ఆదికాండము 24:1-67
ఉద్దేశ్యము/లక్ష్యము
దేవుని సహాయం కొరకు అడిగినప్పుడు దేవుడు మన ప్రార్థన విని జవాబు ఇస్తాడు అని బోధించుట.
ముఖ్యాంశము
ఒక ప్రయాణము కొరకు దేవుని సహాయం కోరుట - చాలా దూరములో ఉన్న మీ స్నేహితులను కలవాలి అని తలంచారు అనుకుందాము. మీకు దారి తెలియదు గనుక గూగుల్ లో వెదుకుతారు, లేదా తెలిసిన వారికి ఫోన్ చేసి తెలుసుకుంటారు. గూగుల్ లో మీరు వెళ్ళవలసిన ప్రదేశము ఎంత దూరంలో ఉంది, ఎటు వెళ్తే దగ్గర అవుతుంది, ఎలా వెళ్లాలి అనే వివరాలు అన్నీ ఉంటాయి. అవి అన్నీ తెలుసుకున్న తరువాత మీ ప్రయాణం ఎంతో సులభంగా ఉంటుంది. ఈరోజు ప్రభువు ద్వారా సహాయము పొంది ప్రయాణం చేసిన ఒక వ్యక్తి గురించి చూద్దాము.
గతవారము
అబ్రాహాము అందరికంటె తనను ఎక్కువగా ప్రేమిస్తున్నాడో లేదో తెలుసుకొనుటకు దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ప్రభువు అబ్రాహామును ఏమి చేయమని చెప్పాడు? అబ్రాహాము దేవుని మాటలకు విధేయత చూపాడా? దేవుడు ఇస్సాకును నిజముగా చంపాలి అనుకున్నాడా? ఈ సంఘటన అబ్రాహాము గురించి ఏమి తెలియజేస్తుంది? మన జీవితాలలో ప్రభువుకు మొదటి స్థానం ఇస్తున్నామా?
అబ్రాహాము శారాలకు దేవుడు ఇస్సాకును కుమారునిగా ఇచ్చిన విషయం గుర్తుందా? ఇస్సాకు 37 సంవత్సరాల వయస్సులో అతని తల్లి శారా చనిపోయింది (ఆది. 23:1-2). అబ్రాహాము, ఇస్సాకు ఒంటరి వాడై పోయాడు. అబ్రాహాము వృద్ధాప్యంలో ఉన్నందున తాను చనిపోతాడు కనుక, ఇస్సాకుకు త్వరగా వివాహం చేయాలని అనుకున్నాడు. తాము నివసిస్తున్న కనాను దేశపు వారు విగ్రహారాధికులు గనుక ఆ దేశపు స్త్రీలతో ఇస్సాకుకు వివాహము చేయకూడదు అని అబ్రాహాము తీర్మానించుకున్నాడు. సృష్టికర్త అయిన దేవుని ఎరిగిన స్త్రీ తోనే ఇస్సాకు వివాహం జరిగించాలి అనుకున్నాడు.
అబ్రాహాము తన దాసునికి ఆజ్ఞాపించి పంపుట
తాను మరణించక ముందే ఇస్సాకు వివాహము జరిపించాలి అని అబ్రాహాము ఆశించాడు. అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును చూచుకొనే దాసుడైన ఎలియాజరును పిలిచి మాట్లాడాడు. అతడు అబ్రాహాముకు ఎంతో నమ్మకమైన పరిచారకుడు. అతడు దేవునియందు భయభక్తులు కలిగిన వాడు, మరియు దేవుని పట్ల ప్రేమ కలిగిన వాడు. అబ్రాహాము ఎలియాజరుతో - ``నా స్వదేశ మందున్న నా బంధువుల యొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన ప్రభువు తోడని నీ చేత ప్రమాణము చేయించెదను'' అనెను.
అప్పుడు ఆ దాసుడు - ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని యెడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలెనా?''అని అబ్రాహామును అడిగాడు. అప్పుడు అబ్రాహాము -"అక్కడకు నా కుమారుని తీసికొని పోకూడదు. నా తండ్రి ఇంట నుండియు, నేను పుట్టిన దేశమునుండియు నన్ను తీసుకొని వచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చెదనని ప్రమాణముచేసి నాతో చెప్పిన పరలోక ప్రభువు తన దూతను నీకు ముందుగా పంపును'' అని ఎలియాజరుతో చెప్పాడు. నిజమైన దేవుని ప్రేమించి, ఆరాధించే స్త్రీ తన కుమారునికి భార్యగా రావాలి అని అబ్రాహాము అనుకున్నాడు. అబ్రాహాము అను తన యజమానుని తొడ క్రింద ఎలియాజరు చెయ్యి పెట్టి ప్రమాణము చేశాడు. ఆ దేశంలో ప్రమాణము చేయుటకు తొడ క్రింద చేయి పెట్టేవారు. అబ్రాహాము ఎలియాజరుకు అన్ని వివరాలుచెప్పి ప్రయాణము కొనసాగించుటకు పంపివేశాడు.
ఎలియాజరు హారాను చేరుట
ఎలియాజరు పదిఒంటెల మీద ఆహారమును, శ్రేష్టమైన నానా రకములులైన వస్తువులను తీసికొని బయలుదేరాడు. అబ్రాహాము నివసిస్తున్న కనాను దేశమునుండి సిరియాలోని హారానుకు దాదాపు 650 కి.మీ. దూరం ఉంటుంది. ఒంటె మీద అక్కడికి చేరుకోవడానికి కొన్ని వారాలు పడుతుంది. అబ్రాహాము ఎలియాజరుతో - ``నా కుమారునికి భార్యను వెతుకుటకు నీవు చేస్తున్న ప్రయాణములో ప్రభువు తన దూతను నీకు ముందుగా పంపుతాడు. అక్కడనుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు'' అని చెప్పాడు. ఎలియాజరు తన ప్రయాణము కొరకు ఎంతగానో ప్రార్ధించి ఉండవచ్చు. అక్కడ అబ్రాహామునకు ఎంతో మంది బంధువులు ఉన్నారు గనుక వారిలో ఇస్సాకు కొరకు ఏర్పరచబడిన వారు ఎవరో తెలిసికొనుటకు ఎలియాజరు ప్రార్ధిస్తూ, చివరకు హారానుకు చేరుకున్నాడు. ఆ ఊరిబయట ఉన్న నీటి బావి దగ్గరకు వచ్చాడు. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనుటకు ఆ బావి దగ్గరకు వచ్చేవారు. బావి నుండి తమ ఇంటికి, పశువులకు కావలసిన నీటిని తీసుకొని వెళ్ళేవారు. వారు బిందెలతో నీళ్లు చేది కడవలలో నింపి మోసికొని పోయేవారు. ఎలియాజరు ఆ బావి దగ్గరకు వచ్చి తన ఒంటెలను మోకరింపచేశాడు. అక్కడ తనలో తాను ప్రార్ధించుకుంటూ ఎదురు చూస్తున్నాడు.
ఎలియాజరు ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చుట
ఎలియాజరు తన వలన ఎటువంటి పొరపాటు జరగకుండా సూచన చూపించుమని ప్రభువుకు ప్రార్థించాడు. ఎలియాజరు దేవునికి - ``నా యజమానుడగు అబ్రాహాము దేవుడవైన ప్రభువా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము. చిత్తగించుము నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరివారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై యుండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలిసికొందును'' అని ప్రార్థించాడు.
ఎలియాజరు ప్రార్థించుట ముగించిన వెంటనే ఒక చిన్నది కడవ తన భుజము మీద పెట్టుకొని బావి దగ్గరకు వచ్చుట చూశాడు. ఆ చిన్నదాని పేరు రిబ్కా, ఆమె ఎంతో చక్కనిది. తన ప్రార్థనకు సమాధానముగా ఆ చిన్నది అక్కడికి వచ్చి ఉండవచ్చు అని ఎలియాజరు ఆలోచిస్తూ ఆమెను చూస్తున్నాడు. రిబ్కా ఆ బావిలోనికి దిగిపోయి కడవ నిండా నీళ్లు నింపుకుని పైకి యెక్కి రాగా ఎలియాజరు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి - ఈ నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్నుత్రాగనిమ్ము'' అని అడిగాడు. అందుకు రిబ్కా -"అయ్యా త్రాగుము'' అని చెప్పి త్వరగా తన కడవ చేతి మీదకు దించుకుని అతనికి దాహమిచ్చింది. తరువాత - ``నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేది పోయుదును'' అని ఎలియాజరుకు చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నింటికీ నీళ్లు చేది పోసింది. ప్రభువు తన ప్రార్థనకు జవాబు దయ చేస్తున్నాడు అని ఎలియాజరుకు అర్థమైంది.
రిబ్కా అందమైనదే కాకుండా దయ కలిగినది అని ఎలియాజరు గ్రహించాడు. ఒంటెలు నీరు త్రాగిన తరువాత ఎలియాజరు అర తులం బరువుగల బంగారపు ముక్కు కమ్మిని, పది తులముల బరువు గల రెండు బంగారు కడియములను తీసి రిబ్కా కు ఇచ్చాడు. ఎలియాజరు రిబ్కాను - నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా''? అని అడిగాడు. అప్పుడు రిబ్కా -"నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడుగు బెతూయేలు కుమార్తెను'' అని చెప్పింది. రిబ్కా ఇస్సాకుకు ఏర్పాటు చేయబడిన కన్యక అని ఎలియాజరుకు పూర్తిగా అర్థమైంది. తరువాత ఎలియాజరు తలవంచి ప్రభువును స్తుతించాడు. దేవుడు తనను సరియైన మార్గములో నడిపించినందుకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాడు. నేను త్రోవలో ఉండగానే నా యజమానుని బంధువుల ఇంటికి దేవుడు నన్ను నడిపించాడు అని ఎలియాజరు ఎంతగానో సంతోషించాడు.
ఎలియాజరు తన ప్రయాణము గురించి వివరించుట
రిబ్కా పరిగెత్తుకొని పోయి ఆ విషయాలన్నీ తన ఇంటిలో తెలిపింది. ఆ మాటలు వినిన రిబ్కా సహోదరుడైన లాబాను బావి దగ్గర వెలుపలనున్నఎలియాజరు దగ్గరకు పరుగెత్తుకొని వెళ్ళాడు. ఎలియాజరు తన ఒంటెలతో అక్కడ నిలబడి ఉన్నాడు. అప్పుడు లాబాను ఎలియాజరుతో - ``ప్రభువు వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము నీవు బయట నిలువ నేల? ఇల్లును, ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితిని'' అని పిలిచాడు.
ఎలియాజరు వారి ఇంటికి వెళ్ళినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి, వాటికి గడ్డి మేత వేశాడు. అతనితో కూడా ఉన్నవారికి కాళ్లు కడుగుకొనుటకు నీళ్లు ఇచ్చి వారికి భోజనము సిద్ధపరిచాడు. కానీ ఎలియాజరు - నేను వచ్చిన పని చెప్పకమునువు భోజనము చేయను'' అని చెప్పగా లాబాను చెప్పమన్నాడు. అప్పుడు ఎలియాజరు -"నేను అబ్రాహాము దాసుడను, ప్రభువు నా యజమానుని బహుగా ఆశీర్వదించెను కనుక అతడు గొప్పవాడాయెను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసీ జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చి యున్నాడు. నా తండ్రి ఇంటి వారి వద్దకు వెళ్లి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసికొని రావలెనని నా చేత ప్రమాణము చేయించెను'' అని చెప్పాడు. మరియు అబ్రాహాము నాతో - ``నేను ఎవని సన్నిధిలో జీవించుచున్నానో ఆ దేవుడు నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు అని చెప్పాడు'' అని ఎలియాజరు వారికి తెలియచేశాడు.
ఎలియాజరు తాను ప్రార్ధించి దేవుని సహాయం కోరగా రిబ్కా ఎలా కనిపించిందో వారికి వివరించాడు. తాను ప్రార్థించిన దాని చొప్పుననే దేవుడు తనను వారి యింటికి నడిపించాడు అని ఎలియాజరు చెప్పాడు. తన యజమానుని కుమారుడైన ఇస్సాకుకు రిబ్కా దేవుడు ఏర్పరిచిన భార్య అని తాను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను అని వారికి తెలిపాడు.
ఇస్సాకు దగ్గరకు వెళ్ళుటకు రిబ్కా ఇష్టపడుట
అప్పుడు లాబానును, బెతూయేలును - ఇది ప్రభువు వలన కలిగిన కార్యము మేమైతే అవునని గాని కాదని గాని చెప్ప జాలము'' అని ఎలియాజరుతో అన్నారు. రిబ్కా తల్లి కనీసం పది దినములైనా రిబ్కాను తమతో ఉండనిమ్ము అని ఎలియాజరును అడిగింది. కానీ ఎలియాజరు వారితో -"ప్రభువు నా ప్రయాణమును సఫలము చేసెను గనుక తడవు కానీయక పంపించుడి. నా యజమానుని యొద్దకు వెళ్లెదను'' అని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాని ని పిలిచి - ఈ మనుష్యునితో కూడా వెళ్ళదవా'' అని అడుగగా రిబ్కా -"వెళ్లెదను'' అని చెప్పింది.
మరుసటి దినము వారి కుటుంబము రిబ్కాను సాగనంపింది. రిబ్కా అంత త్వరగా వెళ్ళడం వారందరికీ ఎంతో బాధ కలిగించి ఉంటుంది. క్రొత్త దేశానికి వెళ్ళి తాను ఎన్నడూ చూడనటువంటి మనిషిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడం రిబ్కాకు ప్రభువు యెడల ఉన్న నమ్మకాన్ని తెలుపుతుంది. అబ్రాహాము ప్రతిదినము ప్రార్ధిస్తూ, తనకోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని ఎలియాజరుకు తెలుసు. అందుకే త్వరగా తన యజమానుని దగ్గరకు వెళ్లాలని తీర్మానించుకున్నాడు. పనికత్తెలు కూడా రిబ్కా తో పాటు ఒంటెల మీద ప్రయాణం మొదలుపెట్టారు. ఇస్సాకు కోసం ఎంత చక్కని భార్యను దేవుడు ఏర్పరచాడు! రిబ్కా ఎంతో చక్కనిది, దయగలిగినది, సహాయం చేసే స్వభావము గలది. దేవునికి లోబడి ఎలియాజరుతో కూడా బయలుదేరింది.
ఇస్సాకు రిబ్కాను వివాహము చేసికొనుట
ఒకరోజు సాయంకాలమున ఇస్సాకు ప్రార్ధించు కొనుటకు పొలములోనికి వెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుట కనిపించింది. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి - మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్నఆ మనుష్యుడు ఎవరు?'' అని ఎలియాజరును అడుగగా అతడు -"ఇతడు నా యజమానుడు'' అని చెప్పాడు. అప్పుడు రిబ్కా ముసుకు వేసుకుంది. ఆ దినములలో పెండ్లి కుమార్తెలు ఆ విధముగా ముసుగు ధరించేవారు. అప్పుడు ఎలియాజరు తాను చేసిన కార్యములన్నిటిని ఇస్సాకుకు వివరించాడు. ఇస్సాకు రిబ్కా ప్రభువు తనకు అనుగ్రహించిన భార్య అని విశ్వసించి, ఆమెను తన భార్యగా చేసుకున్నాడు. ఇస్సాకు రిబ్కాను వివాహమాడుట ద్వారా తన తల్లి మరణము వలన కలిగిన దుఃఖాన్ని పోగొట్టుకొన గలిగాడు. ఇస్సాకు రిబ్కాను ఎంతో ప్రేమించి, తన గుడారము లోనికి తీసుకొని వెళ్ళాడు.
సందేశము
ఇస్సాకుకు తగిన భార్యను ప్రభువు ఇస్తాడు అని అబ్రాహాము విశ్వసించాడు. కాని దానికి అవసరమైన ప్రయత్నాలు తన దాసుడైన ఎలియాజరు ద్వారా చేశాడు. ఎలియాజరు ఎంతో ప్రార్ధనచేయగా దేవుడు ఆ ప్రార్ధన అంగీకరించి ఫలితాన్ని ఇచ్చాడు. అది ప్రభువు చేసిన కార్యము అని అందరూ స్పష్టంగా చూడగలిగారు. ప్రార్ధన యొక్క శక్తిని మనము బైబిల్ అంతటిలో చూడగలము. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించే సమయములో మోషే దేవుని సహాయాన్ని పొందాడు. యేసును గూర్చిన సువార్తను ఫిలిప్పి పట్టణమునకు తీసుకొని వెళ్ళుటకు పౌలును కూడా ప్రభువే నడిపించాడు. అంత గొప్ప అద్భుతాలు కేవలం ప్రార్ధన ద్వారానే సాధ్యమౌతాయి.
అన్వయింపు
వివాహము, పై చదువులు, ఉద్యోగము మొదలైన విషయాలలో క్రైస్తవులు దేవుని సహాయం కొరకు ప్రార్ధిస్తుంటారు. వారు అడిగిన విధముగానే ప్రభువు కొన్నిసార్లు వారికి జవాబు ఇస్తాడు, మరికొన్నిసార్లు దేవుని జవాబులు ఊహించలేనివి గా ఉంటాయి. మనము అన్ని సమయములలో దేవుని వైపు చూచుటకు నేర్చుకోవాలి.
ఉదాహరణ
ఒకసారి ఒక కుటుంబం వేరే దేశానికి వెళ్లి అక్కడ స్థిర పడవలసి వచ్చింది. తల్లిదండ్రులు తమ కుమారుని తీసుకుని అక్కడ విమానాశ్రయంలో దిగారు. వారు ఇల్లు తీసుకునేంత వరకు ఎక్కడ ఉండాలో వారికి అర్థం కాలేదు. వారికి అక్కడ ఎవరూ తెలియదు. ముగ్గురు అక్కడే నిలబడి ప్రభువు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన అయిన వెంటనే ఒక వ్యక్తి వారి దగ్గరకు వచ్చాడు. ఆయన ఎవరో వారికి తెలియదు. మీకు ఏదైనా సహాయం కావాలా'' అని వారిని అడిగాడు. అప్పుడు వారు -"ఈ రాత్రి ఉండటానికి ఎక్కడైనా స్థలం దొరుకుతుందేమో అని చూస్తున్నాము'' అని చెప్పారు. అతడు పూర్తిగా కొత్త వ్యక్తి అయినప్పటికీ తన హోటల్ లో వచ్చి ఉండమని వార్త చెప్పాడు. డబ్బు కట్టనవసరం లేదని కూడా వారితో చెప్పాడు. ప్రభువు అంత త్వరగా తమ ప్రార్థనలకు జవాబు ఇవ్వడం చూచి వారు ఎంతో ఆశ్చర్యంతో నిండిపోయారు. తమను గురించి అంత శ్రద్ధ కనుపరచిన ప్రభువు పట్ల వారి హృదయాలు ఎంతో కృతజ్ఞతతో నిండిపోయాయి.
ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితులు ఎదురైనప్పుడు మనము కూడా ప్రభువు సహాయం అడగాలి. తనయందు విశ్వాముంచిన వారికి తప్పక సహాయము చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు.
కంఠతవాక్యం
ఒకని నడత ప్రభువుచేతనే స్థిరపరచ బడును (కీర్తన 37: 23).
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF