1 సమూయేలు 2,3 అధ్యాయాలు
ఉద్దేశము
దేవుడు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినటం చాలా ముఖ్యము అని బోధించుట.
ముఖ్యాంశము
మీరు ఎప్పుడైనా హాస్టల్ లో ఉండి చదువుకున్నారా? చాలామంది మంచి చదువుల కోసం తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్ లో ఉండి చదువుకుంటారు. అక్కడే ఉండి చదువుకుంటూ సెలవులు వచ్చినప్పుడు ఇంటికి వెళ్తుంటారు. కాని చాలా మంది పిల్లలకు తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్ లో ఉండి చదవడం ఇష్టం ఉండదు. గతవారం సమూయేలు గురించి చూసాము . అతడు బాలుడుగా ఉన్నప్పుడే షిలోహులో ఉన్న దేవుని మందిరములో పరిచర్య చేయుటకు వెళ్లాడు. అతని తల్లిదండ్రులు సంవత్సరమునకు ఒకసారి వెళ్లి సమూయేలును చూసేవారు.
గతవారము
సమూయేలు తల్లి హన్నా ఎందుకు దుఃఖంతో ఉండేది? హన్నాకు పిల్లలు లేనందున ఆమె సవతి అయిన పెనిన్నా ఎగతాళి చేస్తూ కోపము పుట్టించేది. ప్రతి సంవత్సరము కుటుంబంతో కలిసి ఎల్కానా షిలోహు లోని దేవుని మందిరమునకు వెళ్లే సమయంలో పెనిన్నా ఇంకా ఎక్కువగా హన్నాను విసిగిస్తుండేది. ఒకసారి హన్నా దేవుని సన్నిధిలో ఎంతో దుఃఖముతో కుమారుని అనుగ్రహించమని ప్రార్ధించింది. ఆ కుమారుని దేవుని ఆలయంలో పరిచర్య కోసం ప్రతిష్టిస్తాను అన్నీ దేవునికి మ్రొక్కుబడి చేసుకుంది. దేవుడు హన్నా ప్రార్థన ఆలకించి కుమారుని అనుగ్రహించాడు. సమూయేలు బాలుడిగా ఉండగానే ఆలయమునకు తీసుకొని వెళ్లి యాజకుడైన ఏలీకి అప్పగించింది. హన్నాకు దేవుడు ఇంకా ఐదు మంది పిల్లలను దయ చేసాడు. హన్నా హృదయం దేవుని యెడల ఎంతో కృతజ్ఞతతో నిండిపోయింది.
బాలుడైన సమూయేలు ఆలయములో పెరుగుట
తల్లిదండ్రులను వదిలి పెట్టి ఆలయములో ఉండటం సమూయేలుకు మొదట క్రొత్తగా అనిపించి ఉండవచ్చు. తాను కన్నీటితో దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన వలన సమూయేలు జన్మించినట్లు హన్నా చెప్పి ఉండవచ్చు. హన్నా దేవునికి మ్రొక్కుబడి చేసికొని నట్లు తాను దేవుని ఆలయంలో ఉండి పరిచర్య చేయడం మంచిది అని సమూయేలు అర్థం చేసుకొని ఉండవచ్చు. అతడు సంతోషంగా ప్రభువు చెప్పిన పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఆ దినములలో ఇశ్రాయేలీయులకు ఏలీ న్యాయాధిపతిగా ఉన్నాడు. అతడు దేవుని ఆలయంలో యాజకుడిగా కూడా ఉన్నాడు. ఏలీ వయస్సు అప్పటికి 98 సంవత్సరాలు (4:15). అతడు స్థూలకాయముతో బరువుగా ఉండే వాడు. అంతేకాక కళ్ళు కూడా సరిగా కనిపించేవి కాదు. సమూయేలు ఏలీకి ఎంతో సహాయకరంగా ఉంటూ పరిచర్య చేస్తున్నాడు. సమూయేలు ఉత్సాహంగా అటూ ఇటూ తిరుగుతూ, ఏలీ చెప్పిన పనులు చేస్తూ ఉండి ఉండవచ్చు. దేవుని ఆలయంలో దీపమును వెలిగించడం, ఉదయం ఆలయము యొక్క తలుపులు తెరవడం ఇలా ఎన్నో పనులు ఏలీ సమూయేలుకు నేర్పుతూ ఉండి ఉండవచ్చు. సమూయేలు ఖచ్చితంగా ఏలీకి ఎంతో సహాయపడి ఉంటాడు.
ఏలీ కూడా సమూయేలుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉండి ఉంటాడు. దేవుని వాక్యమును ఏలీ సమూయేలుకు నేర్పించి ఉంటాడు. అబ్రాహాము,ఇస్సాకు,యాకోబు,యోసేపు,మోషే,యెహోషువ ఇలా గొప్ప విశ్వాసులను గురించి చెప్పి ఉండవచ్చు. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాలను, వారి యెడల చేసిన గొప్ప కార్యాలను సమూయేలు ఎంతో శ్రద్ధగా విని, తాను కూడా దేవునికి సంతోషాన్ని కలిగించే విధంగా జీవించాలి అని నేర్చుకుని ఉంటాడు.
దేవుని ఆలయము ఆ సమయములో ఒక గుడారము వలె ఉండేది. దానిని ప్రత్యక్షపు గుడారము అని పిలిచేవారు. అందులో బంగారుతో చేయబడిన నిబంధన మందసము ఉండేది. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు దీనిని తయారు చేశారు. వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రత్యక్షపు గుడారమును చుట్టి యాజకులు దానిని మోసేవారు. యొర్దాను నదిని దాటినప్పుడు కూడా యాజకులు నిబంధన మందసమును మోసినట్లు బైబిల్ లో వ్రాయబడింది. తరువాత షిలోహులో వారు ఆ ప్రత్యక్షపు గుడారమును ఉంచారు. ఇశ్రాయేలీయులు అందరూ ప్రతి సంవత్సరము షిలోహులో నున్న ప్రత్యక్షపు గుడారమునకు వచ్చి దేవుని ఆరాధించి వెళ్ళేవారు.
ఏలీ కుమారుల చెడుతనము
ఏలీ కుటుంబములోని దుఃఖకరమైన విషయము గురించి మనము తెలుసుకోవాలి. ఏలీ ప్రధానయాజకుడు గా ఉన్నప్పటికి ఆయన కుమారులు హోప్నీ ఫీనెహాసులు చాలా చెడ్డవారుగా జీవించేవారు. వారు ఆలయంలో పరిచర్య చేస్తున్నప్పటికి వారి చెడుతనము ఎంతో భయంకరమైనదిగా ఉండేది. వారు ఇశ్రాయేలీయులు ప్రభువుకు అర్పించు అర్పణలలో మంచి వాటిని తీసుకునేవారు. అంటే దేవుని అర్పణలను వారు దొంగతనం చేసే వారుగా అనుకోవచ్చు. ప్రజల నుండి వీలైనంత ఎక్కువగా బలవంతము చేసి తీసుకునేవారు. అంటే దేవుని ఆజ్ఞలను కట్టడలను అన్నింటిని అతిక్రమించే వారు. వారిని చూచి ఏలీ దేవుడు మిమ్మును తప్పక శిక్షిస్తాడు అని హెచ్చరించాడు. వారు తమ తండ్రి మాటలు వినకుండా తమ చెడు మార్గములలోనే నడువసాగారు. ఏలీ తన కుమారులను దేవుని ఆలయము నుండి బయటకు పంపి వేయవలసింది కానీ అలా చేయలేక పోయాడు.
ఒక దినము ప్రభువు నీవు నీ కుమారులను సరిదిద్దకుండా వారిని నా కంటె గొప్ప చేయుచున్నావు అని ఏలీపై కోపగించాడు. ఏలీని, అతని కుమారులను శిక్షించి వారిని యాజకులుగా ఉండకుండా తీసి వేస్తాను అని దేవుడు హెచ్చరించాడు. అంతేకాక వారి స్థానంలో ఒక నమ్మకమైన యాజకుని నియమిస్తాను అని చెప్పాడు.
దేవుడు సమూయేలును పిలుచుట
ఒక రోజు రాత్రి సమూయేలు నిద్రిస్తున్న సమయంలో ప్రభువు సమూయేలు తో మాట్లాడాడు. అది అర్ధరాత్రి సమయము దాటి ఉండవచ్చు. ఆలయములోని దీపం ఆరిపోయే సమయమందు దేవుడు మాట్లాడాడు. ప్రభువు సమూయేలును పిలువగా సమూయేలు - "చిత్తమండి నేనున్నాను అని చెప్పి ఏలీ దగ్గరకు వెళ్ళాడు. ఏలీకి కన్నులు కనపడనందు వలన సమూయేలు అతనికి సహాయ పడుతూ ఉండేవాడు. రాత్రి సమయంలో సమూయేలు నిద్ర పోతున్నట్లు నటించి ఉండవచ్చు కాని అతడు దేవుని పరిచర్య చేయడానికి ఎంతగానో ఇష్టపడేవాడు. సమూయేలు వెళ్ళినప్పుడు ఏలీ -</"నేను పిలువలేదు పోయి పండుకొమ్ము" అని చెప్పాడు.
రెండవసారి కూడా దేవుడు సమూయేలును పిలువగా సమూయేలు మరలా ఏలీ దగ్గరకు వెళ్ళాడు. తిరిగి వెళ్ళి పడుకోమని ఏలీ చెప్పాడు. మూడవసారి ప్రభువు సమూయేలును పిలిచినప్పుడు సమూయేలు మరలా ఏలి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు ఏలీ ప్రభువు సమూయేలును పిలుస్తున్నట్లు గ్రహించాడు. ఏలీ సమూయేలుతో - "నీవు పోయి పండుకొమ్ము. ఎవరైనా నిన్ను పిలిచిన యెడల-"ప్రభువా నీ దాసుడు ఆలకించు చున్నాడు ఆజ్ఞ ఇమ్ము" అని చెప్పమన్నాడు. సమూయేలు పోయి తన స్థలమందు పడుకున్నాడు. సమూయేలు తిరిగి ఆ స్వరం కొరకు ఎదురు చూస్తూ ఉండి ఉండవచ్చు. పరిశుద్ధమైన దేవుని స్వరము వినడానికి, భయముతో, శ్రద్ధతో ఎదురు చూస్తున్నాడు.
దేవుడు జరుగబోవు సంగతులను సమూయేలుకు తెలుపుట
తరువాత ప్రభువు ప్రత్యక్షమై నిలిచి ముందు మాదిరిగానే - "సమూయేలూ సమూయేలూ అని పిలువగా సమూయేలు -"నీ దాసుడు ఆలకించు చున్నాడు ఆజ్ఞ ఇమ్ము" అని చెప్పాడు. సమూయేలు ప్రభువు పలుకుతున్న ప్రతి మాటను శ్రద్ధగా వినసాగాడు. దేవుడు ఒక బాధాకరమైన విషయాన్ని సమూయేలుకు చెప్పసాగాడు. ప్రభువు సమూయేలుతో - "తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులు గా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలీ ఇంటివారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికిని ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణ పూర్వకముగా ఆజ్ఞాపించితిని" అని చెప్పాడు. సమూయేలు ఉదయమే లేచి దేవుని మందిరపు తలుపులు తీశాడు కాని తనకు కలిగిన దర్శనము గురించి ఏలీతో చెప్పడానికి భయపడ్డాడు.
ఏలీ సమూయేలు ను పిలిచి - " నీతో ప్రభువు ఏమి సెలవిచ్చెనో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీకు సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసిన యెడల అంతకంటె అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయును గాక" అని చెప్పాడు. అప్పుడు సమూయేలు దేవుడు తనకు తెలియజేసిన సంగతులు అన్నింటిని ఏలీకి చెప్పాడు. తన కుమారుల చెడుతనము దేవునికి కోపము కలిగించింది అని ఏలీ గ్రహించాడు. ఏలీ అన్నింటిని వినిన తరువాత -"సెలవిచ్చిన వాడు ప్రభువు తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయును గాక" అన్నాడు.
దేవుని మందసము
ఆ సమయములో ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేస్తూ ఆ యుద్ధములో ఓడిపోసాగారు. అప్పుడు ఇశ్రాయేలీయులు షిలోహులోని దేవుని నిబంధన మందసము తీసుకుని తమ మధ్యలో ఉంచుకోవాలి అని నిర్ణయించుకున్నారు. అలా చేస్తే యుద్ధములో తమకు విజయము కలుగుతుంది అని అనుకున్నారు. మందసము వలన తమకు అదృష్టం కలుగుతుంది అని వారి నమ్మకం. వారు సహాయము కొరకు దేవునికి ప్రార్థన చేయుటకు బదులు మందసము వలన విజయం దొరుకుతుంది అని ఆశ పడసాగారు. ఏలీ వారి ఆలోచనను ఆపి వేయడానికి బదులుగా తనకు కుమారులైన హోప్నీ, ఫీనెహాసులతో మందసమును యుద్ధభూమికి పంపించారు.
నిబంధన మందసము అక్కడకు రాగానే ఇశ్రాయేలీయులు పెద్ద కేకలు వేయసాగారు కాని ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయారు. ఇశ్రాయేలీయులు తమ దేవునికి దూరమై నందున ఆయన వారికి విజయము కలుగ చేయలేదు. ఫిలిష్తీయులు ఏలీ ఇద్దరు కుమారులను ఒక్క రోజే చంపివేసి మందసమును పట్టుకున్నారు.
ఏలీ యుద్ధము గురించి మందసము గురించి దుఃఖిస్తూ ఆసనము మీద కూర్చుండి ఎదురుచూస్తుండగా ఒక వ్యక్తి యుద్ధభూమి నుండి తప్పించుకొని ఏలీ దగ్గరకు వచ్చాడు. అతడు వచ్చి - "ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలువలేక పారిపోయిరి. జనులలో అనేకులు హతులైరి హోప్నీ, ఫీనెహాసు అను నీ ఇద్దరు కుమారులు మృతులైరి. మరియు దేవుని మందసము పట్టబడెను" అని ఏలీతో చెప్పాడు. దేవుని మందసము పట్టబడిన మాట వినిన వెంటనే 98 సంవత్సరముల ఏలీ పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు.
సమూయేలును దేవుడు ప్రవక్తగా న్యాయాధిపతిగా ఏర్పరచనైయున్నాడని ఇశ్రాయేలీయులందరు గ్రహించారు. ప్రభువు సమూయేలుకు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉండేవాడు. అతడు ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా న్యాయాధిపతిగా యాజకునిగా దేవుని చేత నియమించబడ్డాడు.
సందేశము మరియు అన్వయింపు
సమూయేలు జీవితము నుండి ఈ రోజు మనము ఏమి నేర్చుకొనగలమో చూద్దాము.
- ప్రభువు ప్రత్యక్షము కాకముందే సమూయేలు ఆయనకు ప్రీతికరంగా జీవించటానికి ప్రయాసపడే వాడు. సమూయేలు వినయముతో, విధేయతతో సంతోషంగా ఉండేవాడు. మనము కూడా క్రైస్తవులముగా జీవించాలి అంటే ప్రభువుకు విధేయులై సంతోషంగా ఉండాలి.
- ప్రభువు సమూయేలుకు ప్రత్యక్షమై తన స్వరాన్ని వినిపించాడు. ఇప్పుడు మనము దేవుని స్వరాన్ని బైబిల్ ద్వారా వినగలము. సమూయేలు బాలుడిగా ఉన్నప్పుడే ప్రభువును తెలుసుకున్నాడు. బైబిల్ లో కూడా చాలామంది యౌవనస్తులుగా, బాలురుగా ఉన్నప్పుడే ప్రభువును తెలుసుకున్నారు.ఉదా - దానియేలు ,యోసేపు, దావీదు, తిమోతి. మేము చాలా చిన్నవారము గనుక దేవుని గురించి తెలుసుకొనవలసిన అవసరము లేదు అని అనుకొన కూడదు. ప్రభువైన యేసు చిన్నపిల్లలను తన యొద్దకు రమ్మని పిలిచాడు.
- ప్రభువు తనతో మాట్లాడిన విషయాలన్నింటినీ సమూయేలు శ్రద్ధగా విన్నాడు. బైబిల్ లోని విషయాలు దేవుడు మన కోసం వ్రాయించినవి అని విశ్వసించి శ్రద్ధతో విని, విధేయత చూపాలి ప్రభువైన యేసును రక్షకునిగా అంగీకరించటం ప్రపంచంలో అన్నిటికంటే అద్భుతమైన విషయం. ముందుగా మన హృదయాలు ఎంతో మోసకరమైనవి అని మనము గుర్తించాలి. మన పాపములు క్షమించ బడి మన హృదయాలు నూతన పరచబడే వరకు దేవునికి ప్రార్ధించాలి. ఆయన మన పాపములను క్షమించినప్పుడు మన హృదయాలు సంతోషంతో, సమాధానముతో నింపబడతాయి. మనము ఆయన వారసులుగా, పిల్లలుగా జీవించగలము. మనము కూడా సమూయేలు వలె ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్ము అని చెప్పగలగాలి. అప్పుడు ఆయన మనతో మాట్లాడుతాడు
కంఠతవాక్యము
"ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్ము అని చెప్పెను"(1 సమూయేలు 3:9)
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF