నిర్గమ.32; కీర్తన 78

ఉద్దేశము
మన జీవితాలలో మొదటి స్థానం దేవునికి తప్ప మరి దేనికి గాని , ఎవరికి గాని ఇవ్వకూడదు అని బోధించుట.

ముఖ్యాంశము
పేపర్ లో ఏదైనా పజిల్ చేసి పంపించి దానికి రావలసిన బహుమనం కోసం మీరు ఎదురుచూస్తున్నారు అనుకోండి. ఎప్పుడు ఆ బహుమతి వస్తుందా అని కొరియర్ కోసం చూస్తుంటారు. కొన్నివారాలు ప్రతిరోజు ఎదురు చూస్తారు. తరువాత అసలు బహుమతి వస్తుందా లేదా అనే అనుమానం కలుగుతుంది, ఇంకా కొన్ని వారాలకు దానిని గురించి ఆశలు వదిలేస్తారు, ఇక రాదు అనే నిర్ణయానికి వస్తారు. ఇశ్రాయేలీయులకు కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైంది. దేవుడు గొప్ప మహిమతో, తేజస్సుతో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినట్లు మనము చూసాము. దేవుడు మోషేను పర్వతం మీదికి రమ్మని పిలువగా మోషే ఇశ్రాయేలీయులను చూసుకునే బాధ్యతను అహరోనుకు అప్పగించి పర్వతము మీదికి వెళ్ళాడు. రోజులు, వారాలు గడుస్తున్నా మోషే పర్వతము దిగి రాలేదు. ఇశ్రాయేలీయులు ఎదురు చూసి చూసి విసిగిపోయారు. మోషేకు ఏమి జరిగిందో వారికి అర్థం కాలేదు.

అహరోను విగ్రహమును తయారు చేయుట
మోషే పర్వతముమీద దేవుని సన్నిధిలో 40 పగళ్ళు 40 రాత్రులు గడిపాడు. దేవుడు రెండు రాతి పలకల మీద పది ఆజ్ఞలు తన చేతితో వ్రాశాడు. అంతేకాకుండా ప్రత్యక్షపు గుడారము ఏ విధముగా తయారు చేయాలి అనే విషయం కూడా వివరించాడు. విశ్వాసముతో ఇశ్రాయేలీయులు మోషే కొరకు ఎదురు చూడలేకపోయారు. ఎప్పటివలె సణగడం మొదలుపెట్టారు.

వారు అహరోను దగ్గరకి వచ్చి - "లెమ్ము మా ముందర నడచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు" అని చెప్పారు. కొన్ని వారాల క్రిందట దేవుడు తన పది ఆజ్ఞలను మోషే ద్వారా వారికి వివరించాడు. వాటిలో మొదటి ఆజ్ఞ- ``నేను తప్ప మరొక దేవుడు మీకుండకూడదు''. రెండవది -'' మీరు ఎటువంటి విగ్రహములను చేసికొనకూడదు''. వారు దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుతాము అని మోషేకు చెప్పారు. కాని ఇప్పుడు తమకొరకు ఒక దేవతను చేయుమని అహరోనును అడుగుతున్నారు. వారు తాము ఇచ్చిన మాటను ఎంత త్వరగా మరిచిపోయారు! వారు అంత చెడ్డగా ఎలా మారిపోయారు? ఐగుప్తు చెరలో నుండి విడిపించి, ఎర్ర సముద్రము దాటించి, వారి అవసరాలను అన్నింటినీ తీరుస్తున్న ప్రభువుకు వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేస్తున్నారు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బాగా చదివించి, అన్నీ సమకూర్చి పెద్దవారిని చేసిన తరువాత మీరు అకస్మాత్తుగా వచ్చి నేను మా స్నేహితులతో కలిసి ఉంటాను మీతో నాకు సంబంధం లేదు అని చెప్తే వారికి ఎలా అనిపిస్తుంది! వారు ఎంత బాధ పడతారు. ఇశ్రాయేలీయులను చూచిన దేవునికి బాధతో పాటు కోపం కూడా వచ్చింది.

ఇశ్రాయేలీయులు తమ కొరకు విగ్రహం చేయమని అడిగిన వెంటనే అహరోను వారిని నివారించవలసింది, కాని అహరోను కూడా వారి ఆలోచనకు అంగీకరించాడు. వారు అనేకమంది ఉన్నందున అహరోను వారికి భయపడి ఉండవచ్చు.

అతడు మంచి నాయకుడు కాదు. అహరోను ఇశ్రాయేలీయులతో "మీ భార్యలకు మీ కుమారులకు కుమార్తెలకు చెవుల నున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండి" అని చెప్పాడు. ఐగుప్తీయుల దగ్గర వారు దోచుకొనిన బంగారం ఎంతో విస్తారముగా వారి దగ్గర ఉంది. వారందరూ తమ చెవుల నుండి బంగారు పోగులను అహరోను దగ్గరకు తీసుకుని పోయి ఇచ్చారు. అహరోను వాటిని తీసికొని అగ్నిలో కరిగించి, పనిముట్లతో దూడ ఆకారమును పోతపోశాడు. ఆ బంగారం తో వారికి ఒక దూడని తయారుచేశాడు. ఇశ్రాయేలీయులు ఆ దూడను చూచి - ``ఓ ఇశ్రాయేలూ,ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇదే'' అని చెప్పారు. దేవుడు తమపట్ల చేసిన కార్యాలు అన్నింటిని చూసిన తరువాత కూడా వారు ఆ విధంగా ప్రవర్తించడం ఎంత భయంకరం! అహరోను ఆ దూడ ఎదుట ఒక బలిపీఠము కట్టించి మరుసటి రోజు ప్రభువుకు పండుగ జరుగుతుంది అని చాటించాడు. వారు ఉదయమున లేచి దహనబలులను సమాధాన బలులను అర్పించారు. తరువాత వారు తినుటకు త్రాగుటకు కూర్చుంది ఆడుటకు మొదలుపెట్టారు. తాము కోరుకున్నట్లుగానే బంగారు దూడ తమ ముందు ఉండుట వారికి ఎంతో సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగించి ఉండవచ్చు. వారు దేవుని ఆజ్ఞలను లెక్క చేయలేదు. వారు తమ పాపకార్యముల నుండి బయటకు రాకుండా అలాగే కొనసాగాలి అని నిశ్చయించుకున్నారు.

దేవుడు మోషేతో మాటలాడుట
మోషే ఇంకను పర్వతముపై దేవుని సన్నిధి లోనే ఉన్నాడు. క్రింద జరుగుతున్న విషయాలేమీ మోషేకు తెలియదు కాని ప్రభువు సమస్తము ఎరిగియున్నాడు. అప్పుడు దేవుడు క్రింద ఇశ్రాయేలీయులు చేస్తున్న పనులన్నింటిని గురించి మోషేకు వివరించాడు. వారిపై తన కోపము మండుతుంది అని మోషేతో చెప్పాడు. ఐగుప్తులో దేవుడు వారికి చేసిన గొప్ప కార్యములు ఆశ్చర్యకార్యములను ఇశ్రాయేలీయులు మరిచిపోయి కృతజ్ఞత లేనివారుగా ఉండి తమ క్రియల చేత దేవునికి కోపము పుట్టించారు అని బైబిల్ లో వ్రాయబడింది(కీర్తన 106 :19- 23). ఇశ్రాయేలీయులు లోబడ నొల్లని ప్రజలు గనుక వారిని కాల్చి వేస్తాను అని ప్రభువు మోషేతో చెప్పాడు. అప్పుడు మోషే వారిని చంపవద్దని ప్రభువును బ్రతిమాలాడు. దేవుని సేవకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను గుర్తు చేసుకొనుమని బ్రతిమాలాడు. ఆకాశ నక్షత్రముల వలె వారి సంతానమును విస్తరింపచేసి కనాను దేశమును స్వాస్త్యముగా ఇస్తాను అని ఇశ్రాయేలీయులకు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకొనుమని వేడుకున్నాడు. మోషే మనవిని దేవుడు అంగీకరించి తన కోపమును మానుకుని వారిని నాశనం చేయలేదు. కానీ వారు చేసిన పాపమునకు శిక్ష అనుభవించకుండా వారు తప్పించుకోలేరు.

మోషే కోపగించుకొనుట
మోషే శాసనములు గల రెండు పలకలను చేత పట్టుకుని కొండ దిగి వచ్చాడు. అప్పుడు యెహోషువ మోషేను కలుసుకున్నాడు. యెహోషువ కొండ దగ్గర మోషే కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండవచ్చు. వారు దిగుతున్నప్పుడు పెద్ద కేకలు వారికి వినిపించాయి. అది యుద్ధధ్వని అని యెహోషువ అన్నాడు, కానీ అది సంగీత ధ్వని అని మోషే చెప్పాడు. వారు పాళెమునకు సమీపించగానే జరుగుతున్న విషయాలు తెలిశాయి. బంగారు దూడ, దాని చుట్టూ సంతోషంతో నాట్యమాడుతున్న ఇశ్రాయేలీయులను చూశారు. వారి చెడుతనము అవిధేయత చూచి మోషే కోపం మండిపోయింది. అతడు కొండ దిగువకు దిగివచ్చి దేవుని ఆజ్ఞలు వ్రాయబడిన రెండు రాతి పలకలను పడవేసి వాటిని పగులగొట్టాడు. తమ దేవుని మరిచిపోయి, ఆయన మాటలను లక్ష్యపెట్టక విగ్రహాలను చేసుకుని పూజించడం ఎంత గొప్ప పాపం!

శిక్ష
మోషే ఇశ్రాయేలీయులు చేసికొనిన బంగారు దూడ ను తీసికొని అగ్నితో కాల్చి పొడిచేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీయుల చేత త్రాగించాడు. దేవుడు మోషేకు తోడై ఉన్నాడు కనుక అతడు ఇశ్రాయేలీయులకు భయపడలేదు. అతడు మంచి నాయకుడు. తాము పూజించిన విగ్రహాన్ని వారు నీటి వలె త్రాగుతున్నారు, ఎంత భయంకరం! వారు చేసిన భయంకరమైన పాపమునకు వారు తప్పక శిక్ష అనుభవించాలి. వారు పూజించిన విగ్రహము ఎంత వ్యర్థమైనది అని వారు తెలుసు కొనులాగున మోషే ఆ విధముగా చేసి ఉండవచ్చు. ఆ విగ్రహములు వారికి ఏ విధముగా కూడా సహాయము చేయలేవు. అప్పుడు మోషే అహరోనును - "నీవు ఈ ప్రజల మీదికి ఈ గొప్ప పాపము రప్పించునట్లు వారు నిన్ను ఏమి చేశారు?''అని అడిగాడు. అప్పుడు అహరోను మోషేకు కుంటి సాకులు చెప్పసాగాడు. ఈ ప్రజలు దుర్మార్గులు కనుక తమకొరకు విగ్రహము చేయమని అడిగినప్పుడు వారి మాటలు వినవలసి వచ్చింది అని చెప్పాడు. అహరోను ఆ సంఘటనలో తన తప్పు ఎంతమాత్రం లేదు అని, నింద అంతా ఇశ్రాయేలీయుల మీద నెట్టి వేశాడు. తనపై కోపము తెచ్చుకొనవలదు అని మోషేకు చెప్పాడు. తన పొరపాటును ఒప్పుకోవడానికి అహరోను ఏ మాత్రము ఇష్టపడలేదు. ప్రజలు విచ్చలవిడిగా పెరుగుట చూచి మోషే పాళెము యొక్క ద్వారము దగ్గర నిలుచుండి - "ప్రభువు పక్షమున ఉన్నవారందరు నా యొద్దకు రండి'' అని చెప్పాడు. అప్పుడు ఆ బంగారు దూడను పూజించని వారు అనేకులు మోషే దగ్గరకు వచ్చారు. మోషే వారితో "మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకుని పాళెములో ద్వారమునుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని ప్రత్తివాడు తన పొరుగువానిని చంపవలెను అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు" అని చెప్పాడు. ఆ రోజు తాము చేసిన పాపమునకు శిక్షగా ప్రజలలో సుమారు మూడు వేల మంది చనిపోయారు.

మోషే ప్రజల కొరకు ప్రార్ధించుట
మోషే ఇశ్రాయేలీయులతో -"మీరు గొప్ప పాపము చేసితిరి గనుక ప్రభువు వద్దకు కొండ ఎక్కి వెళ్లెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో" అని చెప్పాడు. అప్పుడు దేవుడు మోషేతో నీవు ఇశ్రాయేలీయులను తీసికొని వాగ్దాన దేశమునకు వెళ్లమని చెప్పాడు. దేవుడు వారితో రాను అని కూడా చెప్పాడు. మోషే ఎంతగానో బాధతో, నిరాశతో నిండిపోయాడు. అటువంటి అవిధేయులైన ప్రజలకు నాయకుడిగా ఉండడం మోషేకు ఎంతో కష్టంగా అనిపించింది. మోషే దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీయుల కొరకు ఎంతో భారముతో ప్రార్థించగా దేవుడు దయతో ఆ ప్రార్ధన అంగీకరించాడు. దేవుడు వారిని నాశనము చేయకపోయినా వాగ్దాన భూమికి వారు చేసిన ప్రయాణములో చాలా తెగుళ్లు ఎదుర్కొనవలసి వచ్చింది. వారు చేసిన చెడ్డ పనులకు శిక్షను అనుభవించవలసి వచ్చింది. తరువాత ప్రభువు మరలా రెండు రాతి పలకల మీద పది ఆజ్ఞలు రాసి మోషే చేతికి ఇచ్చాడు. మోషే రెండవ సారి కొండ మీదకు వెళ్ళి దేవుని తో మాట్లాడి తిరిగి వచ్చేవరకు ఇశ్రాయేలీయులు ఎదురుచూస్తూ ఉన్నారు. మోషే వారి దగ్గరకు వచ్చినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించినందువలన అహరోను, ఇశ్రాయేలీయులు మోషే దగ్గరకు వెళ్లడానికి భయపడ్డారు. మోషే దేవుని సన్నిధిలో ఉన్నందువలన అతని ముఖం ప్రకాశించింది.

సందేశము
ఈరోజు ఒక బాధాకరమైన కథను మనము చూశాము. తమ యెడల ఎంతో ప్రేమ చూపి వాగ్దాన భూమికి నడిపిస్తున్న దేవుని మరచి ఇశ్రాయేలీయులు అంత త్వరగా ఎలా మారిపో గలిగారు? వారు బంగారు దూడను పూజించుట చూచి దేవునికి చాలా కోపం కలిగింది. మోషే ఇశ్రాయేలీయులను క్షమించమని దేవునికి ప్రార్థించకపోతే దేవుడు వారిని తప్పక నాశనం చేసి ఉండేవాడు.

అన్వయింపు
మనము ఇశ్రాయేలీయుల వలె బంగారు దూడను పూజింపక పోయినప్పటికి దేవుని ఆజ్ఞను చాలా సులభముగా అతిక్రమిస్తుంటాము. మన స్నేహితులకోసం, అలవాట్ల కోసం, చదువుల కోసం దేవుని నిర్లక్షం చేస్తూ ఉంటాము. చాలా సమయం గేమ్స్,కంప్యూటర్ గేమ్స్ ఆడుతూ దేవునికి కొంచెం సమయం కూడా ఇవ్వలేము. ఇవి మన జీవితాలలో విగ్రహాలుగా మారిపోతాయి. అలా చేసినప్పుడు దేవుడు తప్పక శిక్షిస్తాడు. మన మందరము దేవునికి వ్యతిరేకముగా పాపము చేసిన వారమే, శిక్ష పొందవలసినవారమే. కానీ మనము ఎటువంటి పాపము లేని ప్రభువైన యేసు దగ్గరకు రావాలి. ఆయన మన పాపములు క్షమించి అన్ని విషయములలో తనను పోలి నడుచుకొనునట్లు సహాయము చేస్తాడు. యేసు నందు విశ్వాసము ఉంచినట్లయితే దేవుని యొక్క ఉగ్రతనుండి, శిక్ష నుండి మనము తప్పించుకొన గలము.

కంఠత వాక్యము
ఏ భేదమును లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. (రోమా 3:23)

ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

 

సిరీస్ 1 - సృష్టి నుండి బాబెలు

  1. సృష్టికర్తయైన దేవుడు
  2. ఆరు దినముల సృష్టి క్రమము
  3. దేవుడు మానవుని సృజించుట
  4. దేవుడు సృష్టి కార్యమును పూర్తి చేయుట
  5. ఆదాము - హవ్వ
  6. మానవుని పతనము - పర్యవసానములు (ఫలితము)
  7. కయీను - హేబెలు
  8. నోవహు ఓడను నిర్మించుట
  9. నోవహు ఓడలోనికి వెళ్ళుట
  10. నోవహు కృతజ్ఞతార్పణ చెల్లించుట
  11. బాబెలు గోపురము

సిరీస్ 2 - అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు

  1. అబ్రాహాము దేవునికి విధేయత చూపుట
  2. అబ్రాహాము, లోతు - వారి ఎంపిక
  3. శారా యొక్క అవిశ్వాసము
  4. సొదొమ పట్టణములో లోతు
  5. అబ్రాహాము అబద్ధమాడుట
  6. అబ్రాహాముకు దేవుని వాగ్దానము
  7. హాగరు - ఇష్మాయేలు
  8. అబ్రాహాము విశ్వాసము పరిశోధించబడుట
  9. ఇస్సాకు వివాహము చేసికొనుట
  10. యాకోబు ఇస్సాకును మోసము చేయుట
  11. యాకోబు - నిచ్చెన
  12. యాకోబు వివాహము
  13. యాకోబు తిరిగి తన దేశమునకు వెళ్ళుట

సిరీస్ 3 - యోసేపును గురించి మరియు మోషే పుట్టుక

  1. యోసేపు స్వప్నములు
  2. యోసేపు విచిత్రపు నిలువుటంగీ
  3. పోతీఫరు గృహములో యోసేపు
  4. యోసేపు - పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి
  5. చెరసాలలో నుండి అధికారము లోనికి
  6. యోసేపు స్వప్నములు నెరవేరుట
  7. యోసేపు తన సహోదరులను పరీక్షించుట
  8. ఐగుప్తులో యోసేపు కుటుంబము
  9. ఇశ్రాయేలు వంశము ఐగుప్తునందు అభివృద్ధి చెందుట
  10. మోషే జన్మించుట
  11. మోషే నిర్ణయము (ఎంపిక)
  12. మోషేకు దేవుని పిలుపు

సిరీస్ 4 - మోషే, ఇశ్రాయేలీయుల చరిత్ర

  1. మోషే తన పని ప్రారంభించుట
  2. ఐగుప్తు దేశము మీద తెగుళ్ళు
  3. పస్కా పండుగ
  4. ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రమును దాటుట
  5. దేవుడు మన్నా కురిపించుట
  6. దేవుడు ఇశ్రాయేలీయులకు నీటిని సమకూర్చుట
  7. సీనాయి పర్వతం
  8. పది ఆజ్ఞలు
  9. బంగారు దూడ
  10. వేగులవారి సమాచారము
  11. ఇత్తడి సర్పము
  12. మోషే మరణము

సిరీస్ 5 - యెహోషువ, సమూయేలు

  1. యెహోషువ - క్రొత్త నాయకుడు
  2. జ్ఞాపక సూచకమైన రాళ్ళు
  3. రాహాబు విశ్వాసము
  4. యెరికో పట్టణము కూలిపోవుట
  5. ఆకాను పాపము
  6. గిబియోనీయులు మోసగించుట
  7. యెహోషువ వీడ్కోలు - న్యాయాధిపతుల కాలము
  8. గిద్యోను సిద్దపడుట
  9. గిద్యోను విజయము
  10. సమ్సోను
  11. సమూయేలు జన్మించుట
  12. సమూయేలును దేవుడు పిలుచుట
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.