నిర్గమ 12:37- 51; 13 17-15: 21 కీర్తన 106: 8-12; హెబ్రీ 11:29
ఉద్దేశము
దేవుడు సర్వశక్తిమంతుడు కనుక ఏదైనా చేయగలడు అని చూపుట.
ముఖ్యాంశము
సాలెగూడులో చిక్కుకున్న పురుగును మీరు ఎప్పుడైనా చూసారా? ఆ పురుగును చూసి మనకు బాధ కలిగితే ఆ గూటిని చేతితో పాడుచేసి ఆ పురుగును బయటకు తీస్తాము. కొన్నిసార్లు ఆ పురుగును చంప చూచిన సాలె పురుగును చంపుతాము కూడా. దేవుడు అనేకమైన తెగుళ్ళు ఫరో మీదికి ఐగుప్తీయుల మీదికి పంపి ఇశ్రాయేలీయులను ఫరో అధికారం నుండి విడిపించిన విషయాలు మనము చూశాము. దేవుని శక్తి ముందు అవి గొప్ప విషయాలేమీ కావు . ఫరో తనను గురించి తాను ఎంతో గొప్ప రాజుగా తలంచినప్పటికీ, అన్నిటినీ మించిన తన మహా శక్తిని, బలాన్ని దేవుడు ఫరో ఎదుట, ఐగుప్తీయుల ఎదుట ఇశ్రాయేలీయుల ఎదుట రుజువు పరిచాడు. దేవుడు పదవ తెగులు పంపిన తర్వాత ఫరో ఇశ్రాయేలీయులను ఐగుప్తు విడిచి వెళ్ళమని త్వరపెట్టాడు.తమ వస్తువులన్నింటిని తీసికొని ఇశ్రాయేలీయులు అర్ధరాత్రి త్వరపడి ఐగుప్తునుండి బయలుదేరారు.
ప్రయాణము
ఇశ్రాయేలీయులు అందరు పట్టణం వెలుపల సమూహముగా కూడుకుని ఉండవచ్చు. స్త్రీలు, పిల్లలు కలసి వారు సుమారుగా 20 లక్షలమంది ఉండవచ్చు (నిర్గమ.12:37). వారి వస్తువులు గొర్రెలు పశువులు అన్నీ కలిసి పెద్ద గుంపు ఐగుప్తు నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉంది. ఫరో దాసత్వము నుండి చివరకు బయటకు రాగలిగినందుకు ఇశ్రాయేలీయులు ఎంతగానో సంతోషించి ఉంటారు. ఎటువైపు వెళ్ళాలి అని వారికి ఎలా తెలుస్తుంది? ఐగుప్తు నుండి వారిని వెలుపలికి నడిపించిన దేవుడు వారిని ఎలా విడిచిపెడతాడు? ప్రభువు వారి ప్రయాణానికి ఒక మార్గాన్ని ఏర్పరిచాడు (నిర్గమ. 13:21). పగటివేళ ప్రయాణించుటకు మేఘస్తంభమును ప్రభువు వారికి నీడగాఇచ్చాడు. వారు దానిని వెంబడిస్తూ ప్రయాణించాలి. ఆ మేఘస్తంభములో ప్రభువు ఉండి వారిని నడిపించ సాగాడు. రాత్రివేళ అది అగ్ని స్తంభము గా మారి చీకటిని పోగొట్టి వెలుగును ఇచ్చునట్లు వారితో వుండేది. మేఘస్తంభమును, అగ్ని స్తంభము చూచినప్పుడు ప్రభువు తమతో కూడా ఉన్నాడు అని ఇశ్రాయేలీయులు ధైర్యాన్ని పొంది ఉంటారు.
ఫరో తన మనస్సు మార్చుకొనుట
కానీ ఫరో మనసులో ఒక క్రొత్త ఆలోచన మొదలైంది. తన సేవలో బానిసలుగా ఉండకుండా ఇశ్రాయేలీయులను పంపి వేసినందుకు ఎంతగానో బాధపడ్డాడు. తమకు పనిచేయుటకు ఇప్పుడు ఎవరూ లేరు. ఇశ్రాయేలీయులు తన దాసత్వము క్రింద ఉన్నవారు కనుక వారిని కనుగొని, తరిమి పట్టుకొని బలవంతముగా తిరిగి తీసుకొని రావాలి అని నిశ్చయించుకున్నాడు. దేవుని అద్భుతమైన కార్యాలు, సూచక క్రియలు చూచిన తరువాత కూడా ఫరో హృదయము ఇంకా కఠినంగానే ఉండటం ఎంత ఆశ్చర్యం! వెంటనే ఫరో తన సైన్యాధిపతులను సమకూర్చుకున్నాడు. అతడు 600 గుర్రపు రథములను, గుర్రపు రౌతులను, తన జనులను తీసుకుని వారిని తరుముటకు బయలుదేరాడు. ( నిర్గమ. 14:9). వారు వేగముగా ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తున్న దారిలో ముందుకు వెళ్తూ వారిని వెంబడించారు. ఇశ్రాయేలీయులను ఎలాగైనా ఐగుప్తునకు తీసుకొని వచ్చుటకు ఫరో ప్రయత్నిస్తున్నాడు.
ఇశ్రాయేలీయులు చిక్కుకొనుట
ఇశ్రాయేలీయులు మేఘస్తంభము ద్వారా నడిపించబడి ఎర్ర సముద్రం దగ్గరకు చేరుకున్నారు. ఇశ్రాయేలీయులు తమ వెంట వచ్చుచున్న ఫరో రథములను, రౌతులను, ఐగుప్తీయులను చూచి ఎంతో భయపడిపోయారు. వారు తమను పట్టుకొనుటకు వస్తున్నారు అని ఇశ్రాయేలీయులు గ్రహించారు. ఎంతో క్లిష్టమైన పరిస్థితి! వారు రెండు ప్రక్కల పర్వతములు అరణ్యము, ఎదుట ఎర్ర సముద్రము వెనుక ఐగుప్తీయులతో చిక్కుపడిపోయారు. వారికి తప్పించుకొనుటకు మార్గము లేదు. ఇప్పుడు ఏమిచేయాలి? వారు దేవునికి మొరపెట్టారు కానీ కొందరు మోషే పై సణగడం మొదలుపెట్టారు. వారు మోషేను-"ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చంపుటకు మమ్మును రప్పించితివా, మమ్మును ఐగుప్తులో నుండి బయటకు రప్పించి ఇట్లు చేయడం న్యాయమా ?"అని ప్రశ్నించారు. అప్పుడు మోషే వారితో-" భయపడకుడి ప్రభువు మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు" అని వారిని ధైర్య పరిచాడు. ప్రభువు వారి పక్షమున యుద్ధము చేయబోతున్నాడు కనుక వారు మౌనముగా ఆయన కార్యాలు చూడాలి అని మోషే వారికి తెలిపాడు.
దేవుని అద్భుతమైన శక్తి
దేవుడు మోషే చేయవలసిన పనిని వివరించాడు . ఎర్ర సముద్రం రెండుగా చేసి ఇశ్రాయేలీయులను దాటించుమని దేవుడు మోషేతో చెప్పాడు. అప్పుడు అందరూ తనను మహిమ పరుస్తారు అని చెప్పాడు. కానీ ఐగుప్తీయులు తమను పట్టుకొనుటకు ముందే ఇశ్రాయేలీయులు ఎలా సముద్రమును దాటగలరు? ఫరో రథములు ఎంతో వేగంగా వస్తూ ఉన్నాయి కనుక త్వరలో వారిని కలుసుకుంటారు. దేవుడు ఏ విధముగా వారిని ఈ ప్రమాదం నుండి తప్పించగలడు? దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఇశ్రాయేలీయులకు ముందుగా నడచుచున్న మేఘస్తంభము వెనుకకు పోయి వారికి, ఐగుప్తీయులకు మధ్య అడ్డుగా నిలిచింది. ఆ మేఘము ఐగుప్తీయులకు చీకటిని కలుగజేసింది కానీ ఇశ్రాయేలీయులకు అగ్ని స్తంభము గా ఉండి వెలుగును ఇచ్చింది. ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపించ లేకపోయింది. ఆ సముద్రమును దాటుటకు వారికి వెలుగు అవసరమై ఉన్నది అని దేవునికి తెలుసు. మోషే దేవుని మాట చొప్పున తన చేతి లోని కర్రను ఎత్తి సముద్రం వైపు చాపాడు. అప్పుడు ప్రభువు ఆ రాత్రి అంతా బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేల గా చేశాడు. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచి పోయారు. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కల గోడవలె నిలిచాయి. వారు నడుస్తున్నప్పుడు వారి కాళ్ళకు నీరు కూడా తగలలేదు. ఎంత అద్భుతమైన విషయం! సమస్తము సృష్టించిన దేవుడు మాత్రమే అటువంటి గొప్ప కార్యాలు చేయగలడు .
దేవుని ఆఖరి శిక్ష
ఆ రాత్రి అంతయు ఇశ్రాయేలీయులు తమ పశువులతో కలసి ప్రయాణం చేశారు. అయితే వేకువజామున ప్రభువు ఐగుప్తీయులకు, ఇశ్రాయేలీయులకు నడుమ ఉంచిన మేఘస్తంభము తొలగించాడు. జరుగుతున్న దానిని చూచి నప్పటికి ఫరో, అతని సేవకులు వారిని తరుముట మానలేదు. వారు అలాగే తరుముతూ సముద్రం మధ్యకు చేరుకున్నారు. అప్పుడు దేవుడు వారిని కలవరపరచి, వారి రథచక్రములు ఊడిపడినట్లు చేశాడు. వారు బహు కష్టపడి ఆ రథములను తోలసాగారు. అప్పుడు వారు దేవుడు తమకు చేయుచున్న దానిని గ్రహించి అక్కడ నుండి పారిపోవుటకు ప్రయత్నించసాగారు. ఇశ్రాయేలీయుల దేవుడు తమకు విరోధముగా కార్యములు జరిగిస్తున్నాడు అని అర్థం చేసుకున్నారు. అప్పుడు ఐగుప్తీయుల మీదికి, వారి రథములమీదికి, వారి రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రము మీద చేయి చాపుమని దేవుడు మోషేకు ఆజ్ఞా పించాడు. మోషే ఆ విధముగా చేసిన వెంటనే సముద్రము బహు బలముగా తిరిగి పొర్లింది కనుక ఐగుప్తీయులు వెనుకకు వెళ్ళుటకు ప్రయత్నించారు కానీ ప్రభువు సముద్రము మధ్య వారినందరినీ నాశనము చేశాడు. వారిలో ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో బయట పడలేదు. దేవుడు వారికి గొప్ప పాఠం నేర్పించాడు. కానీ అది నేర్చుకోవడానికి వారు ఎంతో నష్టపోవలసి వచ్చింది.
క్షేమముగా ఉన్న ఇశ్రాయేలీయులు
తమ శత్రువులు నీటిలో మునిగి చనిపోవడం చూసిన ఇశ్రాయేలీయులు ఏమి తలంచి ఉండవచ్చు? దుష్టుడైన ఫరో ఇక తమను శ్రమ పెట్టలేడు దేవుడే గొప్ప అద్భుతములు జరిగించి తమను విడిపించాడు అని వారికి ఖచ్చితముగా తెలుసు కనుక వారెంతో కృతజ్ఞతతో నిండిపోయారు. తమ యెడల దేవుడు చూపిన కృపను, ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తూ వారు ఒక స్తుతి గీతాన్ని పాడసాగారు. మోషే అక్క మిర్యాము స్త్రీలందరూ నాట్యము చేయుచుండగా తంబుర వాయుంచుచు ముందుండి వారిని నడిపించింది. ఇశ్రాయేలీయులు అందరి జీవితాలలో అది ఎంతో సంతోషకరమైన దినము! శత్రువుల చేతి నుండి దేవుడు తమను విడిపించాడు కనుక ఇక మీదట వారికి భయపడవలసిన అవసరం లేదు.
సందేశము
ఎన్నడూ జరుగనటువంటి ఒక గొప్ప అద్భుతం దేవుడు జరిగించినట్లు మనము చూశాము. ఫరోను, అతని సైన్యమును నీటిలో ముంచి వేయడం ద్వారా దేవుడు తన మహాశక్తిని కనుపరచాడు. గొప్పగాలి విసర చేసి సముద్రమును రెండు పాయలుగా చేయటం ప్రభువుకు అసాధ్యం కాదు. సమస్తాన్ని ఆయనే సృజించి తన స్వాధీనంలో ఉంచుకొనియున్నాడు.
అన్వయింపు
తన మహాశక్తి తో ఎర్ర సముద్రమును రెండుగా విభజించిన దేవుడు అదే రీతిగా మన పాపములను క్షమించిమనలను పూర్తిగా మార్చగలడు. దేవుడు మన జీవితాలలో ఉన్నఎడల మనము భయపడవలసిన అవసరము లేదు. ఆయన ఎల్లప్పుడూ మనతో కూడా ఉండి తప్పక మనలను పరలోకమునకు చేర్చగలడు.
కంఠతవాక్యము
ప్రభువా, నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు (కీర్తన 104:1)
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF