నిర్గమ 7:14,10;29; కీర్తన 105: 26-36; 78: 43-51
ఉద్దేశము
దుష్టుల క్రియలు ఏ విధముగా ఉంటాయి అనేది చూపుట. దేవుడు వారిని ఒక దినము తప్పక శిక్షిస్తాడు అని బోధించుట.
ముఖ్యాంశము
ఒక అల్లరి పిల్లవాడు మీ స్నేహితుని వాచ్ తీసుకొని చేతిలో గట్టిగా దాచేసి ఎంత ప్రయత్నించినా ఇవ్వలేదు అనుకుందాం. ఎంత బతిమాలినా కూడా ఇవ్వలేదు అనుకోండి. అప్పుడు మీ స్నేహితుడు ఏమిచేస్తాడు? బలము ఉపయోగించి ఆ పిల్లవాని చేతిలో నుండి తన వాచ్ ను లాక్కుంటాడు. ఫరో రాజు కూడా ఇశ్రాయేలీయులను అదే విధముగా తన అధికారం క్రింద బంధించాడు. ఇశ్రాయేలీయులు పరదేశులు అయినప్పటికీ వారిని తన దేశములోనే దాసులుగా ఉంచుకోవాలి అనుకున్నాడు. తన ప్రజలను పోనిమ్మని ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని మోషే చెప్పినప్పటికి ఫరో అతని మాటలు వినలేదు.
ఇశ్రాయేలీయులను వదిలి పెట్టుటకు దేవుడు ఫరోతో ఎంతో కఠినంగా వ్యవహరించవలసి వచ్చింది. ఫరో మహా శక్తిమంతుడైన ఒక నియంత. తాను చెప్పిన మాటలకు అందరూ తప్పక విధేయత చూపించాలి అనేది అతని కోరిక. అతడు ఎంతో క్రూరమైన గొప్ప పేరుపొందిన రాజు. తనకు బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయులను వదిలిపెట్టడం ఎంతమాత్రం ఇష్టంలేదు. వారిని వదిలి పెట్టుటకు బదులుగా వారి శ్రమలను ఇంకా కఠినతరం చేశాడు. దేవుడు తన మహాశక్తిని ఫరోకు, జనులందరికి ఏ విధముగా తెలియచేశాడు అనే విషయాన్ని ఈరోజు మనము తెలుసుకుందాము (నిర్గమ 9:16). ప్రభువు సర్వశక్తిమంతుడు కనుక సమస్తమును తనకు ఇష్టమైన రీతిగా జరిగించగలడు.
ఐగుప్తు దేశం మీదకు తెగుళ్లు పంపుట ద్వారా ఫరోను శిక్షించాలని దేవుడు అనుకున్నాడు. అవి ఫరో మీద, అతని ప్రజల మీద ప్రభావము చూపించబోతున్నాయి. దేవుడు పది తెగుళ్ళను పంపుట ద్వారా ఫరో గర్వాన్ని అణచివేయాలని అనుకున్నాడు.
పది తెగుళ్ళు
యేటి నీటిని రక్తముగా మార్చుట: (నిర్గమ 7:14- 25) మోషే అహరోనులను నైలు నది ఒడ్డుకు వెళ్ళి ఫరో రాగానే కర్రతో యేటి నీటిని కొట్టుమని ప్రభువు ఆజ్ఞాపించాడు. దేవుడు ఆ నీటిని రక్తముగా మార్చివేశాడు. అప్పుడు యేటిలోని చేపలన్నీ చచ్చిపోయాయి. అప్పుడు ఆ యేటినుండి చెడు వాసన రావడంతో ఐగుప్తీయులు ఆ నీటిని త్రాగలేక పోయారు. వారు వారం రోజుల పాటు వారు కష్టపడ్డారు. కానీ ఫరో ఆ విషయం పట్టించుకోకుండా తన హృదయము కఠినపరచుకున్నాడు.
కప్పలు: (నిర్గమ 8:1-15) మోషే ఫరో దగ్గరకు వెళ్లి - "నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనియ్య నొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలను అప్పల చేత బాధించెదను. యేటిలో కప్పలు విస్తారముగా పుట్టును. అవి నీ ఇంట నీ పడక గదిలోనికి, నీ మంచము మీదికి, నీ సేవకుల ఇండ్ల లోనికి, నీ జనులమీదికి, నీ పొయ్యులలోనికి, నీ పిండి పిసుకు తొట్ల లోనికి ఎక్కి వచ్చును. ఆ కప్పలు నీ మీదికి నీ జనుల మీదికి నీ సేవకులందరి మీదికి వచ్చునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు" అని చెప్పాడు. అహరోను ఐగుప్తు నీటిమీద తన చెయ్యి చాపగానే కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశము కప్పివేశాయి. ఎంత భయంకరం! అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి నా యొద్దనుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని మీ దేవుని వేడుకొనుడి. అప్పుడు ఈ ప్రజలను తప్పక పోనిచ్చెదను అని చెప్పాడు. కానీ ఆ కప్పలు పోగానే ఫరో తన హృదయమును కఠినపరచుకుని వారి మాట వినలేదు.
పేలు: (నిర్గమ 8:16-19) దేవుడు కర్రను పట్టుకుని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టుమని అహరోనుకు చెప్పాడు. అహరోను ఆలాగున చేయగా ఆ ధూళి అంతా పేలుగా మారి మనుష్యులమీద, జంతువులమీద వ్యాపించింది. ఐగుప్తు ప్రజలు ఆ పేలవలన ఎంతో బాధపడ్డారు. ఐగుప్తు దేశములోని శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పారు. కానీ ఫరో హృదయము కఠినమైనందున అతడు వారి మాట వినలేదు.
ఈగలు: (నిర్గమ 8:20-32) మోషే ప్రొద్దున లేచి యేటి దగ్గర ఫరోను కలుసుకున్నాడు. ఇశ్రాయేలీయులను పంపని యెడల ఈగల గుంపులను పంపుతాను అని దేవుడు సెలవిచ్చాడు అని ఫరోకు చెప్పాడు. బాధకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇండ్లలోనికి వ్యాపించాయి. కానీ ఆ ఈగలు గుంపులు ఇశ్రాయేలీయుల ఇళ్లలోనికి రాలేదు. ఫరో మోషే అహరోనులను పిలిపించి ఈగలు పోవునట్లు వారి దేవుని వేడుకొనుమని చెప్పాడు. ఆ ఈగలు పోయిన వెంటనే ఫరో తిరిగి తన మనసును కఠినం చేసుకున్నాడు.
పశువుల మీదకు మరణము ( నిర్గమ 9:1-7) పొలములో నున్న పశువులు గుఱ్ఱములు గాడిదలు ఒంటెలు గొర్రెల మీదికి తెగులు రాబోతున్నది అని హెచ్చరించుటకు దేవుడు మోషే అహరోనులను ఫరో దగ్గరకు పంపాడు. మరునాడు దేవుడు హెచ్చరిక చేసిన విధముగానే తెగులు వలన ఐగుప్తీయుల పశువులు జంతువులు అన్నీ చచ్చిపోయాయి. కానీ ఇశ్రాయేలీయుల పశువులలో ఒక్కటి కూడా చావలేదు. అది చూసిన తరువాత కూడా ఫరో హృదయకాఠిన్యములో ఎటువంటి మార్పులేదు.
దద్దురులు,పొక్కులు:( నిర్గమ 9:8-12) చేతినిండా ఆవపు పొడి తీసికొని ఆకాశమువైపు చల్లుమని దేవుడు మోషేకు చెప్పగా అతడు ఆలాగుననే చేసాడు. అప్పుడు అది సన్నటి ధూళిగా మారి ఐగుప్తు దేశమంతట మనుష్యుల మీదను, జంతువుల మీదను పొక్కులు దద్దురులుగా మారిపోయింది. అది వారికి ఎంతో బాధ, నొప్పి కలిగించింది. ఆ దద్దురులు, పొక్కుల వలన వారు ఎంతో కష్టపడ్డారు. అయినప్పటికీ ఫరో హృదయము కఠినంగానే ఉంది గనుక ఇశ్రాయేలీయులను పోనీయలేదు .
వడగండ్లు: (నిర్గమ 9:13-35) ఇశ్రాయేలీయులను పోనివ్వని యెడల దేవుడు బాధాకరమైన వడగండ్ల కురిపిస్తాడు అని మోషే ఫరోతో చెప్పాడు. ఫరో ప్రజలలో ప్రభువుమాట నమ్మినవారు తమ పశువులను, సేవకులను ఇండ్లలోనికి త్వరగా రప్పించుకున్నారు. దేవుడు ఉరుములు వడగండ్లు కలుగచేయగా పిడుగులు భూమిమీద పడసాగాయి. ఐగుప్తుమీద వడగండ్లు కురిసాయి. అటువంటి పిడుగులతో కలసిన వడగండ్లు వారు అంతవరకు ఎన్నడూ చూడలేదు. ఇంటిబయట, పొలములో ఉన్న ప్రతి మనుష్యుడు జంతువు చనిపోయాయి. కూర మొక్కలు కూడా నశించిపోయాయి. ఫరో తిరిగి మోషే అహరోనులను పిలిపించి - "నేను ఈ సారి పాపము చేసియున్నాను, దేవుడు న్యాయవంతుడు. నేను, నా జనులు దుర్మార్గులము. ఇంత మటుకు చాలును. ఇకను బ్రహ్మాండమైన ఉరుములు, వడగండ్లు రాకుండునట్లు ప్రభువును వేడుకొనుడి. మిమ్మును పోనిచ్చెదను . మిమ్మును ఇకను నిలుపను" అని చెప్పాడు. అయితే ఫరో ఎప్పటివలె వర్షము వడగండ్లు ఉరుములు నిలిచిపోవటం చూచి ఇంకను పాపము చేయుచు తన హృదయమును కఠినపరచుకుని వారిని పోనీయలేదు.
మిడతలు ( నిర్గమ.10:1-20) తరువాత రాబోవు తెగులు గురించి ఫరోకు తెలియజేయుటకు దేవుడు మోషే అహరోనులను పంపాడు. మిడతలు ఐగుప్తుదేశము కప్పేస్తాయి అని వారు ఫరోకు చెప్పారు. మోషే తన చేతిని ఐగుప్తు దేశము మీదికి చాపిన వెంటనే మిడతలు ఐగుప్తును కమ్మివేశాయి. ప్రభువు ఆ పగలు, రాత్రి అంతా ఆ దేశం మీద తూర్పు గాలిని విసరునట్లు చేయగా ఆ గాలికి మిడతలు వచ్చాయి. ఆ దేశపు కూరగాయల నన్నిటిని, వృక్ష ఫలముల నన్నిటిని ఆ మిడతలు తిని వేశాయి. ఆ మిడతల దండు వలన దేశమంతటా చీకటి కమ్మివేసింది. ఫరో మోషే అహరోనులను పిలిపించి, తన పాపములను క్షమించి ఆ మిడతలను తొలగించుమని మీ దేవుని వేడుకొనుడి అని చెప్పాడు. ఆ మిడతల దండును దేవుడు ఎర్ర సముద్రములో పడవేయగానే ఫరో తిరిగి తన హృదయమును కఠినపరచుకుని ఇశ్రాయేలీయులను పోనివ్వలేదు.
చీకటి: (నిర్గమ.10:21- 29) దేవుడు తిరిగి మోషేతో ఐగుప్తు దేశము మీద చేయి చాపుమని చెప్పగా అతడు అలాగుననే చేశాడు. అప్పుడు ఐగుప్తు దేశము మీద చేతికి తెలియునంత చీకటి కమ్మింది. ఐగుప్తు దేశము మూడు దినములు గాఢాంధకారముతో నిండిపోయింది. ఆ మూడు దినములు వారు ఒకరినొకరు గుర్తు పట్టలేకపోయారు. వారు తమ చోటునుండి లేవలేక పోయారు. ఫరో మరల మోషే అహరోనులను పిలిపించి చీకటిని పోగొట్టుమని చెప్పాడు. ఇశ్రాయేలీయులలో కొందరు మాత్రమే బలి అర్పించుటకు వెళ్ళవచ్చు అని ఫరో చెప్పాడు. మోషే అహరోనులు ఫరోతో లేదు అందరము వెళ్ళవలసిందే అని చెప్పగా ఫరో తిరిగి తన హృదయమును కఠినపరచుకుని ఇశ్రాయేలీయులను పోనివ్వలేదు.
జ్యేష్ఠ సంతానం మరణించుట: ఈ తెగులు గురించి వివరంగా వచ్చేవారం తెలుసుకుందాం. ఈ తెగులు ద్వారా ఫరో కఠినత్వాన్ని ప్రభువు ఏ విధముగా శిక్షించి తన ప్రజలను విడిపించాడో చూద్దాము.
సందేశము
ఫరో రాజుకు, సృష్టికర్త అయిన దేవునికి మధ్య ఎన్నో రోజులు ఈ విధముగా సంఘర్షణ జరిగింది. ఫరో హృదయము కఠినమాయెను అని బైబిల్ లో వ్రాయబడింది. అనేకమైన తెగుళ్ళను దేవుడు పంపినప్పటికి, ఫరో హృదయము ఇంకా కఠినంగా మారింది. నిజ దేవుని మాటలు వినాలని, విధేయత చూపాలని ఫరో అనుకొనలేదు. కొన్నిసార్లు నటించినప్పటికి, నిజమైన పశ్చాత్తాపము ఫరోకు కలుగలేదు. బైబిల్ లో ఇటువంటివారు ఎంతోమంది ఉన్నారు.సౌలు రాజు కూడా పశ్చాత్తాప పడినట్లు చెప్పినప్పటికి, తరువాత ఎంతో క్రూరమైన కార్యాలు జరిగించాడు. ప్రభువైన యేసు శిష్యులలో ఒకడైన యూదా కూడా పశ్చాత్తాప పడినట్లు అనిపించినా అది యదార్థమైనది కాదు అని బైబిల్ ద్వారా మనము గ్రహించగలము (మత్తయి. 27:4-5). వీరుకూడా ఫరో వంటివారు అని మనము తలంచవచ్చు.
అన్వయింపు
ఈరోజు ప్రపంచంలో దేవుడిని విశ్వసించని దుష్ట ప్రజలు ఎంతోమంది ఉన్నారు. గొడవలు,హత్యలు ,పోట్లాటలు ఇలా ఎన్నో విషయాలను గురించి టి.వి. లో మనము చూస్తుంటాము. కానీ దేవుడు అందరిని అన్నింటిని చూస్తున్నాడు అనే విషయం మరచిపోకూడదు. ఐగుప్తీయుల మీదకు, ఫరో మీదకు పంపిన విధముగా భయంకరమైన తెగుళ్లు ఈ దినాలలో దేవుడు మనమీదకు పంపించకపోయినా తనకు అవిధేయులైన వారికి శిక్ష, తీర్పు ఉంటాయి అని బైబిల్ చెప్తుంది (2థెస్స.1:8,9).
ప్రతి చెడ్డ వ్యక్తి మీలాగే చిన్నపిల్లవాడుగా ఉండి ఉంటాడు. అల్లరి చేస్తూ, గొడవలు పెట్టుకుంటూ, ఇతరులను ఎగతాళి చేస్తూ పెరిగి ఉంటారు. వారు పెద్దవారైనప్పుడు ఇంకా చెడ్డవారుగా మారుతుంటారు. వారు దేవునికి ప్రార్ధించి పాప క్షమాపణ పొందకపోతే వారిలో ఎటువంటి మార్పు ఉండదు. పాపము దేవునికి కోపము కలిగిస్తుంది అనే విషయము మరచిపోకూడదు. మనము దేవుని క్షమాపణ పొందినవారము అయిన ఎడల ఇతరుల కొరకు ప్రార్ధించాలి. దుష్టులు కూడా పాపక్షమాపణ పొంది మంచివారుగా మారటం ఎంత సంతోషకరం! బైబిల్ లో మనషే అను రాజు ఎంతో చెడ్డవాడుగా ఉన్నప్పటికీ చివరకు తన్ను తాను తగ్గించుకుని కన్నీటితో ప్రార్థించగా దేవుడు అతనిని క్షమించి జవాబు ఇచ్చినట్లు చూడగలము (2ది.వృ.33:12-13). మనలో కూడా ఎంత చెడుతనము ఉన్నప్పటికీ పశ్చాత్తాపముతో ప్రార్ధించినప్పుడు ఆయన మన ప్రార్ధన వింటాడు.
కంఠతవాక్యము
"సమస్త భూమిలో నావంటి వారెవరును లేరని నీవు తెలిసి కొనవలెను" అని దేవుడు చెప్పెను. నిర్గమ 9:14
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF