పాత నిబంధన

 

లేవీయకాండము 16:1

అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాటలాడి ఇట్లనెను.

లేవీకాండము 10వ అధ్యాయంలో అహరోను కుమారులైన నాదాబు అబీహులు యెహోవా సన్నిధిలోనికి అన్యాగ్నిని తీసుకువెళ్ళడం వల్ల చనిపోయినట్టు మనం చదువుతాం. ఆ సంఘటన తర్వాత దేవుడు ఈమాటలు చెబుతున్నట్టు ఈ వచనంలో చూస్తున్నాం. 11-15 అధ్యాయాలలోని మాటలు అంతకుముందు చెప్పినవి కానీ ఈ తర్వాత చెప్పినవి కానీ అయ్యుండవచ్చు.

లేవీయకాండము 16:2
నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెరలోపలికి ఎల్లప్పుడును రాకూడదని అతనితో చెప్పుము.

పది ఆజ్ఞల పలకలున్న మందసం మీద మూతలా రెండు కేరూబుల రూపంతో తయారు చెయ్యబడిందే కరుణాపీఠం అంటే (నిర్గమకాండము 25:17-22). అది ప్రత్యక్షగుడారంలో ఒక తెరద్వారా వేరుచెయ్యబడిన అతిపరిశుద్ధస్థలంలో ఉంటుంది (నిర్గమకాండము 26:33,34, హెబ్రీ 9:1-5). యాజకులు కానీ ప్రధానయాజకుడు కానీ ఆ అతిపరిశుద్ధస్థలంలోకి ప్రవేశించకూడదు (హెబ్రీ 9:6). దాని గురించే ఈ వచనంలో "అహరోను మందసము మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెరలోపలికి ఎల్లప్పుడును రాకూడదు" అని చెప్పబడుతుంది. "ఎల్లప్పుడును" అంటే ఆ ప్రదేశంలోకి అసలు వెళ్ళకూడదని కాదు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రం అందులోకి వెళ్ళాలి (హెబ్రీ 9;6,7) అదెప్పుడో క్రిందివచనాల నుండి చదువుతాం.

అయితే ప్రత్యక్షగుడారంలోని అతిపరిశుద్ధస్థలంలోకి ఎవ్వరూ ప్రవేశించకూడదనే నియమం అందులో దేవుని మహిమ నివసిస్తున్నప్పుడు మాత్రమే వర్తిస్తుంది. ఆ మహిమ మందిరం నుండి పైకి వెళ్ళినప్పుడు అరణ్యంలో ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలీయులంతా ముందుకు సాగాలి (నిర్గమకాండము 40:36-38), ఆ సమయంలో యాజకులు మందిరాన్ని విప్పి అతిపరిశుద్ధ స్థలంలోని మందసాన్ని సహా మోసుకుని వెళ్ళాలి. అప్పుడు మాత్రం అందులోకి ప్రవేశించవచ్చు.

లేవీయకాండము 16:3,4
అతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెదూడను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని, వీటితో పరిశుద్ధ స్థలములోనికి రావలెను. అతడు ప్రతిష్ఠిత మైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్న నార లాగులు తొడుగుకొని, సన్ననార దట్టికట్టుకొని సన్ననారపాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠవస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసికొనవలెను.

ఈ విధులు ప్రధానయాజకుడు అతిపరిశుద్ధస్థలంలోకి ప్రవేశించబోయే రోజు చెయ్యవలసినదానికి సంబంధించినవి. ఇది ఏడవనెల పదవరోజు జరుగుతుంది (లేవీకాండము 16:29). దీనినే ప్రాయశ్చిత్త దినం అని అంటారు (లేవీకాండము 23:27,28). ఆరోజు ఇశ్రాయేలు ప్రజలందరి పాపాలకూ ప్రాయశ్చిత్తంగా బలిరక్తం అతిపరిశుద్ధస్థలంలోకి తీసుకువెళ్ళబడుతుంది. ప్రధానయాజకుడికి సంవత్సరంలో ఆ ఒక్కరోజు మాత్రమే మందసం ఉన్న ఆ అతిపరిశుద్ధస్థలంలోకి వెళ్ళే అనుమతి లభిస్తుంది (హెబ్రీ 9:7).

లేవీయకాండము 16:5-7
మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజము నొద్దనుండి పాపపరిహారార్థబలిగా రెండు మేక పిల్లలను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని రావలెను. అహరోను తన కొరకు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ రెండు మేకపిల్లలను తీసికొని వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను.

ఈ వచనాల ప్రకారం; ఆరోజు అహరోను ప్రజలవద్ద నుండి రెండు మేకపిల్లలను ఒక పొట్టేలును తీసుకుని మొదట తన మరియు తన ఇంటివారి పాపాల నిమిత్తం ఒక కోడెదూడను బలిగా అర్పించాలి. అంటే మొదట తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుని ఆ తర్వాతనే ప్రజలపాపాలకు ప్రాయశ్చిత్తం చెయ్యబడే పనికి సిద్ధపడాలి. ఎందుకంటే అతను కూడా బలహీనుడైన మనిషే (హెబ్రీ 5:1-3). ‌

లేవీయకాండము 16:8-10
అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని ఆ రెండు మేకల మీద రెండు చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడునో, ఆ మేకను అహరోను తీసికొని వచ్చి పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దానివలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు, దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను.

ఈ వచనాలలో యెహోవాకు అర్పించబడే మేకపిల్ల విడివిపెట్టబడే మేకపిల్ల గురించి మనం చూస్తాం. అహరోను చీటీల ప్రకారం అనగా ఒక చీటీపై యెహోవాకు అనీ మరోచీటీపై విడిచిపెట్టబడేది అని రాసి వాటిని కలిపి ఆ మేకపిల్లలపై ఉంచడం వల్ల దేనిని బలిగా అర్పించాలో దేనిని విడిచిపెట్టాలో నిర్ణయించాలి. అంటే దేవుడే దానిని నిర్ణయిస్తాడు (సామెతలు 16:33). ఈ నియమం వెనుకున్న పరమార్థాన్ని క్రింది వచనాలలో చూద్దాం.

అయితే మనం కూడా ఇలా చీటీల ద్వారా దేవునిచిత్తాన్ని తెలుసుకోవచ్చా అనే సందేహం ఇక్కడ కలుగుతుంది. ఇప్పుడు అలా కుదరదు. ఈ అంశాన్ని వివరంగా తెలుసుకోవడానికి ఈవ్యాసం చదవండి.

దేవుని చిత్తమును కనుగొనుట

లేవీయకాండము 16:11-16
అప్పుడు అహరోను పాపపరిహారార్థ బలియగు ఆ కోడెను తీసికొనివచ్చి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. తరువాత అతడు తనకొరకు తానర్పించు పాపపరిహారార్థ బలియగు కోడెను వధించి యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్తెడు నిప్పులను, తన పిడికెళ్లతో పరిమళధూపచూర్ణమును తీసికొని అడ్డతెరలోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు, యెహోవా సన్నిధిని ఆ అగ్నిమీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. అప్పుడతడు ఆ కోడెరక్తములో కొంచెము తీసికొని తూర్పుప్రక్కను కరుణాపీఠము మీద తన వ్రేలితో ప్రోక్షించి, కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను. అప్పుడతడు ప్రజలర్పించు పాపపరిహారార్ధ బలియగు మేకను వధించి అడ్డతెరలోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడెరక్తముతో చేసినట్లు దీని రక్తముతోను చేసి, కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దాని ప్రోక్షింపవలెను. అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టియు, అనగా వారి అపవిత్రతను బట్టియు, వారి అతిక్రమములను బట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను.

ఈ వచనాల ప్రకారం; అహరోను దూపద్రవ్యముల సువాసనల మధ్య తనకొరకు అర్పించబడిన దూడ రక్తాన్నీ ప్రజల కొరకు అర్పించబడిన మేకయొక్క రక్తాన్నీ తీసుకుని అతిపరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలి. ఆ రెండు జీవుల రక్తాన్నీ రెండు విడతలుగా ఏడేసిసార్లు కరుణాపీఠంపైనా దాని ఎదుటా ప్రోక్షించాలి. కారణం: "ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను" అని అక్కడే చదువుతున్నాం. దీనిని బట్టి పరిశుద్ధుడైన దేవుని నివాసం ప్రజలమధ్య నివసించడానికి ఆ ప్రజలపాపాలకై రక్తప్రోక్షణ అవశ్యమని స్పష్టమౌతుంది (హెబ్రీ 9:22). గమనించండి; ప్రజల పాపాలను బట్టి ప్రత్యక్షగుడారమే అపవిత్రమౌతుంటే ఆ పాపం చేసిన ప్రజలు మరెంత అపవిత్రులుగా పరిగణించబడతారో కదా!

కొందరు "ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను" అనే మాటలను కీర్తనలు 90:8 లోని "మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొనియున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడుచున్నవి" అనే మాటలతో ముడిపెట్టి దేవుని సన్నిధి ప్రత్యక్ష గుడారంలో ఉన్నది కాబట్టి అక్కడ ప్రజల పాపాలు ఆయన ఎదుటకు వస్తాయి కాబట్టి అది అపవిత్రపరచబడుతుందని వ్యాఖ్యానించారు. కానీ మన పాపాలు పరలోకంలోని దేవునిసన్నిధికి కూడా వెళ్తాయి, అలాగని పరలోకం అపవిత్రపరచబడుతుందా? అలా అనడానికి‌ వీలు లేదు కదా! అందుకే ప్రత్యక్షగుడారం పాపులైన మనుషులమధ్యలో నివసిస్తుంది కాబట్టి దానిని కూడా శుద్ధిచేసి ఉపయోగించాలి అనేభావంలోనే ఆమాటలను అర్థం చేసుకోవాలి.

లేవీయకాండము 16:17
పరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవు నప్పుడు అతడు తన నిమిత్తమును తన యింటి వారి నిమిత్తమును ఇశ్రాయేలీయుల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తముచేసి బయటికి వచ్చువరకు ఏ మనుష్యుడును ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు.

ఈ వచనం ప్రకారం; ప్రధానయాజకుడు ఆ ప్రాయశ్చిత్తకార్యం జరిగిస్తున్నప్పుడు ఇతర యాజకులెవ్వరూ ప్రత్యక్షగుడారంలో ఉండకూడదు. అంటే అతను ఒంటరిగానే ఆ కార్యం జరిగించాలి. ఈ నియమం ప్రజల తరపున క్రీస్తు ఒక్కడే చేసిన యాగానికి సాదృష్యంగా ఉంది (హెబ్రీ 9:22-26). దీనిగురించే "దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు" (1తిమోతికి 2:5,6) అని రాయబడింది.

లేవీయకాండము 16:18,19
మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠము నొద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అతడు ఆ కోడెరక్తములో కొంచెమును ఆ మేకరక్తములో కొంచెమును తీసికొని బలిపీఠపు కొమ్ముల మీద చమిరి యేడుమారులు తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము దాని మీద ప్రోక్షించి దాని పవిత్రపరచి ఇశ్రాయేలీయుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను.

ఈ వచనాల ప్రకారం; అహరోను అతిపరిశుద్ధ స్థలానికి ప్రాయశ్చిత్తం చేసినతర్వాత బయటకు వచ్చి బలిపీఠానికి కూడా ప్రాయశ్చిత్తం చెయ్యాలి. ఎందుకంటే ప్రజల పాపాలకై దానిపైనే బలులు అర్పించబడుతుంటాయి కాబట్టి దానిని కూడా ప్రాయశ్చిత్తం చెయ్యాలి. ఇది పాపం యొక్క తీవ్రతను లేక స్వభావాన్ని తెలియచెయ్యడానికి దేవుడు పెట్టిన నియమం. అనగా పాపం అన్నిటినీ మలినపరుస్తుందని ఈ నియమం తెలియచేస్తుంది. పరిశుద్ధమైనది అన్నిటినీ పరిశుద్ధపరచదు కానీ అపవిత్రమైనది అన్నిటినీ అపవిత్రపరుస్తుంది (హగ్గయి 2:11-13). అందుకే సమస్త అపవిత్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

లేవీయకాండము 16:20-22
అతడు పరిశుద్ధస్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసికొని రావలెను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తలమీద తన రెండు చేతులు ఉంచి, ఇశ్రాయేలీయుల పాపములన్నియు, అనగా వారి దోషములన్నియు వారి అతిక్రమములన్నియు దానిమీద ఒప్పుకొని, ఆ మేకతలమీద వాటిని మోపి, తగిన మనుష్యునిచేత అరణ్యములోనికి దాని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నిటిని ఎడారి దేశమునకు భరించి పోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను.

ఈ వచనాలలో విడిచిపెట్టబడే మేకపై అహరోను ప్రజల దోషాలన్నీ మోపి దానిని అరణ్యానికి పంపివెయ్యాలని చూస్తాం. అంటే ఆ మేక మరలా సమాజం మధ్యకు రాకుండా చాలా దూరంగా పంపివెయ్యాలి. గమనించండి; ప్రజల పక్షంగా ఒక మేక బలి అయ్యింది, మరో మేక ఆ ప్రజల దోషాలన్నీ భరిస్తూ అరణ్యానికి కొనిపోబడింది. ఈ రెండు మేకలూ యేసుక్రీస్తుకు ఛాయగా ఉన్నాయి. ఆయన మనకోసం బలిగా మారాడు, మన దోషాలన్నీ భరించుకువెళ్ళాడు. దానిగురించే "ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారిని గూర్చి విజ్ఞాపనము చేసెను" (యెషయా 53:12) అనీ "మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి" (1పేతురు 2:24) అనీ రాయబడింది. దీనికి ప్రవచనంగా "ఆ కాలమున ఆ నాటికి ఇశ్రాయేలు దోషమును వెదకినను అది కనబడకుండును. యూదా పాపములు వెదకిను అవి దొరుకవు శేషింపజేసినవారిని నేను క్షమించెదను ఇదే యెహోవా వాక్కు" (యిర్మియా 50:20) అని కూడా రాయబడింది.

లేవీయకాండము 16:23-26
అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారము లోనికి వచ్చి, తాను పరిశుద్ధస్థలములోనికి వెళ్లినప్పుడు తాను వేసికొనిన నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుగుకొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చితన కొరకు దహన బలిని ప్రజలకొరకు దహనబలిని అర్పించి, తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను పాప పరిహారార్థబలి పశువుయొక్క క్రొవ్వును బలిపీఠముమీద దహింపవలెను విడిచిపెట్టే మేకను వదలినవాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెములోనికి రావలెను.

ఈ వచనాల ప్రకారం; విడిచిపెట్టబడే మేకను అరణ్యానికి పంపివేసిన తర్వాత అహరోను తనకోసం తీసుకువచ్చిన పొట్టేలునూ ప్రజల వద్దనుండి తీసుకున్న పొట్టేలునూ దహనబలిగా అర్పించాలి. అనగా వాటి మాంసం అంతటినీ బలిపీఠంపై కాల్చివెయ్యాలి. ఇక్కడ ఆరోజు జరగవలసిన బలుల గురించి కొద్దిగా వివరిస్తాను. మొదటిగా అహరోను తనకోసం తన కుటుంబం కోసం ఒక కోడెదూడనూ పొట్టేలునూ తీసుకురావాలి (లేవీకాండము 16:3). ఆ కోడెదూడను బలిగా అర్పించి దాని రక్తాన్ని అతిపరిశుద్ధస్థలంలోని కరుణాపీఠంపై ఏడుసార్లు ప్రోక్షించాలి. ప్రజల వద్దనుండి రెండు మేకపిల్లలనూ ఒక పొట్టేలునూ తీసుకోవాలి (లేవీకాండము 16:5). ఆ మేకపిల్లలలో ఒకదానిని అర్పించి దాని రక్తాన్ని కూడా అతిపరిశుద్ధస్థలంలోని కరుణాపీఠంపై ఏడుసార్లు ప్రోక్షించాలి. మరో మేకను విడిచిపెట్టాలి. అతిపరిశుద్ధ స్థలంలోకి రక్తం తీసుకెళ్ళబడే కోడెదూడ, మేకల బలులు పాపపరిహార్థ బలులు. వాటి క్రొవ్వును మాత్రమే బలిపీఠంపై దహించి మిగిలిన శరీరం అంతటినీ పాళెం వెలుపల దహించివెయ్యాలి (లేవీకాండము 16:27). మిగిలిన రెండు పొట్టేళ్ళ బలులూ దహనబలులు. క్రొవ్వుతో సహా వాటి మాంసమంతటినీ బలిపీఠంపై దహించివెయ్యాలి.

లేవీయకాండము 16:27,28
పరిశుద్ధస్థలములో ప్రాయ శ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడెనో పాపపరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాళెము వెలుపలికి తీసికొని పోవలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను. వాటిని కాల్చివేసినవాడు తన బట్టలు ఉదుకు కొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెములోనికి రావలెను.

ఈ వచనాల ప్రకారం; పాపపరిహార్థబలిగా అర్పించబడిన కోడెదూడ, మేకపిల్లల దేహమంతటినీ పాళెంకు వెలుపల దహించివెయ్యాలి. వాటి క్రొవ్వును మాత్రమే బలిపీఠంపై ధూపం వెయ్యాలి (లేవీకాండము 16:25). అయితే ఈ నియమం అతిపరిశుద్ధ స్థలంలోకి రక్తం తీసుకుపోబడే (ప్రాయశ్చిత్త దినాన) పాపపరిహారార్థ బలుల విషయంలోనే వర్తిస్తుంది. వాటిమాంసాన్ని మాత్రమే తినకుండా పాళెంకు వెలుపల దహించివెయ్యాలి (లేవీకాండము 6:30, హెబ్రీ 13:10-12) అలానే యాజకుడు తనపాపం కొరకు అర్పించిన పాపపరిహార్థ బలిపశువును కూడా తినకూడదు (లేవీకాండము 4:3-12). ఈ రెండు సందర్భాల్లోనూ మినహా ప్రజలు అర్పించే పాపపరిహార్థ బలి పశువుల మాంసాన్ని యాజకులు తినాలి, అది ప్రజల పాపాన్ని వారు భరించడాన్ని సూచిస్తుంది (లేవీకాండము 6:25,26, 10:16-18).

గమనించండి; మొదట హేబెలు తనకొరకు గొర్రెపిల్లను బలిగా అర్పించాడు, తర్వాత కుటుంబంకోసమైన బలి జరిగింది (పస్కా) ఈ ప్రాయశ్చిత్త దినాన దేశమంతటికీ బలి జరుగుతుంది. ఇలా ఈ బలులన్నీ లోకపాపాలను మోసుకుపోయే దేవుని గొర్రెపిల్లయైన క్రీస్తువైపే నడిపిస్తూ ఆయనకు సాదృష్యంగా నియమించబడ్డాయి. ఆయన బలిమాత్రమే ఇక మరలా బలి అవసరం లేకుండా లోకపాపాలన్నిటినీ తీసివెయ్యగలదు.

హెబ్రీ 10:14  ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు.

లేవీయకాండము 16:29-31
ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులుగాని మీ మధ్యనుండు పరదేశులుగాని మీరందరు ఏడవనెల పదియవ నాడు ఏ పనియైనను చేయక మిమ్మును మీరుదుఃఖపరచు కొనవలెను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచు నట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహా విశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను; ఇది నిత్యమైన కట్టడ.

ఈ వచనాలలో ప్రాయశ్చిత్త దినం నిత్యమైన కట్టడగా మహా విశ్రాంతి దినంగా మనం చూస్తాం.‌ బలుల గురించీ ఆచారాల గురించి నిత్యమైన కట్టడ అనేమాటలు మరికొన్ని సందర్భాలలో కూడా చదువుతాం. దానికి ఛాయారూపకమైన ఈ బలుల నిర్ణీత సమయం వరకూ అనగా నిజస్వరూపమైన క్రీస్తు బలియాగం జరిగేంతవరకూ కొనసాగాలని అర్థం.

"స్వదేశులుగాని మీ మధ్యనుండు పరదేశులుగాని మీరందరు ఏడవనెల పదియవ నాడు ఏ పనియైనను చేయక మిమ్మును మీరుదుఃఖపరచు కొనవలెను"

దేవుడు ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు ఇశ్రాయేలీయులతో కలసి ఆయనను ఆరాధించే అందరికీ ఆయన దేవుడేనని ఈ మాటలు మనకు తెలియచేస్తున్నాయి. ఆయనకు ఎలాంటి బేధమూ లేదు. అలానే "మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను" అనంటే వారి పాపాల విషయమై పశ్చాత్తాపపడాలని అర్థం. అనగా ఉపవాసం ఉండి వారి పాపాలను ఒప్పుకోవాలి.

లేవీయకాండము 16:32-34
ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభి షేకముపొంది తన్ను ప్రతిష్ఠించుకొనునో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసికొని నారవస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను. మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడార మునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములనుబట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను.

ఈ వచనాలలో ప్రధానయాజకుడిగా అభిషేకం పొందిన ప్రతీ ఒక్కరూ ఈ అధ్యాయంలో వివరించబడిన విధులు పాటించవలసిందిగా మనం చూస్తాం. ఇవన్నీ చాలా కష్టంతోనూ శుద్ధీకరణతోనూ పాటించవలసిన విధులు. కారణం; ఇవి క్రీస్తుకు ఛాయగా నియమించబడ్డాయి (హెబ్రీ 7-10 అధ్యాయాలు)

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.