాడు (హెబ్రీ 11 :19). వెంటనే అబ్రాహాము ఇష్టపూర్వకంగా, విధేయతతో తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు.
అబ్రాహాము ప్రయాణము ప్రారంభించుట
దేవుడు అబ్రాహామును మోరియా దేశమునకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. బెయేర్షెబా నుండి మోరియా దేశము 80 కిలోమీటర్ల దూరంలో ఉండేది. అక్కడికి ప్రయాణించటానికి మూడు రోజులు పట్టేది. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంతలు కట్టి తన పని వారిలో ఇద్దరిని, తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి, లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళుటకు బయలుదేరాడు. ప్రయాణం చేస్తున్న మూడు రోజులు అబ్రాహాము మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండి ఉండవచ్చు? శారాను గురించి ఆలోచించి ఉండవచ్చు. తనకు ప్రియమైన కుమారుని చంపబోతున్నాను అనే ఆలోచన పదే పదే మనసును బాధపెడుతూ ఉండవచ్చు.
ఒకవేళ వెనుకకు వెళ్లి పోదామా అనే ఆలోచన కూడా వచ్చి ఉండవచ్చు. కానీ అబ్రాహాము దేవునికి అవిధేయత చూపడానికి ఇష్టపడలేదు. మూడవ దినమున వారు అక్కడకు చేరుకున్నారు. అబ్రాహాము కన్నులెత్తి దూరమునుండి ఆ చోటును చూచి తన పని వారితో - "మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి నేనును,ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి దేవునికి మ్రొక్కి మరల మీ యొద్దకు వచ్చెదము" అని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకుని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాడు. దహనబలికి అవసరమైన కట్టెలను ఇస్సాకు తనపై పెట్టుకుని మోసాడు. వారిద్దరు కలిసి వెళ్ళుచున్నప్పుడు ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో "నాతండ్రీ" అని పిలిచాడు. అందుకు అబ్రాహాము "ఏమి నా కుమారుడా" అని చెప్పగా ఇస్సాకు తిరిగి అబ్రాహామును "నిప్పును, కట్టెలును ఉన్నవి కాని దహనబలికి గొర్రెపిల్ల ఏది" అని అడిగాడు. అందుకు "
అబ్రాహాము - "నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనును''అని సమాధానమిచ్చాడు. ఆ సమయం అబ్రాహాముకు ఎంత దుఃఖాన్ని కలిగించిందో మనము ఊహించలేము. దేవుని సహాయం కొరకు అబ్రాహాము ఎంతగానో ప్రార్థించి ఉంటాడు.
అబ్రాహాము దేవునికి విధేయత చూపుట
అబ్రాహాము, ఇస్సాకు దేవుడు చెప్పిన స్థలము చేరుకున్నారు. అబ్రాహాము అక్కడ ఒక బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చాడు. తరువాత అబ్రాహాము దేవుడు తనతో చెప్పిన మాటలను ఇస్సాకుకు చెప్పి ఉండవచ్చు. ఇస్సాకు కూడా ప్రభువును ప్రేమించేవాడు కనుక తండ్రి చెప్పిన మాటలకు విధేయత చూపాడు. అప్పుడు అబ్రాహాము ఇస్సాకును బంధించి ఆ బలిపీఠముపై ఉన్న కట్టెల మీద ఉంచాడు. ఇస్సాకు ఎదురుతిరుగలేదు, పారిపోవాలని ప్రయత్నించలేదు, కనీసం దుఃఖించలేదు, తండ్రి మీద కోపపడలేదు. నిశ్శబ్దంగా, ఇష్టపూర్వకంగా విధేయత చూపాడు. అబ్రాహాము తన జీవితములో ఎంతో దుఃఖకరమైన సమయం ఎదుర్కొంటున్నాడు. అప్పుడు అబ్రాహాము ఇస్సాకును వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు. దేవునికి విధేయుడై తన కుమారుని చంపుటకు అబ్రాహాము వెనుతీయలేదు. పరిపూర్ణమైన విధేయతతో దేవుడు చెప్పిన మాటలకు లోబడ్డాడు. తాను ఇస్సాకును వధించినప్పటికి దేవుడు తిరిగి బ్రతికించగలడు అని నమ్మాడు.
దేవుడు బలిపశువును సమకూర్చుట
అబ్రాహాము ఇస్సాకును వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగానే ప్రభువు దూత పరలోకము నుండి "అబ్రాహామా అబ్రాహామా" అని పిలిచాడు. అందుకు అబ్రాహాము "చిత్తము ప్రభువా" అని బదులు చెప్పాడు. అప్పుడు ఆయన "ఈ చిన్నవాని మీద చెయ్యి వేయకుము అతనినేమియు చేయకుము. నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది" అనెను. అబ్రాహాము ఎంతగా సంతోషించి ఉంటాడో! అప్పుడు అబ్రాహాము ఇస్సాకు కట్లు విప్పదీసాడు. అబ్రాహాము కన్నులెత్తి చూచినప్పుడు పొదలో కొమ్ములు తగులుకొని యున్నఒక పొట్టేలు వెనుకతట్టు కనబడింది. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించాడు. అప్పుడు అబ్రాహాము ఆ చోటికి "దేవుడు పర్వతము మీద చూచుకొనును" అనే పేరు పెట్టాడు.
ప్రభువు దూత రెండవ సారి పరలోకము నుండి అబ్రాహామును పిలిచి - "నీకు ఒక్కడైయున్న నీ కుమారుని ఇచ్చుటకు వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందలి ఇసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచు కొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకమందలి జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసియున్నాను అని దేవుడు సెలవిచ్చాడు'' అని చెప్పాడు. తరువాత అబ్రాహాము తన పని వారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్లారు. తన కుమారునితో కలిసి తిరిగి బెయేర్షెబాకు వెళ్ళటం అబ్రాహాముకు ఎంత సంతోషం కలిగించి ఉంటుంది!
సందేశము
ప్రభువు ముందుగా అబ్రాహాము జీవితాన్ని మార్చాడు. అబ్రాహాము లోకములోని వాటన్నింటికంటే తనను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా లేదా అని పరీక్షించాడు. స్వంత కుమారుని చంపమని దేవుడు అబ్రాహాముకు చెప్పడం ఎంత ఆశ్చర్య కరమైన విషయం! కానీ అబ్రాహాము ఇస్సాకును చంపాలి అనేది దేవుని ఉద్దేశము కాదు. అబ్రాహాము విశ్వాసమును పరీక్షించాలి అని దేవుడు అనుకున్నాడు. ఆ పరీక్షలో అబ్రాహాము విజయము పొందాడు. అబ్రాహాము ఇస్సాకును చంపకుండా దేవుడు అడ్డుకున్నాడు. దేవుడు పెట్టిన పరీక్ష ద్వారా అబ్రాహాము తాను దేవుని కోసం ఏదైనా చేయడానికి సిద్ధమే అని రుజువు చేశాడు. అబ్రాహాము విధేయత కలవాడు తన జీవితములో మొదటి స్థానం ప్రభువుకే అని తన విశ్వాసము ద్వారా చూపించాడు.
అన్వయింపు
దేవునికి మొదటి స్థానం ఇచ్చుట - నేను ప్రభువును ప్రేమిస్తున్నాను అని మాటల ద్వారా చెప్పడం మనకు ఎంతో సులభం. మనము క్రైస్తవులమయితే తప్పక ప్రభువును ప్రేమించాలి. కానీ మనము చాలాసార్లు ఇతర విషయాలు ఎక్కువగా ప్రేమించడం బాధాకరమైన విషయం. మనకు ఎంతో ఇష్టమైన వారిని ఎక్కువగా ప్రేమిస్తూ, దేవుని ప్రేమించే విషయంలో వెనుకబడి పోతుంటాము. కొన్నిసార్లు మన వస్తువులను ఎక్కువగా ప్రేమిస్తుంటాము. కంప్యూటర్, మోటార్ సైకిల్ వీటిపై ఎంతో ప్రేమ కలిగి ఉంటాము. మనము ఎంతో ప్రేమించే వాటిని కొన్నిసార్లు ప్రభువు మనకు దూరం చేస్తాడు. ఎందుకంటే అప్పుడైనా మనము మన జీవితాలలో ప్రభువును ఎక్కువగా ప్రేమించడానికి ఇష్టపడతాము అని ప్రభువు ఆశ.
కొన్నిసార్లు దేవుని కంటె మనకున్నఅలవాట్లు మనకు చాలా ముఖ్యమైనవిగా అనిపిస్తుంటాయి. మన సమయం అంతా మనకు ఇష్టమైన పనులు చేస్తూ గడుపుతుంటాము. కానీ దేవుని విషయాలకు కొంచెం సమయం కూడా ఇవ్వలేక పోతుంటాము. మనము హృదయపూర్వకంగా ఆయనను ప్రేమించాలని ప్రభువు కోరిక. మన బలహీనతలను క్షమించి మనలను మార్చమని దేవునికి ప్రార్ధించాలి. అప్పుడు ప్రభువుకు మన జీవితాలలో మొదటిస్థానం ఇవ్వగలము.
ఇస్సాకును బలి అర్పించుట - యేసు మరణమునకు సాదృశ్యము - ఈ రోజు మనము నేర్చుకున్నఈ కథ ద్వారా దేవుడు ఎంతో ముఖ్యమైన విషయాలను మనకు నేర్పిస్తున్నాడు. ఇది దేవుడు చేయనైయున్న బలి అర్పణకు మాదిరిగా, సాదృశ్యంగా ఉంది.
-
అబ్రాహాము తనకు ప్రియమైన ఏకైక కుమారుని బలిగా అర్పించుటకు సిద్ధపడ్డాడు. దేవుడు తన ప్రియ కుమారుని బలిగా ఇచ్చుటకు సిద్ధపడ్డాడు
-
ఇస్సాకు ఇష్టపూర్వకంగా విధేయత చూపించాడు. యేసు ఇష్టపూర్వకంగా విధేయత చూపాడు (ఫిలిప్పి 2:5-8)
-
దేవుడు ఇస్సాకును మృతులలోనుండి లేప గలడు అని అబ్రాహాము విశ్వసించాడు. దేవుడు యేసును మృతులలో నుండి లేపాడు.
-
దేవుడు బలికి గొర్రెపిల్లను సమకూర్చాడు. దేవుడు యేసును బలిగా సమకూర్చాడు.
మనము క్రైస్తవులముగా ఉండాలనే ఆశ కలిగి ఉంటే దేవుని గొర్రెపిల్ల అయిన యేసు దగ్గరకు వెళ్లి మన పాపములు క్షమించమని వేడుకోవాలి. అప్పుడు ఆయన మన హృదయాలను పవిత్రపరచి, మన జీవితాలను మార్చగలడు. ప్రభువైన యేసు మన పాపముల నిమిత్తమై సిలువపై బలి అర్పణ గా తన ప్రాణమును అప్పగించాడు. ఈ విషయం తెలిసిన తరువాత కూడా దేవుని ప్రేమించకుండా, సొంత మార్గంలో వెళ్తుంటే పరలోకమునకు వెళ్ళడం అసాధ్యము.
కంఠతవాక్యము
నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను (మత్తయి 22:37).
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF