యెహోషువ 23, 24; న్యాయాధిపతులు 2:7- 19
ఉద్దేశము
దేవుడు చేసిన గొప్ప కార్యములు అన్నింటిని మరువక అంతము వరకు ఆయనను వెంబడించాలి అని బోధించుట.
ముఖ్యాంశము
మీకు వీలునామా అంటే ఏమిటో తెలుసా? మనుష్యులు చనిపోవడానికి ముందు తమ ఆస్తులు, ఇళ్లు, డబ్బు ఎవరెవరికి చెందాలో వ్రాసి పెడతారు, దానినే వీలునామా అంటారు. పిల్లలకు లేదా తమకు ఇష్టం వచ్చిన వారికి తమ ఆస్తులన్నింటినీ వ్రాసి ఇస్తుంటారు. పాత రోజులలో చనిపోతున్న వ్యక్తి తన కుటుంబ సభ్యులను అందరిని పిలిపించుకుని వారితో మాట్లాడి కొన్ని జాగ్రత్తలు, సలహాలు ఇచ్చి వారి ముందే వీలునామా వ్రాయించేవారు. యెహోషువ వృద్ధుడైనందున మరణమునకు సమీపంగా ఉన్నాడు. దానికి ముందుగా ఇశ్రాయేలీయులనందరినీ పిలిచి కొన్ని ముఖ్యమైన సూచనలు వారికి ఇవ్వాలి అని తలంచాడు.
యెహోషువ జీవితము
గత కొన్ని వారాలు యెహోషువ ద్వారా దేవుడు జరిగించిన అద్భుతమైన కార్యాలను గురించి తెలుసుకున్నాము. యెహోషువకు వృద్ధాప్యంతో మరణించే సమయము వచ్చింది. ఇశ్రాయేలీయులకు మంచి నాయకుడిగా యెహోషువ ఉండగలిగాడా? అవును యెహోషువ ప్రభువు పని కొరకు ఎంతో బలమైన, ధైర్యం కలిగిన నాయకుడిగా ఉండగలిగాడు.
ఐగుప్తు దాసత్వము నుండి మోషే ఇశ్రాయేలీయులను అరణ్యములో ఏ విధముగా నడిపించినది మీకు గుర్తుంది కదూ! కనాను దేశపు సరిహద్దులు చేరినప్పుడు మోషే స్థానములో
నాయకుడిగా దేవుడు ఎవరిని ఏర్పరిచాడు? అవును, దేవుడు యెహోషువను మోషే స్థానములో నాయకుడిగా ఏర్పరచాడు. యెహోషువ మోషేకు సహాయకుడిగా ఉంటూ ఎంతో యధార్ధముగా ప్రభువును ప్రేమించేవాడు. ఇశ్రాయేలీయులను వాగ్దాన భూమి లోనికి నడిపించడం సులభమైన విషయం కాదు. కనాను దేశస్థులు ఎంతో దుష్టత్వముతో నిండిన వారు గనుక వారిని అందరినీ నాశనము చేయాలని దేవుడు తలంచాడు. వారు మొలెకు అను దేవతను ఎక్కువ ఆరాధించేవారు. తమ ప్రథమ సంతానమును వారు మొలెకు దేవతకు బలిగా అర్పించే వారు. అలా చేయుట వలన ఆ దేవత తమను ఆశీర్వదిస్తుంది అని విశ్వసించేవారు. ఇత్తడి విగ్రహం అయిన మొలెకు చేతులలో తమ సంతానం ఉంచి ఆ విగ్రహం క్రింద పెద్ద మంట పెట్టేవారు. ఆ వేడికి చిన్నపిల్లలు మరణించేవారు. కనానీయులు చేయుచున్న హేయ క్రియలను, పాపమును చూచి దేవుడు ఆగ్రహంతో నిండిపోయాడు. అమోరీయుల అక్రమము సంపూర్ణమైనప్పుడు అబ్రాహాము యొక్క నాల్గవ తరము వారు వారిని నాశనం చేస్తారు అని దేవుడు అబ్రాహాముకు చెప్పాడు(ఆది 15:16). ఆ సమయము వచ్చింది గనుక యెహోషువ, ఇశ్రాయేలీయులు ఆ దేశములో ప్రవేశించి అందులో నివసించబోతున్నారు. యెహోషువను ధైర్యపరచుటకు ప్రభువు - "నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, భయపడకుము నేను నీకు తోడై యుండెదను" అని చెప్పాడు. దేవుని మాటలను విశ్వసించి యెహోషువ ముందుకు సాగాడు.
ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశమును స్వతంత్రించు కొనుటకు ముందు వారు యొర్దాను నదిని దాట వలసి వచ్చింది. యాజకుల కాళ్లు యొర్దాను నీటిని తాకగానే నీరు ప్రవహించుట ఆగిపోయింది. దేవుడు చెప్పినట్లుగానే ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద నడిచినట్లు గా యొర్దాను నదిని దాటారు. ప్రభువు మాత్రమే అటువంటి అద్భుతములు చేయుటకు సమర్ధుడు.
నది ఒడ్డున జ్ఞాపక సూచనగా ఒక స్తంభమును 12 రాళ్లతో నిలువ బెట్టునట్లు దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు ఎందుకు అలా ఆజ్ఞాపించాడు? యొర్దాను నదిని దాటించిన దేవుని గొప్ప శక్తిని వారు మరచిపోకుండునట్లు దేవుడు ఆ విధముగా చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు కనాను దేశము లోనికి ప్రవేశించి గిల్గాలు అనే ప్రాంతములో తమ గుడారములు వేసుకున్నారు. యెరికో పట్టణమును చూచుటకు యెహోషువ వేగుల వారిని పంపిన విషయము గుర్తుంది కదూ?
నేపధ్యము
యెరికో పట్టణపు రాజు చంపకుండునట్లు వేగుల వారిని ఎవరు దాచి ఉంచారు? అవును రాహాబు. రాహాబు జీవముగల ఇశ్రాయేలీయుల దేవుని యందు విశ్వాసముంచి వారిని గడ్డివాములో దాచి పెట్టింది. ప్రభువు వారిని కాపాడుతాడు అని విశ్వసించింది( హెబ్రీ 11 :31). రాహాబు ఎందుకు ఎర్రని దారము తన ఇంటి కిటికి నుండి వ్రేలాడదీసింది? ఇశ్రాయేలీయులు యెరికో పట్టణమును జయించినప్పుడు రాహాబును నాశనము చేయకుండా కాపాడుటకు ఆ దారము గుర్తుగా కట్టబడింది.
యెరికో పట్టణమును జయించుటకు యెహోషువకు ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పిన ప్రణాళిక ఏమిటి? ఆరు రోజులు, రోజుకు ఒకసారి ఆ పట్టణ ప్రాకారము చుట్టూ తిరిగి రావాలి. కొందరు యాజకులు నిబంధన మోస్తారు మరికొందరు బూరలు ఊదుతారు. ఏడవ దినమున ఏమి చేయాలని దేవుడు చెప్పాడు? పట్టణము చుట్టూ ఏడు మారులు తిరగాలి, యెహోషువ చెప్పిన వెంటనే యాజకులు బూరలు ఊదాలి, ప్రజలు గొప్ప శబ్దముతో కేకలు వేయాలి. అప్పుడు ఏం జరిగింది? గోడలు కూలిపోయాయి. గోడ ఒక చోట కూలి పోలేదు. రాహాబు ఇల్లు ఆ ప్రాకారము పై అలాగే నిలిచి ఉంది. అప్పుడు ఇద్దరు వేగులవారు యెహోషువ మాటచొప్పున రాహాబును ఆమె కుటుంబపు వారిని తీసుకుని వచ్చి ఇశ్రాయేలీయుల పాళెములో ఉంచారు. రాహాబు ప్రభువు నందు విశ్వసించుట వలన పట్టణపు వారితో కూడా నాశనము కాలేదు. ప్రభువు మాటచొప్పున ఇశ్రాయేలీయులు కనాను దేశమును ఆక్రమించుకున్నారు.
యెరికో పట్టణమును ఆక్రమించు కొనుటకు ముందు దేవుడు ఒక ముఖ్యమైన ఆజ్ఞను యెహోషువకు చెప్పాడు. యెరికో పట్టణమంతటిని నాశనము చేయవలెను అని దేవుడు చెప్పాడు. అందులో దేనిని ఎవరూ ముట్టకూడదు అని ఆజ్ఞాపించాడు. కాని వారిలో ఒకరు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు.
అవును ఆకాను షీనారు పై వస్త్రమును బంగారు వెండి చూచి ఆశించి వాటిని తీసుకున్నాడు. వాటిని ఆకాను తన గుడారము మధ్య గుంట త్రవ్వి దాని లో దాచి పెట్టాడు. ఇశ్రాయేలు వారు హాయి అను చిన్న పట్టణము మీదకు యుద్ధమునకు పోయి వారి చేతిలో ఓడిపోయారు. ఆకాను చేసిన పాపమును బట్టి దేవుడు వారికి అపజయము కలుగ చేశాడు. వారి అపజయానికి కారణము యెవరో దేవుడు యెహోషువకు చూపించాడు. ఆకాను తన పాపమును ఒప్పుకొని తాను దాచిన వస్తువులను చూపించాడు. ఆకాను చేసిన పాపమువలన అతనితో పాటు కుటుంబమంతయు, అతనికి కలిగిన సమస్తము నాశనం చేయబడింది. ఆకన్నును చూచి క్రైస్తవులు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ప్రభువు తన మాటలకు విధేయత చూపిన వారిని మాత్రమే ఆశీర్వదిస్తాడు.
యెహోషువ చేసిన పొరపాటు గుర్తుందా? చినిగిపోయిన దుస్తులతో, అరిగిపోయిన చెప్పులతో కపట వేషముతో గిబియోనీయులు వచ్చినప్పుడు ప్రభువుకు ప్రార్థించ కుండానే వారితో నిబంధన చేశాడు. వారు తాము చాలా దూర ప్రాంతమునకు చెందినవారమని చెప్పిన మాటలు నమ్మి వారితో కలిసి భోజనం చేశారు.
యెహోషువ, ఇశ్రాయేలీయుల పెద్దలు దేవుని సన్నిధిలో ప్రార్థించ కుండానే వారి మాటలు నమ్మి నిబంధన చేసుకున్నారు. వారు పెద్ద పొరపాటు చేశారు. గిబియోనీయులు అబద్ధాలు చెప్పారు అని మూడు రోజుల తరువాత వారికి తెలిసింది. వారు దూర ప్రాంతమునకు చెందినవారు కాదు గాని తమకు సమీపము లోని వారే అని తెలుసుకున్నారు. వారు చేసిన మోసము యెహోషువ కు కోపం తెప్పించింది. కానీ, వారితో చేసిన నిబంధన వలన వారికి హాని చేయక తమలోనే ఉండనిచ్చారు. గిబియోనీయులు ఇశ్రాయేలీయులకు పనివారుగా ఉండిపోయారు.
ఇశ్రాయేలీయులు కనాను దేశమందు నివసించుట
తరువాత యెహోషువ నాయకత్వములో ఇశ్రాయేలీయులు ఎన్నో యుద్ధాలు చేశారు. ఆ సమయమంతా ప్రభువు వారికి ఎంతో అద్భుతంగా సహాయం చేశాడు. ఒకేసారి ఐదుగురు రాజులు గొప్ప సైన్యముతో యుద్ధమునకు రాగా దేవుడు వడగండ్లు పంపి వారిలో అనేకులను చంపివేశాడు. మరోసారి ఇంకొక అద్భుతం జరిగింది. దేవుడు ఒక దినమంతా సూర్యుడు అస్తమించకుండా చేశాడు. కనుక ఇశ్రాయేలీయులు ఆ రోజు అంతా తమ శత్రువులతో యుద్ధము చేసి విజయం సాధించగలిగారు. ఆ దేశములో అందరూ నశించక పోయినప్పటికి, దేవుడు ఇశ్రాయేలీయులకు సమాధానము కలిగించాడు. దేవుడు తన మాట చొప్పున తన ప్రజలకు కనాను దేశమును స్వాస్థ్యముగా ఇచ్చాడు. యెహోషువ ఇశ్రాయేలు 12 గోత్రముల వారు నివసించునట్లు ఆ దేశమును వారికి పంచిపెట్టాడు. చివరకు వారు స్థిరపడే అవకాశం దేవుడు కలిగించాడు.
యెహోషువ ప్రజలకు గుర్తు చేయుట:(యెహోషువ 24: 1-13)
యెహోషువ ఇశ్రాయేలీయులకు మంచి నాయకుడిగా ఉన్నాడు. కానీ తాను మరణించ వలసిన సమయము దగ్గరగా ఉంది అని యెహోషువ గ్రహించాడు. ఇశ్రాయేలీయులను యెహోషువ 30 సంవత్సరములు నడిపించాడు. దేవుడు యెహోషువకు తోడుగా ఉండి ఎంతగానో ఆశీర్వదించాడు. యెహోషువ షెకెములో కలుసు కొనుమని ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిపించాడు. తాను మరణించక ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు వారికి చెప్పాలి అని తలంచాడు. తాను మరణించిన తరువాత వారు ఏ విధముగా ముందుకు సాగాలి అనే విషయాలు వారితో పంచుకోవాలి అని యెహోషువ అనుకున్నాడు.
దేవుని యొక్క ప్రేమను, దయను ఇశ్రాయేలీయులు ఎన్నడూ మరవకూడదు అని యెహోషువ ముందుగా వారికి గుర్తు చేశాడు. దేవుడు అబ్రాహామును పిలిచి కనాను దేశమును స్వాస్థ్యముగా ఇస్తాను అని వాగ్దానం చేశాడు. యాకోబు సంతతివారు ఐగుప్తు దేశములో నివసించుటకు వెళ్ళిన సంగతిని కూడా గుర్తుచేశాడు. వారు అక్కడ నాలుగు వందల సంవత్సరములు నివసించిన తరువాత మోషే ను నాయకుడిగా ఏర్పరిచి వారిని బయటకు నడిపించాడు. మోషే తరువాత యెహోషువ వారికి నాయకుడిగా ఉండి వారిని వాగ్దాన దేశములోనికి నడిపించాడు. ప్రభువు తమకు తోడుగా ఉండి విజయాన్ని కలిగించిన సంగతిని యెహోషువ వారికి గుర్తు చేశాడు.
యెహోషువ ప్రజలను హెచ్చరించుట
అన్నిటికంటె ముఖ్యమైన విషయము - ప్రభువును ప్రేమించి ఆయనకు విధేయత చూపుట అని యెహోషువ వారికి చెప్పాడు. అక్కడ నివసిస్తున్న వారి దేవతలను అనుసరించకూడదు అనియు వారితో స్నేహం చేయకూడదు అనియు యెహోషువ హెచ్చరించాడు.కనాను దేశములో నివసిస్తున్న వారిని బయటకు పంపి వేయాలి అని కూడా చెప్పాడు. అక్కడ వారిని వివాహం చేసుకొనరాదు.
అని కూడా యెహోషువ ఆజ్ఞాపించాడు. వారిని వివాహం చేసుకుంటే ఇశ్రాయేలీయుల హృదయాలను వారు తమ దేవతల తట్టు మరలిస్తారు అని వారికి చెప్పాడు. వారు దేవుని నుండి దూరము వెళ్ళిపోతే, దేవుడు వారి నుండి దూరముగా వెళ్తాడు అని చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలీయులకు ఆశీర్వాదములకు బదులుగా శాపములు కలుగుతాయి అని వివరించాడు. యెహోషువ వారితో - "మీరు ఎవని సేవించదరో మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును ప్రభువును సేవించెదము" అని చెప్పాడు. అప్పుడు వారు యెహోషువతో -"మేము ప్రభువునే సేవించెదము, ఆయనే మా దేవుడు" అని ప్రత్యుత్తరమిచ్చారు .
ప్రజలు తిరిగి వెళ్లకముందు యెహోషువ ధర్మశాస్త్ర గ్రంథము లోని వాక్యములను పెద్ద రాయి మీద వ్రాయించి సిందూర వృక్షము కింద ఆ రాతిని నిలువ పెట్టించాడు. తరువాత వారితో - "ఆలోచించుడి ప్రభువు మనతో చెప్పిన మాటలన్నియు ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన యెడల అది మీ మీద సాక్షిగా ఉండును" అని చెప్పి వారిని ఇండ్లకు పంపించాడు. 110 సంవత్సరముల వయస్సులో యెహోషువ మృతి పొందాడు (న్యాయాధిపతులు 2:1 -10).
సందేశము
ప్రభు చేసిన ఉపకారములకు గుర్తు చేసుకోవాలి అని యెహోషువ ఇశ్రాయేలీయులకు గుర్తుచేశాడు. ప్రభువు నుండి దూరము వెళ్ళవద్దు అని యెహోషువ వారిని హెచ్చరించాడు.
అన్వయింపు
దేవుడు మనకు ఇచ్చిన ప్రతి మంచి విషయాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చాలి. దేవుడు మనకు ఇచ్చిన మంచి కుటుంబం, గృహము, ఆరోగ్యము స్నేహితులను గుర్తు చేసికొని సంతోషించాలి. మనము బైబిల్ చదువుకోవడానికి సండే స్కూల్ కి వెళ్ళడానికి కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. మనము దేవుని నుండి దూరంగా వెళ్ళుట చాలా పెద్ద తప్పు అని బైబిల్ భోధిస్తుంది.
దేవుని ద్వేషించే వారితో సహవాసము చేయవద్దు అని ఇశ్రాయేలీయులకు యెహోషువ ఆజ్ఞాపించాడు. అలా ఎందుకు చేయాలి? వారితో సహవాసము చేసినప్పుడు వారివలె విగ్రహారాధికులుగా మారుతారు అని దేవునికి తెలుసు. మనము కూడా అల్లరి పిల్లలతో స్నేహము చేసినట్లయితే వారు మనలను దేవుని దగ్గరకు వెళ్లకుండా అడ్డు పడవచ్చు. వారితో ఎక్కువ సమయం గడిపితే వారిలో ఉండే చెడ్డ విషయాలను మనము కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. మనము దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా ఉండుటకు సాతాను ఎంతగానో ప్రయత్నిస్తుంటాడు.
తనకు అవిధేయత చూపినప్పుడు దేవుడు శిక్షిస్తాడు అనే పాఠాన్ని ఈరోజు మనము నేర్చుకున్నాము. దేవునికి ఇష్టము లేని విషయాలకు దూరంగా ఉండునట్లు ఆయన సహాయం కొరకు ప్రార్థించాలి. మన హృదయాలలో దేవునికి ఇష్టమైన రీతిగా జీవించాలి అనే ఆశ ఉంటే దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. అన్ని విషయాలలో సరిగా నడుచుటకు దేవునికి సహాయము కొరకు ప్రార్థన చేయాలి.
కంఠతవాక్యము
ప్రభువునే సేవించెదము ఆయనే మా దేవుడు (యెహోషువ 24:18).
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF