నిర్గమకాండము 3, 4 అధ్యాయాలు, అ. కా. 7:30-35
ఉద్దేశము
దేవునికి సాకులు చెప్పి తప్పించుకొనుటకు ఎప్పుడూ ప్రయత్నించకూడదు అని బోధించుట. దేవుడు ఏదైనా చేయమని మనకు చెప్పినప్పుడు మనము విధేయత చూపాలి అని వివరించుట.
ముఖ్యాంశము
మీరు ఎప్పుడైనా సాకులు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించారా? మీ అమ్మ పక్కింటి ఆంటీకి ఏదైనా వస్తువు ఇచ్చి రమ్మని చెప్తే మీరు - " నాకు తల నొప్పిగా ఉంది, నా చెప్పులు కనిపించలేదు, నాకు చాలా పని ఉంది" అని కుంటి సాకులు చెప్పి తప్పించుకోవచ్చు. మీకు వెళ్లడానికి ఇష్టం లేక ఆ విధముగా చెప్పి తప్పించుకుంటున్నారు అని మీ అమ్మకు తెలుసు. తల్లిదండ్రులు మనకు ఏదైనా చెప్పినప్పుడు మనము వారికి విధేయత చూపాలి. దేవుడు ఒక పనిని అప్పగించినప్పుడు సాకులు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని గురించి తెలుసుకుందాము.
గతవారము
మోషే గురించి, అతడు తీసుకున్న గొప్ప నిర్ణయం గురించి గతవారం తెలుసుకున్నాము. ఆ నిర్ణయం మీకు గుర్తుందా? రాజభవనములోని సమస్తమైన ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి తన జనులైన ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్లాలని మోషే ఇష్టపడ్డాడు. ప్రమాదంలో ఉన్న ఒక ఇశ్రాయేలీయుని కాపాడినప్పుడు ఏమి జరిగిందో గుర్తుందా? మోషే ఐగుప్తుయుని చంపి భూమిలో పాతిపెట్టాడు. ఈ విషయం తెలిసిన ఫరో రాజు మోషేను చంపుటకు ప్రయత్నించగా మోషే మిద్యానుకు పారిపోయాడు. ప్రభువు మోషేను ఏ విధముగా కాపాడాడు? దేవుడు మోషేకు ఒక ఇంటిని, భార్యను, ఇద్దరు కుమారులను అనుగ్రహించాడు.
అరణ్యములో మోషే
మోషే తన మామ మందలను మేపుతూ 40 సంవత్సరములు అరణ్యములో ఉన్నాడు. మోషే వాటిని మేపుతూ ఒక చోట నుండి మరొక చోటుకు వెళ్తూ ఉండి ఉండవచ్చు. రాజకుమారునిగా పెద్ద భవనాలలో ఉండి ఇప్పుడు పశువులను మేపుతూ అరణ్యములో తిరుగుతున్నాడు. ఎంతో ధనవంతుడైన వాడు ఇప్పుడు పేదవాడుగా ఉన్నాడు. కానీ ప్రభువు మోషేకు తోడై యుండి అతని అవసరాలు అన్నీ తీరుస్తున్నాడు.
ఐగుప్తులో దాసత్వములో ఉన్న తన ప్రజలైన ఇశ్రాయేలీయులను గురించి మోషే ఆలోచిస్తూ ఉండవచ్చు. తాను ఐగుప్తీయుని చంపడం, అందువలన పారిపోవలసి రావడం అన్నీ జ్ఞాపకానికి వస్తూ ఉండవచ్చు. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయ చేయుచున్న సంగతి వారు గ్రహిస్తారు అని మోషే తలంచాడు గాని ఆ విధముగా జరుగలేదు(అ.కా. 7:25). మోషేను దేవుడు ఇశ్రాయేలీయులకు నాయకుడిగా నియమించాడు గాని ఆయన ఏర్పాటుచేసిన సమయము ఇంకా రాలేదు. వారికి నాయకుడిగా ఉండుటకు మోషే అరణ్యములో దేవుని దగ్గర శిక్షణ తీసుకొనవలసి ఉంది. మోషే అరణ్యములో ఓపికతో 40 సంవత్సరములు మందలను కాస్తూ గడిపాడు. దేవుని ప్రజలను అరణ్యములో ఏ విధముగా నడిపించాలో నేర్చుకొనుటకు శిక్షణ ఎంతో అవసరమైన ఉన్నది. మోషే తన పనిని ప్రారంభించుటకు ప్రభువు ఏ రీతిగా పిలిచాడు అనే విషయాన్ని చూద్దాము.
మండుచున్న పొద
ఒకరోజు మోషే తన మామ మందను మేపుచుండగా ఒక వింతైన విషయాన్ని చూసాడు. ఒక పొద మధ్యలో అగ్నిజ్వాలలు కనిపించాయి. అగ్నివలన ఆ పొద మండుట చూసాడు గాని ఆ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే - "ఆ పొద ఏల కాలిపోలేదో నేను అటు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను" అని అనుకున్నాడు. అతడు సమీపించగానే పొద నడుమనుండి - "మోషే మోషే" అని తన పేరు పిలుచుట వినబడింది. అప్పుడు మోషే - "చిత్తము ప్రభువా" అన్నాడు. అందుకు తిరిగి ఆ స్వరము - "దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము. నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము" అని పలికింది. మరియు ఆయన - " నేను నీ తండ్రి దేవుడను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవునివైపు చూచుటకు భయపడ్డాడు. దేవుడు ఒక మండుచున్న పొద నుండి మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుడు గొప్పవాడు, మహా శక్తిమంతుడు గనుక ఏదైనా చేయగలడు. దేవుడు మోషేకు ఏమి చెప్పబోతున్నాడు? దేవుడు ఇశ్రాయేలీయులను గూర్చి మాట్లాడుతున్నాడు. దేవుడు తిరిగి మోషేతో - `` నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్ము కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి కనాను దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి యున్నాను. కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెను" అని చెప్పాడు.
దేవుడు చెప్పిన మాటలకు మోషే చెప్పిన మూడు సాకులు
నేనెంతటివాడను!
దేవుని మాటలు విని మోషే భయపడ్డాడు. 40 సంవత్సరముల క్రిందట దేవుడు తన ప్రజలకు నాయకుడిగా తనను ఎన్నుకున్నాడు అని తలంచాడు, కాని ఇప్పుడు ఆ పనిని చేయడానికి అంగీకరించడం లేదు. మోషే దేవునితో - " నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకుని పోవుటకును ఎంతటి వాడను?" అని చెప్పాడు. అందుకు దేవుడు మోషేతో - "నిశ్చయముగా నేను నీకు తోడైయుందును" అని చెప్పాడు. ఆ మాటలు వినిన తరువాత దేవుడు తనతో కూడా ఉంటే సమస్తము సాధ్యమేనని మోషే విశ్వసించాడు. అయినా కూడా ఐగుప్తుకు వెళ్లకుండా తప్పించుకోవాలి అనే కోరిక ఇంకా మోషే హృదయములో నుండి తొలగిపోలేదు. అందుకే దేవునితో మరొక సందేహాన్ని పంచుకున్నాడు. మోషే దేవునితో - " చిత్తగించుము నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్లి వారి పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు - "ఆయన పేరేమి" అని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పవలెను" అని అడిగాడు. అప్పుడు దేవుడు మోషేతో నీవు వారి దగ్గరకు వెళ్లి వారితో - "మీ పితరుల దేవుడు నన్ను మీ యొద్దకు పంపెను ఐగుప్తులో మీకు సంభవించిన దానిని మీ దేవుడు చూచెను ఆయన ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు మిమ్మును నడిపించుటకు నన్ను పంపెను" అని చెప్పమని ఆజ్ఞాపించాడు. దేవుడు మోషేతో నీవు ఐగుప్తు రాజు దగ్గరకు వెళ్ళి నా ప్రజలను పంపించు అని అడగాలి అని వివరించాడు
వారు నన్ను నమ్మని యెడల ఏమి చేయాలి?
మోషే ప్రభువు మాటలకు లోబడి సంతోషంగా వెంటనే వెళ్ళి ఉండాలి, కానీ ఇంకను మోషే ఆ బాధ్యత నుండి తప్పించుకొనుటకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మరల మోషే దేవునితో - "వారు నన్ను నమ్మరు, నా మాట వినరు దేవుడు నీకు ప్రత్యక్షము కాలేదు అందురు" అని చెప్పగా దేవుడు తన మహాశక్తిని మోషే చూచునట్లు రెండు సూచక క్రియలను చేశాడు. దేవుడు మోషే చేతిలోని కర్రను క్రింద పడవేయమనగా మోషే దానిని నేలమీద పడవేయగానే అది పాముగా మారిపోయింది. అది చూచి మోషే అక్కడ నుండి పారిపోయాడు. దేవుడు మోషేను పిలిచి నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమని చెప్పగా, అతడు చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది కర్రగా మారిపోయింది. దేవుడు తిరిగి మోషేతో చెయ్యి రొమ్మున ఉంచుకొనుమని చెప్పగా, మోషే తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠురోగముతో మంచువలె తెల్లగా మారింది. తరువాత మరల ఆ చేతిని రొమ్మున ఉంచుకొనుమని దేవుడు చెప్పగా మోషే ఆలాగుననే చేసాడు. అప్పుడు ఆ చెయ్యి మిగిలిన శరీరము వలె మారిపోయింది. దేవుడు చేసిన ఈ సూచక క్రియలవలన మోషే దేవుని యొక్క మహాశక్తిని గ్రహించాడు. ఈ సూచక క్రియలు చేయుట వలన దేవుడు మోషేను పంపాడు అనే విషయాన్ని ఫరో తెలుసుకుంటాడు అని మోషే విశ్వసించాడు. దేవుడు తనతో ఉన్నందువలన ఫరో మరియు ఐగుప్తీయులు తన మాటలు వింటారు అని మోషే తలంచాడు.
నేను నోటి మాంద్యము గల వాడను
దేవుని సూచక క్రియలను చూచిన తరువాత కూడా మోషే దేవుడు అప్పగించిన బాధ్యతలనుండి తప్పించుకోవాలి అనే అనుకుంటున్నాడు. తనకు బదులుగా దేవుడు మరొకరిని నాయకునిగా ఎన్నుకుంటే బాగుంటుంది అని మోషే ఆలోచన. మోషే చెప్తున్న ప్రతి సాకుకు దేవుడు వెంటనే సమాధానాలు ఇస్తున్నాడు. మోషే దేవునితో - "ప్రభువా నేను మాట నేర్పరిని కాను. నేను నాలుక మాంద్యము కలవాడను" అని చెప్పగా వెంటనే దేవుడు మోషేతో - "నేను నీ నోటికి తోడై యుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదను" అని చెప్పాడు. మోషే చివరగా - "అయ్యో ప్రభువా నీవు పంప తలంచిన వానినే పంపుము" అని చెప్పాడు. అప్పుడు దేవునికి మోషే పై కోపం వచ్చింది. మోషే దేవుని యందు విశ్వాసముంచవలసినది. తాను బాలుడిగా ఉన్నప్పుడే మరణము నుండి తనను కాపాడిన ఆయన విశ్వాస్యతను మోషే జ్ఞాపకము చేసుకొన వలసినది. మానవులకు మాట్లాడుట నేర్పువాడు దేవుడే. మోషేపై కోపం వచ్చినప్పటికి దేవుడు తన కృపను దూరం చేయలేదు. దేవుడు మోషేతో - "నీ అన్న అహరోను వచ్చుచున్నాడు. అతడే నీకు బదులు జనులతో మాటలాడును, అతడే నీకు నోరుగా ఉండును" అని చెప్పాడు. ఆ మాటలు వినిన మోషే సంతోషించాడు, దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చుటకు సిద్ధపడ్డాడు.
మోషే తిరిగి ఐగుప్తు వెళ్ళుట
మోషే ఐగుప్తులో ఉన్న తన బంధువుల యొద్దకు పోయి వారిని చూసి వస్తాను అని తన మామ అయిన యిత్రోకు చెప్పి తన భార్యను కుమారులను తీసుకుని బయలుదేరాడు. అహరోను కూడా మోషేను కలుసుకున్నాడు. 40 సంవత్సరముల తరువాత తన అన్నను కలుసుకున్నందుకు మోషే ఎంతో సంతోషించి ఉండవచ్చు. దేవుడు మండుతున్న పొద నుండి తనతో మాట్లాడిన విషయాలను, ఇశ్రాయేలీయులైన తమ స్వజనుల మూలుగులను దేవుడు ఆలకించి వారిని విడిపించుటకు సిద్ధపడిన విషయాన్ని మోషే అహరోనుకు వివరించి ఉండవచ్చు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి కనాను దేశమునకు నడిపించిన గొప్ప అద్భుతాన్ని మనము రాబోయే వారములలో చూద్దాము.
సందేశము
ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఉండమని దేవుడు చెప్పినప్పుడు మోషే ఎన్నో సాకులు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. నేనెంతటివాడను, నన్ను వారు విశ్వసించరు, నాకు నోటి మాంద్యము ఉంది ఇలా ఎన్నో సాకులు చెప్పాడు. దేవుడు సూచకక్రియలు చేసినా, వేరే వారిని పంపుము అని అడిగాడు. మోషే చెప్పిన సాకులకు దేవునికి కోపం వచ్చినప్పటికి, అహరోనును మోషేకు తోడుగా ఉంచాడు. మోషే ఇశ్రాయేలీయులను నడిపించు నాయకుడిగా ఉంటే, అహరోను మోషే నోటికి తోడుగా ఉండునట్లు దేవుడు ఏర్పరచాడు.
అన్వయింపు
మనము కూడా చాలాసార్లు మోషే వలె ప్రవర్తిస్తుంటాము. సండే స్కూల్ కి వెళ్లి దేవుని మాటలను తెలుసుకుంటాము. మనము ఏమి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో నేర్చుకుంటాము. ప్రభువైన యేసు సిలువలో తన ప్రాణము పెట్టాడు గనుక ఆయన క్షమాపణ కొరకు ప్రార్థించాలి అని వింటాము. ఆ విధముగా చేసినప్పుడే మనము నిజమైన క్రైస్తవులముగా మారగలము అని తెలుసు. కాని ఆలాగున చేయుటకు బదులుగా మోషే వలె కుంటిసాకులు చెప్పడానికి ప్రయత్నిస్తుంటాము. కొన్నిసార్లు - " నేను ఒకరోజు తప్పకుండా క్రైస్తవునిగా మారుతాను, కానీ ఇప్పుడే కాదు. నేను ఇంకా సిద్ధంగా లేను, నేను చేయవలసిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి, నా స్నేహితులతో కలిసి గడపాలి, నాకు ఇష్టమైన పనులన్నీ చేయాలి, దేవుని గురించి ఆలోచించే సమయం ఇంకా రాలేదు, నేను పెద్ద అయిన తరువాత దేవుని గురించి ఆలోచిస్తాను" అని అనుకోవచ్చు. మనము దేవునికి అవిధేయత చూపితే ఆయనకు కోపం కలుగుతుంది. యేసు దగ్గరకు రావడానికి మనము ఆలస్యం చేయకూడదు. క్రైస్తవునిగా మార్పు చెందడం లోకములోని అన్ని విషయాలలో ఎంతో ముఖ్యమైనది. మనము సాకులు చెబుతూ దేవుని మన హృదయాలలోనికి ఆహ్వానించక పోతే సమయం మించిపోవచ్చు. ప్రభువును ప్రేమించాలి అనే ఆశ మన హృదయాలలో లేనట్లయితే, అటువంటి ఆశ కలిగించమని దేవునికి ప్రార్థన చేయాలి. క్రైస్తవులుగా మారిన తరువాత దేవుడు ఆజ్ఞాపించిన వాటన్నింటిని చేయుటకు ఇష్టపడాలి.
ఉదాహరణ
కీర్తి, ఖ్యాతి మంచి స్నేహితులు. వారు ప్రక్క ప్రక్క ఇండ్లలో ఉండేవారు. 16 సంవత్సరముల వయస్సులో కీర్తి యేసును తన హృదయం లోనికి ఆహ్వానించి క్రైస్తవురాలుగా మారింది. అప్పటినుండి యేసును గూర్చిన సువార్త తన స్నేహితురాలికి చెప్పడం మొదలు పెట్టింది. ప్రారంభంలో ఖ్యాతి ఎంతో ఆసక్తిగా ఈ మాటలు వింటూ, బైబిల్ చదువుతూ కీర్తితో కలసి మీటింగ్స్ కు వెళ్ళేది. కాని కొన్ని రోజుల తరువాత ఖ్యాతిలో మార్పు కనిపించసాగింది. నాకు పని ఉంది, మీటింగ్ కి రాలేను అని చెప్పేది. కీర్తి ఇచ్చిన బైబిల్ ను తిరిగి ఇచ్చేసింది. నాకు బైబిల్ చదవడానికి సమయం లేదు అని చెప్పేది. వేరే ప్రాంతానికి వెళ్తూ కీర్తికి ఒక ఉత్తరం రాసింది. అందులో ఇలా ఉంది - " నా జీవితంలో నేను సరదాగా సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు యేసుతో అవసరం లేదు నేను చనిపోవడానికి ముందు నా పాపములు క్షమించమని అడుగుతాను.
కీర్తి తన స్నేహితురాలి నిర్ణయానికి ఎంతగానో బాధపడింది. మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుస్తుంది? అయినప్పటికి కీర్తి ప్రతిరోజు తన స్నేహితురాలి కోసం ప్రార్థన చేస్తుండేది. 10 సంవత్సరముల తరువాత ఖ్యాతి దగ్గర నుండి మరొక ఉత్తరం వచ్చింది. అందులో తాను ఆఫ్రికా దేశంలో ఉన్నాను అని, క్రైస్తవురాలుగా మారి ఎంతో సంతోషంగా ఉన్నాను అని వ్రాసింది. తనకు ప్రభువైన యేసును గూర్చి చెప్పినందుకు ఎంతో కృతజ్ఞతలు చెప్పింది. ఎన్నో సాకులు చెప్పి బాధ కలిగించినందుకు క్షమించమని కూడా అడిగింది. ఆ ఉత్తరం చదివిన తరువాత ఖ్యాతి జీవితములో కలిగిన గొప్ప మార్పును తెలుసుకుని కీర్తి ఎంతో సంతోషించింది. ప్రభువైన యేసు ఎటువంటి వారినైనా మార్చగలడు అని మనము విశ్వసించాలి.
కంఠతవాక్యము
నీవు నీ దేవుడైన ప్రభువు మాట శ్రద్ధగా వినవలెను (ద్వితీ. 28:1)
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF