ఆదికాండము 2:16-17;3:1-10
ఉద్దేశము/లక్ష్యము
పాపము మొదట ఈ లోకములోనికి ఎలా ప్రవేశించింది చూపుట. సాతాను ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్తూ మనుష్యులు దేవునిమాట వినకుండా చేస్తున్నాడు అని తెలుపుట.
ముఖ్యాంశము
రోబో( మరమనిషి) రోబోఅంటే ఏమిటి? అవి స్వంతముగా ఏ పనులు చేయగలవు? ఏమీ చేయలేవు కదా! మనము బటన్ నొక్కుతుంటే మనము చెప్పిన పనులు అవి చేస్తాయి. మనుష్యులు రోబో వంటివారు కాదు. మనము స్వంతముగా ఆలోచించి నిర్ణయాలు తీసు కొనగలము. మనము చేయవలసిన పనులను గురించి ఇతరులు చెప్తే మనకు నచ్చదు. దేవుడు ఆదాము హవ్వలకు ఆలోచించే శక్తిని ఇచ్చాడు. వారు తమకు ఇష్టమైన పనులు చేయడానికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. తమను సృజించి, అవసరమైన వాటినన్నింటిని సమకూర్చిన దేవుని వారు ఎంతో సంతోషంగా ప్రేమించి, విధేయత చూపుతూ ఉన్నారు, కాని అప్పుడే ఒక విచారకరమైన సంఘటన జరిగింది.
దేవుడు ఆదాము హవ్వలకు ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ
మనకు ఇంటిలో, స్కూల్ లో కొన్ని నిబంధనలు ఉంటాయి. మీ నాన్నగారు బైక్ తీసుకుని బయటకు వెళ్ళవద్దు అని చెప్తారు. మీరు మాట వినకుండా బయటకు వెళ్తే, మీ నాన్నకు కోపం వచ్చి మిమ్మల్ని తిట్టవచ్చు లేదా కొట్టవచ్చు. మీ నాన్నకు మీరు అవిధేయత చూపారు. స్కూల్ కి టైమ్ కి రావాలి అని స్కూల్ లో నిబంధన ఉంటుంది. ఆలస్యంగా వెళ్తే నిబంధన మీరినందుకు శిక్ష ఉంటుంది. ఇలా మనకు ఎన్నెన్నో నిబంధనలు ఉంటాయి, కాని దేవుడు ఆదాము హవ్వలకు ఒకే ఒక ఆజ్ఞను ఇచ్చాడు.
ఏదెను తోట మధ్యలో ఉన్న ఒక వృక్షపు పండ్లు తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. అది మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము. అది ఎంతో కష్టమైన ఆజ్ఞ కాదు కదా! దేవుడు కఠినమైన వాడు కాదు. వారు ఆ తోటలోని మిగిలిన వృక్షపు పండ్లు నిరభ్యంతరంగా తినవచ్చు. దేవుడు ఆ ఒక్క పండు గురించి ఆదాముతో - “నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు” అని చెప్పాడు (ఆదికాండము2:16,17). అంటే వెంటనే వారు శారీరకంగా మరణిస్తారు అని కాదు గాని వారు నిరంతరము జీవించే అవకాశం పోగొట్టుకుంటారు, వారు ఆత్మీయంగా మరణిస్తారు అని దేవుడు చెప్పాడు. ఆత్మవలననే మనుష్యులు దేవునితో సహవాసం చేస్తూ, సన్నిహితంగా ఉండగలరు. దేవుడు వారి మంచి కోసమే ఆదాము హవ్వలకు అటువంటి ఆజ్ఞను ఇచ్చాడు. వారు తన మాట వినకుండా ఆ వృక్షపు పండ్లను తింటే వారు చెడుతనము, పాపము గురించి తెలుసుకుంటారు అని దేవునికి తెలుసు. అప్పుడు వారికి ఎంతో దుఃఖము కలుగుతుంది! దేవుడు అలా ఎన్నడూ జరగకూడదు అని ఆశించాడు. వారు ఎల్లప్పుడూ సంతోషంగా, మంచివారుగా, పాపము లేని వారుగా ఉండాలి అని దేవుడు ఇష్టపడ్డాడు. కాని దేవుని విరోధి అయిన సాతాను ఏ విధముగా ఆదాము హవ్వలకు, దేవునికి మధ్య ఉన్న సహవాసాన్ని పాడుచేసాడో తెలుసుకుందాము. ఆదాము హవ్వల అవిధేయతను బట్టి దేవుడు వారిని శిక్షించవలసి వచ్చింది.
అసలు సాతాను ఎవరు?
ప్రపంచము సృష్టించబడక ముందే పరలోకములో దేవునితో కలిసి నివసించిన దేవదూతే సాతాను (యోబు 38:4-7). దేవదూతలు పరలోకములో ఎల్లప్పుడూ దేవుని గొప్పతనాన్ని, శక్తిని స్తుతించి కీర్తించేవారు. కాని వారిలోఒక దేవదూత గర్వముతో నిండి దేవునితో సమానముగా ఉండాలి అని ఆశపడ్డాడు (1 తిమోతి 3:6). దేవుని తో పాటు తనను కూడా మిగిలిన దేవదూతలు స్తుతించాలి అని తలంచాడు. పరలోకములో ఎటువంటి దుష్టత్వానికి స్థానం లేదు కనుక దేవుడు ఆ దేవదూతను, అతని అనుచరులను బయటకు త్రోసివేశాడు (ప్రకటన 12:9). అప్పటినుండి సాతాను దేవుని ద్వేషించుటకు మొదలుపెట్టాడు. దేవుడు సృష్టించిన అందమైన ప్రపంచాన్ని చూసి, దానిని కూడా పాడు చేయాలి అని సాతాను అనుకున్నాడు. ఆదాము హవ్వలను కూడా తనవలె చెడ్డవారిగా మార్చాలి అని తలంచాడు. దేవుని విరోధి అయిన సాతాను, ఆదాము హవ్వలు కూడా దేవుని ద్వేషించాలి అని కోరుకున్నాడు.
సాతాను హవ్వ దగ్గరకు వచ్చుట
సాతాను ఒకరోజు అందమైన ఏదెను తోట లోనికి వెళ్ళి హవ్వతో మాట్లాడాలి అనుకున్నాడు. సాతాను సర్పము (పాము) రూపంలోవెళ్లి హవ్వతో మాట్లాడడానికి నిశ్చయించుకున్నాడు. సాతాను చాలా కుయుక్తిపరుడు. ఎన్నో చెడుకార్యాలు చేయగలడు. ఆ దినాలలో పాములు నిలబడగలిగేవి అని మనము ఊహించవచ్చు(3:14). ఆదికాండము 3:13 లో జరిగిన సంభాషణను గమనించండి. హవ్వ దేవునికి అవిధేయత చూపునట్లు చేశాడు. ఆ పండ్లు తినినప్పటికి చనిపోరు అని నమ్మించాడు. వారు ఆ పండ్లు తింటే జ్ఞానము పొందుతారుఅని చెప్పాడు. అవి తింటే వారి కన్నులు తెరువబడి మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవునివలె ఉంటారు అని చెప్పాడు(5 వ). ఇది ఘోరమైన అబద్ధము. ఆ వృక్ష ఫలాలు తింటే నిశ్చయముగా చనిపోతారు అని దేవుడు వారికి ఎంతో స్పష్టంగా ముందే చెప్పాడు. ఎన్నో మంచి విషయాలను దేవుడు వారికి ఇవ్వకుండా ఆపుతున్నాడు అనే ఆలోచన హవ్వకు సాతాను కలిగించాడు. ఎంత మోసం! హవ్వ సాతాను మోసానికి లోబడిపోయింది, సాతాను మాట నమ్మింది ( 2 కొరింథి.11:3). అంతకు ముందు చేయని పని సాతానుతో మాట్లాడిన తరువాత, చేస్తే బాగుంటుంది అనిపించింది. తినడానికి ఎన్నోరకాల పండ్లు అక్కడ ఉన్నప్పటికి, సాతాను మాటలు విని దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన వాటిని తినడానికి నిర్ణయించుకుంది. ఆహారమునకు ఎంతో మంచిగా కనిపిస్తున్న ఆ పండ్లను చూచింది. అవి ఎంతో రమ్యముగా కనిపిస్తున్నాయి. సాతాను మాటలకు లోబడి పండ్లు తిని వివేకము, జ్ఞానము సంపాదించుకుని దేవునివలె ఉండాలి అని హవ్వ అనుకుంది. దేవుని మాట వదిలివేసి సాతాను మాట వినడానికి హవ్వ నిర్ణయించుకుంది. ఆమె కొన్ని పండ్లను తీసుకొని తిని, కొన్ని తన భర్తకు కూడా ఇవ్వగా, ఆదాము కూడా వాటిని తిన్నాడు. అలా తినడం దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే అని ఆదాముకు తెలుసు. అతడు తినకుండా మానివేసి ఉండవచ్చు, కాని ఆదాము కూడా దేవుని మాటకు విధేయత చూపలేదు. ఎంత భయంకరమైన పని చేసారు కదూ!
ఆదాము హవ్వలు దేవునితో తమ సహవాసము కోల్పోవుట
ఆ పండ్లు తినిన వెంటనే ఒక భయంకరమైన సంఘటన జరిగింది. దేవుని ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా వారికి ఆత్మీయ మరణం సంభవించింది. ఆ విషయం దేవుడు ముందే వారికి చెప్పాడు (3:3). దేవుడు ఆదాము హవ్వలకు నిష్కళంకమైన ఆత్మలను అనుగ్రహించాడు. వారు దేవునితో, దేవుడు వారితో ప్రతిదినము సహవాసము కలిగి ఉండేవారు. అంతా ఎంతో అద్భుతంగా ఉండేది. అప్పటివరకు మంచివాటిని గురించి మాత్రమే వారికి తెలుసు. దేవునికి అవిధేయులైన వెంటనే చెడు గురించి వారికి తెలిసింది. వారు దేవునితో ఉన్న సన్నిహితమైన సంబంధాన్ని పోగొట్టుకున్నారు. ఆ రోజు సాయంత్రము దేవుడు వారితో మాట్లాడుటకు వచ్చినప్పుడు వారు సిగ్గుతో దాక్కున్నారు. దేవుని కలవడానికి వారు ఇష్టపడలేదు. భయముతో చెట్ల వెనుక దాక్కున్నారు. ఉద్దేశపూర్వకంగా తాము చూపిన అవిధేయత దేవునికి కోపం కలిగిస్తుంది అని వారికి తెలుసు. పరిపూర్ణుడు, పరిశుద్ధుడు అయిన దేవుడు పాపముతో, అవిధేయతతో నిండిన ఆదాము హవ్వలను సహించలేకపోయాడు. వారు ఇకమీదట దేవునికి స్నేహితులుగా ఉండలేరు. వారు దిగంబరులుగా ఉన్నందున సిగ్గుతో అంజూరపు ఆకులతో వస్త్రాలు చేసుకుని ధరించారు. వారి అవిధేయతను బట్టి దేవుడు వారిని ఏ విధముగా శిక్షించాడు అనేది వచ్చేవారం తెలుసుకుందాము.
సందేశము
సాతాను తాను చేయాలనుకున్నది చేసి దేవునికి, ఆదాము హవ్వలకు మధ్య ఉన్న సంబంధాన్ని పాడుచేసాడు. వారి పరిస్థితి ఎలా ఉందో ఊహించండి! ఆజ్ఞను అతిక్రమిస్తే ఆత్మీయంగా చనిపోతారు అని దేవుడు ముందుగా చెప్పినట్లుగానే వారికి జరిగింది. ఆదాము హవ్వలు పాపము చేసి పాపులుగా మారిపోయారు గనుక వారి సంతానము అంతా పాపులుగానే జన్మిస్తారు. ఈ లోకములోని వారందరూ ఆదాము హవ్వలవలె ఆత్మీయంగా మృతి పొందిన వారు గానే ఉన్నారు. చిన్నపిల్లలు కూడా అబద్ధాలు చెప్తూ, అల్లరి పనులు చేస్తూ, కోపంతో, అవిధేయులుగా ఉంటారు. వారు పాపముతో నిండిన హృదయాలతోనే జన్మిస్తారు గనుక అలా ప్రవర్తిస్తుంటారు.
అన్వయింపు
మనము చెడు పనులు చేయకుండా, నిజమైన క్రీస్తు విశ్వాసులముగా ప్రభువును మన హృదయమంతటితో ప్రేమించాలి అని బైబిలు బోధిస్తుంది. దేవుడు ఎంతో దయ కలిగినవాడు గనుక పాపక్షమాపణ కొరకు ఒక మార్గాన్ని ఆయన సిద్ధ పరిచాడు. ప్రభువైన యేసు మాత్రమే పాపములను తొలగించి మన ఆత్మలను తిరిగి జీవింప చేయగలడు. కాని దేవుడు అలా చేయటం సాతానుకు ఇష్టం లేదు. హవ్వను మోసపుచ్చినట్లుగానే సాతాను మనలను కూడా దేవునికి అవిధేయత చూపులాగున మోసపరచడానికి ప్రయత్నిస్తుంటాడు. మనము సాతానును చూడలేకపోయినా, ఎప్పుడూ మనకు దగ్గరలోనే ఉంటాడు(1 పేతురు 5: 8). సాతాను మన చెవిలో మెల్లగా - “ బైబిల్ చదివితే ఏమి ఉపయోగము? టి.వి. లో ఎంత మంచి ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. ఎందుకు ప్రతిరోజు రాత్రి ప్రార్ధన చేసుకుంటావు? అలసిపోయావు కదా పడుకుని నిద్రపో, సండే స్కూల్ కి ఎందుకు పోతున్నావు, స్కూల్ లో ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుంది కదా!” ఇలా ఎన్నో చెప్తుంటాడు. మన జీవితాలలో దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా ఉండులాగున ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంటాడు. మన మనస్సులను చెడు ఆలోచనలతో నింపి పాడు చేస్తుంటాడు. సాతాను మాటలు వినకుండా దేవునికి ఇష్టమైన జీవితాలను కలిగి ఉండుటకు శక్తిని ప్రసాదించమని ప్రభువుకు ప్రార్ధనచేయాలి.
కంఠతవాక్యము
ఒక మనుష్యుని పాపము ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములోనికి ప్రవేశించెను (రోమా 5:12).
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF