ఆదికాండము 9:20-29;11:1-9
ఉద్దేశము/లక్ష్యము
దేవుని శక్తి అన్నిటికంటె గొప్పది అనియు మరియు మానవుని గర్వఫు ఆలోచనలను ఆయన నశింపచేస్తాడు అనియు బోధించుట.
ముఖ్యాంశము
చాలా ఎత్తయిన భవనంపైకి మీరు ఎప్పుడైనా ఎక్కారా? అంత ఎత్తులో ఉంటే ఎలా అనిపిస్తుంది? అలా ఎత్తులో ఉండే ఇంటిలో ఉండటం మీకు ఇష్టమేనా? కొంతమందికి ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లాలంటే ఎంతో భయం, కాని మరికొందరు కొండలు, పర్వతాలు ఎక్కటానికి ఎంతో ఇష్టపడతారు. ఆకాశాన్ని అంటుకునేంత ఎత్తయిన గోపురము కట్టుకోవాలి అని ఆశపడిన కొందరిని గురించి ఈ రోజు తెలుసుకుందాము.
గతవారము
నోవహు,అతని కుటుంబము, జంతువులు,పక్షులు, పురుగులు అన్ని దేవుడు ఆజ్ఞాపించిన తరువాత ఓడ నుండి బయటకు వచ్చినట్లు గతవారం చూశాము. జలప్రళయము ఆగిపోయుంది, వారు క్రొత్తగా తమ పనులు మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి దేవుడు కొత్త జీవితాలు ప్రసాదించాడు. ముందుగా ఎక్కడ నివసించాలి, ఏమి పనులు చేయాలి అని వారు ఆలోచించారు. నోవహు వ్యవసాయం చేసేవాడు కనుక ద్రాక్షతోటలు నాటాడు. నోవహు దేవుని ఎంతగానో ప్రేమించి, విధేయత చూపేవాడు.
మనుష్యుల అవిధేయత నోవహు ముగ్గురు కుమారులకు సంతానము కలిగి వారు విస్తరింపసాగారు. వారు భూమియందంతట వ్యాపించారు. దేవుడు వారిని ఒకచోటే ఉండమని చెప్పలేదు కాని అన్నిప్రాంతాలకు విస్తరించమని చెప్పాడు. ఫలించి అభివృద్ధిపొంది భూమిని నింపుడి (9:1) అని ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ గురించి తెలిసినప్పటికి, ప్రజలు దానికి లోబడలేదు. అందరూ కలసి ఒకే చోట ఉండాలని అనుకున్నారు. దేవుని మాటలకు విధేయత చూపడానికి వారు ఇష్టపడలేదు. వారు తూర్పు దిక్కున ప్రయాణము చేస్తూ షీనారు దేశములోని ఒక మైదానమును చూచి అక్కడ నివసించుటకు నిశ్చయించుకున్నారు. చుట్టూ నదులు కలిగిన చక్కటి మైదానము గనుక అది తమకు సరియైన ప్రదేశం అని వారు తలంచారు.
అప్పుడు వారు ఒకరితో ఒకరు - ” మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండి'' అని మాట్లాడుకున్నారు. మరియు వారు - “ మనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును, ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండి'' అని మాట్లాడుకున్నారు. వారు తమ తెలివితేటలు ఉపయోగించి పేరుప్రఖ్యాతులు సంపాదించుకొని దేవునికంటె తమను తాము హెచ్చించుకోవాలి అని ఆలోచించారు. తామందరం కలిసి ఉంటే ఎంత అసాధ్యమైన పనులు అయినా చేయగలము, దేవుని కంటె ఎక్కువ పేరు సంపాదించు కొనగలము అని ఆశ పడ్డారు. గొప్ప శిఖరము కట్టుకొంటే క్షేమంగా ఉండవచ్చు అనుకున్నారు. అక్కడే కలిసి ఉంటే ఎవరూ తప్పిపోలేరు. మైదాన ప్రాంతం గనుక అక్కడనుండి ఎంత దూరమైనా ఆ శిఖరం కనిపిస్తుంది అని ఆలోచించి ఉండవచ్చు.
పట్టణమును కట్టుటకు మొదలుపెట్టుట అంత పెద్ద పట్టణము, శిఖరము కట్టడానికి చాలా సమయం పడుతుంది. ఆ పనులు అన్నీ చూచుకోవడానికి మనుష్యులను నియమించాలి. ఎవరిని నియమించాలి? నోవహుకు నిమ్రోదు అనే ముని మనుమడు ఉన్నాడు. అతడు చాలా పేరు గలిగినవాడు, పరాక్రమము గల వేటగాడు(10:8-9). నిమ్రోదు ఎంతో పరాక్రమశాలి గాని ఎంతో గర్వము, చెడుతనము కలిగిన క్రూరుడు. దేవుని ఎంత మాత్రము లక్ష్య పెట్టేవాడు కాదు. జలప్రళయము గురించి, ఆ సమయములో దేవునికి అవిధేయులైన వారు నశించుట గురించి నోవహు నిమ్రోదుకు తప్పకుండా చెప్పి ఉండవచ్చు. కానీ నిమ్రోదు అవేమీ పట్టించుకొనలేదు. దేవుడు భూమిపై విస్తరించి దానిని నింపుడి అని చెప్పిన మాటలు పట్టించుకోకుండా జనులందరూ కలిసి ఉండునట్లు గొప్ప పట్టణము కట్టించాలని అనుకున్నాడు. నిమ్రోదు కట్టించిన మొదటి పట్టణము బాబెలు (10:10). అతడు పరాక్రమము గలవాడు అయినప్పటికి, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేవాడు. జనులుఎంత ఉత్సాహంగా ఆ పట్టణాన్ని, గోపురాన్ని కట్టడం మొదలుపెట్టారో మనం ఊహించవచ్చు! ఆ గోపురము కట్టుటకు వారు ఇటుకలు చేసి బాగుగా కాల్చి వాటిని ఉపయోగించసాగారు. ఆ పనులతో జనులు తీరిక లేకుండా ఉన్నారు. ఆ గోపురం ఎత్తు రోజు రోజుకూ పెరుగుతూ ఉంది. వారు అందరూ ఆలోచిస్తూ,మాట్లాడుకుంటూ కలిసి పనిచేస్తున్నారు. ఆ గోపురము కట్టుటకు ఎంతో ఎత్తు ఎక్కవలసి వచ్చేది. ఎంత కష్టమైనా వారు మానకుండా పని చేయసాగారు.
ప్రభువు దిగివచ్చుట వారు కడుతున్నది అంతా ఒకరు చూస్తున్నారు అని వారికి తెలుసా? ఎవరో మీరు ఊహించగలరా? అవును దేవుడు. జనులు తన యెడల అవిధేయులుగా ఉన్నందుకు దేవుడు వారిపై ఎంతో ఆగ్రహంతో ఉన్నాడు. వారిని అలాగే పట్టించుకోకుండా ఉంటే అందరూ కలిసి తమ దుష్ట ఆలోచనలను నెరవేర్చుకుంటారు అని దేవునికి తెలుసు. దేవుడు వారిని ఎలా ఆపి వేయబోతున్నాడు? మరొక జలప్రళయము పంపుతాడు అనుకుంటున్నారా? లేదు, మరెన్నడూ భూమిమీదికి జలప్రళయము పంపను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానములు నెరవేర్చే దేవుడు. ఆ పట్టణపు నిర్మాణము ఆపివేయుటకు దేవుడు మరొక మార్గం ఎన్నుకున్నాడు.
ఆ దినములలో భూమియందంతట ఒకే భాష, ఒకే పలుకు ఉండేవి (11:1). దేవుడు వారు కట్టుచున్న పట్టణమును, గోపురమును చూచి - “ఇదిగో జనము ఒక్కటే వారికందరికి భాష ఒక్కటే. వారు ఈ పని ఆరంభించి యున్నారు. ఇకమీదట వీరు చేయదలచు ఏ పనియైనను చేయకుండా వారికి ఆటంక మేమియు ఉండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండి'' అని అనుకున్నాడు. అలా జరిగినప్పుడు వారు తమ పనిని అపివేసి, భూమియందంతట తప్పక చెదరిపోవలసి వస్తుంది. ఆ విధముగానే జరిగింది. అకస్మాత్తుగా వారందరికి ఒకరి మాటలు మరొకరికి అర్థం కాకుండా పోయాయి. మొదట్లో కొందరు తమషాగా మాట్లాడుతున్నారు అని అనుకొని ఉండవచ్చు. కాని తరువాత అందరికి కోపం విసుగు కలగడం మొదలైంది. ఒకరి మాటలు ఒకరు అర్థం చేసుకోలేక ఎవరూ పని చేయలేకపోతున్నారు. అక్కడ ఎంత అల్లరి ఉందో మీరు ఊహించగలరా! వారికి తాము కలసి పనిచేయడం అసాధ్యం అని అర్థమైంది. వారు ఆ గోపురం కట్టడం మానివేశారు. అది మరెన్నటికి పూర్తి కాలేదు. ఒకే భాష మాట్లాడుతున్న వారందరు కలిసికొని ఒక ప్రాంతానికి వెళ్లి అక్కడ నివసించటం మొదలుపెట్టారు. అలా అందరూ భూమియందంతట చెదరిపోయారు. దేవుడు మొదట చెప్పిన విధముగా భూమియందంతట వ్యాపించునట్లు వారు బలవంతముగా దేవునిచేత చెదరగొట్టబడ్డారు.
సందేశము
ఎంతో ఆశ్చర్యకరమైన విషయాలను మనము చూశాము. నిమ్రోదు మరియు జనులుఎంతో గర్వంతో నిండిన వారుగా ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా ఏ పనైనా చేయగలము అని తలంచారు. అవిధేయులుగా ఉన్నప్పటికి తమకు ఏమీ జరగదు అనుకొన్నారు. కాని వారు అనుకున్నవన్నీ పొరపాటు అని మనము చూసాము. నిమ్రోదు ఎంతో దుష్టుడు. అతడు నిజమైన దేవుని ఆరాదించేవాడు కాదు. ఈ బాబెలు పట్టణమే తరువాత బబులోను మహా సామ్రాజ్యముగా మారింది అని మనకు తెలుసు. బబులోను విగ్రహారాధనతో నిండిన దేశము అని బైబిల్ లో వ్రాయబడింది.
అన్వయింపు
ఈ దినములలోకూడా ప్రపంచములో ఎంతో మంది జనులు గర్వముతో నిండి యున్నారు. వారు ఎన్నో పాపపు ఆలోచనలు, చెడు ప్రణాళికలతో దేవునికి వ్యతిరేకమైన పనులు చేయుటకు ప్రయత్నిస్తుంటారు. అమాయకులను చంపుతూ, ఇతరులను హింసిస్తూ వుంటారు. కాని వారిని చూచి మనము భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటె దేవుడు వారి క్రియలన్నిటిని చూస్తున్నాడు. వారి క్రియలను దేవుడు అలాగే ముందుకు కొనసాగనీయడు. వారి గర్వమును, వారి దుష్ట క్రియలను తప్పక ఒకరోజు అణిచివేస్తాడు. బాబెలు గోపురము కట్టుచున్న వారిని ఆపివేసినట్లుగానే వీరిని కూడా ఆపివేస్తాడు. కానీ క్రైస్తవులమైన మనము భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ మనతో కూడా ఉంటాడు. మనము దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుడు చూపిన మార్గములలో నడుస్తూ ఆయనను సంతోషపరిచే జీవితము కలిగి ఉండునట్లు ప్రార్ధన చేయాలి. బాబెలు గోపురము కట్టించిన వారు దేవుని కంటే తమను తాము హెచ్చించుకోవాలి అనే చెడు ఆలోచన కలిగి, మొదలుపెట్టిన పనిని ముగించలేకపోయారు. మనలను సృజించిన దేవుని కంటె మనలను హెచ్చించుకోవాలి అని తలంచుట ఎంత బుద్ధిలేని తనము! అటువంటి గర్వము చెడుతనము మన హృదయాలలో ప్రవేశించకుండునట్లు దేవుని సహాయము కొరకు ప్రార్ధించాలి.
కంఠతవాక్యము
గర్వముతో నటించువారిని ఆయన అణపశక్తుడు (దానియేలు 4:37).
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF