1 సమూయేలు 1,2 అధ్యాయాలు
ఉద్దేశము
యధార్థ హృదయముతో చేసిన ప్రార్థనలను దేవుడు తప్పక ఆలకిస్తాడు అని బోధించుట.
ముఖ్యాంశము
మీకు ఏదైనా వస్తువు మీద చాలా కోరిక కలుగుతుందా? సైకిల్ లేదా కంప్యూటర్ గేమ్స్ ఉంటే బాగుంటుంది అని ఆశగా అనిపిస్తుంది కదూ! అవి ఎలాగైనా కావాలి అనే కోరికతో ఎప్పుడూ వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీ ప్రక్కింటిలో మీ స్నేహితుడు సైకిల్ కొనుక్కుంటే మీ కోరిక ఇంకా ఎక్కువ అవుతుంది. మీ తల్లిదండ్రులు ఇప్పుడు కొనడానికి వీలు కాదు అని చెప్తే మీకు ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తుంది.
గతవారము
గత వారము సమ్సోను గురించి తెలుసుకున్నాము. సమ్సోను లోని ప్రత్యేకత ఏమిటి? అతడు ఎంతో బలవంతుడు జుట్టు కత్తిరించుకొనక పోవడంవల్ల చూడడానికి ప్రత్యేకంగా కనిపించేవాడు. సమ్సోను జుట్టు కత్తిరించుకున్న వెంటనే అతని బలం తొలగిపోతుంది అని చెప్పాడు. సమ్సోను తల్లిదండ్రుల మాట వినకుండా ఫిలిష్తీయుల లోని స్త్రీలను వివాహమాడి దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపాడు. సమ్సోను దెలీలా అను స్త్రీ తో కలిసి ఉంటున్న సమయంలో, ఆమె డబ్బుకు ఆశపడి సమ్సోను బలమును గురించిన రహస్యము తెలుసుకుంది. సమ్సోను జుట్టు కత్తిరించగానే అతని బలము పోయినందున ఫిలిష్తీయులు అతనిని బంధించి, కళ్ళు పీకివేసి బందీ గృహములో తిరుగలి విసరు వానిగా ఉంచారు. ఫిలిష్తీయులు దాగోను గుడిలో పండుగ చేసుకుంటున్న సమయంలో సమ్సోను దేవునికి ప్రార్ధించి గుడి స్తంభములను గట్టిగా లాగిన వెంటనే ఆ గుడి కూలిపోయి సమ్సోను తో పాటు దాదాపు మూడు వేల మంది ఫిలిష్తీయులు మరణించారు.
గిద్యోను, సమ్సోను ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతులు. ఇశ్రాయేలీయులు ప్రభువును మరచి దూరమైనప్పుడు దేవుడు వారిని శత్రువులకు అప్పగించే వాడు. తిరిగి వారు పశ్చాత్తాపముతో ప్రార్ధించినప్పుడు వారిని రక్షించడానికి న్యాయాధిపతులను పంపేవాడు. ఇశ్రాయేలీయులకు చివరి న్యాయాధిపతి అయిన సమూయేలు గురించి తెలుసుకుందాము. సమూయేలు తరువాత ఇశ్రాయేలీయులు రాజులను ఏర్పాటు చేసుకున్నారు.
ఎల్కానా కుటుంబముతో షిలోహు వెళ్ళుట
ఎఫ్రాయిము మన్యములో ఎల్కానా, హన్నా అను దంపతులు ఉండేవారు. ఎల్కానా హన్నాను ఎంతగానో ప్రేమించే వాడు. కానీ హన్నాకు పిల్లలు లేనందువలన ఎల్కానా పెనిన్నా అనే మరొక స్త్రీని వివాహము చేసుకున్నాడు. ఆ దినములలో పిల్లలు లేకపోవడం ఎంతో గొప్ప పాపముగా ఎంచేవారు. పెనిన్నా వలన ఎల్కానాకు చాలామంది పిల్లలు పుట్టారు. ఎల్కానా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఎల్కానా ప్రతి సంవత్సరము కుటుంబముతో కలిసి దేవుని మందిరమునకు వెళ్ళేవాడు. రామా అనే పట్టణంలో నివసించేవాడు. రామాకు షిలోహు చాలా దగ్గరలో ఉండేది. వారందరూ మందిరమునకు వెళ్ళి దేవుని ఆరాధించి, స్తుతించి సంతోషంగా వచ్చేవారు. కానీ హన్నా మాత్రము వారితో కలిసి సంతోషంగా ఉండేది కాదు. పిల్లలు లేనందువలన ఎంతో దుఃఖముతో ఉండేది.
హన్నా యొక్క దుఃఖము
తనకు పిల్లలు లేనందువలన హన్నా ఎంతో దుఃఖము గా ఉండేది. ఆమెకు ప్రపంచములో అన్నిటికన్నా ఎక్కువగా పిల్లలు కావాలనే కోరిక ఉండేది. పెనిన్నాకు కలిగిన పిల్లలు ఆడుతూ తిరుగుతూ ఉంటే తనకు కూడా పిల్లలు ఉంటే బాగుంటుంది అనే కోరిక బలంగా కలిగేది. పెనిన్నా హన్నాను విసిగిస్తూ, కోపము పుట్టించేది. ఎల్కానా హన్నాను ఎక్కువగా ప్రేమించుట వలన పెనిన్నా అసూయతో హన్నాను ఎగతాళి చేస్తూ పిల్లలు లేరు అని ఎంతో చులకనగా చూస్తుండేది. ఎల్కానా మందిరమునకు వెళ్ళి బలులు అర్పించిన సమయములో పెనిన్నా కంటే హన్నాకు ఎక్కువ బహుమతులు ఇచ్చేవాడు. హన్నా ప్రభువు పట్ల ఎంతో ప్రేమ కలిగిన స్త్రీ. పెనిన్నా తనను విసిగించి కోపము తెప్పిస్తున్నప్పటికి ఎంతో సహనము కలిగి ఉండేది. ఎంతో కష్టంగా ఉన్నప్పటికీ హన్నా ప్రభువు నందు విశ్వాసముతో ఉండేది.
హన్నా యొక్క ప్రార్థన
ప్రతి సంవత్సరము దేవుని మందిరమునకు వెళ్ళిన సమయములో పెనిన్నా మరీ ఎక్కువగా విసిగించి ఉండవచ్చు. ఆ సమయంలో ఎంతో బాధతో భోజనం చేయకుండా ఏడుస్తుండేది. ఎల్కానా హన్నతో - "హన్నా, నీ వెందుకు ఏడ్చుచున్నావు, నీవు భోజనము మానుట ఏల? నీకు మనో విచారమెందుకు కలిగినది? పదిమంది కుమాళ్లకంటె నేను నీకు విశేషమైన వాడను కానా ?" అని చెప్పి ఆమెను ఓదార్చుటకు ప్రయత్నించేవాడు. హన్నా మనసులోని వేదన ఎల్కానా అర్థము చేసుకొని ఉండకపోవచ్చు. తన బాధను ఎవరు అర్థము చేసుకోకపోయినా, ప్రభువు తప్పక అర్థం చేసుకుంటాడు అని హన్నాకు తెలుసు.
షిలోహులో ఎల్కానా కుటుంబపువారు భోజనము చేసిన తరువాత హన్నా ఒంటరిగా దేవుని మందిరమునకు వెళ్ళింది. హన్నా తనలో తాను ప్రార్దించుటకు మొదలు పెట్టింది. సంతానము కొరకు ఎన్నోసార్లు అక్కడ ప్రార్ధించి ఉండవచ్చు. కానీ ఆ రోజు ప్రత్యేకంగా ప్రార్ధించుట మొదలు పెట్టింది. ఆమె ఎంతో దుఃఖముతో నిండి వుంది. దేవుని సన్నిధిలో హన్నా ఎంతగానో ఏడుస్తూ - "ప్రభువా, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయ చేసిన ఎడల వాని తలమీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానీయక వాడు బ్రతుకు దినములన్నియు నేను వానిని నీకు అప్పగింతును" అని ప్రార్ధించి మ్రొక్కుబడి చేసుకుంది.
తనకు కుమారుడు జన్మిస్తే దేవుని పరిచర్య కొరకు వానిని అప్పగిస్తాను అని దేవునికి మ్రొక్కుబడి చేసుకుంది.
యాజకుడైన ఏలీ
హన్నా ప్రార్థన ను అక్కడ కూర్చొని ఉన్న యాజకుడైన ఏలీ కనిపెట్ట సాగాడు. హన్నా తన మనస్సులో ప్రార్ధించు కుంటున్నది గనుక ఆమె పెదవులు కదులుచున్నాయి కాని మాటలు వినపడలేదు. హన్నా ద్రాక్షారసము త్రాగి మత్తుతో ఉన్నది అని ఏలీ తలంచాడు. ఏలీ హన్నాతో - "ఎంత వరకు నీవు మత్తురాలవై ఉందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయుము" అని చెప్పాడు. అప్పుడు హన్నా యాజకుడైన ఏలీ తో - "అది కాదు నా యేలినవాడా, నేను మనో దుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షరసము నైనను, మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను ప్రభువు సన్నిధిని కుమ్మరించు కొనుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పు కొనుచున్నాను" అని చెప్పింది. అప్పుడు ఏలీ హన్నాతో - "నీవు క్షేమముగా వెళ్లుము ఇశ్రాయేలీయుల దేవునితో నీవు చేసికొనిన మనవిని ఆయన దయచేయును గాక" అని ఆశీర్వదించి పంపి వేసాడు. ఆ దినము నుండి హన్నా దుఃఖముగా ఉండుట మానివేసింది.
హన్నా ప్రార్థన మనవిని దేవుడు నెరవేర్చుట
షిలోహులో నుండి వచ్చిన తరువాత దేవుడు తన ప్రార్థన అంగీకరించి కుమారుని దయ చేస్తాడు అనే విశ్వాసముతో హన్నా సంతోషంగా ఉండసాగింది. తరువాత కొన్ని దినములకు హన్నా గర్భము ధరించింది. హన్నా ఎంతో సంతోషంతో దేవునికి కృతజ్ఞతలు చెప్పి ఉండి ఉండవచ్చు. కుమారుడు పుట్టినప్పుడు వానికి సమూయేలు అనే పేరు పెట్టారు. ప్రభువు హన్నా ప్రార్థన ఆలకించి ఆమెకు సంతానము దయ చేశాడు.
హన్నా తన మ్రొక్కుబడిని నెరవేర్చుట
హన్నా తన కుమారుని ప్రభువు పనికి అప్పగిస్తాను అని ఆలయములో చేసుకున్నమ్రొక్కుబడిని మరిచిపోలేదు. సమూయేలు తనకు ఎంతో ప్రియమైన కుమారుడైనప్పటికి అతడిని దేవుని పని కొరకు అప్పగించడానికి సిద్ధపడింది. సమూయేలు పాలు విడుచు వరకు షిలోహు లోని దేవుని మందిరమునకు వెళ్ళలేదు. పాలు మాన్పించిన తరువాత ఇంకా చిన్నవాడై ఉండగానే హన్నా సమూయేలును ఎత్తుకొని షిలోహులోని మందిరమునకు వెళ్ళింది. సమూయేలు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నాలుగు లేదా ఐదు సంవత్సరముల వయస్సు ఉండవచ్చు. యాజకుడైన ఏలీతో ఉండి పరిచర్య చేయాలి అని హన్నా సమూయేలుకు చెప్పి ఉండవచ్చు. ఆలయములో దుఃఖముతో ప్రార్థించినది తానేనని హన్నా ఏలీకి చెప్పింది. మందిరములో పరిచర్య చేయుటకు సిద్ధపడిన సమూయేలు కు దేవుడు తోడుగా ఉంటాడు అని హన్నా విశ్వసించింది. ఎంతో కృతజ్ఞతతో సమూయేలును దేవునికి ప్రతిష్టించింది, సమూయేలు కూడా అక్కడే ప్రభువుకు మ్రొక్కాడు.
బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదును ధరించుకొని పరిచర్య చేయసాగాడు. హన్నా చిన్న అంగీని కుట్టి బలి అర్పించుటకు వచ్చినప్పుడు తెచ్చి సమూయేలుకు ఇచ్చేది. హన్నా నమ్మకత్వమును బట్టి దేవుడు మరి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను అనుగ్రహించాడు. ఇప్పుడు హన్నాను పెనిన్నా విసిగించే అవసరము లేదు.
సందేశము
హన్నా దుఃఖముతో ప్రార్థించగా ప్రభువు ఆమె ప్రార్థనకు జవాబు ఇచ్చినట్లు చూసాము. తన హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించి తనకు కుమారుడు కావాలి అని హన్నా ప్రార్ధించింది. తన ప్రార్థనలకు జవాబు ఇచ్చినప్పుడు ఎంతో సంతోషంతో దేవుని స్తుతించింది. యధార్ధముగా ప్రార్ధించిన వారి మానవులను విని దేవుడు ఉత్తరమిచ్చినట్లు బైబిల్ లో మనము ఎన్నో సార్లు చూడగలము.
ప్రభువైన యేసు భూమీమీద జీవించిన సమయంలో ఎంతగానో ప్రార్థించేవాడు. గెత్సేమనే తోటలో చెమట కారునంతగా ప్రార్ధించాడు అని బైబిల్ లో చూడగలము. సిలువపై మరణించుటకు కావలసిన శక్తిని ప్రసాదించు నట్లు యేసు తండ్రికి ప్రార్థన చేశాడు. లోక పాపములను క్షమించు రక్షకునిగా సిలువలో మరణించుటకు దేవుడు యేసును పంపించాడు.
అన్వయింపు
దేవుడు మన ప్రార్థనలకు చెవి యొగ్గి ప్రత్యుత్తరమిస్తాడు. మనకు ఏది మంచిది అనే విషయము మన కంటే దేవునికి బాగా తెలుసు. కొన్ని ప్రార్థనలకు అనుకూలంగా జవాబు వస్తే, మరికొన్నింటికి ప్రతికూలంగా వస్తుంది. మరి కొన్నింటి కోసం ఎదురు చూడవలసి వస్తుంది. హన్నా వలె మనము దేవుని సన్నిధిలో మన హృదయాలు కుమ్మరించి యదార్ధముగా ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. మన పాపములకు క్షమాపణ పొంది, మన జీవితాలలో యేసును కలిగి ఉండడం ఈ లోకములో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. మన ప్రార్ధన యధార్ధముగా ఉండాలి. మన ప్రార్థనలకు జవాబు పొందినప్పుడు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి.
కంఠతవాక్యము
ప్రతి విషయములోను ప్రార్ధన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి (ఫిలిప్పీ 4:6).
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF