యెహోషువ 2;హెబ్రీ 11:31;యాకోబు 2:25
ఉద్దేశము
విగ్రహము అంటే ఏమిటి మీకు తెలుసా? మట్టితో రాతితో లేదా చెక్కతో ఒక రూపాన్ని ఏర్పరచి నిలబెట్టడం. చాలా దేశాల్లో విగ్రహాలను నిలుపుకొని దేవుడిగా పూజిస్తుంటారు. వాటి ముందు మోకరించి, ప్రార్ధించి ఆహారాన్ని కూడా అర్పిస్తూ ఉంటారు. కానీ దేవుడు శక్తి మంతుడు, సృష్టికర్త గనుక తనకు తాను ఏదో ఒక రూపాన్ని ఏర్పరచుకొనడు. సృష్టికర్త అయిన తనను మరచి తాను చేసిన సృష్టిని పూజించడం దేవునికి ఎంతో బాధను కలిగిస్తుంది. జీవము గల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే తాను సృజించిన మానవుల పాపములను క్షమించగలడు.
గతవారము
ఇశ్రాయేలీయులు దాటి పోవునట్లు దేవుడు యొర్దాను నదిని ఎండిపోజేసినట్లు గతవారం చూశాము. చివరకు వారు ప్రభువు వాగ్దానము చేసిన కనాను దేశములోనికి ప్రవేశించారు. దేవుని దయను, ఆశ్చర్య కార్యాలను ఇశ్రాయేలీయులు మరిచిపో కుండునట్లు దేవుడు వారికి ఏమి చెప్పాడు? నదిలో నుండి పండ్రెండు రాళ్లు తీసుకొనివచ్చి జ్ఞాపక సూచనగా స్తంభముగా నిలిపారు. అది చూసినప్పుడు దేవుని నమ్మకత్వాన్ని వారు గుర్తు చేసుకొనుటకు వీలు కలుగుతుంది. మోషే ఉన్నప్పుడు దేవుడు ఏ విధముగా వారితో ఉన్నాడో ఇప్పుడు కూడా ఉన్నాడు అని వారు గ్రహించారు. యొర్దాను నదిని ఆపి వేయగలిగిన దేవుడు, కనాను దేశము స్వాధీనం చేసుకొనుటకు సహాయము చేయగల సమర్ధుడు అని విశ్వసించారు. కనాను దేశపు ప్రజలు చాలా దుర్మార్గులు, విగ్రహాలను పూజించేవారు అని బైబిల్ లో వ్రాయబడింది. వారు తమ దేవతలకు ఆహారము మాత్రమే కాక, తమ చిన్నపిల్లలను కూడా బలిగా అర్పించే వారు. మొలెకు అను వారి దేవత ఎదుట చిన్నపిల్లలను అగ్నిలో పడవేసేవారు. ఎంత ఘోరమైన విషయం! వారి దుర్మార్గమును, క్రూరత్వమును చూచినప్పుడు దేవుడు ఎంతో ఆగ్రహంతో నిండిన వాడై వారిని నిర్మూలము చేయాలనుకున్నాడు (ద్వితీ 20:18).
యెహోషువ ఇద్దరిని వేగు చూచుటకు పంపుట
క్రొత్త దేశమును ఆక్రమించు కొనుటకు ముందు యెహోషువ ఇద్దరు వేగుల వారిని పంపించాడు. అక్కడ పరిస్థితులు ముఖ్యంగా యెరికో పట్టణం ఎలా ఉన్నది చూచి రమ్మని పంపించాడు. వారు ఇశ్రాయేలీయులు అని గుర్తు ప ట్టకుండునట్లు రహస్యంగా వారు బయలుదేరారు. అక్కడ పట్టణమును బాగుగా పరిశీలించి ఆ సమాచారం తనకు అందించమని చెప్పి వారిని పంపించాడు వారిని ఎవరైనా గుర్తుపట్టి నట్లయితే వెంటనే చంపుతారు. వారిరువురు ధైర్యం తో బయలుదేరారు.
రాహాబు
రాహు యెరికో పట్టణములో నివసించుచున్న ఒక స్త్రీ. ఆమె తన తల్లిదండ్రులను విడిచి తన సొంత ఇంటిలో ఉండేది. ఆమె ఉండే ఇల్లు యెరికో పట్టణ ప్రాకారము మీద ఉండేది. రాహాబు ఇల్లు ఒక వసతిగృహము వలె ఉండేది. ఆ పట్టణములోనికి ఎవరైనా కొత్తవారు వస్తే ఆమె ఇంటిలో బస చేయడానికి వీలుగా ఆ ఇల్లు ఎదురుగా కనిపిస్తూ ఉండేది. యెరికో పట్టణస్థుల వలె రాహాబు కూడా విగ్రహాలను ఆరాధించేది. అంతేకాకుండా రాహాబు తన ఇంటిలో పురుషులకు కూడా ఆశ్రయము ఇచ్చేది. ఆమె చెడు ప్రవర్తనను బట్టి యెరికో పట్టణములో చాలా చెడ్డ స్త్రీ అని పేరు ఉండేది.
ఇశ్రాయేలీయులు తమకు దగ్గర లోనే ఉన్నారు అని రాహాబునకు, యెరికో పట్టణపు వారికి తెలిసింది. జీవము గల దేవుడు వారి పక్షముగా ఉన్నాడు అని వారికి వినబడింది. ఆయన ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఇశ్రాయేలీయుల శత్రువులను ఎర్ర సముద్రములో మునిగిపోవునట్లు చేసిన సంగతి కూడా వారికి తెలిసింది. తమకు ఏమి జరగబోతుంది అని యెరికో ప్రజలు, రాజు భయంతో ఉన్నారు. ప్రభువు చేసిన ఆశ్చర్య కార్యములను వినిన రాహాబు సృష్టికర్త అయిన దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఆయన గొప్ప కార్యములు చేయగల సమర్ధుడు అని ఎంతగానో నమ్మింది.
వేగులవారు రాహాబు ఇంటికి వచ్చుట
యెహోషువ పంపిన వేగులవారు ఇద్దరు రాహాబు ఇంటిలో రాత్రి బస చేయుటకు వెళ్లారు. వారు రాహాబు ఇంటికి వెళ్ళిన విషయం రాజుకు తెలిసింది. ఇప్పుడు రాహాబు ఏమి చేయబోతుంది? రాజు ఆజ్ఞ చొప్పున వారిరువురిని అప్పగించాలి లేదా వారిని దాచి పెట్టాలి. రాజు చంపకుండునట్లు వారిని దాచిపెట్టుటకు నిర్ణయించుకుంది. రాహాబు ఆ ఇరువురిని తన మిద్దె మీదికి ఎక్కించి దాని మీద రాశివేసి యున్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టింది. రాహాబుకు ఎంత ధైర్యం! ఒకవేళ రాజు పంపిన మ నుష్యులు వేగుల వారిని కనుగొని నట్లయితే వారితో పాటు రాహాబును కూడా చంపి వేస్తారు. హెబ్రీ 11:31 లో "విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందున అవిధేయులతో పాటు నశింపక పోయెను'' అని వ్రాయబడింది.
యెరికోను వేగుచూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుష్యులు రాత్రివేళ వచ్చారు అని రాజుకు తెలిసింది. అప్పుడు రాజు పంపించిన మనుష్యులు రాహాబు దగ్గరకు వచ్చి నీ యొద్దకు వచ్చి - "నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన మనుష్యులను వెలుపలికి తీసికొని రమ్ము. వారు ఈ దేశమంతటిని వేగు చూడ వచ్చిరి" అని చెప్పారు. రాహాబు రాజు పంపిన మనుష్యులతో- "మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే. వారు ఎక్కడనుండి వచ్చిరో నేనెరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుష్యులు వెలుపలికి వెళ్ళిరి. వారు ఎక్కడికి పోయిరో నేనెరుగను మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టు కొందురు" అని చెప్పింది. రాహాబు వారితో అబద్ధము చెప్పింది, కాని జీవముగల దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను కాపాడుటకు ఆ విధంగా చెప్పింది. రాహాబు మాటలు విని వారు త్వరపడి వేగుల వారిని వెదకుటకు బయలుదేరి పోయారు. మరి వారు వేగులవారిని కలుసుకున్నారా ? లేదు ఎందుకంటే వారు ఇంకా రాహాబు ఇంటిలోనే ఉన్నారు.
రాహాబు వేగుల వారితో మాట్లాడుట
చుట్టూ అందరూ నిద్రించిన తరువాత రాహాబు ఆ వేగుల వారితో మాట్లాడసాగింది. రాహాబు ద్వారా ప్రభువు తమను కాపాడినందుకు వారిరువురూ ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఉండవచ్చు. రాహాబు ఆ ఇద్దరు వేగుల వారితో- "ప్రభువు ఈ దేశమును మీ కిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ దేవుడు మీకు చేసిన ఆశ్చర్య కార్యములను వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడు పైన ఆకాశమందును
క్రింద భూమియందును దేవుడు. నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రి ఇంటి వారు అందరూ చావకుండ బ్రతుకనిచ్చి రక్షించునట్లు గా దయచేసి ప్రభువు తోడని ప్రమాణము చేయుడి" అని అడిగింది. రాహాబు జీవము గల తమ దేవుని యందు విశ్వాసముంచుట చూచి ఆ వేగులవారు ఎంతో సంతోషించి ఉండవచ్చు. అప్పుడు వారు రాహాబుతో - "నీవు మా సంగతి వెల్లడి చేయని యెడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు మా ప్రాణమిచ్చెదము" అని మాట ఇచ్చారు.
రాహాబు- వేగులవారు ఒప్పందము చేసుకొనుట
రాహాబు ఎవరూ చూడకుండా వారిని ఎలా పంపి వేయాలి? రాహాబుకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆమె ఇల్లు యెరికో ప్రాకారము మీద ఉన్నది గనుక ఒక తాడు అక్కడ నుండి వేసి కిటికీ ద్వారా వారిని క్రిందకు దించింది. వారు కిటికీలో నుండి తాడు పట్టుకొని దిగారు. రాత్రి సమయం గనుక వారిని ఎవరు చూడలేదు. రాహాబు వారికి కొండల లోనికి వెళ్లి మూడు దినములు అక్కడ దాగియుండి తరువాత వెళ్ళమని చెప్పింది. వేగులవారు యెరికో పట్టణము, దాని ప్రజల గురించి రాహాబు గురించి చెప్పినప్పుడు యెహోషువ,ఇశ్రాయేలీయులు ఎంతో సంతోషించారు. తమ దేవుని భయము చేత యెరికో ప్రజలందరికీ ధైర్యము చెడి యున్నదనియు, ప్రభువు ఆ దేశమంతటిని అప్పగించ బోతున్నాడనియు వారు చెప్పగా విని అందరూ సంతోషంతో దేవునికి కృతజ్ఞతలు చెప్పారు.
వేగులవారు రాహాబు ఇంటినుండి బయలుదేరుతూ ఒక నిబంధన చేసుకున్నారు. వారు రాహాబు కు - "నీవు మమ్మును దించిన ఈ కిటికీ కి ఎర్రని దారమును కట్టి, నీ తండ్రిని నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారినందరిని నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన యెడల దానికి మేమే ఉత్తర వాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన యెడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయములో మేము దోషులము కాము" అని చెప్పారు. అందుకు రాహాబు - "మీ మాటచొప్పున జరుగును గాక" అని సమాధానమిచ్చింది. వారు వెళ్ళగానే రాహాబు చేసిన మొదటి పని - తన ఇంటి కిటికీ కి ఎర్రని దారము కట్టడం. ఆమె ప్రభువును ఎంతగానో విశ్వసించింది గనుక తనకు, తన కుటుంబానికి ఎటువంటి అపాయం కలుగదు అని నమ్మింది. రాహాబు, ఆమె కుటుంబం ఎలా సురక్షితంగా ఉన్నదో తరువాత చూద్దాము.
సందేశము
రాహాబు గురించి మూడు విషయాలు మనము గుర్తుంచుకోవాలి. మొదటిగా ఆమె వేశ్యగా జీవించింది గనుక ఎన్నో పొరపాట్లు చేసి ఉండవచ్చు. ప్రభువు ఇశ్రాయేలీయులకు చేసిన ఆశ్చర్య కార్యములు వినిన తరువాత, ఆయన మాత్రమే జీవము గల నిజమైన దేవుడు అని విశ్వసించింది. యెరికో పట్టణములో ఎంతోమంది ఉన్నప్పటికీ రాహాబు మాత్రమే విశ్వసించింది రెండవదిగా రాహాబు తన జీవితాన్ని పూర్తిగా మార్చుకుంది.ఆమె తన పాపపు జీవితాన్ని వదిలిపెట్టి,
విగ్రహములను పూజించుట మానివేసి ప్రభువును వెంబడించుట నిర్ణయించుకుంది. వేగులవారిని దాచి పెట్టినప్పుడు దేవుడు వారిని కాపాడగలడు అని విశ్వసించింది(హెబ్రీ 11:31). మూడవదిగా తన ఇంటి కిటికీకి ఎర్రని దారము కట్టుట వలన యెరికో నాశనమై నప్పుడు తనను తన ఇంటి వారినందరినీ దేవుడు క్షేమముగా ఉంచుతాడు అని నమ్మకముంచింది.
అన్వయింపు
మనము నిజముగా క్రైస్తవులమైతే మన జీవితాలు ప్రత్యేకంగా ఉండాలి అని బైబిల్ చెప్తుంది. మన హృదయాలు ఎంతో చెడుతనము తో నిండి ఉంటాయి గనుక, పాపపు జీవితాలను కలిగి ఉంటాము. కానీ రాహాబు దేవుని యందు విశ్వాసముంచి తన జీవితాన్ని మార్చుకున్నది. రాహాబు జీవితములోని మార్పును అందరూ చూడగలిగారు.
మనము పశ్చాత్తాపముతో పాపములు క్షమించమని ప్రభువైన యేసును అడిగినప్పుడు, ఆయన మనలను క్షమిస్తాడు. అప్పుడు మనలోని మార్పును ప్రతి ఒక్కరు గమనించగలుగులుగుతారు. చెడు పనులు చేయకుండా, వాటిని అససహ్యించుకుంటున్న విషయము వారు గ్రహిస్తారు. మనము సరియైన మంచి పనులను మాత్రమే చేస్తున్నాము అని వారికి తెలుస్తుంది. మనలను కాక ప్రభువును సంతోషపరిచే వారముగా జీవించడం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు. ఎవరైనా క్రీస్తును అంగీకరిస్తే వారు తమ పాత జీవితం వదిలిపెట్టి క్రొత్త జీవితానికి అలవాటు పడతారు అని బైబిల్ లో ఉంది.
ఉదాహరణ
దేవుని యందు విశ్వాసముంచుటకు ముందు ప్రత్యూష్ ఎన్నో సంవత్సరాలు ప్రభువైన యేసుకు ప్రార్ధించాడు. తన విశ్వాసం గురించి తల్లిదండ్రులతో చెప్పలేదు కానీ ప్రత్యూష్ జీవితములో వచ్చిన మార్పుల వలన అతడు క్రైస్తవుడుగా మారాడు అని వారు గ్రహించగలిగారు. ప్రత్యూష్ తన పనులను మాత్రమే గాక ఇతరుల పనులలో కూడా ఎంతో ఆసక్తి చూపించి సహాయం చేసేవాడు. తన చెల్లికి చదువులలో సహాయం చేసేవాడు, వాళ్ళ అమ్మ తో కలిసి ఇంటి పనులు చేసేవాడు. తరువాత తాను క్రైస్తవునిగా మారినట్లు తల్లిదండ్రులకు చెప్పాడు. అతని జీవిత విధానము ముందే ఆ విషయాన్ని తమకు తెలియ చేసింది అని వారు చెప్పారు. ప్రత్యూష్ వారి మాటలకు ఎంతో సంతోషించాడు. క్రీస్తును తెలుసుకొనిన తరువాత తన జీవితము మారినట్లు అందరూ చూడగలగటం ప్రత్యుష్ కు ఎంతో ఆనందం కలిగించింది.
కంఠతవాక్యము
ఎవడైనను క్రీస్తు నందున్న యెడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను (2 కొరింథీ 5:17).
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF