నిర్గమ. 11 - 13; హెబ్రీ. 11: 28
ఉద్దేశము
మన పాపముల నుండి విడిపించబడుటకు ఉన్న ఏకైక మార్గం యేసుని విశ్వసించుట మాత్రమే అని బోధించుట.
ముఖ్యాంశము
కుటుంబముగా కారులో ప్రయాణం చేస్తూ మీరు ఎప్పుడైనా దారి తప్పిపోయారా? అలా తప్పిపోయినప్పుడు మీ తల్లిదండ్రులు కారు కిటికీలో నుండి దారి కోసం కనబడిన వారిని అడుగుతుంటారు. వారు చెప్పిన గుర్తులు జాగ్రత్తగా విని, వాటి ప్రకారం ప్రయాణించినప్పుడు మీ గమ్యాన్ని సరిగా చేరుకోగలరు. ఇశ్రాయేలీయులు దేవుడు చెప్పిన ఆజ్ఞలకు సూచనలకు లోబడి ఏ విధముగా నడుచుకున్నారో ఈ రోజు చూద్దాము.
గతావారము
ఫరో మీదికి, ఐగుప్తీయుల మీదికి దేవుడు పంపిన తొమ్మిది భయంకరమైన తెగుళ్లు గురించి గతవారం చూశాము. ప్రభువు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను పంపుమని ఫరోకు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ అతడు తన హృదయ కాఠిన్యాన్ని బట్టి వారిని పంపలేదు. ఈరోజు చివరి తెగులు గురించి తెలుసుకుందాం. ఈ పదవ తెగులు అత్యంత భయంకరమైనది కనుక ఐగుప్తీయులతో పాటు ఫరోకూడా ఇశ్రాయేలీయులను తమదేశం విడిచివెళ్ళి పోవలసినదిగా త్వరపెట్టాడు.
తొమ్మిది తెగుళ్ల తరువాత తనను మరెన్నడూ కలువవద్దు అని ఫరో మోషేకు ఆజ్ఞా పించాడు. ఫరో సన్నిధి నుండి వెళ్లకముందు మోషే పదియవ తెగులు గురించి హెచ్చరించి వెళ్ళిపోయాడు. ఐగుప్తులోని ప్రతి కుటుంబంలో తొలి సంతానం మరణిస్తారు అనేది ఆ పదవ తెగులు. వారు చెప్పిన తొమ్మిది తెగుళ్ళు తమ మీదకు వచ్చినప్పటికీ, పదవ తెగులు గురించి మోషే చెప్పిన మాటలు ఫరో నమ్మలేదు.
దేవుని ప్రత్యేకమైన ఆజ్ఞలు సూచనలు
తాను కలుగజేయబోవుచున్న పదవ తెగులు గురించి ప్రభువు మోషే అహరోనులకు వివరించాడు. అప్పుడు వారు ఫరో దగ్గరకు వెళ్ళి - "ఒక దినము మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశం లోనికి బయలు వెళ్ళెదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలి పిల్ల మొదలుకుని తిరుగలి విసరు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరు చచ్చెదరు. జంతువులలోకూడా తొలి పిల్లలన్నియు చచ్చును. అప్పుడు నీ సేవకులైన వీరందరు నా యొద్దకు వచ్చి నాకు నమస్కారముచేసి నీవును నిన్ను ఆశ్రయించిన ఈ ప్రజలందరును బయటకి వెళ్ళుడి అని చెప్పుదురు అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు" అని చెప్పి ఫరో యొద్దనుండి కోపముతో వెళ్లిపోయారు. ఆ తెగులు నుండి తప్పించుకొనుటకు ఇశ్రాయేలీయులు దేవుడు చెప్పిన ఆజ్ఞలను అనుసరించవలసియున్నది. దేవుని మాటలు వినిన ప్రతిఒక్కరు ప్రాణములతో ఉంటారు.
దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞలు
పైన వివరించిన ఆజ్ఞలు ఇశ్రాయేలీయులకు అర్థం కాకపోయినప్పటికీ వారు దేవుని మాటలకు విధేయత చూపాలి. వారు దేవుని మాటలను విశ్వసించి ఆహారం సిద్ధపరచుకుని, ప్రయాణం కొనసాగించుటకు సిద్ధపడసాగారు.
సిద్ధపాటు
దేవుడు చివరి తెగులు పంపుటకు ముందు ఇశ్రాయేలీయులకు సిద్ధ పడటానికి ఎక్కువ సమయం లేదు. ప్రయాణములో తమకు అవసరమైన వాటిని తీసుకుని వెళ్లాలి. బట్టలు, వంట సామానులు తమ గాడిదల మీద వేసి ఉంటారు. ఐగుప్తీయుల దగ్గరనుండి వెండి నగలను, బంగారు నగలను,మంచి బట్టలను తీసికొనుమని దేవుడు ఇశ్రాయేలీయులకు సెలవిచ్చాడు. వారు చేసిన కఠినమైన దాసత్వానికి వారు ఐగుప్తీయులను దోచుకోవడం సరియైనదే. దేవుడు అబ్రాహాముతో ముందుగానే ఇశ్రాయేలీయులను గూర్చి - "మీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీ ర్పుతీర్చెదను. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు" అని చెప్పాడు (ఆది. 15:14).
పస్కా పండుగ లేదా పులియని రొట్టెల పండుగ
చివరకు ఆ దినము సాయంకాలము రానేవచ్చింది. ఇశ్రాయేలీయులు కుంచెను రక్తములో ముంచి ద్వారబంధపు పై కమ్మీ మీదను రెండు నిలువు కమ్ములకును తాకించాలి. వారు మంచి వస్త్రములు ధరించుకొని బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నారు ఇవన్నియు వారు దేవుడు ఆజ్ఞాపించిన విధముగానే చేశారు.
ఉదయం వరకు ఎవరూ ఇంటి ద్వారం నుంచి బయటకురాకూడదు అని మోషే ఇశ్రాయేలీయులకు చెప్పాడు. ప్రభువు ఐగుప్తీయు లను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు కమ్మీలమీదను, రెండు నిలువు కమ్ములమీదను ఉన్న రక్తమును చూచి ఆ తలుపును దాటిపోవును కనుక ఆ ఇంటిలో మరణం సంభవించదు అని వారికి వివరించాడు. ద్వారబంధం మీద రక్తం లేని ఇంటిలో జ్యేష్ఠ కుమారుడు మరణిస్తాడు ఎంత భయంకరం! కానీ ఎవరి పొరపాటు వలన ఆ విధంగా జరగబోతుంది? ఫరో చేసిన పొరపాటువలననే కదా! ఫరో దేవునికి విధేయత చూపితే ఐగుప్తు మీదకు తెగుళ్లు వచ్చేవి కావు. అతడిని హెచ్చరించినప్పటికీ పట్టించుకొనలేదు. ఫరో చెడుతనము వలననే ఐగుప్తులో ప్రతికుటుంబములో జ్యేష్ఠ కుమారుడు మరణించవలసివచ్చింది. ఇశ్రాయేలీయుల ద్వారబంధపు కమ్ములపై రక్తముచూచి ప్రభువు వారిని సంహరించకుండా విడిచిపెట్టాడు. దేవుడు ఇశ్రాయేలీయులతో - "మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను" అని వాగ్దానం చేశాడు (నిర్గమ. 12:13). అందుకే దానిని పస్కాఅనగా దాటి పోవుట అని పిలుస్తారు. దేవుడు ఇశ్రాయేలీయులను చంపకుండా దాటి పోయాడు కనుక పస్కాదినము అని అంటారు. ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కరూ ప్రభువు మాటలకు విధేయత చెప్పినందువలన వారిలో ఏ ఒక్కరు కూడా మరణించలేదు. ద్వార బంధపు కమ్ముల మీద పూయబడిన రక్తము వారిని క్షేమంగా ఉంచింది.
ఫరో విడిచిపెట్టుట
ఐగుప్తీయులుకు ఆరోజు రాత్రి ఎంత భయంకరమైనది! ఆ రోజు అర్ధరాత్రి సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్లవరకు ఐగుప్తు దేశములో తొలి పిల్లలు అందరూ చనిపోయారు. ఫరో జ్యేష్ఠ కుమారుడు కూడా చనిపోయాడు. ఫరో, అతని సేవకులు చూచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటి కూడా ఐగుప్తులో కనబడలేదు. అందువలన ఐగుప్తు దేశములో మహా దుఃఖం కలిగింది. అప్పుడు ఫరో ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి పంపివేయాలి అనుకున్నాడు. ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో - "మీరును ఇశ్రాయేలీయులును లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి మీ దేవుని సేవించుడి మీరు చెప్పినట్లు మీ మందలను, మీ పశువులను తీసుకొనిపొవుడి నన్ను దీవించుడి" అని చెప్పాడు. ఐగుప్తీయులు తమ దేశములోనుండి ఇశ్రాయేలీయులను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేశారు కనుక ఇశ్రాయేలీయులు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునుపే పిండి పిసుకు తొట్లలో దానిని మూటకట్టుకుని తన భుజముల మీద పెట్టుకుని బయలుదేరారు. ఇశ్రాయేలీయులు మోషే చెప్పినట్లు ఐగుప్తీయుల దగ్గరనుండి వెండి బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకుని వారిని దోచుకున్నారు. ఫరో మనస్సు మారకముందే వారు ఐగుప్తు విడిచి పెట్టారు. ఐగుప్తులో కఠినదాస్యములో కూడా తమతో ఉండి అక్కడ నుండి విడిపించిన దేవునికి వారు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించి ఉంటారు.
సందేశము
ఫరో చేతి నుండి తన మహాశక్తి తో దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించిన విషయాన్ని ఈరోజు చూశాము. ఐగుప్తులో జ్యేష్ఠ సంతానమును చంపుట దేవునికి సంతోషము కలిగించే విషయం కాదు. కాని ముందు పంపిన తొమ్మిది తెగుళ్లు ఫరోలో ఎటువంటి మార్పు కలిగించలేదు. మరణం అనే తెగులు దేవుడు పంపిన తరువాత ఫరో ఇశ్రాయేలీయులను త్వరపడి పంపివేశాడు. ఫరో దుష్టత్వము, కఠిన హృదయం కలవాడు కనుక దేవుడు అతనికి తీర్చు తీర్చవలసి వచ్చింది. యోసేపు కుటుంబము అనేక సంవత్సరములు ఐగుప్తులో నివసించిన తరువాత వారు ఇప్పుడు కనాను దేశము వెళ్ళుటకు బయలుదేరారు. దేవునికి విధేయులైనందున ఇశ్రాయేలీయులు మరణం అనే తెగులు నుండి రక్షింపబడ్డారు. ద్వారబంధపు కమ్ములమీద రక్తమును చూచి దేవుడు వారిని సంహరించకుండా దాటిపోయాడు.
అన్వయింపు
దేవుడు చెప్పిన మాటలు ఇశ్రాయేలీయులు ఖచ్చితంగా పాటించారు. మరణము నుండి తప్పించడానికి ఇశ్రాయేలీయులు గొర్రెపిల్ల రక్తాన్ని వారి ద్వారబంధం కమ్ములమీద పూయవలసివచ్చింది. యేసు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకములోనికి వచ్చాడు. ఆయన సిలువపై తన రక్తము చిందించుట ద్వారా పాపులకు రక్షణ దయచేశాడు (యోహాను1:29;1కొరింథీ.5:7). నిత్య నరకం నుండి తప్పిం చుకొని రక్షింపబడుటకు దేవుని ఆజ్ఞలను మనము నెరవేర్చాలి. ఆయనకు విధేయత చూపాలి. మన పాపములు క్షమించమని దేవుని అడగాలి. ఆయన చిందించిన రక్తము మనలను ర క్షింపగలదు అని విశ్వసించాలి. యేసు రక్తము ద్వారా పాపవిమోచన కలుగుతుంది అని మనము విశ్వసించిన యెడల దేవుడు మన పాపములను క్షమించి, మనము మరణించినప్పుడు మనకు ఎటువంటి శిక్షను విధించడు. మనము నిత్యజీవము లోనికి నడిపించబడతాము. మనము దేవుని ప్రేమించి ఆయనను వెంబడించు వారుగా ఉంటాము.
కంఠతవాక్యము
"ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు" అని చెప్పాడు అ.కా. 16 31.
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF