ఆదికాండము 1:1-5, కీర్తనలు 90:2, అ.కా.17:24-25, ప్రకటన 4:11
ఉద్దేశము
దేవుడు చీకటి నుండి వెలుగును వేరుపరచాడు అని చూపుట. మన హృదయాలలో కూడా ఆయన వెలుగు నింపగలడు అని బోధించుట.
ముఖ్యాంశము:-
ఈ ప్రపంచం ఎలా నిర్మించబడింది అని ఎప్పుడైనా ఆలోచించారా ? అది ఎలా ప్రారంభమైందో మీకు తెలుసా ? ఆదిలో ఈ సృష్టి ఎలా ఉండేది ? ఈ భూమి ఎలా ఉండాలి, సముద్రం ఎక్కడ ఉండాలి, కొండలు పర్వతాలు ఎంత ఎత్తు ఉండాలి, ఎన్ని రకాలైన పక్షులు జంతువులు చెట్లు ఉండాలి అని ఎవరు ఆలోచించారు? కొన్ని కోట్ల సంవత్సరాల క్రిందట అంతరిక్షములో పెద్ద విస్ఫోటనము సంభవించి దాని ద్వారా కలిగిన చిన్న చిన్న పదార్థాల వలన ప్రపంచం నిర్మించబడింది అని దేవుడిని విశ్వసించని వారు అనుకుంటారు. ఉదా. ఒక టేబుల్ ఉంది అనుకుందాము. అది పేలిపోయి చెట్టుగా మారుతుంది అంటే మీరు నమ్ముతారా? లేదు కదా! ఆ టేబుల్ చిన్న ముక్కలుగా అయిపోతుంది. సృష్టి కూడా ఆ విధంగా నిర్మించబడలేదు, కాని చాలామంది అదే నమ్ముతారు.
చిన్న జంతువులు క్రమంగా మార్పు చెందుతూ పెద్ద జంతువులుగా మారిపోతాయి అని వారి నమ్మకం. పెద్ద జంతువులు కూడా కాలక్రమేణా మనుష్యులుగా మారుతారు అని వారి వాదన. దీనినే పరిణామ సిద్ధాంతం అంటారు. మనము స్కూల్ లో, టి.వి. లో ఈ సిద్ధాంతాన్ని గురించి వింటూ ఉంటాము. అనేకులు దేవుడిని సృష్టికర్తగా అంగీకరించడానికి బదులుగా అసత్యమైన విషయాలను నమ్ముతుంటారు.
దేవుని గ్రంధమైన బైబిల్ లోని సత్యాలను క్రైస్తవులు నమ్ముతారు. సృష్టిని, అందులోని సమస్తమును తానే చేశాను అని దేవుడు ప్రకటించాడు. ఈ భూమి కేవలం కొన్ని వేల సంవత్సరాల క్రితం చేయబడినది అని మీకు తెలుసా? దేవుడు అన్నింటిని సంపూర్ణముగా సృష్టించాడు. ఈ విషయాలను గురించి బైబిల్ ఏమి వివరిస్తుందో ఈరోజు తెలుసుకుందాము.
దేవుడు శాశ్వతమైన వాడు (నిత్యుడు) దేవుడు ప్రపంచమును నిర్మించకముందే ఉన్నాడు అని మీకు తెలుసా? (కీర్తనలు 90:2). దేవునికి ప్రారంభం అంటూ ఏమీ లేదు. ఆయన యుగయుగములు ఉన్న సజీవుడైన దేవుడు. పురుగులు కొన్ని రోజులు, చిన్న మొక్కలు కొన్ని వారాలు, చిన్న జంతువులు కొన్ని సంవత్సరాలు, మనుష్యులు 100 సంవత్సరాలు, పెద్ద వృక్షాలు 1000 సంవత్సరాలు బ్రతకవచ్చు. కాని ఏదో ఒక దినాన అవి అన్నీ మరణించవలసిందే. కాని దేవునికి మాత్రం మరణం లేదు. ఆయనకు పుట్టుక లేదు మరణము లేదు, ఆయన ఎల్లప్పుడూ సజీవుడు.
పరలోకము దేవుని నివాసం దేవుడు సృష్టిని చేయకముందే పరలోకములో ఉన్నాడు అని మీకు తెలుసా? పరలోకము పరిపూర్ణమైన సంతోషము ఆనందముతో నిండి ఉంటుంది. అక్కడ ఎటువంటి చెడుతనము, దుఃఖము, మరణము ఉండవు (ప్రకటన 21:4). పరలోకములో దేవుని సింహాసనము ఎదుట కోట్లకొలది దేవదూతలు ఆయనను స్తుతిస్తూ,కీర్తనలు పాడుతూ ఉంటారు (ప్రకటన 5:11-12). పరలోకము ఎక్కడ ఉందో మనకు తెలియదు కాని అది ఎంతో అందమైన, అద్భుతమైన ప్రదేశం అని బైబిలు వివరిస్తుంది. ప్రభువైన యేసును విశ్వసించి ప్రేమించినట్లయితే సదాకాలము ఆయనతో కూడా మనము పరలోకములో ఉంటాము (యోహాను 14:3). అది ఎంత గొప్ప అద్భుతం కదా!
లోకమును సృష్టించుట దేవుని ప్రణాళిక
దేవుడు భూమిని సృష్టించాలని నిర్ణయించుకున్నప్పుడు మనుష్యులు నివసించుటకు తగినట్లుగా ఉండాలి అని అనుకున్నాడు. దానికి ముందుగా సృష్టి అంతా శూన్యముతో నిండిపోయి నిరాకారంగా ఖాళీగా ఉండేది (ఆదికాండము 1:2). దేవుడు ముందుగా భూమిని నిర్మించాడు. అప్పటికి భూమిపై నదులు పర్వతాలు పక్షులు పశువులు మానవులు ఏమీ లేవు. ఎటువంటి వెలుతురు కూడా లేదు. భూమి అంతటిపై చీకటి, జలము ఉండేవి. చీకటిలో ఉండటం ఎంత భయంకరమైన విషయం! దేవుడు సృష్టిని అలాగే వదిలేసి ఉండవచ్చు, కాని ఆయన ఆ విధముగా చేయలేదు. ఎంతో అందమైన స్థలాన్ని మనకోసం సిద్ధ పరచాలని ఇష్టపడ్డాడు. ఆయన ఆరు దినములలో ఎలా సమస్తాన్ని సృష్టించాడు అనేది మనము రాబోయే తరగతులలో చూద్దాము. సృష్టి మొదటి దినమున దేవుడు ఏమి చేశాడు అనేది ఈ రోజు చూద్దాము.
దేవుడు వెలుగును కలుగజేయుట దేవుడు మొదటి రోజు పలికిన మొదటి మాట - “వెలుగు కలుగును గాక''. ఆ మాట పలుకగానే వెలుగు కలిగింది. దేవుడు ఎంతో జాలి గల కరుణామయుడు. మనకు వెలుగు లేకపోతే ఎక్కువ రోజులు బ్రతకమని ఆయనకు తెలుసు. వెలుగు లేకుండా మనము ఎలా బ్రతక గలము? ఏ పని చేయగలము? ఆహారము ఏ విధముగా తినగలము? మధ్యరాత్రిలో మీకు ఎప్పుడైనా మెలకువ వచ్చిందా? కొన్నిసార్లు నిద్రలో చెడ్డ కలలు వస్తే భయముతో మధ్యరాత్రిలో మేలుకుంటాము. ఇటువంటి సమయములో వెంటనే లైట్లు వెలిగిస్తాము. ఆ వెలుగులో గది అంతా చూసి ఏమీ భయపడవలసిన అవసరం లేదు అని ధైర్యం తెచ్చుకుంటాము. చీకటిలో ఎన్నో ఘోరమైన విషయాలు జరుగుతుంటాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కరెంటు లేకపోతే ఎలా ఉంటుందో ఒక సారి ఊహించండి.
వెలుగు దేవుడు మనకు ఇచ్చిన అద్భుతమైన బహుమానం. ఆ వెలుగు వలన దేవుని సృష్టిని మనము చూడగలము. తరువాత దేవుడు పగలు రాత్రి కలుగునట్లు వెలుగును చీకటిని వేరుపరచాడు. ఒక పగలు రాత్రి కలిసి ఒక రోజు (24గం) గా లెక్కిస్తాము. గాఢాంధకారము నుండి వెలుగును కలిగించిన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడు! దేవుడు మాట పలకగానే ఆ ప్రకారమే జరిగింది. దేవుడు శూన్యములో నుండి సమస్తము సృష్టించాడు.
గోధుమపిండి లేకుండా ఇంట్లో మనము రొట్టెలు చేయగలమా? మీ నాన్నగారు పెట్రోల్ లేకుండా వాహనము నడిపించగలరా? అది అసాధ్యం, వీలు కాదు కదా. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు (లూకా 1:37). దేవుడు లోకము కొరకు వెలుగును కలుగజేశాడు. తాను చేసిన దానిని చూసి దేవుడు ఎంతో సంతోషించాడు. సమస్త సృష్టిని ఆయన చేసిన విధానాన్ని వచ్చే వారం తెలుసుకుందాం.
సందేశము దేవుడు అద్భుతమైన సృష్టికర్త అని ఈ రోజు మనము చూసాము. సృష్టిని చూచుటకు వీలుగా మనకు దేవుడు వెలుగును అనుగ్రహించాడు. సృష్టి అకస్మాత్తుగా,దానంతట అదే సంభవించలేదు, కాని సమస్త సృష్టిని దేవుడు ఆరు దినములలో కలుగజేశాడని బైబిల్ల్ ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. బైబిల్ లో ఉన్న విషయాలు అన్నీ సత్యమైనవి. దేవుని మాటలు నిజము అని మీరు నమ్ముతున్నారా? దేవుని అద్భుతమైన సృష్టిని, ఆయనచే సృష్టించబడిన వస్తువులను గురించి ఆలోచించినప్పుడు తప్పక ఆయన యందు విశ్వాసము ఉంచాలి అని బైబిల్ లో వ్రాయబడి ఉంది (రోమా 1:20).
అన్వయింపు దేవుడు అద్భుతమైన వాడు - ఆయన సమస్తమును చేయగల సమర్ధుడు. దేవుడు వెలుగును కలుగజేసిన విధానమును మనము ఈ రోజు చూసాము. యేసు - “ నేను లోకమునకు వెలుగును '' (యోహాను 8:12) అని చెప్పాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి సిలువపై మరణించాడు. సిలువలో రక్తం కార్చుట ద్వారా పురుషులకు, స్త్రీలకు, బాలురకు, బాలికలకు పాపక్షమాపణ అంటే ఏమిటో చూపించాడు. మనము దేవుని మాటలను విని ఆయనకు లోబడాలి. మనము ప్రభువైన యేసును విశ్వసించిన యెడల మన చీకటి హృదయాలలో దేవుని అద్భుతమైన వెలుగు ప్రకాశిస్తుంది. అప్పుడు మనము క్రొత్త జీవితముతో నిజమైన సంతోషము కలిగి ప్రభువు కొరకు జీవిస్తాము. మీ హృదయాలలో దేవుని వెలుగు నింపబడి ఉన్నదా? (2 కొరింథి. 4:6).
కంఠతవాక్యము దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను (ఆదికాండము 1:3).
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF