న్యాయధిపతులు 7:1-22
ఉద్దేశము
క్రైస్తవులకు ఎదురయ్యే పోరాటాలలో, గెలిచే శక్తి ని దేవుడు వారికి దయ చేస్తాడు అని బోధించుట.
ముఖ్యాంశము
మీరెప్పుడైనా మాట ఇచ్చి తప్పారా? మీరు ఇంకా చిన్న వయస్సులో ఉన్నారు, లైసెన్స్ లేదు కనుక మోటార్ సైకిల్ నడపవద్దు అని మీ తల్లిదండ్రులు చెప్తారు. మీకు ప్రమాదం జరగకూడదు అని అలా చెప్తుంటారు. మీరు వారి మాటలకు అంగీకరించి మోటార్ సైకిల్ నడిపించను అని మాట కూడా ఇచ్చి ఉండవచ్చు. కానీ మీ తల్లిదండ్రులు బయటకు వెళ్ళినప్పుడు మీరు బైక్ తీసుకొని మీ స్నేహితుని దగ్గరకు వెళ్లి వస్తుంటే జారిపడి దెబ్బలు తగిలాయి అనుకోండి. మీ తల్లిదండ్రులు వచ్చి మీ దెబ్బలు చూచి, వారి మాటలు విననందుకు తప్పకుండా కోపపడతారు కదూ. మీ మంచి కోసం చెప్పిన మాటలు విననందుకు వారు ఎంతో బాధపడతారు కూడా.
గతవారము
ఇశ్రాయేలీయులు దేవుని మరచి కనాను దేశపు దేవతలను పూజించిన యెడల వారిని శిక్షిస్తాను అని యెహోషువ ద్వారా దేవుడు హెచ్చరించాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఇచ్చిన సమాధానము గుర్తుందా? మేము ప్రభువునే సేవిస్తాము ఆయనే మా దేవుడు అని చెప్పారు. కానీ యెహోషువ, ఇశ్రాయేలీయుల పెద్దలు మరణించిన తర్వాత వారు తమ ప్రమాణమును నిర్లక్ష్య పెట్టి తమ దేవునికి దూరమయ్యారు. కనాను వారితో స్నేహం చేసుకుని వారి దేవతలను పూజించుట మొదలుపెట్టారు. వారు ఆ విధముగా చేస్తున్నందుకు దేవుడు వారిని ఎలా శిక్షించాడో తెలుసా? మిద్యానీయులను ప్రతి సంవత్సరము ఇశ్రాయేలీయుల మీదకు పంపి వారి పంటలను, పశువులను తీసుకొని పోవునట్లు చేశాడు. ఇశ్రాయేలీయులు కొండ గుహలలో దాగుకొనేవారు.
మిద్యానీయులు కలిగించిన బాధలు, శ్రమల వలన ఇశ్రాయేలీయులకు ఎంతో కష్టము కలిగింది. తినడానికి ఆహారము కూడా లేని పరిస్థితులు వారికి ఎదురయ్యాయి. అప్పుడు వారు తిరిగి తమ దేవునికి ప్రార్ధించసాగారు. తమ దేవుని మరచిపోయినందువలన ఆయన కోపముతో తమను శిక్షిస్తున్నాడు అని తెలుసుకున్నారు. వారు ఎలుగెత్తి మొఱ్ఱపెట్టగా దేవుడు వారిని క్షమించి గిద్యోనును వారికి న్యాయాధిపతిగా పంపాడు. దేవుడు గిద్యోనును పిలిచినప్పుడు అతడు గానుగ చాటున గోధుమలను శుభ్రము చేసుకుంటున్నాడు. మిద్యానీయులతో యుద్ధము చేసి వారిని జయించమని దేవుడు గిద్యోను కు చెప్పాడు. ముందుగా గిద్యోను తండ్రి నిలిపిన బయలు బలిపీఠమును, దేవత స్తంభమును పడద్రోయ మని దేవుడు చెప్పగా, దేవుని సహాయం వలన గిద్యోను వాటిని పడగొట్టాడు. దేవుని సూచక క్రియలను చూచుట ద్వారా విశ్వాసము కలిగి మిద్యానీయులతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. దేవుడు గిద్యోను కు తోడుగా ఉండి మిద్యానీయులపై విజయము దయ చేయడం ఈ రోజు చూద్దాము.
గిద్యోను సైన్యము
గిద్యోను దూతలను పంపి ఇశ్రాయేలు వారినందరిని మిద్యానీయులపై యుద్ధము చేయుటకు తన దగ్గరకు పిలిపించాడు. గిద్యోనుతో కలిసి యుద్ధము చేయుటకు 32 వేల మంది వచ్చారు. ప్రభువు గిద్యోనుతో - "నీతో నున్న జనులు ఎక్కువమంది నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహు బలము నాకు రక్షణ కలుగ చేసెను అనుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినునట్లుగా ప్రకటించుము" అని చెప్తాడు. అప్పుడు వారిలో 22 వేల మంది తిరిగి వెళ్ళిపోగా పదివేల మంది మిగిలారు. అప్పుడు ప్రభువు మరల - "ఈ జనులు ఇంకను ఎక్కువమంది. నీళ్ల యొద్దకు వారిని దిగ జేయుము. కుక్క గతుకునట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని, త్రాగుటకు మోకాళ్లూని కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుము" అని ప్రభువు సెలవిచ్చాడు. చేతితో నోటి కందించుకొని త్రాగిన వారి లెక్క 300, మిగిలిన వారు నీళ్లు త్రాగుటకు మోకాళ్లు వంచారు. ఆ మూడు వందల మంది ద్వారా మిద్యానీయులను మీ కప్పగించి మిమ్మును రక్షిస్తాను అని దేవుడు చెప్పాడు. గిద్యోను 300 మంది సైనికులతో యుద్ధము చేయుటకు సిద్ధంగా ఉన్నాడు.
గిద్యోనును దేవుడు బలపరచుట
మిద్యానీయులు తమ గుడారములు వేసుకొని యెజ్రాయేలు మైదానములో వేలకొలది దండుగా దిగారు. గిద్యోను తన సైన్యముతో హరోదు బావి యొద్ద నిలుచుండి చూడగా లోయలో మిద్యానీయుల సైన్యము కనిపించింది. అంత గొప్ప సైన్యమును మూడు వందల మందితో జయించడం అసాధ్యము అని గిద్యోను అనుకొని ఉండవచ్చు. ఆ రాత్రి ప్రభువు గిద్యోనుతో - "నీవు లేచి దండు మీదికి పొమ్ము నీ చేతికి దానిని అప్పగించెదను. పోవుటకు నీకు భయమైన యెడల నీ పని వాడైన పూరాతో కూడా దండుకు దిగిపొమ్ము. వారు చెప్పుకొనుచున్నదానిని వినిన తరువాత ఆ దండు లోనికి దిగి పోవుటకు నీ చేతులు బలపరచు బడును" అని చెప్పాడు. గిద్యోనులో ఇంకను భయము పూర్తిగా తొలగిపోలేదు అని దేవునికి తెలుసు. గిద్యోను దేవుని మాట చొప్పున తన పని వానిని తీసుకుని మిద్యానీయుల దండు దగ్గరకు వెళ్లాడు. ఎవరూ వారిని చూడలేదు. గిద్యోను దండు లో ప్రవేశించినప్పుడు ఒకడు తాను కనిన కలను తన స్నేహితునికి వివరిస్తూ - "నేనొక కలగంటిని అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండు లోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దానిని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయెను" అని చెప్పాడు. అందుకు అతని స్నేహితుడు - "అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే కానీ మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతటిని అతని చేతికి అప్పగింప బోవుచున్నాడు" అని జవాబు చెప్పాడు. గిద్యోను వారి మాటలు విని ప్రభువుకు నమస్కారము చేసి తిరిగి ఇశ్రాయేలీయుల దండు లోనికి వెళ్ళి వారిని యుద్ధమునకు సిద్ధ పరచాడు.
దేవుడు గిద్యోనుకు విజయము కలుగజేయుట
గిద్యోను తన 300 మంది సైనికులను మూడు 3 గుంపులుగా చేసి ప్రతివాని చేతికి బూరను, వట్టి కుండను, ఆ కుండలో దివిటీలను ఇచ్చి తాను చేసినట్లుగా వారిని కూడా చేయమని చెప్పాడు. గిద్యోను నడి జామున 100 మందిని తీసుకొని మిద్యానీయుల దండు చిట్టచివరకు వెళ్ళాడు. తరువాత వారు బూరలను ఊది తమ చేతులల్లో ఉన్న కుండలను పగులగొట్టారు. ఆ మూడు గుంపుల వారు అదే విధముగా బూరలను ఊదుచు కుండలను పగులగొట్టి యెడమ చేతులతో దివిటీలను, కుడి చేతులలో బూరలను పట్టుకుని - "ప్రభువు ఖడ్గము గిద్యోను ఖడ్గము" అని కేకలు వేశారు. అర్ధరాత్రి నిశ్శబ్దంగా ఉన్న సమయములో ఇశ్రాయేలీయుల అరుపులు, బూర శబ్దములు విని మిద్యానీయులు భయముతో నిద్రలో నుండి లేచి పారిపోవుట మొదలుపెట్టారు. గిద్యోను సైన్యము కేకలు, కుండలు పగిలిన శబ్దం మిద్యానీయులకు భయాన్ని కలిగించాయి. వారు గుడారములలో నుండి బయటకు వచ్చినప్పుడు దివిటీలు చుట్టూ మండుతూ కనిపించాయి. నిద్రలో నుండి లేచిన మిద్యానీయులకు ఏమీ అర్థము కాలేదు. అప్పుడు ప్రభువు వారి దండులో ప్రతివాడు తన కత్తిని తన పొరుగు వాని మీద త్రిప్పునట్లు చేశాడు. దేవుడు వారికి గందరగోళం కలిగించగా వారు భయముతో తమ దేశం వైపు పరిగెత్తి పోయారు. గిద్యోను, అతని సైనికులు వారిని తరమసాగారు. మొదట తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిన సైనికులు మిద్యానీయులకు ఎదురుగా వచ్చి వారిని పట్టుకున్నారు. మిద్యానీయులు చాలామంది చనిపోగా, వారి అధిపతులైన ఓరేబు జెయేబు అని వారిని కూడా చంపి వేశారు. కొన్ని గంటలలోనే యుద్ధము ముగిసిపోయింది. ఎంత అద్భుతమైన విజయం!
సందేశము
ఇశ్రాయేలీయులు ఎందుకు ఈ యుద్ధము చేయవలసి వచ్చింది? వారు దేవునికి అవిధేయులు అయినందున మిద్యానీయులు వారిని శ్రమ పెట్టారు. తమ కష్ట సమయములో వారు తమ పాపమును అంగీకరించి ప్రార్థించగా దేవుడు గిద్యోను ద్వారా వారికి విజయం కలుగ జేశాడు.
గిద్యోను మన వంటి సాధారణమైన వ్యక్తి కానీ ప్రభువు నందు విశ్వాసముంచాడు. తన వెంట సైనికులు ఉన్నప్పటికి యుద్ధము చేయుట తనకు సాధ్యం కాదని గిద్యోనుకు తెలుసు. గిద్యోను విజయానికి అతని విధేయత, విశ్వాసమే కారణము. దేవుని సహాయము వలననే తమకు విజయము కలుగుతుంది అని గిద్యోను విశ్వసించాడు.
దేవుని గొప్ప శక్తిని చూచిన ఇశ్రాయేలీయులు తిరిగి ఆయన యందు విశ్వాసముంచి కనాను దేవతలను పూజించుట మానివేశారు. నలుబది సంవత్సరములు దేవుని వెంబడిస్తూ నమ్మకముగా జీవించారు.
అన్వయింపు
మిద్యానీయులు మనకు శత్రువులు కాదు గాని, సాతాను మనకు శత్రువు. మనము ప్రభువును ప్రేమించటం, విధేయత చూపటం సాతానుకు ఇష్టము ఉండదు. ప్రభువైన యేసునందు విశ్వాసముంచి క్రైస్తవులుగా మారటం కూడా సాతానుకు ఇష్టం ఉండదు. మీరు దేవుని మాటలు వింటారా, లేదు సాతాను మాటలకు విధేయత చూపుతారా? ప్రభువు మనలను క్షమించిన తరువాత పరిశుద్ధాత్ముడు మన హృదయాలలో నివసిస్తాడు.
క్రైస్తవ జీవితం ఒక యుద్ధము వంటిది. ప్రభువైన యేసు బైబిల్ లో చెప్పిన మాటలకు విధేయత చూపాలని క్రైస్తవులు ఆశిస్తారు. దేవుడు అసహ్యించుకొను వాటిని వదిలిపెట్టి, ఆయనకు ప్రీతికరమైన జీవితాన్ని జీవించాలని ఆశ పడతారు. కాని అది వారికి అసాధ్యమైన విషయము.యేసు -"నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు" అని చెప్పాడు. సాతానుకు వ్యతిరేకముగా మనము చేసే పోరాటములో దేవుడు మనకు తప్పక విజయము కలిగిస్తాడు.
కంఠతవాక్యము
ప్రభువు యొక్క మహా శక్తిని బట్టి ఆయనయందు బలవంతులై ఉండుడి (ఎఫెసి 6 :10).
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF